యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన 'ఆర్ఆర్ఆర్'.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోలు నందమూరి తారక రామారావు, రామ్చరణ్, దర్శకధీరుడు రాజమౌళి (ఆర్.ఆర్.ఆర్) కలయికలో భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే విడుదలకు ముందునుంచే ఈ చిత్ర మేనియా దేశవ్యాప్తంగా ఆవహించింది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమ అనేక ఒడిదుడుకులు, అనిశ్చితి మధ్య ప్రయాణం సాగించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఒక్కసారి యావత్ భారతీయ ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచింది.
‘బాహుబలి’ సిరీస్తో దర్శకుడు రాజమౌళి దేశాన్ని ఓ ఊపు ఉపేయడంతో ఆయన బ్రాండ్ ఇమేజ్ సినిమాపై తిరుగులేని హైప్ క్రియేట్ చేసింది. టార్ హీరో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద కనిపించే సందడే వేరు. అదే ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తే, ఆ సినీహీరో అభిమాన గణాల్లో ఆసక్తిని పెంచింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రౌద్రం రణం రుధిరం-ఆర్ఆర్ఆర్'గా తెరకెక్కిన చిత్రం అభిమానులను ముందుకు వచ్చింది. అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమురం భీమ్గా ఎన్టీఆర్ నటిస్తుండటం వల్ల ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇద్దరు స్టార్ హీరోలను దర్శకుడు రాజమౌళి ఏ విధంగా చూపించారు?ఈ కథలో అలియా భట్, అజయ్దేవగణ్, శ్రియ పాత్రలేంటన్న వివరాల్లోకి వెళ్తే..
కథ
స్వాతంత్ర్యానికి ముందు 1920లో తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో కథ మొదలవుతుంది. బ్రిటీష్ పాలన సాగుతుండటంతో వారు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటారు. అదే సమయంలో గోండు తెగకు చెందిన మల్లి అనే అమ్మాయి గొంతు నచ్చడంతో ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కుని పోతారు. అందుకు అడ్డుపడిన అమ్మాయి తల్లిని సైనికులు చంపేస్తారు. ఆ అమ్మాయిని కాపాడేందుకు గోండు తెగ నాయకుడు కొమురం భీం వస్తాడు. అందులో భాగంగానే ఢిల్లీలోని బ్రిటీష్ ప్రభుత్వంపై తిరగబడి విధ్వంసం సృష్టిస్తాడు. దాంతో అతడిని ఎలాగైనా పట్టుకొని బంధించాలని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తుంది.
అందుకోసం రామరాజును స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తోంది. రామరాజు బ్రిటీష్ పాలనలో పోలీసు అధికారిగా పనిచేస్తుంటాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా గొప్ప కీర్తి అందుకుంటాడు రామరాజు. అయితే అంతకుముందే భీం, రామరాజు కలుసుకుంటారు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అప్పుడే జెన్నీ (ఓలీవియా)కు దగ్గరయ్యేందుకు భీంకు రామరాజు సహాయం చేస్తాడు. కానీ ఆ తర్వాత భీం బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని తెలిస్తుంది. దాంతో వీరిద్దరు విడిపోతారు. అనంతరం ఒకరితో ఒకరు పోరాడేందుకు సిద్ధం అవుతారు. ఈ క్రమంలో వీరిద్దరి మళ్లీ కలుస్తారా.? అసలు వీరికి కుమరం భీమ్, అల్లూరి సీతారామరాజులతో సంబంధమేమిటీ.? మరి భీం ను రామారాజు బ్రీటీష్ కు అప్పగించాడా.? లేదా.? భీమ్ గోండు పిల్లను తెల్లదొరలను తీసుకుని వస్తాడా.? లేదా అన్నది సిల్వర్ స్ర్కీన్ పైనే చూడాలి.
విశ్లేషణ
బ్రిటీష్, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు యోధుల కథ అనేసరికి ప్రేక్షకుల్లో సినిమాపై దేశభక్తి భావనతో పాటు పాత్రలపరంగా ప్రగాఢమైన ఇంపాక్ట్ క్రియేట్ అయింది. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు సమకాలీనులైన వారు ఎప్పుడూ కలుసుకోలేదు. వీరిద్దరి స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే ఊహ నుంచి ఈ కథ రాసుకున్నారు రాజమౌళి. దీనికి హృదయాల్ని కదిలించే భావోద్వేగాల్ని, దేశభక్తి భావాన్ని రంగరించారు. చారిత్రక అంశాలకు ఫిక్షన్ జతచేసి కథావిష్కరణలోనే కొత్తదానాన్ని చూపించారు రాజమౌళి. సినిమా ఆరంభంలోనే నిప్పు, నీరు ప్రతీకలుగా ఇద్దరు కథానాయకుల్ని పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. వీరిద్దరి ఉపోద్ఘాత ఘట్టాల్ని రొమాంచితంగా ప్రజెంట్ చేశారు.
వేల సంఖ్యలో ఉన్న ప్రజలపై లాఠీఛార్జ్ చేస్తూ రామ్చరణ్.. పులిని బంధిస్తూ ఎన్టీఆర్ చేసిన విన్యాసాల నేపథ్యంలో ఈ ఇంట్రడక్షన్ సీన్స్ రాజమౌళి మార్క్ను ప్రతిబింబించాయి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహాన్ని ఆవిష్కరించారు. నీళ్లలో పడ్డ బాబుని రక్షించే క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. అక్కడి నుంచి కథ వేగంగా నడుస్తుంది. భీమ్ ఓ బ్రిటీష్ దొరసానిని ఇష్టపడతాడు. వారిద్దరు చేరువకావడానికి రామరాజు సలహాలు ఇస్తుంటాడు. రామ్-భీమ్ మధ్య స్నేహాన్ని చూపించడానికి ‘నాటు నాటు’ పాట బాగా ఉపయోగపడింది. భీమ్ అమాయకత్వాన్ని చూసి రామరాజు అతనిపై మమకారం పెంచుకోవడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఇద్దరి స్నేహబంధాన్ని చక్కగా ఆవిష్కరించాయి.
అయితే భీమ్ గురించి రామరాజు నిజం తెలుసుకోవడంతో ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది. అక్కడి నుంచి ఇద్దరి పాత్రలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడతాయి. చిన్నారి మల్లిని రక్షించడానికి భీమ్ బ్రిటీష్ కోటను బద్దలు కొట్టే ప్రయత్నం చేయడం..దానిని రామరాజు అడ్డుకోవడం ఉత్కంఠగా అనిపిస్తుంది. తొలి భాగమంతా భీమ్ చుట్టూ కథ సాగగా.. ఆ పాత్రపై ప్రేక్షకులకు ఓ రకమైన సానుభూతి కలుగుతుంది. బ్రిటీష్వారికి నమ్మకస్తుడైన పోలీస్ అధికారిగా రామరాజు పాత్ర తొలుత కొంచెం నెగెటివ్ ఛాయలతో సాగినట్లు కనిపించినా…అతని ఆశయం గురించి తెలిసిన తర్వాత పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ను రొమాంచితంగా తీర్చిదిద్దారు. ఇద్దరు హీరోలు తాళ్లు పట్టుకొని వేలాడుతూ ఛాలెంజ్ చేసుకోవడం ప్రేక్షకుల్లో ఓ ఊపును తీసుకొస్తుంది.
రాజమౌళి సినిమాల్లో పాత్రల మధ్య సంఘర్షణ..ఒకరి ఆశయం కోసం మరొకరు సహాయం చేసుకోవడం ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. ఎమోషన్స్ను పతాకస్థాయిలో ఆవిష్కరించడం రాజమౌళి ట్రేడ్ మార్క్. ఈ సినిమా విషయంలోనూ అదే పంథాను అనుసరించారాయన. హీరోల మధ్య స్నేహం, అపార్థాలు, వైరం వంటి ఉద్వేగాల్ని తనదైన శైలిలో మనసును కదిలించేలా తెరపై తీసుకొచ్చారు. ఎన్టీఆర్, రామ్చరణ్ వంటి ప్రతిభావంతులైన నటులు తోడుకావడంతో తాను అనుకున్న భావోద్వేగాల్ని పండించగలిగాడు. ప్రథమార్థమంతా వేగంగా సాగిన కథనం ద్వితీయార్థంలో కాస్త మందగించినట్లు కనిపిస్తుంది. భీమ్కు శిక్ష విధించే సందర్భంలో వచ్చే ఘట్టాలు హైలైట్గా అనిపిస్తాయి. ముఖ్యంగా ‘కొమురం భీముడో..’ అనే పాట ఎమోషనల్గా సాగింది.
ఇద్దరు కథానాయకులు తమ ఆశయాల్ని తెలుసుకొని బలమైన శత్రువు బ్రిటీష్ ప్రభువుపై పోరాటం చేయడం మెప్పిస్తుంది. రామరాజును భుజాలపైకి ఎత్తుకొని భీమ్ పరుగెత్తడం ఈ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంది. పోరాటఘట్టాల్ని చాలా కొత్తగా డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక పతాకఘట్టాల్లో అల్లూరి సీతారామరాజు గెటప్లో రామ్చరణ్ విజృంభించాడు. బాణాలు సంధిస్తూ అతను శత్రువులపై విరుచుకు పడిన విధానం..ఆ ఎలివేషన్ సీన్స్ కొత్త అనుభూతిని పంచుతాయి. ఓ గోండు చిన్నారిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు వీరులు ఒకరికొకరు పరిచయం కావడం.. వారి ఆశయాన్ని సాఫల్యం చేసుకోవడమే చిత్రానికి చెందిన కీలకమైన పాయింట్.
నటీనటుల విషాయానికి వస్తే..
ఎన్టీఆర్, రామ్చరణ్ తమ కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శన ఇచ్చారని చెప్పొచ్చు. వారి పాత్రలకు సమప్రాధాన్యతనిస్తూ తీర్చిదిద్దే విషయంలో రాజమౌళి ఎక్కడా లెక్కతప్పలేదు. ఇద్దరు హీరోల అభిమానులు సంతుష్టి చెందేలా యాక్షన్ ఘట్టాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నారు రాజమౌళి. నిజజీవితంలో రామ్చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు..తెరపై కూడా ఆ బంధం ప్రతిఫలించింది. ఇద్దరూ పోటాపోటీ అభినయంతో రక్తికట్టించారు.
‘నాటు నాటు..’ పాటలో డ్యాన్సులతో అదరగొట్టారు. బ్రిటీష్ నటి ఓలివియా మోరిస్కు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. సీత పాత్రలో అలియాభట్ చక్కటి అభినయాన్ని కనబరిచింది. కథాగమనంలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత దక్కింది. ఇక అజయ్దేవ్గణ్, శ్రియ ప్లాష్బ్యాక్ ఎపిసోడ్లో కనిపిస్తారు. వారి పాత్రల పరిధి తక్కువైనా గుర్తుండిపోతాయి. రాహుల్ రామకృష్ట పాత్ర నిడివి కొద్దిసేపైనా కథలో కీలకంగా అనిపిస్తుంది. సముద్రఖని ఫర్వాలేదనిపించాడు.