‘96’ తమిళంలో క్లాసిక్గా నిలిచిపోయిన సినిమా. దాన్ని ఎంతో ఇష్టపడి తెలుగులో ‘జాను’ చిత్రంగా రీమేక్ చేశారు దిల్రాజు. ఆయన నిర్మాణంలో రూపొందిన తొలి రీమేక్ ఇదే. మాతృకను తెరకెక్కించిన దర్శకుడే ‘జాను’ బాధ్యతల్ని తీసుకున్నారు. ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోగల సమంత, శర్వానంద్ జంటగా నటించారు. మరి ఈ చిత్రం తమిళంతో మాదిరిగానే ఇక్కడ కూడా క్లాసికల్ హిట్ గా నిలిచిపోతుందా.? అన్న విషయంలోకి ఎంట్రీ ఇచ్చే ముందు కథేలోకి ఎంట్రీ ఇద్దాం..
కె.రామచంద్ర(శర్వానంద్) ట్రావెల్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తుంటాడు. ఓ పని కోసం తన స్టూడెంట్ తో వైజాగ్ వచ్చిన రామచంద్ర అక్కడ స్కూల్, థియేటర్ ను చూడగానే తన గత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. అప్పుడు తనతో పాటు 10వ తరగతి చదువుకున్న మురళి(వెన్నెలకిషోర్), సతీష్(తాగుబోతు రమేశ్)లకు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఆ క్రమంలో అందరూ హైదరాబాద్లో రీ యూనియన్ కావాలనుకుంటారు. అన్నట్లుగానే అందరూ కలుసుకుంటారు. అప్పుడు రామచంద్ర, జానకి దేవి(సమంత అక్కినేని)ని కలుసుకుంటాడు.
దాదాపు 17 సంవత్సరాలు తర్వాత కలుసుకున్న ఇద్దరూ రీ యూనియన్ పార్టీ తర్వాత జానకితో కలిసి రామచంద్ర ఆమె ఉండే హోటల్కి వెళతాడు. అప్పుడు ఇద్దరూ 10వ తరగతి చదువుకునేటప్పుడు ఇద్దరి మధ్య పరిచయం, ఎలా విడిపోయాం అనే సంగతులను గుర్తుకు తెచ్చుకుంటారు. జానుకి పెళ్లై ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. అన్నేళ్ల తర్వాత వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు ఎలాంటివి? అసలు రామచంద్ర ఎందుకు పెళ్లి చేసుకోడు? రామచంద్ర, జాను ఎందుకు విడిపోతారు? అసలేం జరిగింది? చివరికి ఇద్దరి ప్రయాణం ఎలా ముగిసింది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ప్రేమకథలు ఎక్కువగా యువతకే నచ్చుతుంటాయి. తెరపై కనిపించే పాత్రలతో కనెక్ట్ అయ్యేది వాళ్లు మాత్రమే. కొన్ని ప్రేమ కథలు మాత్రం అన్ని వయస్సల వారిని హత్తుకునేలా వుంటాయి. అలాంటి ప్రేమకథే.. ‘జాను’. తొలి ప్రేమలోని మధురానుభూతుల్ని పంచే చిత్రమిది. చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ, గడిచిపోయిన జీవితంలోకి మరోసారి తీసుకెళుతుంది. నిన్నటి నువ్వు ఇదే అంటూ మరోసారి మనల్ని మనకు పరిచయం చేస్తుంది. రీమేక్ సినిమా అంటే కచ్చితంగా మాతృకతో పోల్చి చూస్తుంటారు. మాతృక తరహాలోనే రీమేక్ లోనూ మ్యాజిక్ చేసే కథలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ఇదొకటి.
చిన్ననాటి స్నేహితుల మధ్య ఉన్నామంటే ఆ వాతావరణం ఎంత సరదాగా ఉంటుందో చూపిస్తూ.. ఆ నేపథ్యంలో నవ్విస్తూ.. తొలి ప్రేమ చేసిన తీపి గాయాలతో హృదయాల్ని బరువెక్కిస్తూ ముందుకు సాగుతుందీ చిత్రం. కథానాయకుడు తన స్కూల్ లోకి అడుగు పెట్టినప్పట్నుంచే సినిమా భావోద్వేగభరితంగా మారిపోతుంది. అర్జెంటుగా బయటికెళ్లి మన స్కూల్ ని ఒకసారి చూసొద్దాం అనిపించేలా ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తుంది. అంతలా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు దగ్గరగా రూపోందించాడు దర్శకుడు.
పూర్వ విద్యార్థుల అలుమ్నీ కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, అందులో ఒకొక్కరు ఒక్కో రకంగా స్పందించడం, అందరూ ఒక చోట కలవడం, అక్కడ వాతావరణం సరదాగా మారిపోవడం లాంటి సన్నివేశాలతో సినిమా చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఇక రామ్, జానుల ప్రేమకథ తొలిప్రేమ రోజుల్లోకి తీసుకెళ్తోంది. విరామం సమయంలో వచ్చే సన్నివేశాలు హృదయాల్ని బరువెక్కిస్తాయి. రామ్ గురించి ఒక విషయం తెలిశాక జాను భావోద్వేగానికి గురయ్యే తీరు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఇక ద్వితీయార్ధంలో భావోద్వేగాలు మరింతగా పండాయి. రామ్, జాను కలిసి ఒక రోజు రాత్రి చేసే ప్రయాణం.. అక్కడ జాను గురించి రామ్ తెలుసుకున్న విషయాల గురించి చెప్పడం, రామ్ స్టూడెంట్స్ దగ్గర జాను చెప్పిన ప్రేమకథ, ఆ నేపథ్యంలో భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయి. కథలోనే బలం ఉండటంతో, మాతృకతో పోల్చి చూసుకున్నా.. దేని మ్యాజిక్ దానిదే అనే భావనకి గురిచేసే చిత్రమిది. అక్కడక్కడా సన్నివేశాలు నిదానంగా సాగడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. శర్వానంద్, సమంత పాత్రలకి ప్రాణం పోశారు. వాళ్ల ఎంపిక వందశాతం సరైనదనిపిస్తుందీ చిత్రం.
నటీనటుల విషాయానికి వస్తే..
రామ్ పాత్రలో శర్వా.. జానకి పాత్రలో సమంత ఒదిగిపోయారు. చక్కగా ఫీల్ను క్యారీ చేశారు. పదవ తరగతిలో పుట్టిన ప్రేమ.. అనుకోని పరిస్థితుల్లో విడిపోవడం.. 17 ఏళ్ల తర్వాత కలుసుకున్నప్పుడు వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేదే ఈ సినిమా. ఆ ఫీలింగ్స్ను శర్వా, సమంత చక్కగా తెరపై ఆవిష్కరించారు. శర్వా, సమంతల నటనే చిత్రానికి ప్రధాన బలం. శర్వా, సమంతలు తమ అనుభవాన్నంతా రంగరించి నాలుగు గోడల మధ్య, రెండు పాత్రల మధ్యే సాగే సన్నివేశాల్ని రక్తికట్టించారు. ఇక వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, తనికెళ్ల భరణి, రఘుబాబుతో పాటు జూనియర్ శర్వానంద్గా నటించిన సాయికిరణ్, జూనియర్ సమంతగా నటించిన గౌరి చక్కగా నటించారు.
టెక్నికల్ అంశాలకు వస్తే..
సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమాను చాలా రిచ్ గా రూపోందించారు. సినిమా మేకింగ్ విషయానికి వస్తే మహేంద్రన్ జైరాజ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఇక ఇలాంటి ప్రేమకథా చిత్రాలకు సంగీతమే ప్రధాన బలం. గోవింద్ వసంత సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరో రేంజ్లో నిలిపాయి. ఇక దీనికి తోడు మిర్చికిరణ్ మాటలు మెప్పిస్తాయి. సినిమాలో చాలా స్లో నెరేషన్లో కొనసాగుతుంది. ప్రేమ్కుమార్ భావోద్వేగాలపై పట్టు కోల్పోకుండా కథని నడిపించిన విధానం మెప్పిస్తుంది. దిల్రాజు చేసిన తొలి రీమేక్ సినిమా ఇది. ఆయన సంస్థ స్థాయికి తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి.
తీర్పు..
ప్రేమలో గాయపడిన హృదయాలకు.. తొలిప్రేమలో మధురజ్ఞాపకాలను మరోమారు ఆవిష్కరించే లవ్ ఎమోషన్స్ మూవీ..! జాను..!!
చివరగా.. మనసుల్ని హత్తుకునే.. ‘జాను’..!