ఎన్నికల బరిలో ముందస్తు తయారీలో ఆంధ్రా తెలంగాణా లలో తెలుగు దేశం పార్టీ, తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలు బలంగా జెండా పాతుతుంటే కాంగ్రెస్ పార్టీ పథకాల తోక పట్టుకునే నడుస్తోందింకా.
నిజామాబాద్ ఆర్మూర్ లో ఘనంగా సాగిన తెరాస ఆవిర్భావ సభను పూర్తిగా వాడుకున్నారు మరోసారి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కె చంద్రశేఖరరావు. తనదైన వాడి వేడి ఈటెల్లాంటి మాటలతో తెదేపా కాంగ్రెస్ పార్టీలను విమర్శించటమే కాకుండా తన బలాన్ని కూడగట్టుకోవటానికి ఉన్న అస్త్రాలన్నీ వాడారు. అందులో, మన రాష్ట్రం (ఇంకా ఆవిర్భవించని తెలంగాణా రాష్ట్రం) సుసంపన్నమైన క్షేత్రం, మన రాష్ట్రం మనకి వస్తే మనం ఎంతో బాగుపడతామని చెప్పటానికి ఈ మధ్య తలెత్తిన బయ్యారం గనుల వలన, దానిమీద వచ్చే ఆదాయం ఎంతుంటుందో ప్రజలందరికీ కొద్దో గొప్పో తెలిసిపోవటం బాగా పనికి వచ్చింది. అలా మన రాష్ట్రం మనకు వచ్చి, మన సంపదలు మనకు దక్కాలంటే (ఆంధ్రోళ్ళు కొల్లగొట్టకుండా ఉండాలంటే) మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలి. అందుకు మనకు తెలంగాణా లోని అన్ని నియోజక వర్గాల్లో తెరాస గెలవాలి. తెరాసయే ఎందుకనటానికి కారణం కూడా ఆయన చెప్పారు తెరాస ఒక్కటే ప్రజల పార్టీ అని, తెదాపా కాంగ్రెస్ వైకాపాల్లాగా దిగుజారుడుతనం లేదన్న విషయాన్ని చెప్తూ. బడ్జెట్ సమావేశాల్లో తెరాస అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు జరిగిన వాగ్యద్ధంలో కిరణ్ కుమార్ రెడ్డి అన్న మాటలను గుర్తు చేస్తూ ఒక్కరూపాయి కూడా తెలంగాణాకు ఇవ్వనని చెప్పటానికి అది ఆయన సొత్తా అని ప్రశ్నించారు కెసిఆర్. మనది సంపన్నమైన క్షేత్రం, దాన్ని మనం పాలించుకుంటే మనం బాగుపడతాం, అందుకు తెరాసను గెలిపించటం ఒక్కటే మార్గం- ఇదీ కెసిఆర్ మంత్రం. తెలంగాణా రాష్ట్రం సాధిస్తే తెలంగాణాలో భవిష్యత్తు ఎలా ఉంటుందన్న వర్ణ చిత్రాన్ని కూడా ఆయన అందరికీ చూపించారు. విద్య, ఇళ్ళు, సాగునీరు లాంటి వనరులు, ఇలా అన్ని దిశల్లోనూ తెలంగాణా ఎలా అభివృద్ధి చెందుతుందో ఆయన వివరించారు. ఆంధ్రా పార్టీలను నమ్మవద్దని కూడా ఆయన హెచ్చరించారు. మొత్తానికి కెసిఆర్ తనదైన శైలిలో తెలంగాణా మాండలీకంలో హాస్యాన్ని జోడిస్తూ తిట్లకు అందుకుంటూ, ఆంధ్రా నాయకులను, తెలంగాణా లోని ఇతర పార్టీ నాయకులను యాగీ చేస్తూ సభను విజయవంతం చేసి ఎన్నికలకు చక్కటి బాట వేసుకున్నారు.
తెరాసకు ఉన్న ఒక వెసులుబాటు ఏమిటంటే, ఆయన మాటలను ఖండిస్తూ తెలంగాణాలో తిరగటానికి ఇతర పార్టీలకు జంకు కలిగే వాతావరణం. దానితో కెసిఆర్ అన్నదే వేదమైంది పోయినసారి ఎన్నికల్లోనూ, ఈసారి ఇంతవరకూ కూడా.
అలాగే ఆంధ్రా ప్రాంతంలో జెండా పాతారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంలో తమ పార్టీ బలాన్ని ప్రదర్శించారు. పాద యాత్రను ముగించిన సందర్భంగా విజయస్తూపాన్ని ప్రతిష్టించారు. పార్టీలో అంతర్గతంగా కొన్ని లొసుగులు ఉన్నా, పార్టీ అధికారంలోకి వస్తుందంటే అవన్నీ వాటంతటవే సర్దుకుంటాయన్న అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతోంది.
తెలంగాణాలో కెసిఆర్ అన్నట్టుగానే తెదేపా అధికారంలోకి రాగానే ఏమేం చేస్తామన్న వర్ణ చిత్రాన్ని చంద్రబాబు కూడా చూపించారు. కాకపోతే చంద్రబాబు సంధించిన బాణాలు తెరాస మీద ఏమాత్రం లేవు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైకాపా లే లక్ష్యాలుగా ప్రహారం జరిగింది. తెలుగు దేశం పార్టీ వస్తే చేసే అభివృద్ధి పథకాలనన్నిటినీ బిసిలు, దళితులు, మహిళలు, వ్యవసాయదారులకు చెయ్యబేయే ప్రయోజనకరమైన పనులు, ఋణాల మాఫీలు ఇలా చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని ఎలా బాగు చెయ్యవచ్చో చెప్తూ, అందుకు ప్రజలందరి సహకారంతో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితేనే సాధ్యమని నొక్కి వక్కాణించారు.
తెలుగు దేశం పార్టీకి ఒక్కరే నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాగే తెరాసకు ఒక్కరే కెసిఆర్. ఇద్దరూ ఒకే పంథాలో సభను నడిపించినా, కెసిఆర్ తిట్ల పురాణంతో చంద్రబాబు విమర్శలను పోల్చలేము. రెండు పార్టీలలోనూ అంతర్గత విభేదాలు ఉన్నా, ఉద్యమం పేరుతో తెరాస, అభివృద్ధి, అవినీతితో పోరాటం అనే అంశాలతో తెదేపా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తెరాసలో గైర్హాజరీలు కనిపించలేదు కానీ తెదేపాలో మాత్రం జూ.ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ, కడియం శ్రీహరి, దాడి వీరభద్రరావు లు లేకపోవటం స్పష్టంగా కనపడుతోంది. తెదేపాకున్న మరో విశేషం సినీ గ్లామర్. బాలకృష్ణ, తారకరత్నలు ఉన్నారు. జూ.ఎన్టీఆర్ కూడా కాలక్రమంలో చేరవచ్చనే ఆశాభావం కనిపిస్తోంది. కానీ నాయకుని మనసెరిగానని అనుకునే పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలలో లోకేష్ ఫొటోను ప్రదర్శించారు.
ఇలాంటి కార్యక్రమమేదైనా పెట్టి తెరాస, తెదేపాలకు దీటుగా సభను నడిపించాలంటే కాంగ్రెస్ కున్న ప్రతిబంధకం ఢిల్లీ అధిష్టానం. ఎవరికివారు ఏదిబడితే అది చెయ్యటానికి లేదు. దేనికైనా ఆమోదముద్ర అక్కడి నుంచి రావలసిందే. అందువలన ఎటువంటి హామీలు కూడా ఎవరికి వారు చెయ్యలేరు. అయినా ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఉత్తర ప్రదేశ్ మీద, గుజరాత్ మీద దృష్టి సారించినట్టు ఆంధ్రప్రదేశ్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టటానికి ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. అలా అని నెమ్మదిగానూ ఊరుకోవటం మంచిది కాదు. కానీ తర్వాత చేసే కార్యక్రమాల వలన ముందు చేసినవి మాసిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎన్నికల ముందు జరిగిన ఘటనలే ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేస్తాయి కాబట్టి కాంగ్రెస్ కున్న వ్యూహం కాంగ్రెస్ కీ ఉంది. అంతే కాదు, ఇతర పార్టీలు ఏం చెప్తున్నాయో ముందుగానే చూస్తే, వాటికి దీటుగా ప్రణాళికను తయారు చేసుకోవచ్చు.
ఇక వైయస్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి సభలేమీ లేకుండానే జైలు నుంచే నాయకులతో చర్చలు సాగిస్తూ, వైయస్ ఆర్ ఫథకాలను గురించి పాదయాత్రల్లో చెప్తూ ముందుకు సాగుతోంది. అధికార పార్టీకి మాత్రం ముప్పేట దాడి మొదలైంది. కానీ అధిష్టానం చూస్తే దేశసమస్యలు, మిత్రపక్షాలు, ప్రతిపక్షాలతో పెద్ద స్థాయి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
ఏమైనా పార్టీల బల ప్రదర్శనలు పూర్తిస్థాయిలో ప్రారంభమైనట్లే! కాకపోతే తెదేపా, తెరాస లు ముందుగా కదం తొక్కాయి!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more