మాఘ బహుళ చతుర్ధశి మాఘమాసంలో బహుళ చతుర్ధశిని "మహా శివరాత్రి" అంటారు. (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) . మహా శివరాత్రి మానవులందరకు పర్వదినము - అనగా గొప్ప పండుగ. చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. శివక్షేత్రములందు 'శివరాత్రి'ని పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవముగా చాలా గొప్పగా జరుపుతారు.
శిభక్తులు ఈ పండుగనాడు తెల్లవారు ఝాముననే నిద్ర లేస్తారు. ఇళ్ళలోను, గుళ్ళలోనూ కూడ శివపూజలు, శివాభిషేకములు చేస్తారు. ఈ రోజు 'ఉపవాసం', రాత్రి 'జాగరణ 'చేస్తారు. (రాత్రి అంతా మేల్కొని శివనామ స్మరణ చేస్తూ గడపడాన్ని జాగరణ అంటారు. మరునాటి ఉదయం యధావిధి స్నాన సంధ్యలు ముగించుకొని భగవంతునికి (శివునికి) అర్పించిన ఆహారాన్ని తింటారు.)
మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని మహా శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీమహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేయాలి .ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది.అభిషేకాలు, పూజలతో పరమశివునిఆరాధిస్తారు.భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామంమారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరునిప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులూ చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడుఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు.గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే "భక్తవశంకర" అన్నారు.ఇందుకు సంభందించి ఒక కదకుడా ఉంది . బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచు కుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనేఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు.భక్తులు నిద్రకొరిగెదాక వేచి ఉన్నాడు . జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయిఅనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆవిధంగా ముక్తి పొందుతాడు. శివరాత్రి మహత్యం అంతటిది. పరమశివుని రూపంలో పరమార్ధం మెడలో సర్పం, శిరస్సుపై గంగ - కుండలినిజాగృతిని సూచిస్తున్నాయి. శివనామంలోని మూడుగీతలు - జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను తెలుపుతున్నాయి. మద్యబింధువు తురీయావస్థకు ప్రతీక. అలానే శివుని మూడో నేత్రం ఆజ్ఞాచక్రస్థానంలో ఉండే ప్రజ్ఞాచక్షువు. అర్ధనారీశ్వర తత్వంలో శివపార్వతులు ఇడా, పింగళ, నాడులకు సంకేతాలు. పాక్షికంగా మూయబడిన కళ్ళు ధ్యానస్థితిలో అంతర్ముఖస్థితికి దర్పణం. శివుడు ఆదిగురువు,యోగ గురువు. శివుని వృత్తి భిక్షాటన, ఆసనం పులి చర్మం, ధరించేది గజచర్మం, నివసించేది స్మశానం. ఆయన దగ్ధం చేసింది మదాకారం.... ఇవన్నీ జన్మ బంధ విమోచనలకు మార్గాలకుసూచనలు.శివలింగం :-
నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం"
లింగాభిషేకములో పరమార్ధం :- పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకంచేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.
మనిషి శరీరంలో ఉండే 24 తత్వాలనూ చైతన్యంతో అధిగమించినవారు 25 వ తత్వమైన జ్ఞానాన్ని, క్రమంగా 26 వ తత్వం ఆత్మ, 27వ తత్వం పరమాత్మలను అధిగమించి 28వ తత్వం విదేహస్థితిని అందుకుంటారు. ఆ విదేహస్థితికి సంకేతమే శివలింగం. అందుకే ప్రతినెలా 28వ రోజున మాస శివరాత్రిగా పాటిస్తారు. ఇప్పటికైనా అర్థమయిందా ప్రతినెలా 28వ రోజుకుండే విశిష్టత ...! మహేశ్వరుడుహిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధానఆరాధ్యదైవాలు. వారు
* బ్రహ్మ - సృష్టికర్త
* విష్ణువు - సృష్టి పాలకుదు
* మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు
ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు,ఆరాధనామార్గాలు మారుతుంటాయి.
శివుని పుట్టుక గురించి అనేక కథలు ఉన్నాయి. విష్ణు పురాణంలో శివుడు బ్రహ్మ కుమారుడని ఉన్నది. మధు, కైటభులు అను రాక్షసులు బ్రహ్మను చంపటానికి రాగా, విష్ణువు వారిని తీక్షణంగాచూస్తాడు. ఆ సందర్భములో విష్ణువు నుదుటి నుండి శివుడు త్రిశూలాన్ని ధరించి జన్మించాడని మరొక ఇతిహాసములో ఉన్నది. మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగుత్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగాకోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడినఅనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మంచేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉన్నది.
శివసిద్ధి..
ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైన అనేకమంది ద్వంద్వ భావాలతో సందేహాలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా 'నేను' అనే భావననుంచి, దానికి సంబంధించిన 'అహంకారం'నుంచిబయటపడేందుకు బహువిధాలుగా ప్రయాస పడుతుంటారు. మాయ ఎంత బలీయమైనదంటే- ఒక్క క్షణంలోనే చంచలత్వాన్ని మనసులోకి ప్రవేశపెట్టేస్తుంది. అయోమయం ఆవహింపజేస్తుంది.మహాత్ములు సైతం తమ సాధనా కాలంలో ఈ దురవస్థలతో బాధపడినవారే. సాక్షాత్తు శివాంశ సంభూతునిగా చెప్పుకొనే ఆదిశంకరులకూ ఇలాంటి అవస్థ ఒకసారి కలిగింది. మార్గంలో ఒక చండాలుడుఎదురైనప్పుడు ఆదిశంకరులు ఏవగింపుతో 'తప్పుకో... తప్పుకో...' అని మందలించగా, అతడు నవ్వుతూ 'స్వామీ! తమరు దేన్ని తప్పుకోమంటున్నారు? అశాశ్వతమైన ఈ శరీరాన్నా,అనంతస్వరూపమైన ఆత్మనా?' అని ప్రశ్నించాడు. తక్షణం ఆదిశంకరుల్లో అజ్ఞానపు తెర మటుమాయమైంది. తదనంతర కాలంలో ఆయనలోంచి శివతత్వం గంగా తరంగాలుగా ప్రవహించింది.శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి అనితర సాధ్యమైన రచనలను భక్త లోకానికి అందించారు.
'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేకలక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు. శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశంఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు. పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్నఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే 'శివసిద్ధి'.అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తుశివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.
శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసంఏర్పరచాడంటారు. జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివసాన్నిధ్యంలోఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.
శివరాత్రి మహాత్యము:
తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి
శివరాత్రి నోము...
పూర్వకాలములో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతడెంతటి విద్యాసంపంనుదో అంతటి దారిద్రము అతడిని వేదిస్తుండేది. యెంత ప్రయత్నించినా చేతికి చిల్లి గవ్వైనా లభించేదికాడు. ఇందుకు జతగా అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా వుండేది. ఈ దుర్భర పరిస్తులతో మరొకర్ని యాతన పెట్టడం ఇష్టం లేక దేనికని వివాహం చేసుకోలేదు. నా అన్నవారెవరూ లేక సేవలు చేసే ఇల్లాలు లేక అతడు ఎంతగానో బాధపడుతుండేవాడు. క్రమక్రమంగా అతడికి జీవితం మీద విరక్తి కలిగింది. ప్రాణాలు తీసుకోవడా శాస్త్రసమ్మతం కాదని నారు పోసినవాడు నీరు పొయ్యక పోతాడా అని కాలాన్ని గడుపుతుండేవాడు. క్రమక్రమంగా ఓర్పు నశించింది. ఇంకా ప్రాణ త్యాగం ఒక్కటే తనకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు. నీటిలో పడాలి, అగ్నికి ఆహుతికావాలి. కత్తి కటార్లతో పొడుచుకోవాలి, విషాన్ని తినాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి ఒదిగిపోయాడు.
నిద్రలో అతనికి పరమేశ్వరి సాక్షాత్కరించి ఓయీ! ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాదేడవు. సదాశివుడు కన్నా దయామయుడు లేదు ఆ శంకురుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది. మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరకు వెళ్లి తన బాధలను తనకు వచ్చిన కళను చెప్పి శివ కరుణ కొరకు తానేమి చెయ్యాలి అని ప్రశ్నించాడు. విప్రోత్తమా పార్వతి పరమేశ్వరులు జననీ జనకులు కదా జగదాంబ నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షం పొందమని ప్రభోదించింది. ధన్యుడవు శివునకు ప్రీతియైన రోజు శివరాత్రి ప్రతిమాసంలో ఆఖరి మూడవరోజు శివరాత్రౌతుంది. ఆనాడు నీవు నదీ స్నానం చేసి ఉపవాసముండి ఆరాత్రంతా శివనామార్చనతో జాగారం గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించి ఇలా మహా శివరాత్రి వరకు గడువు ఆనాడు కలిగిని మేరకు ఎవరికైన ఒకరికి ఒక ఫలమో తృణమో ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందు నీ బాధలు తీరుతాయి. దారిద్యము తొలగిపోతుంది . ఆరోగ్య వంతుడవు అవుతావు అని చెప్పగా ఆ ప్రకారంగా భక్తి శ్రద్దలతో శివరాత్రి నోము నోచుకుని అతడు జీవితాంతం సుఖముగా వున్నాడు.
ఉద్యాపన: ప్రతి మాసశివరాత్రి నాడు శివలింగార్చనతో నిరాహారము జాగారము చేయాలి. ఇలా సంవత్సరకాలం ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు దానం చెయ్యాలి. మహా శివరాత్రి పర్వదినాన క్షణమైనా వ్యర్ధం చెయ్యక శివాక్షరిని జపించాలి. శివునకు అర్చన చెయ్యాలి. ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం ఆర్ధిక సహాయము నిరుపేదలకు అందించి వారి ఆశీస్సులు పొందాలి.
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more