ఎన్నో ఆశలు రేపుతున్న వ్యాపార రంగం కొత్త సంవత్సరంలోకి సరికొత్త జోష్ తో అడుగుపెడుతోంది. గత యూపీఏ ప్రబుత్వం కొనసాగించిన ఆర్థిక పథాకాలకు తోడు.. దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త సర్కారు చేపట్టిన ఆర్తిక సంస్కరణలతో భవిష్యత్తు బాంగారు బాటలు వేస్తుండటంతో నష్టాల బాటన విడిచిన స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా లాబాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థపై మళ్లీ విశ్వాసం చిగురించింది. మరోపక్క, అంతర్జాతీయంగా చమురు ధరలు నేలకు దిగి రావడం కూడా దేవీయ వాణిజ్యం లాబాలను చవిచూడటానికి దోమదపడుతోంది.
తగ్గిన చమురు ధరలు
ఈ ఏడాది ఆరంభంలో మరింత పైకి ఎగిసిన చమురు ధరలు.. చివరికొచ్చేసరికి దిగిరావడం సామాన్య ప్రజలకు ఊరటనిచ్చాయి. జూన్ నుంచీ చమురు ధరలు గణనీయంగా పడిపోవడం భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశంగా మారింది. జూన్లో 110 డాలర్ల స్థాయిలో ఉన్న బ్రెంట్ క్రూడ్ ధరలు డిసెంబర్ నాటికి 60 డాలర్ల స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం 56.66 డాలర్లకు చేరువలో వున్నాయి. ఇవి మరింతగా తగ్గి 50 డాలర్లకు చేరుకుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో కొత్త సంవత్సరంపై మరిన్ని ఆశలు చిగురిస్తున్నాయి. పెట్రోల్ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదో సారి తగ్గగా, డీజిల్ ధర గత అక్టోబర్నుంచి వరుసగా నాలుగోసారి తగ్గి ద్రవ్యోల్బనాన్ని కట్టడి చేసేందుకు దోమదపడ్డాయి. అయితే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న చమురు ధరలు ఎప్పుడు స్థిరత్వం పొందుతాయనే అంశంపై మాత్రం పూర్తి అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామం దేశీ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తోంది.
ఈ-కామర్స్ జోరు- రిటైల్ బేజారు
ఇండియాలో ఈ కామర్స్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది. 2014లో ఈ-కామర్స్ విజృంభణ ముఖ్యాంశాల్లో ఒకటి. చైనా దిగ్గజ సంస్థ అలీబాబా సహా పలు దేశాల ఈ కామర్స్ సంస్థల దిగ్గజాలు భారత్కు క్యూ కట్టారు. ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు బిగ్ బిలియన్ డే లాంటి పేర్లతో అత్యంత చవగ్గా వస్తువులు ఇచ్చేయడం లాంటివి ఈ కామర్స్ మరింత పుంజుకోడానికి దోహదపడ్డాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా రూ.1,50,000 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ విజయవంతం కావడం, ఆ సంస్థ చీఫ్ జాక్ మా ఆసియాలోనే అపర కుబేరిడినా అవతరించడం గమనార్హం. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ఈ కామర్స్ సంస్థలు హామీ ఇవ్వడంతో రిటైల్ సంస్థల్లో కొంత అనిశ్చితి నెలకొంది. ఈ విభాగం నేరుగా వ్యాపార రంగంలోకి ప్రవేశించడం వల్ల తమ అమ్మకాలు దెబ్బతింటాయని రిటైల్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమ అమ్మకాలు భారీ తగ్గుముఖం పట్టేఅవకాశం ఉందని రిటైల్ సంస్థలు బేజారెత్తుతున్నాయి.
దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు లాభాలతో దుమ్ముదులిపాయి. ఐదేళ్ల తరువాత మళ్లీ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ ఏకంగా 6,038 పాయింట్లు(29%) ఎగసింది. ఒక దశలో చరిత్రాత్మక గరిష్టమైన 28,882ను తాకింది. గత 2009లో మాత్రమే సెన్సెక్స్ 7,817 పాయింట్లు జమ చేసుకుంది. ఆ తరువాత లాభనష్టాల మద్య దోబూచులాడిన మార్కెట్లు సుమారు ఏడేళ్ల తరువాత తమ ర్యాలీని కొనసాగించాయి. ఈ ఏడాది 21,140 పాయింట్లతో ఆరంభమైన సెన్సెక్స్.. డిసెంబర్ నెలాఖరునాటికి 27,400 పాయింట్లతో కొనసాగుతోంది. ఇంతక్రితం 2009లో మాత్రమే సెన్సెక్స్ 7,817 పాయింట్లు జమ చేసుకుంది. ఇక ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం దాదాపు 30% పుంజుకుని సంవత్సర అఖరునాటికి 8283 పాయింట్లతో దూసుకుపోవడం శుబసూచకం. మోదీ అధ్యక్షతన కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఊపందుకున్న సంస్కరణలు వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) పెట్టుబడులను కుమ్మరించడం మార్కెట్ల జోరుకు దోహదపడింది. ఈ ఏడాది జనవరి మొదలు డిసెంబర్19 వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవహించిన విదేశీ పెట్టుబడులు రూ. 2.6 లక్షల కోట్లను(42.6 బిలియన్ డాలర్లు) తాకాయి. కాగా, ఈ ఏడాది పెట్టుబడులకు సంబంధించి ఎఫ్పీఐలు ఈక్విటీలకు రూ. 99,450 కోట్లు(16.5 బిలియన్ డాలర్లు), బాండ్లకు రూ. 1.59 లక్షల కోట్లు (26.2 బిలియన్ డాలర్లు) చొప్పున కేటాయించారు. ఈల్డ్స్ ఆకర్షణీయంగా ఉండటంతో బాండ్లకు అత్యధిక శాతం పెట్టుబడులను ఎఫ్పీఐలు కేటాయిస్తూ వస్తున్నారు. అమెరికాసహా, కొన్ని విదేశీ స్టాక్ సూచీలు కొత్త గరిష్టాలతో దూసుకెళ్తున్నాయి. ఇది కూడా దేశీ స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్కు బలాన్నిస్తోంది.
ఆశాజనకంగా జీడీపీ
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 5.3 శాతంతో కాస్త కిందికి దిగిజారినా.. గతం కంటే మెరుగ్గా ఉండటం ఆశాజనకంగా మారింది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.7 శాతం వృద్ధితో ఉత్సాహాన్ని ఇచ్చినా.. తరువాత కిందికి జారిపోవడం కాస్త నిరుత్సహాన్ని నింపింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐదు శాతం దిగువన జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకున్నా.. క్రమేపీ ఇది పెరగడం మాత్రం ఉత్సాహాన్ని ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధిని సాధించగలదని డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ తాజాగా అంచనా వేసింది. పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం ఇందుకు సహకరించగలదని ఒక నివేదికలో తెలిపింది.
ఎయిర్ ఏషియా ఇండియా సేవలు
ఇండిగో, స్పైస్జెట్, గో ఎయిర్, జెట్లైట్ల తరహాలో ఎయిర్ ఏషియా కూడా చౌక విమానయాన సర్వీసులను అందించడానికి ఈ ఏడాది శ్రీకారం చుట్టింది. టోనీ ఫెర్నాండెస్ నేతృత్వంలోని మలేసియా విమానయాన సంస్థ, ఎయిర్ ఏషియా, టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్ప్లేస్లు కలసి 49:30:21 భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది స్పైస్ జెట్ కష్టాలు కూరుకుపోయింది. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు బకాయిలు రూ. 1,230 కోట్లకు ఎగబాకడంతో అవి తక్షణం చెల్లింపు జరపాలంటూ పట్టుబట్టాయి. దీంతో ఒకరోజు సర్వీసుల నిలిపివేత వరకూ పరి స్థితి వెళ్లింది. చివరకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇవ్వడంతో మళ్లీ సర్వీసులు కొనసాగుతున్నాయి. కాగా వచ్చే ఏడాది దేశంలో మరో 6 విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలు ఆరంభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రాంతీయ అనుసంధానం పెంచి, మరిన్ని నగరాలకు విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరింది. ఇదే క్రమంలో జెట్ ఇంధనం (ఏటీఎఫ్) ధర తగ్గించేందుకు, పన్ను శాతాన్ని బాగా తక్కువగా ఉంచాలని విజ్ఞప్తి చేసింది. దీంతో నూతన సంవత్సరంలో పౌరవిమానయాన రంగం కూడా కొత్త పుంతలు తొక్కనుంది.
కార్పొరేట్ అరెస్టులు...
2014 కార్పొరేట్ రంగంలో ముగ్గురు ప్రముఖ వ్యక్తుల అరెస్టులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా రెండు గ్రూప్ కంపెనీలు దాదాపు 24,000 కోట్ల నిధుల సమీకరణ... తిరిగి చెల్లించడంలో వైఫల్యం కేసులో సహారా చీఫ్ సుబ్రతారాయ్ జైలుకెళ్లారు. ఇక నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఇన్వెస్టర్లకు దాదాపు రూ.6,000 కోట్ల చెల్లింపుల వైఫల్యం కేసులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షా అరెస్ట్ సంచలనాన్ని సృష్టించింది. ఇక భారతీయ సంతతికి చెందిన గోల్డ్మన్ శాక్స్ మాజీ డెరైక్టర్ రజత్ గుప్తా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు రుజువుకావడంతో జైలుపాలు కావడం మరో కీలక పరిణామం.
ఆర్థిక రికవరీ..
గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐదు శాతం దిగువన స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును నమోదుచేసుకున్న దేశం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.7 శాతం వృద్ధితో ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే రెండవ త్రైమాసికంలోనే 5.3 శాతం వృద్ధిలోకి జారిపోవడం కొంత నిరుత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.5 శాతం వృద్ధి రేటు తగ్గదని ప్రభుత్వం, ఆర్బీఐసహా పలు విశ్లేషణా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఎస్అండ్పీ సైతం భారత్ రేటింగ్ను పెంచడం కొంత సానుకూలంగా మారింది. మొత్తంగా మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించడం, సంస్కరణలపై సత్వర నిర్ణయాలతో మొత్తం ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతున్న సంకేతాలు కనబడుతున్నాయి.
ధరలు.. రేట్లు...
గత రెండుమూడేళ్లగా ధరల పెరుగుదల రేటు తీవ్ర ఆందోళన కలిగించినప్పటికీ, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇది ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యంకన్నా తక్కువకు దిగిరావడం పాలక, పారిశ్రామిక, ఆర్థిక వర్గాల్లో సంతోషాన్ని నింపింది. నవంబర్లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ‘0’గా నమోదుకాగా, రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 4.4 శాతంగా ఉంది. రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.3 శాతం కావడం, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు క్షీణత-స్వల్ప వృద్ధి రేటు మధ్య తిరుగుతున్న నేపథ్యం.. వంటి అంశాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం దిగువస్థాయిలో ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వడ్డీరేట్లను తగ్గించాలని పరిశ్రమల వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఆర్బీఐ చీఫ్ రఘురామ రాజన్ తన కఠిన విధానాన్ని సడలించకపోవడం కొంత విమర్శలకు కారణమయ్యింది. అయితే, 2015 మొదటి రెండు, మూడు నెలల్లో వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని... పావురాళ్లు, గుడ్లగూబలతో పోల్చుతూ పాలసీ విధానం సందర్భంగా గవర్నర్ రాజన్ వద్ద ఆసక్తికరమైన చర్చ జరగడం ప్రధానంగా వార్తల్లోకి ఎక్కింది.
పెను సవాళ్లతో ఆటోమొబైల్ రంగం
అమ్మకాలపరంగా ఆటోమొబైల్ కంపెనీల ప్రయాణం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆటో ఎక్స్పోలో ఏకంగా 70 కొంగొత్త మోడల్స్ ఊరించిన మార్కెట్ మాత్రం ఎగుడుదిగుడుగా సాగింది. మొబీలియో, సియాజ్, జెస్ట్ వంటి వాహనాలతో ఏడాది పొడవునా కొత్త కార్లు సందడి చేశాయి. అయితే, అమ్మకాలు మాత్రం ఒక నెల పెరగడం, మరో నెల తగ్గడం లాగా సాగింది. ఏడాది తొలి 11 నెలల్లో అమ్మకాలు 10 శాతం మేర క్షీణించాయి. కాంపిటీషన్ కమిషన్ 14 కార్ల సంస్థలపై రూ. 2,545 కోట్ల జరిమానా విధించడం మరో చెప్పుకోతగ్గ పరిణామం. అయితే, సవాళ్లెన్ని ఎదురైనప్పటికీ.. ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం ఇన్వెస్ట్మెంట్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. మహీంద్రా, మారుతీ, హీరో మోటోకార్ప్, బజాజ్ తదితర సంస్థలు 5 బిలియన్ డాలర్ల మేర భారీ పెట్టుబడులను ప్రకటించాయి. కొత్త సంవత్సరం సానుకూలంగా ఉండగలదని ఆటోమొబైల్ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి.
విదేశాల్లో మనోళ్ల సత్తా..
మైక్రోసాఫ్ట్ చీఫ్గా ఎదిగిన సత్య నాదెళ్ల ఇందులో ప్రముఖులు. మరొకరు ఫిన్లాంగ్ సంస్థ నోకియా కొత్త ప్రెసిడెంట్, సీఈఓగా భారతీయుడు 46 సంవత్సరాల రాజన్ సూరీ బాధ్యతల స్వీకారం. బ్రిటన్ అగ్రశ్రేణి బ్యాంక్ శాంటడర్ యూకే చైర్మన్గా భారత్ సంతతికి చెందిన మహిళ శ్రుతి వదేరా నియామకం... ఏడీబీ పాలనా ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా తొలి భారతీయురాలు... లక్ష్మీ స్వామినాథన్లను సైతం ఈ జాబితాలో పేర్కొనవచ్చు. భారత్ సంతతికి చెందిన వ్యక్తి సునీల్ సబర్వాల్కు అమెరికాలో అరుదైన గౌరవం... ఐఎంఎఫ్లో ప్రత్యామ్నాయ ఈడీగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆయనను నామినేట్ చేయడం కూడా ఈ ఏడాది ముఖ్యాంశాలు.
తెలుగు రాష్ట్రాల మధ్య ' వ్యాపార' పోటీ
వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాలు తమ ఉనికిని చాటి చెప్పేందుకు యత్నిస్తున్నాయి. ఆ రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో వ్యాపార కార్యకలాపాల్ని మరింత ముందుకెళ్లేందుకు బాటలు వేసుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్టులు, విస్తరణలు, పెట్టుబడులు ఇలా అన్నింటా రెండు రాష్ట్రాల మధ్య ఒక రకంగా పోటీకి తెరతీసింది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి రెండు రాష్ట్రాలు పోటీ పడుతుండటంతో కార్పొరేట్ రంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ దిశగా యత్నాలు ఆరంభించింది. హీరో మోటార్ సైకిల్స్ ప్రాజెక్ట్ గురించి ఇరు రాష్ట్రాలు పోటీ పడగా చివరకు ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. అయితే ప్రపంచ అతిపెద్ద రిటైల్ ఫర్నిచర్ సంస్థ ఐకియూ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అలాగే ఇసుజు, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే తెలంగాణలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కోజెంట్ గ్లాస్ యూనిట్, జాన్సన్ అండ్ జాన్సన్, కోకకోలా తదితర కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.
ఐటీ 'విస్తరణ
తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయికి ఐటీని విస్తృతం చేస్తోంది. హైదరాబాద్ను వైఫై నగరంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే తన కార్యాచరణను మరింత విస్తృతం చేసింది. తొలుత హైటెక్సిటీ ప్రాంతంలో ఎయిర్టెల్తో కలిసి పబ్లిక్ వైఫై అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీ స్టార్టప్ల కోసం టి-హబ్ పేరుతో దేశంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఏర్పాటవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కూడా ఐటీకి విస్తృత ప్రాధాన్యం ఇస్తోంది. ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే గూగుల్, విప్రో తదితర సంస్థలతో చేతులు కలిపింది.
ఏరోస్పేస్ కు ప్రత్యేక పాలసీ
తెలంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. స్విట్జర్లాండ్ కంపెనీ రువాగ్ ఏవియేషన్ తయారీ డార్నియర్-228 విమానాల కోసం విమాన బాడీ, రెక్కల తయారీ కేంద్రాన్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆదిభట్లలోని ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ సెజ్లో నెలకొల్పుతోంది. ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ సహకారంతో జీఎంఆర్ గ్రూప్ ఏరోస్పేస్ ట్రైనింగ్ హబ్ను శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేస్తోంది.
వాణిజ్యరంగంలో గత సంవత్సర ముఖ్యాంశాలు:
జనవరి
వాణిజ్య విమానయాన సేవలకు వందేళ్లు.
నాస్కామ్ అద్యక్షునిగా తెలుగు వ్యక్తి చంద్రశేఖర్ బాధ్యతలు
ప్రపంచంలోని అతిపెద్ద పీసీ తయారీ సంస్థ లెనోవో చేతికి ఐబీఎం సర్వర్ వ్యాపారం.
2005 ముందటి నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ప్రజలకు ఆర్బీఐ సూచన.
టాటా మోటార్స్ ఎండీ కార్స్లిమ్ మృతి.
ప్రపంచంలోనే అత్యధిక లావాదేవీలు నిర్వహించిన ఈక్విటీ మార్కెట్గా ఎన్ఎస్ఈ.
ఫిబ్రవరి
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చరిత్రలో తొలి మహిళా చైర్పర్సన్గా జానెట్ యెలెన్ బాధ్యతల స్వీకరణ.
స్టీవ్ బామర్ స్థానంలో 38 ఏళ్ల చరిత్ర గలిగిన మైక్రోసాఫ్ట్ చీఫ్గా తెలుగు తేజం సత్య నాదెళ్లకు పగ్గాలు.
19 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో వాట్యాప్ను కొన్న ఫేస్బుక్.
మారుతీ ‘800’ ఉత్పత్తి పూర్తిగా నిలిపివేత.
మార్చి
హెచ్పీసీఎల్ తొలి మహిళా సీఎండీగా నిషీ వాసుదేవ
స్టాక్ మార్కెట్ మోసం కేసులో కేతన్ పరేఖ్కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సీబీఐ కోర్టు
ఫోర్బ్స్ అపర కుబేరుల్లో మళ్లీ బిల్ గేట్స్కు అగ్రసాథనం. 56 మంది భారతీయులకు చోటు. ముకేశ్ అంబానీ టాప్.
చెన్నై నుంచి ఎయిర్ ఏషియా ఇండియా తొలి విమానం టేకాఫ్.
ఏప్రిల్
ఐడీఎప్సీ, బంధన్ ఫైనాన్స్ సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్స్లు.
సన్ఫార్మా-ర్యాన్బాక్సీ విలీనం రూ.20,000 కోట్ల డీల్
హోల్సిమ్ (స్విట్జర్లాండ్), లఫర్జీ (ఫ్రాన్) కంపెనీల విలీనం ప్రకటన.
పపంచంలో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా ఆవిర్భావం.
ఫిన్లాంగ్ సంస్థ నోకియా కొత్త ప్రెసిడెంట్, సీఈఓగా భారతీయుడు రాజన్ సూరి నియామకం.
మే
ఎఫ్టీఐఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షా అరెస్ట్
ప్రపంచంలోనే అతి ఖరీదైన ఇల్లుగా ముంబైలోని ముకేశ్ నివాసం ‘అంటిలియా’
దేశీ ఈ-కామర్స్లో అతిపెద్ద విలీనం. ఫ్లిప్కార్ట్ చేతికి మింత్రా.
ముగిసిన అంబాసిడర్ శకం. ఉత్పత్తిని నిలిపేసిన హిందుస్తాన్ మోటార్స్
ఆర్థికమంత్రిగా అరుణ్జైట్లీ బాధ్యతలు. నల్లధనం వెలికితీతపై జస్టిస్ ఎంబీ షా నేతృృత్వంలో సిట్ ఏర్పాటు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి ‘నెట్వర్క్ 18’ గ్రూప్.
జూన్
తొలిసారి 25,000పైన సెన్సెక్స్
ఇన్ఫోసిస్ సీఈఓగా 47 ఏళ్ల విశాల్ సిక్కా. తొలిసారి బయటి వ్యక్తికి పగ్గాలు.
ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు రుజువుకావడంతో జైలులోకి గోల్డ్మన్ శాక్స్ మాజీ డెరైక్టర్, భారత్ సంతతి వ్యక్తి 65 ఏళ్ల రజిత్గుప్తా.
అంతర్జాతీయ విమాన సంస్థల కూటమి స్టార్ అలయన్స్లో ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియాకు చోటు.
జూలై
మోడీ ప్రభుత్వం మొదటి రైల్వే బడ్జెట్.
రూ.17,94,892 బడ్జెట్ వ్యయంతో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తొలి బడ్జెట్
చిత్ర నిర్మాణంలోకి మహీంద్రా గ్రూప్ ప్రవేశిస్తోందని వార్తలు.
వచ్చే మూడేళ్లలో రూ.2.1 లక్షల పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించిన టాటా గ్రూప్. రూ.6,24,754 కోట్ల ఆదాయ కంపెనీగా ఆవిర్భావం
ఆగస్టు
తెలుగు వ్యక్తి కేవీ చౌదరి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ చైర్మన్గా బాధ్యతలు.
ప్రాంతీయ భాషల్లో డొమైన్లు. ఈ నెల 27 నుంచీ హిందీతో ఆరంభం. తరువాత తెలుగుసహా ఆరు భాషల్లో ప్రారంభం
కుటుంబ కలహాల నేపథ్యం... ‘చెట్టినాడ్’ గ్రూప్ పగ్గాల మార్పు.
దేశ వ్యాప్తగా ప్రధాని జనధన యోజన పథకం ప్రారంభం.
సెప్టెంబర్
విజయమాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అలీబాబా ఐపీఓ ప్రపంచ రికార్డు. ఐపీఓ విలువ రూ.1,50,000 కోట్లు. చైనాలో అత్యంత సంపన్నునిగా ఆవిర్భవించిన కంపెనీ ప్రమోటర్ జాక్ మా.
కోల్గేట్ స్కామ్లో 214 బొగ్గు గనులను రద్దు చేసిన సుప్రీంకోర్టు.
అక్టోబర్
డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్పై సెబీ నిషేదాజ్ఞలు. స్టాక్ మార్కెట్ కార్యకలాపాల నుంచి మూడేళ్ల బహిష్కరణ
ఆర్థికమంత్రిత్వశాఖ ముఖ్య ఆర్థిక సలహాదారుగా అరవింద్ సుబ్రమణియన్
రిలయన్స్కు వర్తించని విధంగా గ్యాస్ ధర 6.17 డాలర్ల పెంపునకు కేంద్రం ఆమోదం
డీజిల్ ధరపై నియంత్రణల తొలగింపు
అమెరికాలో ఉద్దీపణలకు స్వస్తి.
నవంబర్
అత్యంత శక్తివంతురాలైన భారత్ వ్యాపార మహిళగా ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య.
మళ్లీ కిసాన్ వికాస పత్రాలు ప్రారంభం.
కొటక్ మహీంద్రాలో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీనానికి ఒప్పందం.
భారత్కు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా. భారత్లో మరిన్ని పెట్టుబడులు
రూ. 100 లక్షల కోట్ల విలువను దాటిన స్టాక్ మర్కెట్ విలువ.
డిసెంబర్
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతన ప్యాకేజీ రూ.520 కోట్లుగా ఖరారు.
కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ మినహా మరోటి ఉండబోదని ఆర్బీఐ స్పష్టీకరణ
రూ.60,000 కోట్ల విలువైన ముడిచమురు దిగుమతికి రష్యా సంస్థ రోజ్నెట్తో ఎస్సార్ ఆయిల్ ఒప్పందం.
స్పైస్ జెట్ విమానసంస్థలో 12 వందల కోట్ల రూపాయల పెట్టుబడులు
అనిల్ అంబానీ (అడాగ్) గ్రూప్ నేతృత్వంలోని బిగ్ సినిమాను కొన్న కార్నివల్. మల్టీప్లెక్స్ రంగంలో అతిపెద్ద ఒప్పందం.
కొత్త సంవత్సరంలో మరో ఆరు విమానయాన సంస్థలు వస్తాయని కేంద్రం మంత్రి ఆశోక్ గజపతిరాజు ప్రకటన
జి.మనోహర్.
- ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) చైర్మన్గా బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ఫిబ్రవరి 8న ఎన్నికయ్యారు.
- ఐఓఏ(ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more