నాలుగు దశాబ్దాలు గడిచాయి. కాని ఆ మనిషి, ఆ స్వరం ఈ గడ్డ జ్ఞాపకాల్లోంచి అంతరించి పోలేదు. కొన్ని కోట్ల కుటుంబాలు ఆయన పాటలు వింటూనే తరిస్తున్నాయి. జీవితంలో తమకెదురవుతున్న సమస్త బాధలను, సంతోషాలను, ప్రేమాభిమానాలను, పిడుగుపాటులా తగిలే ఎదురుదెబ్బలను, విచారాన్ని, వేదనను, భక్తిభావనను, శృంగారాన్ని, కరుణ రస హృదయ స్పందనలను ఆయన పాటల ద్వారా వింటూ స్వాంతన పొందుతూ ఈ నేల మీది మనుషులు సేద తీరుతున్నారు.
ఆ అమర స్వరం ఇక పాడలేనని సెలవు తీసుకుంది. ఆ మనిషి, ఆ స్వరం ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్లిపోయాయి. మనిషి లేడు... ఆయన గతించిన తర్వాత గడిచిన కాలం నాలుగు దశాబ్దాలు. గత ఏడు దశాబ్దాలుగా ఈ నేల ఆయన పాటలతో పునీతమవుతూనే ఉంది. ఆయనే మన తెలుగు తల్లి గారాల స్వర పుత్రుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. గంధర్వ గాయకుడు ఘంటసాల.
ఆయన కంచుకంఠానికి శాశ్వత నిదర్శనంలా నిలిచి, మూడు తరాలపాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింప జేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల. తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతనాన్ని ప్రపంచానికి కమ్మటి గొంతుతో పరిచయం చేసిన ఘంటసాల... మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీత, నేపధ్య గాన చరిత్రలో కరిగిపోని సంతకంలా తెలుగు వారి హదయాల్లో నిలిచిపోయాడు.
అటు భక్తిని, ఇటు రక్తిని, అటు ప్రేమను, ఇటు ఎడబాటును, అటు వేదనను ఇటు అనుకంపనను, విరక్తిని, అల్లరిని, సంతోషాన్ని 'ఒక్క మనిషి సమస్తజీవుల తానైన' చందాన నవరసాలను ఒక్క గొంతులో పలికించడమేమిటి? మన కళ్లముందు ఈ ప్రపంచంలో ఎన్ని భాషల్లో, ఎంతమంది ప్రసిద్ధ గాయనీ గాయకులు పాడటాన్ని, పాటలతో జీవితాన్ని పండించుకోవడాన్ని మనం చూడలేదు? కనలేదు..! వినలేదు..? ప్రేమను పలికించినవారు, విషాదాన్ని గుండెనిండా నింపినవారు.. భక్తిని రంగరించి పాడినవారు ఎంతమందిని మనం చూడలేదు.
కాని ఇన్ని మానవ అనుభూతులను ఒక గొంతు.. ఒకే ఒక్క గొంతు పలకడమేమిటి? ఒక జాతి గొంతును తన గానంతో తరింపజేయడమేమిటి? అనితర సాధ్యమైన ఈ గంధర్వ గాన కళ ఈయనకే ఎలా సాధ్యమైంది? ఆయన కంఠంలో పలికిన భక్తి, విచారం, వేదన, విరక్తి, ప్రేమ, చిలిపితనం, శృంగారం, అల్లరి, గడుసుదనం మరొకరికి అనుకరణ సాధ్యంకాదని తెలుగు జాతి ముక్త కంఠంతో శ్లాఘిస్తోంది.
ప్రపంచ గాన చరిత్రలో ఒక గాయకుడు ఇన్ని మానవ మనోభావాలను, సంవేదనలను మూడు దశాబ్దాలపాటు ఒకే స్థాయిలో పాడటం జరిగిందా, మన దేశంలో కాని, ఇతర దేశాలలో కాని నవరసాలను జీవిత పర్యంతమూ పలికించిన గొంతు ఎక్కడైనా ఉందా అనేది రేపటి పరిశోధకులకే వదిలేద్దాం...
ఘంటసాల కారణ జన్ముడు కాడు. గంధర్వగాయకుడు కాడు.. దేవుడు ప్రసాదించిన వరప్రసాదం అంతకంటే కాదు. పేదరికాన్ని జీవితపు తొలినాళ్లలో ఘోరంగా అనుభవించిన ఆ చిన్ని జీవితం, ఆకలి విశ్వరూపాన్ని తాను చేపట్టిన మధూకర వృత్తి సాక్షిగా చవిచూసిన ఆ పిల్లాడి జీవితం తన గొంతును రాగరంజితం చేసింది.
మానవ జీవితపు సమస్త వేదనలను, ఆశలను, ఆరాటాలను, అభిమానాలను, అనురక్తులను ఆయన కంఠం తనవిగా చేసుకుంది. పేదరికం, ఆకలి ఆ గొంతుకు అమృతాన్ని అందించి కమ్మటి స్వరాన్ని ఈ ప్రపంచానికి చిరస్థాయిగా అందించాయి.
జీవితంలో బాధ పడనివాడు, బాధ అంటే ఏమిటో తెలియని వాడు, ఆకలి రుచెరుగనివాడు, సమస్త బాధల వెనుక ఒక జీవితం అంటూ ఉంటుందన్న ఆశను, వాస్తవాన్ని ఆకలి సాక్షిగానే గుర్తెరగని వాడు... మనిషిని కరిగించే పాట పాడలేడు. కాని పేదరికమే వారిని నడిపించింది. జీవితంలో లేమితనం వారిని రగిలించింది. కష్టభూయిష్ట బాల్యమే వారిని రాటుదేల్చింది.
మన కన్నీళ్లు, మన వేదన, మన దుఃఖం ఇవి పాటకు, గానానికి ప్రాణ ప్రతిష్ట చేస్తాయనే సత్యాన్ని, అన్నమయ్య గీతాలాపనకు ప్రాణంపోసిన శోభారాజు ఒక సందర్బంలో అన్నట్లు గుర్తు. తిండికి ముఖం వాచిపోయిన తన పేదరికమే, తన ఆకలే తన పాటకు మూలమైందని, అన్నమయ్య పాట రూపంలో తన అకలిబాధ వెలికి వచ్చిందని ఆమె పాతికేళ్ల క్రితమే ఒక సందర్భంలో అన్నారు.
చరిత్రకెక్కిన, చరిత్రను చరితార్థం చేసిన ప్రతి గొప్ప వ్యక్తి జీవితం వ్యక్తిగత బాధనుంచే మొదలైంది. ఘంటసాల దానికి అతీతుడు కాదు. ఆయన గొంతు పలికించిన అద్భుత రాగాలకు, కమనీయ వ్యక్తీకరణలకు ఆయన అనుభవించిన బాధ కారణం. ఆకలి కారణం, కటిక పేదరికం కారణం. జీవుడి వేదన కారణం.
ఆయనను ఇలాగే స్మరించుకుందాం. గుర్తించుకుందాం... ఆయన గొంతులో తారాడిన పాట పలికించిన సహస్ర వ్యక్తీకరణలను మనం ఇలాగే భద్రపర్చుకుందాం. ఎన్ని యుగాలు గడిచినా జాతి మర్చిపోని ఈ గాన గంధర్వుడికి ఇలాగే నివాళి పలుకుదాం. ఈరోజు ఫిబ్రవరి 11 ఘంటసాల భూవి నుండి దివికేగిన రోజు (ఘంటసాల వర్థంతి)
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more