గుండె నిండా ధైర్యం ఉంది -అన్నయ్య పై కోపం లేదు - పవన్
పవన్ కల్యాణ్ కొత్త పార్టీ ‘జన సేన’ సభా వేదిక వద్దకు కొద్దిసేపటి క్రితమే చేరుకోవటం జరిగింది. మెగా అభిమానుల ఆనందోత్సాహాల పండుగ వాతావర నెలకొంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభమైంది.
హైదరాబాదులోని మాదాపూర్ నోవాటెల్ హోటల్లో జరుగుతున్న ఈ సభలో ప్రస్తుతం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ 'అందరికీ హృదయ పూర్వక నమస్కారం' అంటూ మొదలెట్టిన పవర్ స్టార్ తనకు ఏమీ లేకున్నా గుండె నిండా ధైర్యం ఉందంటూ ఉద్వేగంతో వ్యాఖ్యానించారు.
అంతేగాకుండా, చిన్ననాటి నుంచి తనకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితలంటే ఇష్టమని, కష్టాల్లో ఉన్నప్పుడు ఓ కవితను స్మరించుకుంటానంటూ, ఇల్లేమో దూరం.. అంటూ తిలక్ కవితను చదివి అభిమానులను ఉత్తేజపరిచారు.
అయితే ఆ సమయంలో తన పార్టీ ఆవిర్భావానికి కారణం ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర నాయకుల బానిస బ్రతుకులే అని స్పష్టం చేశారు. అంతేతప్ప అన్నయ్య చిరంజీవికి వ్యతిరేకంగా కాదని వివరణ ఇచ్చారు. తన గుండెల్లో చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఆయనకు తానెందుకు ఎదురెళతానని పేర్కొన్నారు.
సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసానని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అప్పట్లో తనకి లేదన్నారు. తాను కోరుకుంటే అప్పుడే పీఆర్పీ తరపున ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేసుండేవాడినని పవన్ చెప్పారు. సమాజంలో జరిగే అన్యాయం, అక్రమాలు భరించలేక ఇప్పుడు కొత్త పార్టీ పెట్టానని ఆయన తేల్చి చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపినందుకు అన్నయ్య మీద కోపం లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేప్పటం జరిగింది.
చావడానికైనా సిద్ధమే కానీ-విమర్శలకు భయపడను ?
రాజకీయ నాయకులు నాపై విమర్శలు చేస్తే నేను భయపడను. పిరికితనం అంటే నాకు చిరాకు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ వెన్నుచూపను'' అని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చెప్పారు. తన పార్టీకి సైద్ధాంతిక బలముందని, ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ శత్రువులు ఏర్పడే అవకాశముందని పవన్ కల్యాణ్ చెప్పారు. తనను చంపినా చంపొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, చావడానికైనా సిద్ధమే కానీ, పిరికితనంతో వెనకడుగు వేయబోనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఏమైనా గంగానదా.?
తాను రాజకీయ పార్టీ పెడుతున్నానంటే అనేక మంది రకరకాల విమర్శలు చేశారని తెలిపారు. పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో కలపాలని దిగ్విజయ్ కోరినట్లు చెప్పారు. అలా కలిపేందుకు కాంగ్రెస్ ఏమైనా గంగానదా..? అని ప్రశ్నించారు. తాను పార్టీ పెడుతున్నట్లు ఇటీవల వార్తలొస్తుంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గంగిరెద్దుల మాదిరిగా కొత్త దుకాణం పెడుతున్నారని చేసిన కామెంట్ కు పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్రివిక్రమ్ కు ఇష్టం లేదు
‘‘నేను రాజకీయాల్లోకి రావడం చాలా మంది మిత్రులకు ఇష్టం లేదు’’ అని సినీ హీరో పవన్ కల్యాణ్ చెప్పారు. ముఖ్యంగా సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసుకు తన రాజకీయ రంగప్రవేశం ఇష్టం లేదని ఆయన అన్నారు. త్రివిక్రమ్ తో విభేదించి మరీ రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు.
ఇది నా తెలంగాణ- చిన్నప్పుడే సాయుధ పోరాటం చదివా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడు తూ.. ఇది నా తెలంగాణ అని గర్వంగా అన్నారు. నేను రాజకీయ పార్టీ పెట్టడానికి , నా తెలంగాణ ప్రజలను, నా తెలంగాణ అభిమానులకు నేను క్షమాపణ చెప్పాలా? పార్టీ పెట్టు కానీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలని కొందరు ప్రకటనలు చేశారని అన్నారు. అయితే ఇది నా తెలంగాణ నేను ఎవరికీ క్షమాపణ చెప్పనని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా నేను చిన్నప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం పుస్తకం చదివానని చెప్పటం జరిగింది. రాజకీయల్లోకి రావాలని అన్నీ సిద్దం చేసుకున్నాక నైరాశ్యం అవరించిందన్నారు. ఒకసారి , నిరాశ, నిస్రుహులు అవరించి ఆత్మహత్య చేసుకోవాలనున్నాన్నారు. మార్షల్ ఆర్ట్స్ , యోగా నేర్చుకున్నానని అన్నారు.
బానిసను కాను - పవన్
తనది బానిస మనస్థత్వం కాదని.. అన్నారు బాంచన్ దొర అని కాళ్లు పట్టుకునే అలవాటు తనకు లేదని చెప్పారు. ఢిల్లీలో కూర్చున్న వారి కాల్లు మొక్కడం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు
సచిన్ తో పోలికతో-భగత్ సింగ్ స్పూర్తితో ముందుకెళతా?
భగత్ సింగ్ ఆత్మ బలిదానం జరిగి చాలా కాలం అయ్యిందని, కానీ భగత్ సింగ్ మరణం తనను కదిలించిందనీ పవన్ కల్యాణ్ చెప్పారు. భగత్ సింగ్ డైరీలను చదివినప్పుడు తాను స్ఫూర్తి పొందానని పవన్ తెలిపారు. చిన్న వయస్సులోనే భగత్ సింగ్ మరణించినా, భావి తరాలకు దేశభక్తిని, స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నారని చెప్పారు. ఆయన ఇప్పటి పాకిస్థాన్ లో, అప్పటి అఖండ భారతదేశంలో పుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు.
భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకెళతా
చిన్నప్పటి నుంచి తాను భగత్ సింగ్ అభిమానిని అని, ఆయన స్ఫూర్తితో ముందుకెళతానని చెప్పారు. ఆయనకు జరిగిన అన్యాయాన్ని చూసి తన గుండె తరుక్కుపోయిందని చెప్పారు.
సచిన్ తో పోలికతో..
సినీ రంగంలోకి రాకముందు తన జీవితంలో జరిగిన కొన్ని అంశాలను అభిమానులతో పంచుకున్నారు. తాను పనీపాటా లేకుండా తిరగడం చూసిన కుటుంబ సభ్యులు క్రికెట్ దేవుడు సచిన్ తో పోల్చి విమర్శించేవారని వెల్లడించారు.
'సచిన్ చూడు ఎలా ఆడుతున్నాడో, నువ్వెప్పుడు ప్రయోజకుడివి అవుతావు?' అని వారు అంటుంటే తనకు బాధ కలిగేదని, అయితే ఏదో సాధించాలని గుండెల్లో ఉన్నా, అందుకు తగ్గ నైపుణ్యాలు అప్పట్లో లేవని చెప్పారు. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని, బాధ ఇలాగైనా తీరుతుందేమోనని సహచరులతో విపరీతంగా కొట్టించుకునేవాడినని అయినా అది తీరని వేదనలానే మిగిలిపోయిందని పేర్కొన్నారు.
జగ్గారెడ్డి పై ప్రేమ – వెంకయ్య నాయుడిపై కోపం
బీజేపీ నేత వెంకయ్య నాయుడిని తాను ఎంతగానో అభిమానిస్తే ఆయన తనపై విమర్శలు చేశారని పవన్ అన్నారు. తాను రాజకీయాల్లోకి రావడంపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ 'ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడంట?' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడని పేర్కొన్నారు.
జగ్గారెడ్డిపై ప్రేమ
తెలంగాణలో తనకు నచ్చిన ఏకైక వ్యక్తి జగ్గారెడ్డి అని పవన్ చెప్పారు. ఆయన చెప్పిన మాటలు తనకెంతో నచ్చాయని అన్నారు. రాష్ట్రాలుగా విడిదీసినా ప్రజలనెవరూ విడదీయలేరన్న జగ్గారెడ్డి మాటలు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు.
నాకు మూడు-అందుకే బట్టలూడదీసి కొడతాన్నది?
పవన్ ప్రసంగంలో ప్రతి ఒక్కరికీ చురకలు వేశారు. తెలంగాణ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ఆయన పంచ్ కొట్టారు. తననుద్దేశించి వీహెచ్ ‘‘మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ రాజకీయాలకు అవసరమా?’’ అని అన్నారని పవన్ గుర్తు చేశారు.
తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలుసని, మరి మీ పార్టీ నేత రాహుల్ గాంధీ ఒక్క పెళ్లి చేసుకోలేదేమని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలకు దిగటం సరికాదని ఆయన సీనియర్ నేతలకు హితవు పలికారు.
తనపై అనవసరంగా విమర్శలు చేసేవారికి పవన్ కల్యాణ్ హెచ్చరిక జారీ చేశారు. తనను విమర్శించేవారి గుట్టుమట్లన్నీ తనకు తెలుసని, మీడియాను పిలిచి యాగీ చేయబోనని, తనకు తెలిసిన పద్దతిలో సోషల్ మీడియాలో పెట్టేస్తానని స్పష్టం చేశారు. అందుకు యూట్యూబ్ ను మించిన వేదిక మరోటి లేదని చెప్పారు.
అందుకే బట్టలూడదీసి కొడతానంది ?
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలను బట్టలూడదీసి కొట్టాలని తాను పిలుపునివ్వడానికి గల కారణాన్ని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అదేమిటో ఆయన మాటల్లోనే... 'హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీభవన్ వద్ద భీమ్ రావ్ వాడ అని ఓ బస్తీ ఉంది. ఆ ప్రజలను అక్కడ నుంచి ఖాళీ చేయించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అందుకు ప్రభుత్వ అధికారులను పురమాయించారు.
ప్రజల అభివృద్ధి కోసం వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడంలేదని, కాంగ్రెస్ పార్టీ ఆఫీసును విస్తరించేందుకే వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారని అర్థమైంది. ఆ సమయంలో నేను భీమ్ రావ్ వాడ వెళితే ఓ తల్లి ఏడుపు నన్ను కదిలించింది.
కొత్త ప్రదేశంలో తన వయసుకొచ్చిన కూతురిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదని ఆమె భోరున ఏడ్చింది. ఇలాంటి వారిని బాధపెడుతున్నందుకే తిట్టాను కాంగ్రెస్ నాయకులను పంచలూడదీసి కొట్టాలని' అని వెల్లడించారు.
బాబు మంచి వ్యక్తి- ప్రజాసేవ ముఖ్యం- రాహుల్ నేర్చుకో.?
ప్రజాసేవ ముఖ్యం:
సీమాంధ్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో తనను సీమాంధ్ర నేతలు ఉద్యమానికి సారథ్యం వహించమని అడిగారని పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తే భవిష్యత్తులో సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావచ్చునని వారు తనకు సలహా కూడా ఇచ్చారని పవన్ సభాముఖంగా చెప్పారు.
కానీ, నాకు తెలంగాణ, సీమాంధ్ర అంటూ బేధం లేదని, తెలుగువారంటే తనకు అభిమానమని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో జగన్ జైల్లో ఉన్నారని, చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం లేదని వారు తనతో అన్నారని పవన్ చెప్పుకొచ్చారు. కానీ తనకు... అధికారం, డబ్బు సంతృప్తి ఇవ్వవని, ప్రజాసేవ ముఖ్యమని పవన్ తేల్చి చెప్పారు.
చంద్రబాబు మంచి వ్యక్తి:
జన సేన పార్టీ ఆవిర్భావ సభలో దాదాపు నేతలందర్నీ ఏకిపారేసిన పవన్ కల్యాణ్ ఒక్క నాయకుడిపై మాత్రం విభిన్నంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు చాలా మంచి వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. అందర్నీ ఒకే గాటన కట్టేయలేమని చెప్పారు.
రాహుల్... నేర్చుకో :
ప్రధాని కావాలని ఆశిస్తున్న రాహుల్ గాంధీ ఆయన నాయనమ్మ ఇందిరా గాంధీలా నడుచుకోవడం నేర్చుకోవాలని హితవు పలికారు పవన్ కల్యాణ్. గతంలో ఇందిరా గాంధీ సమాచార శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దేశంలో హిందీ ఉద్యమం నడుస్తోందని, బలవంతంగా హిందీ నేర్చుకోవాలంటూ చాలా చోట్ల ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. అయితే ఆ చర్యలకు ఎన్నో చోట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైందని పవన్ చెప్పారు.
ఆ సమయంలో ఇందిర చెన్నై వెళ్ళి హిందీ నేర్చుకోవడాన్ని తప్పనిసరి చేయబోమని వివరణ ఇచ్చుకున్నారని, అది ఆమె సంస్కారానికి నిదర్శనమని, ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో రాహుల్ కూడా అలాంటి సంస్కారమే అలవర్చుకోవాలని పవన్ సలహా ఇచ్చారు.
సోదరి కవితమ్మా లెక్కలు చెప్పమ్మా- శ్రీకాంతాచారి తల్లి
తెలంగాణా జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితపై పవన్కళ్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కవిత తననుద్దేశించి ‘పవన్ పార్టీ పెట్టొచ్చు కానీ, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని’ ఈనాడు దినపత్రికలో ఈరోజు చదివానని పవన్ అన్నారు. అయితే, తాను ప్రేమించే తెలంగాణకు, తెలంగాణ ప్రాంతాలకు క్షమాపణ చెప్పాలా, వద్దా? అనేది తన వ్యక్తిగత విషయమని ఆయన స్పష్టం చేశారు.
అయితే తాను సారీ చెప్పాలని కవిత డిమాండ్ చేయడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కవిత.. తన సంస్థకు చెందిన నిధుల సేకరణకు సంబంధించి వివరాలను ఈ ప్రాంత ప్రజానీకానికి వెల్లడించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తనను విమర్శించే ముందు వీటికి సమాధానం చెప్పాలన్నారు. కవిత తనకు సోదరి వంటిదని, రేపటి రోజు చెల్లెమ్మ ఫ్యామిలీ తనను టార్గెట్ చేయడంలో తప్పలేదన్నారు.
శ్రీకాంతాచారి తల్లి వేదన:
తెలుగు వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. విడిపోయిన తర్వాత తెలుగువారి మధ్య చిచ్చు పెట్టొద్దని తెలంగాణ రాజకీయ నేతలకు ఆయన హితవు పలికారు. తెలంగాణ ఉద్యమం కోసం వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రకటించిన తరువాత శ్రీకాంతాచారి తల్లి వేదన తనకు కన్నీరు తెప్పించిందని పవన్ కల్యాణ్ చెప్పారు.
కోట్లాది మందికి కోపం :
ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని విభజించిన తీరు సరిగా లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. విభజన తీరు అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో కోట్లాది మందికి కోపం తెప్పించిందని ఆయన అన్నారు. సినిమాల్లో నటించే తాను తెలంగాణ ఉద్యమాన్ని పది, పన్నెండు సంవత్సరాల నుంచి మాత్రమే గమనిస్తున్నానని... అయితే నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఢిల్లీ పెద్దలు ఉద్యమాన్ని గురించి తెలిసీ విభజనను సరిగా చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.
నేను భారతీయుణ్ణి'-కొమరం భీమ్ టీ షర్టు-గద్దర్ పై దాడి
గతంలో ఓ సారి నెల్లూరులో గద్దర్ 'బండెనక బండికట్టి...' అని పాడితే తాను ఆనందంతో గంతులేశానని పవన్ కల్యాణ్ తెలిపారు. గద్దర్ పై దాడి జరిగినప్పుడు ఆయనను ఆదుకుంది, ఆశ్రయం కల్పించింది సీమాంధ్రులేనని పేర్కొన్నారు. ఇక, ప్రొఫెసర్ కంచె ఐలయ్య భావజాలాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఐలయ్య అన్నట్టుగా దేశ రాజకీయ నేతల్లో పేరుకుపోయింది ఫ్యూడలిస్టిక్ దురహంకారమని అన్నారు.
నేను భారతీయుణ్ణి
వేలమంది అభిమానాన్ని తాకట్టుపెట్టి పైకెదగాలని తాను కోరుకోవడంలేదని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తనకు కులం లేదని, మతం లేదని, ప్రాంతం లేదని, తాను భారతీయుణ్ణి అని స్పష్టం చేశారు. తనను ఆంధ్రుడు అంటే బాధ కలుగుతుందని చెప్పారు.
కొమరం భీమ్ టీ షర్టు:
ఎక్కడో దక్షిణ అమెరికాలో జన్మించిన విప్లవ వీరుడు చే గువేరా చిత్రం ఉన్న టీ షర్టును ధరించగలనని , కానీ, తెలంగాణలో పుట్టిన కొమరం భీమ్ చిత్రం ఉన్న టీ షర్టు ధరించలేని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. కొమురం భీమ్ వంటి వీరుడికి ప్రాంతీయతత్వం ఆపాదించడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు.
జనసేన లక్ష్యం -దేశం కోసం చావడానికైనా సిద్దం?
సామాజిక బాధ్యతగా భావించే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. రాష్ట్రంలో సుస్థిరత కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. తెలుగు వారి మధ్య సయోధ్య కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పార్లమెంటుకు వెళ్లడానికి తాను రాజకీయాలకు రాలేదని పవన్ కల్యాణ్ అన్నారు.
తాను వందల కోట్లు సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని ఆయన చెప్పారు. తన దగ్గరున్నది కోట్లాది అభిమానులేనని, వంద మంది గూండాల కన్నా సిద్ధాంతాల కోసం పోరాడే ఒక్కరు ఎక్కువ అని ఆయన స్పష్టం చేశారు.
‘జనసేన’ లక్ష్యం:
చట్టం ఎవరికైనా సమానంగా పనిచేయాలని, అందుకోసమే ‘జనసేన’ పనిచేస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. బ్లాక్ మార్కెట్టును దశల వారీగా సమూలంగా నిర్మూలిస్తామని ఆయన అన్నారు. వాతావరణ కాలుష్యం మీద, మహిళల భద్రత పట్ల దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు.
దేశం కోసం చావడానికైనా:
దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించేవాళ్ళకు హెచ్చరికలు పవన్ కల్యాణ్ జారీ చేశారు. ప్రజలను విడగొట్టేందుకు యత్నిస్తే తాట తీస్తానన్నారు. కొందరు మతం కోసం చస్తారని, కొందరు కులం కోసం, మరికొందరు ప్రాంతం కోసం చస్తారని తాను మాత్రం దేశం కోసం చచ్చే పిచ్చివాడినని పేర్కొన్నారు.
'కాంగ్రెస్ హఠావో... దేశ్ భచావో' నినాదంతో... పవన్ ముగింపు
భారతదేశ సమగ్రతను విచ్ఛిన్నం చేస్తూ... దేశాన్నే సర్వ నాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, తద్వారా దేశాన్ని రక్షించుకోవాలని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతను నాశనం చేస్తున్నాయని విమర్శించారు...
రాష్ట్ర విభజనకు పాలకులే కారణం...
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోవడానికి దశాబ్దాల తరబడి పాలించిన పాలకులే కారణమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. సమస్య ను మొగ్గలోనే తుంచకుండా తమ అవసరాలకోసం వాడుకున్నారని అన్నారు. ఫలితంగానే అది ముదిరి నేడు రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి కారణమైందని చెప్పారు. దీనికి పూర్తిగా రాష్ట్రాన్ని పాలించిన వారే బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.
విభజనతో దేశ సమగ్రతకు భంగం...
ప్రాంతాల వారీగా జరిగే విభజనలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసమే ఆంధ్రప్రదేశ్ ను విభజించిందని అన్నారు. నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనే అయితే.. 2009లోనే ఎందుకు రాష్ట్రాన్ని విభజించలేదని ప్రశ్నించారు. ఐదేళ్లపాటు కాలయాపన చేసి, పార్లమెంట్ చివరి సెషన్ లో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో ఎందుకు విభజించాల్సి వచ్చిందని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించారని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తూ 'కాంగ్రెస్ హఠావో... దేశ్ భచావో' అంటూ నినాదం చేశారు. అంతకుముందు, కాంగ్రెస్ హైకమాండ్ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. షిండే, మొయిలీ, షిండే, ఆంటోనీ, అహ్మద్ పటేల్ తదితరులు కలసి రాష్ట్రాన్ని విభజించిన తీరు ప్రజలను తీవ్రంగా గాయపరిచిందని చెప్పారు.
ఏ పార్టీతోనైనా కలుస్తా:
పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఎన్నికల సందర్భంగా పొత్తులపై సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ తో తప్ప ఏ పార్టీతోనైనా కలుస్తామని స్పష్టం చేశారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more