తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తానని, తెలుగు కళామతల్లిని కంటికి రెప్పలా కాపాడతానని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షునిగా మండలి బుద్ధప్రసాద్ ఈ ఉదయం(గురువారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగును పాలనా, బోధన భాషగా అభివృద్ధి చేస్తానన్నారు. తెలుగులో మాట్లాడిన విద్యార్థులను హింసించే ప్రైవేటు సంస్థలకు పుట్టగతులు లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలుగును విశ్వభాషగా వ్యాప్తి చెందేలా కృషి చేస్తామని బుద్ధప్రసాద్ హామీ ఇచ్చారు. తెలుగుభాషను అన్ని స్థాయిల్లో అమలుకు కృషి చేస్తానన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో అధికార భాషా సంఘం చురుకైన పాత్ర పోషిస్తుందన్నారు.
ఈ ఉదయం సచివాలయం హెచ్ బ్లాక్లో మండలి పదవీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం దామోదరరాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేత చిరంజీవి, మంత్రి పొన్నాల, పొత్తూరి, ఎంపీ లగడపాటి, యార్లగడ్డ, గజల్ శ్రీనివాస్, పలువురు నేతలు హాజరయ్యారు. ఆయనతో పాటు మరో నలుగురు సభ్యులు కూడా బాధ్యతలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడుతూ భాషకు విశేష సేవ చేసిన మండలికి ఈ పదవి దక్కడం ఎంతో సంతోషకరమని ఫలితంగా తెలుగు భాష పరిఢవిల్లేందుకు మార్గం మరింత సులభం అవుతుందని చిరు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ ను అనేకమంది ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.
తెలుగుభాష ఉన్నతికి, తెలుగుజాతి సమైక్యతకు పరితపించిపోరాడిన వంశం లో పుట్టిన మండలి బుద్ధప్రసాద్ జీవిత విశేషాలు ఈ సందర్భంగా ఓసారి మననం చేసుకుందాం...
బుద్ధప్రసాద్ తండ్రి.. దివంగత మండలి వెంకటకృష్ణారావు విద్యాశాఖామంత్రిగా ఉన్న సమయంలో ప్రప్రథమ తెలుగు మహాసభలను నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నడిపి తెలుగుజాతినంతటిని ఒకే వైదికపైకి తెచ్చి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన పరంపరను కొనసాగిస్తున్న బుద్ధప్రసాద్ మితభాషి, మృదుభాషి. అనేక సాహితీ, సాంస్కృతిక సేవా సంఘాలకు అధ్యక్షుడిగా అనేక సదస్సులు నిర్వహించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ జాతీయ తెలుగు రచయితల మహాసభలను రెండు పర్యాయాలు విజయవంతంగా నిర్వహించారు. తెలుగుభాషకు ప్రాచీనహోదా ప్రతిపత్తికి పోరాడి సాధించిన భాషోత్తముడు మండలి. హైదరాబాదులోని సెక్రటేరియట్ అనే నామ ఫలకాన్ని తొలగించటానికి ఉద్యమం చేసి దానిని 'సచివాలయం'గా పేరుమార్పించిన అచ్చమైన తెలుగుభాషాభిమాని.
2011లో అమెరికాలో జరిగిన ప్రపంచ మొదటి తెలుగు అంతర్జాల సదస్సుకు అధ్యక్షత వహించి తెలుగులిపి కోసం కృషిసల్పిన తొలివ్యక్తి ఆయన. ఆంధ్రదేశంలో అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడైన వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహామహులు అలంకరించిన ఈ పీఠాన్ని 13వ అధ్యక్షుడిగా బుద్ధప్రసాద్ అధిరోహించనుండటం పట్ల భాషాభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1974లో అధికార భాషా సంఘం ఏర్పడగా 2010లో స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి సాంస్కతిక శాఖలో విలీనమైంది. సంఘం ఏర్పడిన తర్వాత కొన్ని శాసనేతరమైన అంశాలను మాత్రమే తెలుగులో ప్రవేశపెట్టారు. 1967-68లో మరికొన్ని శాసనాలతో తెలుగువాడకాన్ని విస్తరించారు. 1971-73లో పశుసంవర్ధక, వ్యవసాయక, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, దేవాదాయశాఖ, విద్యాశాఖలలో తెలుగునే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా అవి పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. 1974-79 వరకు రాష్ట్రస్థాయిలో తెలుగు అమలువిషయమై ప్రభుత్వం అనేక ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో వీటినన్నింటిని పునరుద్ధరించి తెలుగును పాలనా భాషాగా మార్చేందుకు కృషి చేయాల్సి ఉంది. ఆయన నేతృత్వంలో తెలుగుభాషకు మంచిరోజులు వస్తాయనే ఆశిద్దాం.
కాగా, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అధికార భాషా సంఘం చైర్మన్గా పదవీ ప్రమాణ స్వీకారం చేయటంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్, క్రుష్ణాజిల్లాలో అతని అనుయాయులు మిఠాయిలు పంచిపెట్టారు. ఇప్పటికైనా తమ నాయకుడికి ప్రభుత్వం సముచితస్థానం కల్పించడంతో తెలుగుభాష అభివృద్ధితో పాటు మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడేందుకు అవకాశం ఏర్పడిందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ అపూర్వ సందర్భాన తెలుగుకళామతల్లి ముద్దుబిడ్డకు తెలుగువిశేష్.కాం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more