Hudhud ready to slam odisha andhra pradesh

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, odisha, army, ndrf, naveen patnaik, chandrababu

Hudhud ready to slam Odisha, Andhra Pradesh; 38 trains cancelled on Oct 12

ఉత్తరాంధ్రను ముందేందుకు.. తరుముకొస్తున్న పెను తుపాను..

Posted: 10/11/2014 09:52 AM IST
Hudhud ready to slam odisha andhra pradesh

బంగాళాఖాతంలో ఏర్పడిన హుదుద్ తుపాను పెనుతుపానుగా మారి వాయువేగంతో దూసుకోస్తుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని కోస్తా ప్రాంతాలపై పెను ఉప్పెన పంజా విసురుతోంది. తీవ్రరూపం దాల్చిన హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలను హడలెత్తిస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న పెనుతుఫాను విశాఖకి తూర్పు - ఆగ్నేయ దిశలో 430, ఒడిశాలోని గోపాలపూర్‌కి దక్షిణ - ఆగ్నేయ దిశలో 460 కిలోమీటర్ల దూరంలో పెను తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మరో 12 గంటల్లో తీవ్ర పెను తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

ఆదివారం మధ్యాహ్నం విశాఖ సమీపంలో తుపాను తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. హుదూద్ తుపాను గమనం ఏమాత్రమైనా మారితే విశాఖపట్నంకు తూర్పు ఉత్తర దిశగా 30 కి.మీ. నుంచి 60 కి.మీ. దూరంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పుడే అధికారికంగా ఏమీ చెప్పలేమని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అంటున్నారు. తుపాను నష్టం తీవ్రంగా ఉండే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరాన్ని దాటే ప్రాంతంలో కొండలు ఉన్నందువల్ల హుదూద్ తీవ్రత కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయి. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, ఆదివారం 130 నుంచి 140 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలున్నాయి. గాలుల తీవ్రతకు సముద్రం అల్లకల్లోలమవుతుంది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో అలలు సాధారణం కంటే 2 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఐఎండీ ప్రత్యేక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నంబరు, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశామని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి శాస్త్రి తెలిపారు.

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, త్రివిధ దళాల బలగాలు:

పెను తుపాను హుదూద్ ను ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాలలోని భాధితులకు సహాయ, పునరావాస చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగాయి. శ్రీకాకుళం జిల్లాకు రెండు, విజయనగరానికి ఒకటి, విశాఖకు ఆరు, బెటాలియన్ల ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించారు. ఇప్పటికే నౌకాదళం అయిదు హెలికాప్టర్లు, 60 మంది గజ ఈతగాళ్లతో కూడిన 15 బృందాలను సిద్ధం చేసింది. ఆర్మీ 225 మంది సుక్షితులైన జవాన్ల బృందాలను విశాకకు పంపింది. హైదరాబాద్‌ నుంచి 36 వాహనాల్లో బయలుదేరి వెళ్లిన ఆర్మీ సిబ్బంది విశాఖకు చేరుకోనున్నారు. వీరిని అచ్యుతాపురం కేంద్రంగా ఉంచుతున్నట్లు విశాఖ జిల్లా కలెక్టరు డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. భారత నావికాదళానికి చెందిన నాలుగు నౌకలను, మరో 30 గజ ఈతగాళ్ల బృందాలు, రబ్బరు బోట్లుని సిద్ధం చేశామని తూర్పు నావికాదళం పేర్కొంది. అత్యవసర సమయంలో ఉపయోగపడేందుకు వీలుగా ఐ.ఎన్.ఎస్. డేగాలో ప్రత్యేకంగా నాలుగు ప్లాటూన్ల నావికాదళాన్ని అందుబాటులో ఉంచామని వివరించింది.

ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తం

హుదూద్ తుపాను ప్రళయ భీకరంగా విరుచుకుపడుతుందన్న సంకేతాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.తుపాను జిల్లాల్లో ప్రత్యేక వైద్యబృందాలు: తుపాను వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించింది.

ప్రధానంగా విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన అవసరమైన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడానికి వీలుగా ప్రజలకు ఇవాళ్టి నుంచే అందుబాటులో ఉండేలా ప్రత్యేక వైద్యబృందాలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ ప్రత్యేకంగా రెండు అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నారు. తుపాను తీవ్రత ఉన్న ప్రాంతాల్లో రక్తపోటు, మధుమేహం, రక్తలేమి తదితర ఆరోగ్య సమస్యలున్న గర్భవతులను(హైరిస్కు ప్రెగ్నెన్సీ) సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సమాచారం పంపించామని తెలిపారు.

తీరం దాటక తెలంగాణలోనూ వర్షాలు

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాను.. తీరం దాటిన తరువాత తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశాలున్నాయి. తాజా సమాచారాన్ని బట్టి తుపాను ఈనెల 12న తీరం దాటుతుందని అంచనా. తీరం దాటి భూమిపైకి వచ్చిన సుమారు 24 గంటల్లోపు తెలంగాణలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వై.కె.రెడ్డి చెప్పారు. 'అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు ఈనెల 13 నుంచి కురిసే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా ఉత్తర తెలంగాణకు విస్తరించవచ్చు. తుపాను తీరం దాటిన తరువాత భూమిపై పయనించే మార్గం, వేగాన్నిబట్టి వర్షాలు ఏ స్థాయిలో పడతాయన్నది తెలుస్తుంది' అని ఆయన అన్నారు.

రైళ్ల రాకపోకలపై ‘హుదూద్’ ప్రభావం

హుదూద్ తుపాన్ రైళ్ల రాకపోకలపై పెను ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైళ్లను దారి మళ్లించగా, పెద్ద సంఖ్యలో రైళ్ల ను రద్దు చేసింది. మొత్తం 27 ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు, 10 ప్యాసింజర్ సర్వీసులను నిలిపివేశారు. 31 రైళ్ల ను దారి మళ్లించారు. మరోవైపు తుపాను ప్రభావం అధికంగా ఉండనుందని భావిస్తున్న ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ పేర్కొంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Hudhud  Visakhapatnam  Bay of Bengal  Cyclone  Andhra Pradesh  odisha  army  ndrf  naveen patnaik  chandrababu  

Other Articles