వైయస్ షర్మిల మీద గత కొంతకాలంగా న్యూస్ పోర్టల్స్ లో అసభ్యకరం, అభ్యంతరకరమైన వార్తలు వస్తున్నాయి. ఎంతోకాలం ఓపిక పట్టిన తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసారు. వైయస్ఆర్ కాంగ్రెస్ రాజకీయ పార్టీలో అగ్రస్థాయి నాయకురాలు అవటమే కాకుండా వైయస్ షర్మిల దివంగత నేత వైయస్ఆర్ కూతురు. అంతే కాదు ఆమెకు కడప జిల్లాలో ఉన్న పలుకుబడి, మంది మార్బలంతో అటువంటి నీతిమాలిన సోషల్ మీడియా నడిపేవారికి గుణపాఠం చెప్పటం ఆమెకు చాలా సులువైన పని. కానీ ఎంతో కాలం ఎంతో సహనంతో- పోనీలే వెధవలు వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని వదిలేస్తే అది వాళ్ళకి అలుసుగా తోచినట్లుంది మరీ పేట్రేగి పోయారు!
దానితో, ఆమె వాళ్ళ మీద, తనకోసం కాకపోయినా తనలాంటివారు అలాంటి పైశాచిక ఆనందంతో రాసేవారి బారిన పడగూడదన్న ఉద్దేశ్యంతో చట్టపరంగా, న్యాయపరంగా అటువంటివాళ్ళ పీచమణచటానికే ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా పోలీస్ కేసు నమోదు చేయించారు. అలా ఆమె ఇతర బాధితులకు కూడా న్యాయపరమైన దారి చూపించారు.
రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేస్తే ఇద్దరు వెబ్ డిజైనర్ లు హైద్రాబాద్ అంబర్ పేట, వరంగల్ కి చెందినవారు పట్టుబడ్డారు. ఇంకా అసలు వ్యక్తులు దొరకాలి కాని పోలీస్ యంత్రాంగం తలచుకుంటే వాళ్ళూ దొరుకుతారు.
{youtube}zRqnNN0EP8o|620|400|1{/youtube}
మనుగడకోసం మరొకరిని కించపరచటం అవసరమా?
సోషల్ మీడియాలో ముఖ్యంగా వార్తలను ప్రచురించే పోర్టర్స్ లో బూతు వార్తలు, అందునా అక్రమ సంబంధాలను ప్రముఖంగా రాయటంతో ప్రసిద్ధికెక్కిన ఒక వెబ్ సైట్ అటువంటి మిగిలిన సైట్లకు మార్గదర్శకమైంది. ఫలితంగా ఎందరిమీదనో ఎన్నో వదంతులు లేచాయి. తాజాగా దివంగత నేత వైయస్ఆర్ కూతురు వైయస్ షర్మిల సినీ నటుడు ప్రభాస్ వెనకపడిందని, ఇలా రకరకాలుగా వారిద్దరి గురించి పుకార్లు షికార్లు చేసాయి.
రాసినవాళ్ళ పబ్బం గడిచింది!
ఇలాంటి రాతలకు ఆదరణ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చదివేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఎన్ని హిట్స్ ఉంటే ఆ పోర్టల్ అంత విజయం సాధించినట్లుగా పరిగణించబడుతుంది కాబట్టి ఒకరిని చూసి మరొకరు వారి రచనా వక్రచాతుర్యాన్ని ఉపయోగించి వారి ఊహలకు అక్షరరూపాన్నివ్వటం మొదలుబెడుతున్నారు. వాళ్ళకి బాధితుల విషయంలో పట్టింపు లేదు. దీనివలన బాధితులు జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటారో వారి వైవాహిక జీవితం ఎలా కకావికలమవుతుందో వాళ్ళకి అనవసరం. కేవలం వారి పోర్టల్ కి ఎంత ఆదరణ లభించిందన్నదే వాళ్ళకి ప్రధానం!
మరి వాటికి నియంత్రణ లేదా?
వాటికి నియంత్రణ లేదా అంటే లేదనే చెప్పాలి. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు సైబర్ పోలీసులు దర్యాప్తు చేసి సదరు వెబ్ సైట్ నడిపే వ్యక్తులను పోలీస్ స్టేషన్ కి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ అసలు ఆ వెబ్ సైట్ ని నడిపేవాళ్ళే ఎవరో తెలియకపోతే? ఆలా ఎదుటివారికి నామాలు పెడుతూ తమ చిరునామాలను గోప్యంగా ఉంచేవాళ్ళ వ్యాపారం బాగుందని భావిస్తూ దురదృష్టవశాత్తూ అడ్రసులు లేని అలాంటి న్యూస్ పోర్టల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
ప్రింట్ మీడియా మీదున్న నియంత్రణ ఇలాంటి ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా మీద లేకపోవటంతో పేట్రేగిపోతున్న పోర్టల్స్ వార్తలను వార్తలలా కాకుండా చదువరులకు ఆసక్తికరంగా తయారు చెయ్యటంతో మొదలుబెట్టి, వ్యంగ్య వ్యాఖ్యానాలు, శృంగార దృష్టికోణాలలో వార్తలకు మసాలా అద్ది ఘాటుగా తయారుచెయ్యటం లాంటి పోకడలకు పోవటం వరకు సమర్ధనీయం కాకపోయినా కాస్త ఓర్చుకుంటారేమో! కానీ, మరీ నిరాధారంగా మనసుకి తట్టిన ఎవరో ఇద్దరి పేర్లు తీసుకుని వాళ్ళ గురించి రాయటం సరికాదని అందరికీ తెలుసు.
ఎవరైనా వాళ్ళ కుటంబ సభ్యుల గురించి అలా రాస్తే ఎంత బాధపడతారు? కానీ వేరే వాళ్ళ గురించి రాస్తే మాత్రం చాలా ఆనందంగా పెరుగన్నంలో ఆవకాయ ముక్క నంజుకున్నట్లుగా చప్పరిస్తూ చదువుతారు! అలా రాసేవాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలోని ఆడవాళ్ళ గురించి రాస్తే ఎలా ఉంటుందన్నది ఆలోచిస్తే మరెప్పుడూ అలాంటి పని చెయ్యరు!
సామాన్యంగా సినిమాలలోను, రాజకీయాలలోనూ క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్ళు ఇలాంటివి పట్టించుకోవటానికి సమయం చిక్కక వదిలిపెడుతుంటారు. సినిమా హీరో ప్రభాస్ కూడా అలాగే తన ఆరోగ్యం గురించి, తాను కోమాలా ఉన్నట్టుగానూ ఏవేవో రాసినా అవే సర్దుకుంటాయిలే అని ఊరుకున్నారు కానీ మరీ అర్థం పర్థం లేకుండా తనెప్పుడూ కలవని ఒక గృహిణితో తనకి సంబంధాన్ని అంటగడుతున్నట్లుగా రాస్తుంటే మౌనంగా ఉండలేకపోయారు. అందుకే ఆయన మీడియాలో ప్రకటన చేసారు.
{youtube}3LJW7p8aL8g|620|400|1{/youtube}
లోగడ అలాగే ఆ బూతు పుకార్లకు మార్గదర్శకమైన పోర్టల్ ఒక ఎంపి, ఒక గాయనికి మధ్య అక్రమ సంబంధాన్ని అంటగట్టింది. ఆ గాయని ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది కానీ ఆ ఎంపి మాత్రం ఆ వెబ్ సైట్ భరతం పట్టారు- న్యాయపరంగా.
అలాగే, మరో సోషల్ మీడియా బాధితుడు సినీ హీరో శివాజి మాటల్లో వినాలంటే ఈ కింది వీడియోని చూడండి-
{youtube}sk5smYySd80|620|400|1{/youtube}
మీడియా బాధ్యతాయుతంగా నడుచుకోకపోతే అమాయకులు ఎన్నో ఇబ్బందులు పడతారనటానికి ఇదే ఉదాహరణ.
{youtube}HPJSMTcZVQw|620|400|1{/youtube}
సినిమాలో దృశ్యాలను తీసుకుని ఏదో సరదాగా రాయటం వేరు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలలోకి పోయి చేతికొచ్చిన రాతలు రాయటం సమాజం దృష్టిలో నేరం. బూతుపలుకులను అలవోకగా జార్చేవాళ్ళనే జర్నలిస్ట్ లనుకుని అలాంటివాళ్ళతో వెబ్ సైట్ లు నడుపుతూ తమదీ ఒక జర్నలిజమే అనుకుంటే వాళ్ళను వాళ్ళు మోసం చేసుకున్నవారవుతారు, ఇతరులను మానసిక క్షోభకు గురిచేసినవారవుతారు.
మరో గమ్మత్తేమిటంటే అసలు ఇలాంటి పుకార్లను ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటూ ఆ సంస్కృతికి నాంది పలికిన న్యూస్ పోర్టల్ వైయస్ ఆర్ కాంగ్రెస్ కి మద్దతుగా వార్తలు రాస్తుండేది. గోడకి కొట్టిన బంతి ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా తిరిగివచ్చి తలకి బొప్పికట్టేట్టుగా తగిలినట్లుగా, తాను చూపిన దోవ తను మద్దతునిచ్చే పార్టీలోని ముఖ్యనాయకురాలికే ఎదురుదెబ్బ తగిలేట్టుగా చేసింది చూసారా!
చెరపకురా చెడేవు అన్న సూక్తి ఇక్కడ అక్షరాలా పనిచేసింది!
కానీ ఇక్కడ, ఆ పోర్టల్ కి కాకుండా పిల్లలకు తల్లైన ఒక గృహిణికి ఆ దెబ్బ తగిలింది. అదే బాధాకరం.
వైయస్ షర్మిల చేసిన 5 పేజీల ఫిర్యాదు మీద ఆమె స్వయంగా సంతకం చెయ్యగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు వైవి సుబ్బారెడ్డి, సోమయాజులు ఆ ఫిర్యాదును హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ ఎమ్ మహీందర్ రెడ్డి కి శనివారంనాడు సమర్పించారు. అందులో, ఆమె తను స్వయంగా పడిన బాధే కాకుండా ఏ తల్లికి ఏ చెల్లికి, ఏ భార్యకి అలాంటి మనోవేదన కలుగజేసే వారిని కఠినంగా శిక్షించాలంటూ రాసారు. ఆమె తన ఫిర్యాదులో వెబ్ సైట్ల మీదనే కాకుండా గూగుల్, ఏపిల్ వాళ్ళ సఫారీ ల మీద కూడా ఫిర్యాదు చేసారు. అయితే అవి కేవలం సెర్చ్ ఇంజన్లు మాత్రమే కదా. అవి వెబ్ సైట్లో పెట్టినవాటిని వెతికి తీసిస్తాయి కానీ అవి తయారు చెయ్యవు, ఉన్నవాటిని మరుగునా పెట్టవు. ఏ సిడి పెడితే ఆ పాట వస్తుంది. అంత మాత్రం చేత సిడి ప్లేయర్ ని తప్పు పట్టం కదా!
ఇప్పటికైనా, విషయం సీరియస్ గా పోలీసుల దృష్టికి వచ్చింది కాబట్టి, ఇలాంటి వదంతులకు తెరపడుతుందని ఆశిద్దాం!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more