Kiran kumar reddy

ఢిల్లీలో మంచి మార్కులు కొట్టేసిన కిరణ్

Posted: 04/20/2013 11:06 AM IST
Kiran kumar reddy

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం హృదయాన్ని దోచుకున్నారని అనకపోయినా, ఢిల్లీ పార్టీ పెద్దలంతా సంతృప్తి పడ్డారనే చెప్పుకోవాలి. అవినీతి మరకలు అంటుకోనివాడు, నిర్భయంగా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు, అన్నిటికీ మించి పార్టీకి విధేయుడు, అధిష్టానానికి విశ్వాసపాత్రుడిగా ఆయన మంచి మార్కులు సంపాదించుకున్నారు. ఇక ఎన్నికల ముందు అనవసరమైన ప్రయోగాలు చెయ్యటం కూడా మంచిది కాదు కాబట్టి కూడా కిరణ్ కుమార్ కి మంత్రి వర్గ విస్తరణకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా కిరణ్ కుమార్ పట్ల మంచి అభిప్రాయంలో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వపథకాల్లో వైయస్ ఆర్ ప్రవేశపెట్టినవి కానీ తన హయాంలో ప్రవేశపెడుతున్నవి కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాత్మక పథకాలేనంటూ కిరణ్ కుమార్ చేస్తున్న ప్రచారం ఆయన స్వార్థరహితమైన విధానాన్ని, పార్టీ పట్ల విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి.

మే రెండవ వారంలో జరుగనున్న మంత్రి వర్గ విస్తరణలో పార్టీకి విధేయులు మాత్రమే క్యాబినేట్ లో చోటు దక్కించుకుంటారు. ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డ వారి పట్ల అధిష్టానం ఇష్టాన్ని, ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తూ ఏం జరిగితే అది జరుగుతుందిలే అని ఊరికే ఉన్నవారిపట్ల ఆగ్రహం ప్రకటించినట్లు కూడా సమాచారం.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ అధిష్టానాన్ని కలిసి రాగనే ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఢిల్లీ వెళ్ళి గులామ్ నబీ ఆజాద్ ని కలిసి పార్టీ తాజాగా తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. ఆజాద్ నుంచి ఏ వివరాలను పొందారో తెలియదు కానీ ఆయనకి మాత్రం తన తరఫునుంచి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించి, వచ్చే ఎన్నకలకు ఏ విధంగా తయారీలు చేసుకుంటే బావుంటుందో చెప్పి వచ్చారు.

 

-శ్రీజ

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles