కథ :
పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులకు పెళ్లయి చాలాకాలం అయినా.. వారికి సంతానం కలగలేదు. దీంతోవారు సంతతి కోసం ఈశ్వరుడికి ఘోరతపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చుకున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారికి ‘‘మీకు అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? లేదా అయిదవతనంలేని అమ్మాయి కావాలా?’’ అని అడిగాడు.
ఈ ప్రశ్నకు ఆలోచనలో పడిపోయిన ఆ బ్రాహ్మణ దంపతులు చివరకు ‘‘అల్పాయుష్కుడైన సరే.. కొడుకునే ప్రసాదించు’’ అని ప్రార్థించారు. శివుడు వారికి ఆ వరాన్నిచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు. శివుడిచ్చిన వరం ప్రభావం వల్ల అనతికాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం దాల్చి, చక్కటి మగబిడ్డను ప్రసవించింది.
కానీ ఇతడు అల్పాయుష్కుడు కాబట్టి తక్షణమే యమభటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అప్పుడు బాలింతురాలైన ఆ బ్రాహ్మణ స్త్రీ విలపించి.. ‘‘లేక లేక ఒక బిడ్డ పుట్టాడు. కనీసం పురుడు తీరేదాక ఆగి, తరువాత తీసుకెళ్లండి’’ అని వేడుకుంటుంది. ఈమె కోరికను వారు మన్నించి యమదూతలు అక్కడినుంచి వెళ్లిపోతారు. తరువాత పురుడు తీరగానే వస్తారు.
అప్పుడామె... ‘‘తండ్రులారా! మాటలు రానిదే మానవుడు కాలేడు కనుక.. మా బిడ్డ నోరార అమ్మానాన్న అని పిలిచేవరకు ఆగండి’’ అని పేర్కొంటుంది. దీంతోవారు ‘‘సరే’’ అని అక్కడినుంచి వెళ్లిపోతారు. ఇలా ఈ విధంగా ఆ బ్రాహ్మణ తల్లి అనేక కారణాలు చూపుతూ, వచ్చిన యమదూతలను వెనక్కి పంపించేది.
ఒకరోజు బ్రాహ్మణ తల్లి తన కొడుకుకి స్నానం చేయిస్తుండగా యమదూతలను తలచుకుని బాధపడుతుంటుంది. విచారిస్తున్న తల్లిని చూసి ఆ బిడ్డ... ‘‘ఎందుకమ్మా ఏడుస్తున్నావు?’’ అని అడగగా.. ఆమె అతని గురించి, జరిగినదాని గురించి మొత్తం వివరిస్తుంది.
ఆ విధంగా విషయం తెలుసుకున్న బాలుడు తన తల్లితో ఈ విధంగా అంటాడు.. ‘‘అమ్మా! నేను ఎలాగూ అల్పాయుష్కుడిగా పుట్టాను. పదికాలాలపాటు బతికి, పుణ్యం చేసే అవకాశం నాకు లేదు. కనీసం కాశీకి వెళ్లి వస్తాను. కాబట్టి నన్ను వెంటనే ఇక్కడి నుంచి పంపించు. నేను వెళ్లిన తరువాత యమదూతలు నాకోసం వస్తే.. నేను వచ్చేదాకా ఆగుమను’’ అని చెప్పి బయలుదేరడానికి సిద్ధపడతాడు.
అయితే తమ బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనితోబాటు అతని మేనమామని కూడా తోడుగా పంపిస్తారు. అలా బయలుదేరిని వీళ్లిద్దరూ.. మార్గమధ్యంలో ఒక పూలతోటలో బస చేస్తారు.
ఆ సమయంలోనే ఆ తోటలో పూలను కోసుకోవాలని వచ్చిన ఆ ఊరి రాజుకూతురు, ఆమె చెల్లలు అక్కడికి వస్తారు. వారి మధ్య చిన్న తగువు వచ్చి ఒకరినొకరు తిట్టుకోసాగారు. రాజుకూతురు కోపగించుకుని.. ‘‘ఈరోజు రాత్రి నా పెళ్లి జరుగుతోంది. అదీగాక మా అమ్మ శ్రావణ మంగళవారం నోము చేసుకుని, నాకు వాయనమిస్తుంది. ఆ వ్రతం మహిమవల్ల నువ్వు నాకిచ్చే శాపనార్థాలు ఏమీ ఫలించవు’’ అని, తన చేతిలో వున్న పూలను నేలమీద పారబోయగా.. అవి తిరిగి చెట్లకొమ్మలకు అతుక్కుపోతాయి. అది చూసిన ఆ బ్రాహ్మణ బాలుడు ‘‘ఆ అమ్మాయి తనకు భార్యయైతే బాగుండును’’ అని అనుకుంటాడు.
ఆరోజు రాత్రి రాజుకూతురు పెళ్లి సందర్భంగా రాజు అన్ని కార్యకలాపాలను సిద్ధం చేస్తాడు. రాజుకూతురు తల్లి కూడా శ్రావణనోము నోచుకుని, ఆమెకు వాయనమిచ్చింది. అయితే ఎంతసేపటికి పెళ్లికొడుకువారు పెళ్లికి రారు. పెళ్లి కుమారునికి సుస్తీగా వున్నందున, పెళ్లిని మరో ముహూర్తానికి వాయిదా వేలవలసిందిగా కబురు పంపుతారు.
అయితే రాజుకు పెళ్లిని వాయిదాపడితే తన పరువు తగ్గుతుందని భావించి, తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయాలని అనుకుంటాడు. అప్పుడు పొరుగూరులో వున్న ఆ మేమమామ, మేనళ్లులను ఈ పెళ్లికి ఒప్పించి, ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి రాజు పెళ్లి జరిపిస్తాడు.
అలా వారికి పెళ్లి జరిగిన ఆరోజు రాత్రి పెళ్లికుమార్తె కలలో మంగళగౌరీ కనిపించి, ‘‘అమ్మాయీ! ఈరోజు రాత్రే నీ భర్తకు పాముగండం వుంది. జాగ్రత్తంగా వుండు. ఆ పాము గండం నుంచి బయటపడాలంటే.. నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలో పామును పట్టి గట్టిగా మూతపెట్టి వుంచు’’ అని ఆజ్ఞాపించింది.
అప్పుడు హఠాత్తుగా లేచి చూసేసరికి, అప్పటికే ఆ పాము పెళ్లికొడుకు దగ్గరకు పాకుతూ వచ్చింది. వెంటనే పెళ్లికుమార్తె మంగళగౌరీ చెప్పిన విధంగా తన తల్లి వాయనమిచ్చిన కుండలో పామును పట్టి కుండలో వుంచుతుంది.
తరువాత రోజు తెల్లవారుజామునే మేమమామ వచ్చి, పెళ్లికుమారుడ్ని నిద్రలేపి, ఇద్దరు కలిసి కాశీకి వెళతారు.
అయితే కొద్దిరోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. వారిని చూసిన రాజు సంతోషించి తిరిగి వివాహం చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తాడు. కానీ రాకుమార్తె మాత్రం అందుకు ఒప్పుకోదు. మొదటి ముహూర్తంలో తనకు తాళి కట్టినవాడే తన భర్త అని ఆమె ప్రకటించింది. ఎవరెంతా చెప్పినా ఆమె పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడరు. అప్పడు ఆమెను అందరు ‘‘కాశీకి పోయినవాడే నీ భర్త అని అనేందుకు నిదర్శనం చూపించు’’ అని పెద్దలు అడిగారు.
అందుకు అంగీకరించిన ఆమె తన తండ్రితో.. ‘‘తండ్రీ! నువ్వు ఒక సంవత్సరం అన్నదానం చెయ్యి. నేనూ ఆ సంవత్సరం అంతా తాంబూలం దానం చేస్తాను. ఆ తరువాతే మీకు నిదర్శనం చూపిస్తాను’’ అని అంటుంది. దీనికి ఆ రాజు ఒప్పుకుంటాడు.
ఇంకొన్నిరోజులలో సంవత్సరం పూర్తి అవుతుందనగా.. కాశీకి వెళ్లిన ఆ మేనమామ అల్లుళ్లు తిరిగి వస్తుండగా.. పూర్వం బస చేసిన ఆ పూలతోటలనే బస చేస్తారు. అప్పుడు అక్కడ జరుగుతున్న సత్రంలో భోజనాలు చేశారు. అనంతరం రాజుకుమార్తె తాంబూలం దానం చేస్తూ ఆ సత్రం దగ్గరకు చేరుకుంటుంది. అప్పుడు అక్కడ ఆమె బ్రాహ్మణుడ్ని చూసి, అతని చేయి పట్టుకొని అతడే తన భర్త అని అందరికి చూపిస్తుంది.
అందుకు పెద్దలందరూ ఆమెను ఋజువు అడగగా... పెళ్లినాడు భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. అదేవిధంగా ఆమె దాచి వుంచిన పాముకుండను కూడా తీసి చూపించిగా.. అందులో వున్న పాము బంగారు పామై కనిపించింది. దీంతో పెద్దలు వారి వివాహాన్ని అంగీకరించారు. ఆ తరువాత అత్తవారింటికి బయలుదేరే ముందు ఆమె తల్లిచేత మంగళవారం నోము నోయించి, ఆ కాటుకను ఒక భరణిలో భ్రదపరిచి తనతీ తీసుకెళ్లింది.
అక్కడ బ్రాహ్మణ దంపతులు తమ కొడుకు గురించి ఆవేదన చెంది, ఎడతెగని కన్నీరు కార్చికార్చి అంధులైపోతారు. ఆ సమయంలో పెళ్లికూతురితో వస్తున్న ఆ బ్రాహ్మణ యువకుడ్నిచూసి గ్రామస్థులంతా బ్రాహ్మణ దంపతుల దగ్గరకు వెళ్లి ‘‘మీ కష్టాలు తీరాయి. మీ కుమారుడు, రాజవైభవాలతో మీకు కోడలిని తీసుకు వస్తున్నాడు ” అని చెప్పారు.
అయితే వారి మాటలకు ఆ బ్రాహ్మణ దంపతులకు నమ్మకం కలగదు.
అప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తాడు. జరిగిందంతా మొత్తం వారికి వివరిస్తాడు. కానీ వారికి చూపులేని కారణంగా కొడుకుని, కోడలిని చూసుకునే అదృష్టం లేదని దిగులుపడుతుంటారు. అయితే రాజకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవార నోము కాటుకను అత్తమామల కళ్లకు పూసింది. దాంతో వారికి చూపు వచ్చి, తమ కొడుకుకోడల్ని చూసుకొని వారు ఎంతో సంబరపడిపోయారు.
ఈ మహత్యాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు వారంతా ఆ పెళ్లికుమార్తెను ‘‘ఇంత మహిమ కలగడానికి ఏ నోము నోచావమ్మా’’ అని అడిగారు. దాంతో ఆమె ‘‘శ్రావణ మంగళవారపు నోము’’ అని సమాధానం ఇచ్చింది. దీనిని మంగళగౌరీ వ్రతం అని కూడా అనుకుంటారు. శ్రావణమాసంలోని మంగళవారాలలో ఈ నోము నిర్వహించుకుంటారు.
విధానం : శ్రావణ మంగళవారం వ్రతం నిర్వహించుకున్న మొదటి సంవత్సరంలో అయిదుగురు ముత్తయిదులను పిలిచి, వారికి పసుపురాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ, కొబ్బరి వగైరా వంటివి వాయనాలు ఇవ్వాలి. ఇదే విధంగా రెండవసంవత్సరంలో పదిమంది ముత్తయిదువులని, మూడవ సంవత్సరంలో పదిహేనుమంది, నాలుగోసంవత్సరంలో ఇరవైమంది, అయిదవ సంవత్సరంలో ఇరవైఅయిదుమంది ముత్తయిదువులను పిలిచి వాయనాలివ్వాలి. అయిదేళ్ల తరువాత ఉద్యాపన చేయాలి.
ఉద్యాపన : అయిదేళ్ళయ్యాక ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి, మట్టేలూ మంగళసూత్రాలూ వగైరా మంగళాభరణాలతో పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్దతి లోపించినా ఫలితం లోపించదు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more