కథ:
ఆనంద్ ముంబైలో ఓ ఐఐటీ విద్యార్థి. మొక్కలన్నా, ప్రకృతి అన్నా అతనికి ప్రాణం. ఎవరైనా వాటికి హాని కలిగిస్తున్నారంటే అస్సలు సహించడు. కాలేజీ ప్రాజెక్టు మీద ఆనంద్ ఓసారి హైదరాబాద్ రావాల్సి వస్తుంది. ఇంకోవైపు సత్యం(మోహన్ లాల్ ) అనే వ్యక్తి తన తమ్ముడితో కలిసి జనతా గ్యారేజ్ అనే మెకానిక్ షాప్ నడుపుతుంటాడు. మనుషులంటే అతనికి అంటే ప్రాణం. అందుకే వెహికిల్స్ తోపాటు, మనుషులను హింసించే వారిని కూడా రిపేర్ చేస్తుంటాడు. కానీ, ముకేష్ రానా(సచిన్) అనే బ్యాడ్ మాన్ కి సత్యం చేసే మంచి పనులు అస్సలు నచ్చవు. గ్యారేజ్ కి ఇబ్బందులు తలపెట్టడంతోపాటు, సత్యం తమ్ముడిని కూడా ముకేష్ చంపేస్తాడు. ఆ సమయంలోనే ఆనంద్, సత్యంలు అనుకోకుండా కలుసుకుంటారు. ఇంతలో సత్యం గతం గురించి ఆనంద్ కి తెలుస్తుంది. అంతే ఇద్దరు చేతులు కలుపుతారు. జనతా గ్యారేజ్ వారసుడిగా ఆనంద్ బాధ్యతలు స్వీకరించి, దుష్టుల భరతం పడుతుంటాడు. ఈ క్రమంలో ముకేష్ తోపాటు సత్యం కొడుకు (ఉన్నిముకుంద్) కూడా ఆనంద్ పాలిట విలన్లుగా మారతారు. ఆనంద్, సత్యంలు వీరిని ఎదుర్కుని జనతా గ్యారేజ్ ని ఎలా నడుపుతారు, అన్నదే కథ.
తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్ గొప్ప నటుడు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నవయసులో ఇండస్ట్రీకి వచ్చి క్రమక్రమంగా టాప్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇక రైటర్ గా టాలీవుడ్ కి పరిచయమై , డైరక్టర్ గా మారి మిర్చి, శ్రీమంతుడు లాంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లను అందించాడు కొరటాల శివ. వీరిద్దరి కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తోడయ్యాడు. మరి వీరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని అంటవా? అదే జనతా గ్యారేజ్-ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును అన్నదే ట్యాగ్ లైన్. ఈరోజే సినిమా మన ముందుకు వచ్చింది మరి ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
విశ్లేషణ:
జనతా గ్యారేజ్ కథ సింపుల్ గానే ఉన్న గత చిత్రాల మాదిరిగా ఎమోషనల్ గా తెరకెక్కించాడు కొరటాల శివ. ఎంటర్ టైనింగ్ స్క్రీన్ ప్లేతోపాటు, అద్భుతమైన డైలాగులను అందించాడు. మొక్కలు, మనుషుల ప్రాణాల కోసం పోరాడే ఇద్దరు మనుషులను ఒక్కటి చేసి విలన్లకు వ్యతిరేకంగా పోరాటం అనే కాన్సెప్ట్ ను అందుకు తగ్గ కాస్టింగ్ తో అద్భుతంగా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్, కాలేజీ లైఫ్ ఎలిమెంట్స్ తో కాస్త నిదానంగా నడిచినప్పటికీ, ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి అసలు కథ మొదలు అవుతుంది. హీరోలిద్దరూ కలుసుకున్నప్పటి నుంచి మొదలయ్యే ఆ ఊపును చివరి దాకా కొనసాగించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లకు పెట్టింది పేరైనా కొరటాల మరోసారి తన చాతుర్యం చూపించాడు.
నటీనటుల విషయానికొస్తే.. ఆనంద్ గా ఎన్టీఆర్ తనలోని నటనను మొత్తం పిండేశాడు. యాక్టింగ్ పరంగా ఇంతవరకు జూనియర్ డిస్సాపాయింట్ చేసిన దాఖలాలు లేవు, ఇందులో కూడా ఉండవు . ముఖ్యంగా మొక్కల గురించి ఎన్టీఆర్ చెప్పే డైలాగులు సీరియస్ నెస్ లో ఫన్నీ మిక్స్ చేసి యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. ఇక సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్లలో పీక్స్ లోకి తీసుకెళ్లాడు. డాన్సులు, ఫైట్లు చించేశాడు. ఇక మోహన్ లాల్ విషయానికొస్తే జనాలను ఉద్దరించే పెద్ద మనిషి పాత్రలో ఒదిగిపోయాడు. స్క్రీన్ ప్రజెన్స్ అంటే ఏంటో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్లను చూస్తే అర్థమైపోతుంది. అంతలా జీవించేశారు. హీరోయిన్లు ఇద్దరు తమ పాత్రలకు న్యాయం చేశారు. నిత్యామీనన్ క్యూట్ గా, ఫ్రెష్ లుక్ లో కనిపించగా, సమంత యాజ్ యూజ్ వల్ గా అందాలు ఆరబోసింది. కాజల్ ఐటెం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గ్యారేజ్ సహయకులుగా బ్రహ్మాజీ, అజయ్, జాన్, బెనర్జీలు సూపర్బ్ గా నటించారు. సితార, దేవయాని, సురేష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. విలన్లుగా సచిన్, ఉన్ని ముకుందన్, సరిపోయారు. ఉన్ని ముకుందన్ కి మరిన్ని అవకాశాలు రావటం ఖాయం. రాజీవ్ కనకాల కాసేపున్న ఇంప్రెస్ చేశాడు.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే దేవీశ్రీప్రసాద్ టెర్రిఫిక్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. చార్ బస్టర్ పాటలు అందించాడు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేశాడు. తిరు అందించిన సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా గుర్తుండిపోయేలా ఉంది. ముఖ్యంగా కేరళ అందాలు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.ఎడిటింగ్ పరంగా సీనియర్ ఎడిటర్ కొటగిరి వెంటేశ్వరరావు బాగా చేశారు. ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి గ్యారేజ్ సెట్ హైలెట్ గా ఉంటుంది. అరసు స్టంట్స్ స్టైలిష్ గా ఉన్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఫ్లస్ పాయింట్లు:
ఎన్టీఆర్ -మోహన్ లాల్ కాంబినేషన్
సెకండాఫ్
ఆకట్టుకునే కథా, కథనం
కొరటాల శివ డైరక్షన్, అద్భుతమైన డైలాగులు
దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్
తిరు విజువల్స్
మైనస్ పాయింట్లు:
ఫస్ట హాప్ కాస్త స్లోగా ఉండటం
వీక్ విలనిజం
ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ లేకపోవటం
తీర్పు:
ఇద్దరు పవర్ ఫుల్ హీరోలు, ఇంట్రస్టింగ్ క్యారెక్టరైజేషన్, వారితో మంచి సందేశాన్ని ఇవ్వాలని చూసిన కొరటాల శివ ఆ ప్రయత్నంలో విజయం సాధించాడనే చెప్పొచ్చు. ప్రతీ ఒక్క వర్గ ప్రేక్షకులు చూడాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. చివర్లో హింస కాస్త ఎక్కువైనప్పటికీ చివరికి శాంతి నెలకొల్పేందుకు చేసే పోరాటం కావటంతో అది పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. క్లాసీ ఫస్టాఫ్ తో, ఇంటెన్సిటీ సెకండాఫ్ తో, కమర్షియల్ అంశాలు ఉన్నా, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ లేకపోవటం పెద్ద మైనస్ గా మారింది. దీంతో ఓవరాల్ గా ఓ సందేశంతో కూడిన చిత్రం కావటంతో గ్యారేజ్ సగటు ప్రేక్షకుడికి సంతృప్తికరమైన ఫీలింగ్ ను అందజేస్తుంది.
చివరగా... జయహో జనతా గ్యారేజ్ రిపేరింగ్ అంతంత మాత్రమే.