టైటానిక్ దుర్ఘటనకు పద్నాలుగేళ్ల ముందే మోర్గాన్ రాబర్ట్సన్ అనే అమెరికన్ రచయిత ‘టైటాన్’ అనే నవల రాశారు. ఆ పుస్తకం ఎక్కడైనా దొరికితే చదవండి. ఇప్పుడది నవలలా అనిపించదు. టైటానిక్ ఓడ తలరాతలా ఉంటుంది! ఇంతకీ ఇది యాదృచ్ఛికమా? లేక రచయిత రాబర్ట్సన్కున్న దివ్యదృష్టి ఫలితమా?... నిజాలు దేవుడికెరుక! ఏదేమైనా పుస్తకంలోని విషయాలకు, టైటానిక్ ఘటనకు మధ్య ఉన్న సారూప్యాలు మాత్రం మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేయడం ఖాయం!అసాధ్యమైన పనులను తలకెత్తుకున్నప్పుడు దేవుడి మీద భారం వేస్తాడు మనిషి. మోసేది తనే కావచ్చు. మోసే శక్తి దేవుడు మాత్రమే ఇవ్వగలింది! 1912 ఏప్రిల్ 10న ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ సముద్రపు జలాల మీద నుంచి టైటానిక్ ఓడ న్యూయార్క్ సిటీకి బయల్దేరేముందు ఓడలోని 2,223 మంది ప్రయాణికులలో ఎంత మంది దేవుడిని తలచుకున్నారో తెలీదు. బహుశా వాళ్లందరి తరఫున జె.పి.మోర్గాన్ అనే వ్యక్తి తప్పనిసరిగా దేవుడిని ప్రార్థించే ఉంటారు - కరుణగల తండ్రీ అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చమని! టైటానిక్ ఓడను నిర్మించిన ‘ఇంటర్నేషనల్ మర్కెంటైల్ మెరైన్ ట్రస్టు’ అధిపతి మోర్గాన్! ఓడలోని ‘బి’ డెక్లో ఆయన తన కోసం కూడా ప్రత్యేకంగా ఒక సూట్ను ఏర్పాటు చేయించుకున్నారు. సముద్రాన్ని చూస్తూ ఓడపై పచార్లు చేయడానికి అనువైన వరండా ఉన్న సూట్ అది. సిగార్ హోల్డర్ల వంటి చిన్న సదుపాయాన్నయినా విస్మరించకుండా ఆయన బాత్రూమ్ తయారయ్యింది. ఇంకా అతడికి కావలసిన సౌకర్యాలన్నీ సూట్లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రార్థన మందిరం! అంతకు ముందు ఏడాదే బెల్ఫాస్ట్ నగరంలో ఓడకు నామకరణ జరిగింది. దేవుడి సన్నిధిలో ‘టైటానిక్’ అనే పేరు పెట్టారు. మోర్గాన్ అప్పుడు అక్కడే ఉన్నారు. టైటానిక్ అంటే మహా శక్తిమంతమైనదనీ, అత్యంత బలమైనదనీ, భారీ ఎత్తున ఉన్నదనీ! ఇకనేం ‘అన్సింకబుల్’ అనుకున్నారు అంతా.కానీ విధి వెయ్యి టైటానిక్ల కన్నా బలమైనది. ప్రయాణం మొదలయ్యాక - నాలుగో రోజు... ఏప్రిల్ 14 రాత్రి 11.40 నిమిషాలకు పెద్ద మంచుకొండను డీకొని టైటానిక్ తునాతునకలై అట్లాంటి క్ మహాసముద్రంలో మునిగిపోయింది. దాదాపు 1500 మందికి పైగా నిద్దట్లోనే చనిపోయారు. ఓడలోని ‘బి’ డెక్ కూడా ముక్కలు చెక్కలయింది. మోర్గాన్ ప్రార్థనా మందిరం ధ్వంసమైపోయింది. ఇంత జరిగినా మోర్గాన్కి మాత్రం ఏమీ కాలేదు. ఎందుకంటే - అసలతడు ఓడలోనే లేడు. చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా పడడంతో మోర్గాన్ ఆ నిశిరాత్రి మృత్యువు నుంచి తప్పించుకోగలిగాడు!! దేవుడు మోర్గాన్ ప్రార్థనను పూర్తిగా ఆలకించలేదా? అతడిని ఒక్కడినే కాపాడి మిగిలినవాళ్లను సముద్రానికి వదిలేశాడా? అలా వదిలేసినవారిలోనూ కొందరిపై దేవుడు జాలిపడి ఆఖరి నిమిషంలో లైఫ్బోట్లు అందించాడా?!ఇలాంటి వివక్షలు, నిర్లక్ష్యాలు, ఆలకింపులో అలక్ష్యాలు మనుషుల్లోనే కనిపిస్తాయి. జనన మరణాలన్నవి దేవుడి దృష్టిలో అందరికీ సమానమే. ముందు వెనుక అన్నది మాత్రం ఎవరికివారు చేసుకునేదే! టైటానిక్ బయల్దేరినప్పుడు ఒక్క శకునమూ సరిగా లేదు, ఒక్కటీ మంచిమాట వినిపించలేదని అంటారు.అయితే రాబర్ట్సన్ అనే రచయిత 1898లో, అంటే అప్పటికి పద్నాలుగేళ్ల క్రితమే... జరగబోతున్నదాన్ని తన మనోనేత్రంతో ముందే వీక్షించిన ట్లు ఏకంగా ఒక పుస్తకమే రాయడం దిగ్భ్రాంతి పరిచే సంగతి! దానికి ఆయన ‘ఫ్యుటిలిటీ’ అనే టైటిల్ పెట్టారు. అంటే వ్యర్థం, నిష్ర్పయోజనం అని! నిజానికి ఏ అతీంద్రియశక్తో ఆయన చేత ఈ పుస్తకం రాయించిందనుకోవాలి. రాయించడమే కాదు, పుస్తకానికి ముందు పెట్టిన పేరును కూడా మార్పించింది! ‘ఫ్యుటిలిటీ’ అనే టైటిల్ను మార్చి ‘రెక్ ఆఫ్ ది టైటాన్’ అని పెట్టాడు రాబర్ట్సన్!ఘోర ప్రమాదానికి గురై ఓడ మునిగిపోవడమే అందులోని కథాంశం! పుస్తకంలోని సంఘటనలకు, నిజంగా జరిగిన టైటానిక్ ఘోర ప్రమాదానికి అడుగడుగునా నివ్వెరపరిచే పోలికలే! ఇదెలా సాధ్యమయ్యిందన్నది నేటికీ ఒక మిస్టరీ. కాల్పనిక సాహిత్యంలో రాబర్ట్సన్లా మరే రచయితా ఇంతలా జరగబోతున్నదానిని అంచనా వెయ్యలేదని ఇవాళ్టికీ చరిత్రకారులు విస్మయం చెందుతూనే ఉన్నారు.మనుషులలోనైనా, సంఘటనల్లోనైనా పొల్లుపోకుండా పోలికలు కుదరడం విస్మయం కలిగించే విషయం. ‘ద రెక్ ఆఫ్ ద టైటాన్’ చదువుతున్నప్పుడు దాదాపు ప్రతి చోటా ఇలాంటి విస్మయాలకు లోనవుతూనే ఉంటాం. ఫిక్షన్కు, రియాలిటీకి మధ్య ఆ పోలికలు ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి.నవలలో ఓడ పేరు ‘టైటాన్’. వాస్తవంలో ఓడ పేరు ‘టైటానిక్’! టైటాన్ డీ కొన్నది ఒక మంచుకొండని. టైటానిక్ డీకొన్నదీ మంచుకొండనే! రెండు ఓడలకూ ప్రమాదం జరిగింది ఒకే ప్రదేశంలో! (ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో). రెండూ ఏప్రిల్ నెలలోనే జరిగాయి! టైటాన్లో తగినన్ని లైఫ్ బోట్లు లేవు. టైటానిక్లోనూ లేవు! ఈ కారణంగా నవల్లో రెండు వేల మంది చనిపోతారు. టైటానిక్ దుర్ఘటనలో చనిపోయినవారి పదిహేను వందలమందికి పైగానే! ‘టైటాన్’ ప్రపంచంలోనే ఒక అద్భుతం అని, మునగనే మునగదని నవల్లోని పాత్రలు అనుకుంటాయి.టైటానిక్ను తయారుచేసినవారు, ప్రయాణికులు కూడా ఇలాగే అపోహపడ్డారు... టైటానిక్ ‘అన్సింకబుల్’ అని! ఈ రెండు ఓడల ప్రయాణ మార్గాలలోనూ సారూప్యం ఉండడం ఇంకో మిస్టరీ! చిన్న వ్యత్యాసం ఏమిటంటే నవలలో టైటాన్ న్యూయార్క్ నుంచి ఇంగ్లండ్కు బయల్దేరితే, వాస్తవంలో టైటానిక్ ఇంగ్లండ్ నుంచి న్యూయార్క్కు బయల్దేరుతుంది. చివరికి రెండూ సముద్రంలో ఒకే పాయింట్లో మునిగిపోవడం షాకింగ్ సిమిలారిటీ! అలాగే ఓడకు చోదకుశక్తిని ఇచ్చే ప్రొపెల్లర్లు, వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పుడు ఓడను నిలకడగా ఉంచే మాస్ట్ల సంఖ్యకూడా రెండిటిలోనూ సరి సమానం! ఇది మరొక విచిత్రం. నవలలో టైటాన్ ఒక షిప్పును డీకొంటుంది. టాటానిక్ కూడా అలాంటి ప్రమాదం నుంచే తృటిలో తప్పించుకుంది. ఇలాంటివెన్నో పోలికలు నవలకు, నిజ నావకు ఉన్నప్పటికీ రెండు మూడు వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. టైటానిక్ దాదాపు అర్థరాత్రి సమయంలో మంచుకొండను ఢీకొంటే, నవల్లోని టైటాన్ మసక చీకటిలో ఢీకొంది. టైటానిక్ తన తొలి ప్రయాణంలోనే మునిగిపోతే, టైటాన్ అప్పటికే అనేక ట్రిప్పులు తిరిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా - టైటానిక్కు ముగింపే కానీ, మరో ప్రారంభం లేదు. నవల్లో టైటాన్ ముక్కలు చెక్కలయ్యాక సెకండ్ హాఫ్ మొదలౌతుంది.జాన్ రోలాండ్ టైటాన్ ప్రమాదం నుంచి బయటపడి సముద్రభూభాగాలలో సాహసాలు చేస్తుంటాడు. ధ్రువప్రాంతపు ఎలుగుబంటితో కూడా పోరాడతాడు. చివరికి ఒక నౌకను పట్టుకుని ఒడ్డుకు చేరతాడు. నవలలో జాన్ ఒకప్పుడు రాయల్ నేవీ ఉద్యోగి. పచ్చితాగుబోతు. దాంతో అతడి ఉద్యోగం పోతుంది. టైటాన్లోకి వచ్చి చేరతాడు. ‘ద రెక్ ఆఫ్ ద టైటాన్’ పుస్తకాన్ని రాబర్ట్సన్ 1898లో రాశారు. ఆ నవల అప్పుడొక సెన్సేషన్. బ్రిటన్, అమెరికాలలో వేల కాపీలు అమ్ముడయ్యాయి. ప్రయాణాలలో పుస్తకాలు చదివే అలవాటున్నవారు, బహుశా ఈ పుస్తకంతో టైటానిక్ను ఎక్కి ఉంటారని అనుకుంటే ఒకలాటి భయం, అయ్యో పాపం అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. సరిగ్గా అలాంటి భయాలను, ఫీలింగ్స్నే కలిగిస్తాయి... టైటాన్కీ, టైటానిక్కి మధ్య పోలికలు! ఇంకొక విషయం. టైటానిక్కు నిర్మించిన జె.పి మోర్గాన్కు, టైటాన్ నవల రాసిన రాబర్ట్సన్కు కూడా ఒక పోలిక ఉంది. రాబర్ట్ ఇంటిపేరు కూడా మోర్గాన్! ముందే చదివి ఉంటే ప్రయాణం మానుకునేవారా? రాబర్ట్సన్ రాసిన ‘రెక్ ఆఫ్ ది టైటాన్’ పుస్తకాన్ని ముందే చదివి ఉంటే కొందరైనా టైటానిక్ ప్రయాణాన్ని మానుకునేవారా? చెప్పలేం. కొత్త అనుభవాలను కోరుకోవడం మానవ స్వభావం. టైటానిక్ లాంటి అత్యంత ఆధునికమైన భారీ నౌకలో ప్రయాణించడం కచ్చితంగా ఒక జీవితకాల అనుభవం, ఒక అనుభూతి.చూస్తూ చూస్తూ ఎలా మిస్ చేసుకుంటారు? అపశకునాలకు, అమంగళ సంకేతాలకు జడిసి, వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటారు? ఒకవేళ రాబర్ట్సన్ నవలను చదివి ఉన్నా కూడా దాన్ని పట్టించుకునేవారా? డౌటే. కానీ నవలకు, వాస్తవానికి ఉన్న ‘దగ్గరి సంబంధాన్ని’ చూస్తే ఇకముందైనా ఇలాంటి ప్రిడిక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరమేమోనన్న భావం కలుగుతుంది. |
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more