అవినీతి, కుంభకోణాలు, అసమర్ధ పాలన, రాజకీయ ఎత్తుగడలు ఈ నాలుగు యూపీఏ ప్రభుత్వ కుర్చిని కూల్చేశాయి. ప్రభుత్వం నిలబడేందుకు కనీసం ఒక్క కాలు కూడా పట్టు ఇవ్వకపోవటంతో.., ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. కాంగ్రెస్. అధికారంలోకి రాకముందే హస్తం ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న మోడి.., కనుచూపు మేరలోనే కాదు.., కంట్రీలోనే అవినీతి అనే మాట విన్పించకుండా చేయాలని తాపత్రయ పడుతున్నారు. కాంగ్రెస్ పై విసుగుతో తమకు అధికారాన్ని ఇచ్చారనే విషయం గుర్తుంచుకున్న ప్రధాని.., తనపై ఉంచిన నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు, మార్పులతో "యే మోడి దునియా" అనేలా చేస్తున్నారు. అవినీతి, బంధుప్రీతి, భీతి అనేవి లేకుండా కేవలం రాజనీతి పాటించాలని మంత్రివర్గానికి స్పష్టం చేశాడు. తన పరిపాలనలో కూడా ఇది తు.చ. తప్పక పాటిస్తున్నాడు.
అవినీతిపై మోడి ప్రభుత్వం ప్రయోగించిన మొదటి అస్ర్తమే.., నల్లధనం వెలికితీతకు సిట్ ఏర్పాటు. వంద రోజుల్లో విదేశాల్లోని నల్లధనం తెస్తామన్న యూపీఏ కనీసం నల్ల కుభేరుల పేర్లను కూడా వెల్లడించలేకపోయింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి రావటంతోనే సిట్ ను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఇదో సంచలనం కల్గించింది. మోడి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకాన్ని కల్గించింది. ఆశలు నెరవేరుస్తారన్న హామి ప్రజలకు అందించింది. ఈ కమిటి ఇటీవలే సుప్రీంకోర్టుకు నల్ల కుభేరుల జాబితాను ఇచ్చింది. ఇక పరిపాలనలో కూడా ఎక్కడా అవినీతి అనే మాట విన్పించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం స్వయంగా మోడియే ప్రతి అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మంత్రుల కార్యాలయాల్లో సీసీటీవీల ఏర్పాటు
అవినీతిపై పోరులో ప్రభుత్వం తీసుకున్న మరో విప్లవాత్మక నిర్ణయం ఇది. ప్రభుత్వ శాఖలు, మంత్రుల కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారి.., అధికార, అర్ధబలం ఉన్నవారికే పనులు జరుగుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో అసలు మంత్రుల కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుగా కీలక శాఖలకు ఇవి అమరుస్తున్నారు. సీసీటీవీలుండే కార్యాలయాల్లో ముందుంది పెట్రోలియం శాఖ. బిలియన్ కోట్ల ప్రాజెక్టులు, పెద్ద పెద్ద వ్యక్తులు తరుచూ వస్తుండే ఈ కార్యాలయంలో అవినీతికి ఎక్కువగా ఆస్కారం ఉంది. బడా చమురు సంస్థలు పెట్రోలియం శాఖను ప్రభావం చూపిన సందర్బాలు చాలా ఉన్నాయి. దీంతో ముందు ఈ శాఖపై మోడి నిఘాకెమెరా కన్ను పడింది. త్వరలోనే అన్ని శాఖలు సీసీటీవీలతో అండర్ అబ్జర్వేషన్ అని ఒళ్ళు దగ్గరపెట్టుకుని పనిచేస్తాయనున్నాయి.
పాలన నిర్ణయాలంతా అక్కడే
ఇక మోడి ప్రభుత్వం తీసుకున్న మరో గొప్ప నిర్ణయం.., ప్రధాని కార్యాలయం (పీఎంఓ) కేంద్రంగా పరిపాలన జరపటం. గత ప్రభుత్వాలు మంత్రులకు స్వేచ్చ ఇచ్చి, పధకాల రూపకల్పన, అమలులో స్వతంత్ర్య నిర్ణయం తీసుకునేలా వ్యవహరించాయి. దీనివల్ల కొందరు మంత్రులు స్వప్రయోజనాల కోసం నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో తీసుకుంటే స్వయంగా మన్మోహన్ ఆధీనంలో ఉండే బొగ్గు శాఖలోనే పెద్ద కుంభకోణం జరిగింది. దీని మసి యూపీఏను ఎన్నికల్లోనూ పట్టుకుంది. ఈ విధానానికి స్వస్తి పలికే ఉద్దేశ్యంతో మంత్రులకు కేవలం నామమాత్రపు అధికారాలిచ్చారు మోడి. కొత్త పధకం అమలు, రూపకల్పన, మార్పులు ప్రతి విషయం ప్రధాని కార్యాలయంకు వెళ్ళాలి. ఫైలు అక్కడి నుంచి వచ్చే వరకు ఆగాల్సిందే. చివరికి కేబినెట్ నోట్ తయారిపై కూడా పీఎంఓ పర్యవేక్షణ ఉంటుంది.
మంత్రుల కదలికలపై నిఘా
వార్డు నెంబర్ అయినా సరే జీవితం సెట్ అయిపోతుంది అని భావించే రోజులివి. ఎక్కడ దొరికితే అక్కడ.. ఎలా దొరికితే అలా ప్రజా ధనం లూటికి అలవాటు పడ్డ మన రాజకీయ నేతల గురించి తెలుసు. వార్డు మెంబర్లే ఈ స్థాయిలో ఉన్నారంటే ఇక మంత్రుల ఎలా ఉంటారు... మంత్రులయి గతంలో తరాలకు తరబడి ఆస్తి పోగేసిన వారిని మనం చూశాం. ఇవన్నీ చూసిన మోడి, తన మంత్రులపై ప్రత్యేక నిఘా పెట్టారు. మంత్రులు ఎక్కడికెళ్తున్నారు, ఏ హోటల్లో ఎవరిని కలుస్తున్నారు అనే అంశాలపై పూర్తి నిఘా పెడుతున్నారు. ఇందుకు ఉదాహరణ. మోడి కేబనెట్లోని ఓ మంత్రి ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో, మోడికి అత్యంత సన్నిహితుడైన ఓ పారిశ్రామికవేత్తతో కలిసి భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో మంత్రికి స్వయంగా ఫోన్ చేసిన మోడి., అతడితో భోజనం పూర్తయిందా? లేదా? అని ప్రశ్నించారు. ఇది విన్న మంత్రి నోట మాట రాలేదు. తానక్కడ ఉన్నట్లు ప్రధానికి ఎలా తెలిసిందా అని మంత్రి ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా కార్యాలయంకు వెళ్ళిపోయారు.
ఇక మరో ఉదాహరణ తీసుకుంటే.., ఒక మంత్రి విదేశీ పర్యటనకు బయల్దేరారు. రొటీన్ గా ఉండే తెల్లబట్టలు, కుర్తాలు వదిలేసి ఫారిన్ ట్రిప్ కదా అని జీన్స్ వేసుకుని బయల్దేరారు. ఇంటి నుంచి కిలోమీటరు దూరం వెళ్లారో లేదో.., ప్రధాని ఫోన్. ఎక్కడకు వెళ్తున్నారని ప్రశ్న. ముందే అనుమతి తీసుకున్నందున విదేశీ పర్యటనకు మీకు తెలిసిందే కదా అని మంత్రి జవాబిచ్చాడు. సరే వెళ్ళండి కానీ.., ఆ జీన్స్ ఎందుకు వేసుకెళ్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలా జీన్స్ వేసుకుని విదేశాల్లో భారతీయ సంస్కృతిపై ఉన్న గౌరవం పోగొడతారా? అని ప్రశ్నించారు. వెంటనే కారు వెనక్కి తిప్పిన మంత్రి ఇంటికెళ్ళి సాంప్రదాయ కుర్తా వేసుకుని ఫారిన్ ట్రిప్ వెళ్ళాడు. ఇలా తన మంత్రివర్గంతో పాటు ఉన్నతాధికారులను కూడా మోడి నిఘా భయపెడుతోంది. ఈ బాధను తట్టుకోలేని కొందరు మంత్రులు, అధికారులు తమ అత్యంత రహస్య సంబాషణల కోసం సొంత మొబైల్ ఫోన్లను వాడటం లేదు. వారి డ్రైవర్లు, పనిమనుషుల ఫోన్లను అడిగి తీసుకుని రహస్యాలు మాట్లాడుకుని తిరిగి వారికిచ్చేస్తున్నారు. అంతలా భయపెడుతున్నారు మరి మోడి.
మీడియా ప్రకటనలపై కూడా దృష్టి
మీడియాను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్న ప్రస్తుత తరుణంలో.., మీడియా ప్రకటనలపై మోడీ దృష్టి పెట్టారు. సాధారణంగా జాతీయ స్థాయిలో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి Directorate of Advertising and Visual Publicity (DAVP) మీడియా ప్రకటనలు ఇస్తుంటుంది. గత పదేళ్ళుగా ఏ ఏ పత్రికలు, ప్రసార సాధనాలకు ఎంతమొత్తంలో ప్రకటనలు ఇచ్చారు అనే లెక్కలు తేలుస్తున్నారు మోడి. ప్రకటనలే ఆదాయ వనరుగా బతుకుతున్న పత్రికలు, ఎలక్ర్టానిక్ మీడియాకు ఇది కాస్త ఇబ్బందికరమే. అయితే పాలనలో పారదర్శకత కోసం తప్పదు. వ్యక్తిగత స్వార్ధం కంటే సమాజ హితమే ముఖ్యమనుకునే మీడియా దీన్ని భరిస్తోంది. ఉన్నదాంట్లో సర్దుకుపోతుంది. ఇలా ప్రతి వ్యవస్థనూ ప్రక్షాళనలు చేస్తూ, అవినీతిపై సమర శంఖం పూరించిన మోడి సుపరిపాలన దిశగా వెళ్తున్నారు. ప్రతి పనిలో తన మార్కు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్.., మనుషులంటే పావులు కాదోయ్.., మనుషులంటే మన దేవుళ్లోయ్ అనే విధంగా ప్రజలను ప్రసన్నం చేసుకునేలా పాలన చేస్తున్నారు మోది. హ్యాట్సాఫ్ నరేంద్ర జీ.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more