అనూహ్య కేసులోని నిజాలు
ముంబైలో టిసిఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే 23 సంవత్సరాల ఏస్తర్ అనూహ్య క్రిస్ట్ మస్ శలవులకు తన స్వగ్రామం మచిలీ పట్నం వెళ్ళి తిరిగి జనవరి 5 న బయలుదేరి విశాఖపట్నం- ఎల్ టి టి రైలులో విజయవాడలో ఎక్కి, ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ కి చేరుకున్న తర్వాత కనిపించకుండా పోయింది. ఆమె అంధేరీలో తను ఉంటున్న హాస్టల్ కి చేరుకోలేదు. తిరిగి జనవరి 16 న శవంగా మారింది- అదీ కాలిపోయి శరీరమంతా మాడిపోయి ముంబై థానే హైవే మీద.
"ఏ తండ్రీ అనుభవించగూడని మనస్తాపాన్ని అనుభవించాను. మా అమ్మాయి కనిపించకుండా పోయిన తర్వాత ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు మాకు సహకరించలేదు. ఆమెను మేమే వెతకటం మొదలుపెట్టాం. పది రోజుల తర్వాత శవంగా దొరికింది మా అమ్మాయి. ఏ తండ్రికైనా ఇంతకంటే ఎక్కువ నరకయాతన మరేముంటుంది" అంటూ భోరుమన్నారు అనూహ్య తండ్రి జోనథన్ సురేంద్ర ప్రసాద్. ఆయన హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేని కలిసి జరిగిన విషయాలన్నీ ఆయనకు చెప్పారు. దానితో స్పందించిన షిండే ఈ కేసు మీద సత్వర విచారణ చేసి నిందితులను పట్టుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రిని కోరారు.
జనవరి 5 న 8 మంది టాక్సీ డ్రైవర్లు, వారిలో ఒక డ్రైవర్ జన్మదిన సందర్భంగా పార్టీ చేసుకున్నారు. పార్టీ ఇస్తున్న డ్రైవర్ మీద వివిధ పోలీస్ స్టేషన్లలో లైంగిక అత్యాచార కేసులు నమౌదైవున్నాయి. అందులో ముగ్గురు టాక్సీ డ్రైవర్లను, ఇద్దరు వ్యభిచార కేంద్రాలకు పనిచేసేవాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
ఆ రోజు కేక్ కటింగ్ చెయ్యటమే కాకుండా వాళ్ళంతా మద్యం కూడా సేవించారని పోలీసు దర్యాప్తులో తెలిసింది. వాళ్ళ మొబైల్ ఫోన్ల ద్వారా వాళ్ళు చేసిన ఫోన్ కాల్ లొకేషన్, అనూహ్య ఫోన్ కాల్స్ లొకేషన్ కలుస్తున్నాయేమో మొబైల్ రికార్డ్స్ ద్వారా పరిశీలించారు. జనవరి 5 న స్విచ్ ఆఫ్ చేసిన అనూహ్య మొబైల్ ని జనవరి 9 న ఎవరో ఆన్ చేసి ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా దొరికిన ఆ ఫోన్ ని తీసుకుందామని అనుకున్న మనిషి ఎవరో ఆ తర్వాత శవాన్ని చూసి భయపడి ఆ ఫోన్ ని పడేసివుంటారని పోలీసు అధికారులు భావించారు. కానీ విచారణలో తేలిన నిజం మరోలా ఉంది!
పోలీసు దర్యాప్తులో అనూహ్యను వ్యభిచారానికి పేరుమోసిన కామాతిపురా లో ఐదు రోజులు నిర్బంధించి, ప్రతిరోజూ హింసిస్తూ ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారని విచారణలో తెలుస్తోంది. చివరకు అనూహ్యను జనవరి 9 న చంపేసారు. నిందితులు అనూహ్య దగ్గరున్న రెండు ఫోన్లలో ఒక దాని నుంచి కామాతిపురా నుంచి కాల్ చేసారు.
జరిగిందేమిటి?
లోకమాన్య తిలక్ టెర్మనల్ లో జనవరి 5 న ఉదయం 4.45 కి చేరుకున్న అనూహ్య క్యాబ్ ని పిలిచింది. అయితే క్యాబ్ డ్రైవర్ ఆమె నివాసముండే అంధేరీ వైపు కాకుండా మరో మార్గంలోకి టాక్సీని తీసుకెళ్ళటం గమనించిన అనూహ్య దారిలో మరో ముగ్గురిని టాక్సీలో ఎక్కించుకోవటంతో కీడు శంకించి ఫోన్ ద్వారా తండ్రి, స్నేహితులకు ఈ విషయాన్ని చేరవేద్దామనుకుంటుంటే నిందితులలో ఒకడు ఆమె ఫోన్లను లాక్కుని స్విచ్ ఆఫ్ చేసాడు.
అనూహ్యను ఐదురోజులపాటు నిర్బంధంలో ఉంచిన తర్వాత జనవరి 8 రాత్రి వాళ్ళ వేధింపులకు అడ్డుపెడుతుండటంతో నిందితులు ఆమెను బలంగా కొట్టారు. దానితో అనూహ్య స్పృహ కోల్పోయింది. రెండవ రోజు వరకూ అదే స్థితిలో ఉన్న అనూహ్యను నిర్మానుష్యమైన కంజూమార్గ్ కి తీసుకెళ్లి అక్కడ ఆమె మీద రసాయనాలు వేసి నిప్పంటించారు నిందితులు. పోలీసులకు కామాతిపురా లో స్లిప్పర్లు, బ్లాంకెట్ లభించాయి. బ్లాంకెట్ తన కూతురిది కాదని ఆమె తండ్రి పోలీసులకు తెలియజేసారు. స్లిప్పర్లను గుర్తించటానికి అనూహ్యతో హాస్టల్ లో ఉంటున్నవారిని పోలీసులు ప్రశ్నించారు. కానీ ఆ వస్తువులు వాళ్ళకి ఎక్కడ దొరికాయన్నది వెల్లడి చెయ్యకపోవటంతో పోలీసులు వాస్తవాలను మరుగన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అనూహ్య తండ్రి ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో పోలీసుల నిర్లిప్తత
పోలీసు అధికారుల నిర్లిప్తతతో దర్యాప్తుని సకాలంలో చేపట్టలేదన్న విషయం తెలుస్తోంది. అనూహ్య బాడీకి పోస్ట్ మార్టం చేస్తున్నట్లే ఆమె మీద జరిగిన అత్యాచారానికి కూడా పోస్ట్ మార్టమే జరుగుతోంది కానీ సమయానికి స్పందించి వుంటే కామాతిపురా లో ఐదు రోజుల ఆమె నరకయాతన తప్పివుండేది.
పోలీసులకు వ్యభిచార గృహాలతో సంబంధాలు
కామాతిపురా లో అత్యధిక స్థాయిలో జరుగుతున్న కామక్రీడలతో పోలీసులకు లోపాయి కారి సంబంధముందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అలాంటి విషయాల్లో కలుగజేసుకుని ముఖ్యమంత్రి అటువంటి అసాంఘిక వ్యవహారాలను అరికట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే అదే పనికి పూనుకున్న ఆఆపా కు అక్కడి పోలీసులు సహకరించకపోవటం, మంత్రే స్వయంగా పూనుకోవటంతో వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. కానీ మహారాష్ట్రలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, పైగా వాళ్ళకి రాష్ట్ర పోలీసు బలగాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ దర్యాప్తు చెయ్యదలచుకుంటే వాళ్ళకి అడ్డు ఏమీ లేదు.
పాటించే హిందూ ధర్మానికి, అనుసరించే మార్గాలకూ సంబంధం లేదు
మనం పాటిస్తున్న హిందూ ధర్మలో స్త్రీ ని దేవతగా చూస్తున్నాం. సృష్టికి మూల కారణమైన ఆది పరా శక్తిని మనం తల్లిగా స్త్రీ రూపంలో పూజిస్తున్నాం. కానీ అదే సమాజంలో స్త్రీని విలాసవస్తువుగా చూస్తున్నారు. ధన కనక వస్తు వాహనాలలో స్త్రీ ని ఎప్పుడూ చేర్చలేదు. కానీ స్త్రీని ఒక ఆస్తిగానూ, పురుషుడి మనోరంజనం చెయ్యటానికే ఉన్న ప్రాణిగానూ చూస్తున్నారు.
పరాయి స్త్రీ విషయంలో గౌరవంగా ఉన్నట్టుగా పైకి నటిస్తూ, అవకాశం దొరికితే చాలు హింసాత్మక విధానంలో తమ కామ క్రీడలను తీర్చుకోవటానికి చూస్తున్నవారు చాలామంది ఉన్నారు. కాకపోతే బయటపడిన ఉదంతాలు, పట్టుబడ్డ నేరగాళ్ళు అతి తక్కువ మంది. అంతేకాదు, అంతకుముందెప్పుడూ నేరం చెయ్యకపోయినా మనసులో మాత్రం నేర ప్రవృత్తి కలిగివుండి, ఎక్కువ చొరవ, ధైర్యసాహసాలు లేక, అదను కోసం చూసి, నేరం చేసిన తర్వాత పట్టుబడతామనే భయంతో సాక్ష్యాధారాలతో సహా బాధితురాలిని కూడా మట్టుపెట్టే ప్రయత్నం చెయ్యటం కూడా జరుగుతోంది.
దీనికి ఇంగ్లీష్ లో మంచి పేరుంది- హిపోక్రసీ అని. పైకి మంచిగా ఉంటూ ధర్మసూత్రాలు వల్లిస్తూ, సూక్తులను ప్రబోధాలుగా చెప్తూ అంతరంగంలో మాత్రం కరడుగట్టిన నేర ప్రవృత్తిని అదిమిపెట్టినవారే సమాజంలో చాలామంది కనిపిస్తున్నారంటే ఇది హిపోక్రటిక్ సమాజమే.
ఎవరి విధులను వారు నిర్వర్తించరా?
ఎవరి పనులు వారు చెయ్యలేరా? కేంద్ర మంత్రి కలుగజేసుకునేంత వరకూ వేడి రాజుకోదా? అంటే ఏ కేసులోనైనా పెద్దల ప్రమేయముంటేనే చకచకా దర్యాప్తు సాగుతుంది లేకపోతే నత్త నడకే లేదా కేసు మూసెయ్యటమే జరుగుతుంది.
తోటివారికి తోడుగా నిలిచేది లేదా?
సరే ఇవన్నీ వదిలెయ్యండి, టిసిఎస్ లో పనిచేసే తోటి ఉద్యోగులకు బాధ్యతేమీ లేదా? తమ సాటి ఉద్యోగిని కనిపించటం లేదని చేసిన ఫిర్యాదు మీద ఏ చర్యా తీసుకోని పోలీసులను ఎండగడుతూ కొద్ది గంటల సేపు కూడా వాళ్ళు నిరసన తెలియజేయలేరా. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది ఉన్న టిసిఎస్ లో ఉద్యోగులు నిరసన తెలియజేస్తే భౌగోళికంగా స్పందన వచ్చివుండేది కాదా. ఎంతసేపు ఎంత సాఫ్ట్ వేర్ డెవలప్ చేసాం ఎంత అమెరికన్ డాలర్లలో సంపాదించామనేనా, అందులో భాగస్వామియైన ఉద్యోగుల సంక్షేమం యాజమాన్యానికి పట్టదా. ఒక్క టిసిఎస్ మాత్రమే కాదు ఎన్నో వేల సాఫ్ట్ వేర్ కంపెనీలున్నాయి. ఉద్యోగులంతా సంఘటితమై ఆందోళన చేస్తే అందరి దృష్టికీ వెళ్లుండేది తద్వారా పోలీసుల మీద ఒత్తిడి పెరిగివుండేది. కనీసం అనూహ్య పుట్టిన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, పనిచేస్తున్న ముంబై నుంచి కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మద్దతు ఆమెకు లభించలేదు. సాటి ఉద్యోగులే అలాంటి చొరవే తీసుకుంటే చేసిందల్లా చెల్లిపోతుందిలే అనే భావన అధికారుల మదిలోకి రాదు.
స్థానికులు కాకపోవటం నేరాలకు ఊతమిస్తుందా?
ఇక్కడ పోలీసుల నిర్లిప్తత చూడండి. అనూహ్య ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన యువతి. అదే ముంబై వాసి అయ్యుంటే అక్కడ స్థానిక మహిళా విభాగాలు, ఆ నియోజక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ గుర్తింపుకోసం చేసినా కనీసం కొంత హడావిడి చేసుండేవారు. కానీ అనూహ్య ఆ నగరవాసి కాదు. అంటే మన దేశవాసి కూడా కాదనా పోలీసులు ఉద్దేశ్యం. రేపు ఆంధ్ర ప్రదేశ్ విడిపోతే కూడా ఇలాగే మన రాష్ట్రానికి చెందిన మనిషి కాదుకదా అనే భావనలు వస్తాయా.
సామాజిక స్పృహ లేదు
ఏ సంఘటన జరిగినా ప్రతివారూ గబగబా చూసేదేమిటంటే బాధితులలో మనవాళ్ళు కాని లేరు కదా అని. దుర్ఘటన జరిగినప్పుడు బాధితులు, వంచితులు మనవాళ్ళు కాకపోతే హాయిగా ఊపిరి పీల్చుకుంటాం. ఇదేనా సమాజంలో కలిసి జీవించటమంటే. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మావాళ్ళంతా బాగున్నారు లే నాకేమిటన్నదేనా పౌరుడిగా బాధ్యత.
అదే స్థానంలో నా తోబుట్టువో, దగ్గర బంధువో, ప్రేమికురాలో, కూతురో ఉంటే ఇలాగే ఊరుకుంటామా అని ఆలోచిస్తే దాని ప్రభావమే వేరుగా ఉంటుంది. ఐదు రోజుల పాటు నిర్బంధంలో ఉన్న అనూహ్య యాతన మన రక్త సంబంధీకులకో దగ్గర బంధువుకో జరిగివుంటే అన్న కోణంలో ఆలోచిస్తే మనసు బరువెక్కదా, హృదయం ద్రవించదా, అలా జరిగింది తప్పు, ఇంకా అలా జరగనివ్వటం నేరం, అలా జరగకుండా ఆపటం నా బాధ్యత అని మీకు అనిపించదా.
మనందరి కర్తవ్యం!
కనీసం మరో అనూహ్య, మరో నిర్భయ వంచించబడకుండా ఉండాలంటే, అనూహ్యను దారుణంగా హింసించిన నేరస్తులను వధస్థలికి పంపించాలి. అలా జరగాలంటే మనందరం ఒత్తిడి తీసుకుని రావాలి.
అందుకు సోషల్ మీడియాను వాడండి. రాతియుగంలో లేము కదా. ఫేస్ బుక్ ట్విట్టర్లలో మీ భావాలను వ్యక్తపరచండి. పెద్ద తలకాయలకు ఇమెయిల్స్ పంపించండి. ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రిని నిద్రలోంచి లేవమని చెప్పండి. రోజంతా రాజకీయాలు, చర్చలు, ప్రసంగాలు, ఎత్తుకి పై ఎత్తులు, ఓటర్లను లోబరచుకునే ప్రణాళికలు వేసుకోమనండి కానీ, తన వంతుగా మహారాష్ట్ర హో మంత్రికి సందేశాన్ని పంపించటానికి ఎంత సమయం పడుతుంది. రాహుల్ గాంధీకి ఇమెయిల్ చెయ్యండి. దేశ బరువు బాధ్యతలు మోసే ముందు ఆయనను కనీసం ఒక అబలకు జరిగిన అన్యాయానికి తీసుకోవలసిన చర్య తీసుకోమని చెప్పండి. హోం మంత్రి షిండే, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, దేశాధికారాలు చేపట్టుని యుపిఏ ఛైర్మన్ సోనియాగాంధీకి ఇమెయిల్స్ పంపించండి.
మీడియా బాధ్యత
కురచ స్కర్ట్ లో లో దుస్తులు ధరించకుండా ఫంక్షన్ లకు వచ్చిన వాళ్ళ గురించి రాసే వెబ్ సైట్లు కాస్త సమయాన్ని కొద్దిపాటి స్థలాన్ని కేటాయించి ఈ మంచి పనికి తోడ్పడవచ్చు. మనవాళ్ళకే అన్యాయం జరిగితే మనం మన వ్యాపారాలు చేసుకుంటూ కూర్చుంటామా. కనీసం ఇంట్లో ముద్ద నోటికి ఎక్కదు. అంత చెయ్యకపోయినా రోజులో కనీసం కొద్ది సమయాన్నైనా కేటాయించి సమాజంలో మంచి చెయ్యటం కోసం మన వృత్తిని ఉపయోగించవచ్చు. మీడియాకున్న శక్తి చిన్నది కాదు కనుక దాన్ని ఉపయోగించి మన వంతు సమాజ సేవ చెయ్యవచ్చు.
ఇక్కడ రాసినవి కొన్ని మార్గాలే. సామాజిక స్పృహతో వ్యవహరిస్తూ మన కుటుంబంతో పాటు ఆ కుటుంబం ఉన్న సమాజాన్ని కూడా నిర్భయంగా నిశ్చింతిగా జీవించేవిధంగా తయారుచేసుకోవటానికి ఎవరికి తోచిన మార్గంలో వారు అన్యాయానికి, అమానుషత్వానికి, అధికారుల నిర్లిప్తతకూ ప్రతిగా ఎదురు నిలిచి చైతన్యాన్ని తీసుకుని రావటానికి శాయశక్తులా ప్రయత్నించవచ్చు.
మీ స్పందనను, సూచనలను ఈ వ్యాసం మీద మీ కామెంట్ల ద్వారా తెలియజేయండి, పాఠకులలో మరింత చేతనను కలిగించండని మీ అందరికీ వినమ్రతతో తెలుగు విశేష్ తరఫున ప్రార్థిస్తున్నాం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more