దేశంలోని ప్రస్తుత రాజకీయ ధోరణిని చూసి ఆవేదన చెందిన 97 సంవత్సరాల కెప్టెన్ లక్ష్మీ సెహగల్, నాయకులంతా ప్రజాహితంలో ప్రజా సేవగా పనిచెయ్యకుండా ప్రజలను ఓటు బ్యాంక్ గా పరిగణించటం విచారకరమని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సన్నిహితంగా దేశ స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్న లక్ష్మీ సెహగల్, నేతాజీ జయంతి సందర్భంగా కాన్పూర్ లో మాట్లాడుతూ, దేశం కోసం నేతాజీ తన జీవితాన్నే అంకితం చేసారని, ఆయన స్పూర్తితో దేశాభ్యుదయం కోసం పనిచెయ్యవలసిన నాయకులు ప్రస్తుత కాలంలో ప్రజలను కానీ వారి ప్రదేశాలను కానీ దేశాన్ని కూడా పట్టించుకోవటం లేదని, కేవలం తమ అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆమె వాపోయారు.
బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఒక పక్క గాంధీ నేతృత్వంలో శాంతియుతమైన సత్యాగ్రహాలు, విదేశీ వస్తు బహిష్కరణ, జైల్ భరోలు జరుగుతుంటే మరో పక్క బ్రిటిష్ సేనను ఎదుర్కోవటానికి ఆజాద్ హింద్ ఫౌజ్ ని తయారు చేసిన సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారి గుండెల్లో దడపుట్టించారు. 1941 లో ఆయన తన నివాసం నుంచి బయలు దేరి వెళ్ళిన వారు తర్వాత ఏమయ్యారో ఎవరికీ తెలియదు. విమాన ప్రమాదంలో మరణించారని కొన్ని కమిటీలు, కాదని కొన్ని నివేదికలిచ్చాయి.
ఒరిస్సా లోని కటక్ లో జనవరి 23, 1897లో బెంగాలీ కుటుంబంలో జన్మించిన సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి వరసగా రెండు కాలాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గాంధీజీతో దేశపర్యటన చేసిన బోస్, గాంధీజీ ఎక్కడికి వెళ్ళినా ఆయన కోసం తరలి వచ్చిన జనాన్ని, వారు చూపించిన శ్రద్ధ, ఆప్యాయతలను చూసి ఆశ్చర్యపోయి, ప్రపంచంలో ఏ నాయకుడికీ ఇంత ఆదరణ వచ్చివుండదని ప్రకటించారు. కానీ తరువాతి కాలంలో లక్ష్యం ఒకటే అయినా ఆచరణ విషయంలో గాంధీ వాదంతో అభిప్రాయ భేదాలు రావటంతో బోస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. అహింసావాదంతో స్వాతంత్ర్యం లభించదని బోస్ గట్టిగా నమ్మారు. అందువలన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే సొంత పార్టీని స్థాపించారు. బ్రిటిష్ వారిని బేషరతుగా సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వమని ఆయన గట్టిగా అడిగేవారు. ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం 11 సార్లు జైల్లో పెట్టింది. తన సేనని పెంచుకుంటూ ఆయన చేసిన నినాదం, నాకు మీ రక్తాన్నివ్వండి. మీకు నేను స్వాతంత్ర్యాన్నిస్తాను అన్నది ఆ సమయంలో చాలా ప్రసిద్ధిగాంచింది.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారి బలహీనతనెరిగిన బోస్, వారి మీద దెబ్బ కొట్టటానికి అదే మంచి సమయమని నమ్మారు. యుద్ధ సమయంలో ఆయన భారతదేశాన్ని విడిచిపెట్టి, సోవియట్ రష్యా, నాజీ జర్మనీ, ఇంపీరియల్ జపాన్ దేశాల ను సంప్రదిస్తూ, బ్రిటిష్ ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యటానికి వారి మద్దతుని కోరారు. ఇంపీరియల్ జపాన్ మద్దతుతో తన పార్టీని ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఐఎన్ఏ) గా పేరు మార్చి, మలయా, సింగపూర్, ఇతర వాయువ్యాసియా దేశాల లోని భారత వ్యవసాయ కూలీలు, యుద్ధ ఖైదీలను సమీకరించుకుని బ్రిటిష్ కి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యటానికి సైన్యాన్ని తయారుచేసుకున్నారు. జపాన్ వారి ఆర్థిక, సైన్య సహాయంతో వారి రాజకీయ మద్దతుతో అక్కడ ఆజాద్ హింద్ ప్రభుత్వమని అఙాతంలో సర్కార్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంఫాల్ బర్మాలలోని చెల్లాచెదరుగా విఫలమైవున్న సేనలను కూడదీసి ఇండియన్ నేషనల్ ఆర్మీని తీర్చిదిద్దారు. విదేశాలలో రేడియో సాయంతో ప్రసంగాలిస్తూ, స్వదేశంలో స్వాతంత్ర సమరం పట్ల ఉత్సాహం నెలకొల్పారు.
సుభాష్ చంద్ర బోస్ తన ప్రయత్నంలో సఫలీకృతులై ఆ సమయంలోనే గనక స్వాతంత్ర్యాన్ని తేగలిగి వుంటే భారత దేశ దశ మరోలా ఉండేదని నమ్మేవారు ఇంకా మన దేశంలో కొన్ని వర్గాల్లో ఉన్నారు. అయితే ఆయన నాజీలతోనూ ఇతర దేశస్తులతోనూ కలిసి పనిచెయ్యటం, బ్రిటిష్ సేనలను ఎదుర్కోవటం లాంటి చర్యలను నిరసించేవారూ కొందరున్నారు. అతనే నిజమైన నాయకుడని, నాయకుడంటే అలా ఉండాలని గాఢంగా విశ్వసించేవారూ ఉన్నారు.
కలకత్తాలో బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన బోస్ ను హౌస్ అరెస్ట్ చేసారు. ఆయన నివాసం మీద నిఘాపెట్టివుంచారు. అయితే బోస్ ఎలాగో తప్పించుకుని ఆఫ్గనిస్తాన్ గుండా సోవియట్ రష్యాకి పారిపోయారు. దానికి ముందు నుంచే గడ్డం పెంచుకుని పఠాన్ గా రూపం మార్చుకుని జనవరి 14, 1941లో బ్రిటిష్ కన్నుగప్పి తప్పించుకున్నారు.
పెషావర్ చేరుకున్న బోస్ అక్కడ అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్ లను కలుసుకున్నారు. బోస్ ని అక్బర్ షా నమ్మదగ్గ వ్యక్తైన ఆబాద్ షా ఇంటికి తీసుకునివెళ్ళారు. అక్కిడి నుంచి జనవరి 26 1941 న ఆయన ఆఫ్గనిస్తాన్ గుండా రష్యాకి ప్రయాణం కట్టారు. అందుకు మియా అక్బర్ షా సాయం తీసుకున్నారు. షా ఇచ్చిన సలహా ప్రకారం, అక్కడి భాష తెలియదు కనుక బోస్ తలపాగ కట్టుకుని గడ్డం పెంచుకుని మూగ చెవుడు గల కొండజాతి వానిగా నటిస్తూ ప్రయాణం చేసారు. ఆయనకు మార్గదర్శనం చేసిన భగత్ రామ్ తల్వార్ రష్యా ఏజెంట్ గా వ్యవహరించేవారు. ఆగాఖాన్ 3 సాయంతో ఆఫ్గనిస్తాన్ దాటి, అక్కడ రోడ్డు నిర్మాణ సంస్థ గా నటిస్తూ తయారుగా ఉన్న అబ్వెహర్ సాయం తీసుకుని కాబూల్ ద్వారా రష్యాలోకి ప్రవేశించారు. ఆఫ్గనిస్తాన్ వరకూ చేరుకోవటానికి ఇన్సూరెన్స్ ఏజెంట్ గానూ ఆ తర్వాత అక్కడి నుంచి రష్యాకి వెళ్ళటానికి ఇటలీ పాస్ పోర్టు తోనూ ప్రయాణం చేసారు. రష్యాలో అడుగుపెట్టిన బోస్ మాస్కోకు అక్కడి ఎన్ కె వి డి సాయంతో సులభంగా చేరుకున్నారు. బ్రిటిష్ రాజ్యపాలనకు వ్యతిరేకులైన రష్యా ప్రభుత్వం సాయం తీసుకోవచ్చని బోస్ ఉద్దేశ్యం. కానీ బోస్ ఆశించిన స్పందన అక్కడ రాకపోవటంతో సమయనష్టం కాకుండా ఉండటం కోసం రష్యాలోని జర్మన్ అంబాసిడర్ ని కలిసారు. ఆయన బోస్ ని ప్రత్యేక విమానంలో బెర్లిన్ పంపించారు. జర్మన్ సాయంతో అక్కడ ఆజాద్ హింద్ రేడియోని నడిపారు. బెర్లిన్ లో ఫ్రీ ఇండియా కేంద్రాన్ని స్థాపించి అందులో 4500 మంది సైన్యాన్ని సమకూర్చారు. వారంతా బ్రిటిష్ తరఫున యుద్ధం చేసి అక్కడ చిక్కుకునివున్న భారత యుద్ధ ఖైదీలు. వారంతా, జర్మన్ నియంత హిట్లర్ కి విధేయులుగా ఉంటామని, తమ నాయకుడిగా సుభాష్ చంద్రబోస్ ఆఙలకు లొంగి వుంటామని ప్రతిఙలు చేసారు. నాజీ సైన్యం సాయం కూడా తీసుకుని రష్యా గుండా భారతదేశంలో బ్రిటిష్ సేనల మీద యుద్ధానికి సన్నిద్ధం చేసారు. (అయితే ఈ నిర్ణయాన్ని చాలా మంది తప్పు పట్టారు. అంత పెద్ద దాడి చేసి గెలిచినట్లయితే జర్మన్లు దేశాన్ని వదిలి వట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోతారా అని ప్రశ్నించారు).
జరిగిన పరిణామానికి నిజానికి బోస్ ఆనందపడాలి కానీ ఆయన మనసులోపల ఒక శంక వేధించసాగింది. రష్యాలోకి పోయిన జర్మన్ ట్యాంక్ లు తిరిగి వెనక్కి వచ్చేయటంతో హతాశుడైన బోస్ జర్మన్లు నిజంగా యుద్ధం చేస్తారా లేకపోతే కేవలం గొప్పలకోసం అలా ప్రచారం చేస్తారా అని అనుమానపడ్డారు. హిట్లర్ ని కలిసినప్పుడు బోస్ అనుమానం మరింత ధృడపడింది. దానితో ఆయన ఎవరికీ చెప్పకుండా జర్మనీ వదిలి ఒక సబ్ మెరైన్ ద్వారా జపాన్ చేరుకున్నారు.
సుభాష్ చంద్రబోస్ వెళ్ళక ముందే జపాన్ లో భారత యుద్ధ ఖైదీలతో మోహన్ సింగ్ నేతృత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ తయారైంది కానీ, జపాన్ హై కమాండ్ ఆ సేనని తన ప్రయోజనం కోసం వాడుకుంటుందేమో అనే అనుమానం కలిగిన మోహన్ సింగ్ అక్కడ వారితో విభేదించటంతో మోహన్ సింగ్ ని నిర్బంధంలోకి తీసుకుని యుద్ధ ఖైదీలను తిరిగి జైళ్ళకు పంపించేసారు. కానీ బోస్ రాకతో మరోసారి కదలిక వచ్చి పునరుద్ధరించబడింది. దాన్ని నడిపిస్తున్న రాష్ బిహారీ బోస్ దేశ బహిష్కరణలో అక్కడున్న వ్యక్తి. ఆయన ఆర్మీ మీద ఆధిపత్యాన్ని సుభాష్ చంద్ర బోస్ రాగానే ఆయనకి వదిలేసారు. ఒక సమయంలో ఆర్మీ 85000 కి చేరుకుంది. దానికి మద్దతుగా లక్ష్మీ స్వామినాథన్ నేతృత్వంలో ఒక మహిళా సైన్యం కూడా రాణీ ఝాన్సీ రెజిమెంట్ పేరుతో పనిచెయ్యటం మొదలుపెట్టింది. బర్మాలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ ర్యాలీ లో బ్రిటిష్ రాజ్ కి వ్యతిరేకంగా పోరాడటానికి తనతో రమ్మని కోరుతూ సుభాష్ చంద్ర బోస్ ఇచ్చిన ఉపన్యాసం అక్కడ అందరినీ ఆకట్టుకుంది. జపాన్ వారి ఆర్థిక మద్దతు తగ్గిపోతున్నప్పుడు కూడా బోస్ నిరుత్సాహపడలేదు.
ఆయన రేడియోలో చేసిన మొదటి ప్రసంగంలో గాంధీజీని జాతిపితగా సంబోధిస్తూ ఇంగ్లీషువారికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి ఆయన ఆశీర్వాదం కలుగజేయమని కోరారు.
నేతాజీ సుబాష్ చంద్ర బోస్ గురించి ఎంతైనా రాయవచ్చు రాయటానికి ఎంతో ఉంది కానీ పైన చెప్పుకున్నవి చాలు ఆయన అంకితభావాన్ని, దేశ ప్రేమను, నిష్టను తెలియజేయటానికి. మాతృభూమి కోసం ఆయన చేసిన తెగింపు ప్రపంచంలో ఎంతమంది చేయగలరు. ఎంత మంది తమ జీవితాలను ఫణంగా పెట్టి అంత పెద్ద ఎత్తున అన్ని సంవత్సరాలు పూరుగాని పూరిలో దేశం కాని దేశంలో భాష తెలియని ప్రాంతాల్లో తిరుగుతూ తమ లక్ష్యం వైపు వెళ్ళగలరు.
ఈ రోజుల్లో ఉన్న నాయకులను సుభాష్ చంద్రబోస్ తో కనీసం పోల్చి చూడటానికైనా అర్హులెవరున్నారు. అందుకే బోస్ సన్నిహితురాలు లక్ష్మీ సెహగల్ వ్యథను అర్థం చేసుకోవటం కోసమే ఈ సుబాష్ చంద్రబోస్ గురించి కొద్దిగా గుర్తు చేసుకున్నాం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more