రణధీర్(రణధీర్), శ్రీముఖి ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. కిడ్నాప్ చేసి డబ్బులు కొట్టేయడమే వీరి పని. ఓసారి వీరిద్దరూ కలిసి ఎంపి వసుంధర(సింధు తులాని) మేనల్లుడైన చిన్న పిల్లాడిని కిడ్నాప్ చేస్తారు. కోటి రూపాయలు ఇస్తేనే ఆ బాబును విడిచిపెడతామని వారు డిమాండ్ చేస్తారు. వారి డిమాండ్ కి వసుంధర తలొగ్గి.. కోటి ఇవ్వడానికి సిద్దమవుతుంది. డీల్ ప్రకారం.. రణధీర్ తనతోపాటు బాబుని తీసుకుని తీసుకెళుతుంటాడు. అయితే.. మార్గమాధ్యంలో యాక్సిడెంట్ అవుతుంది.
కట్ చేస్తే.. తనీష్(తనీష్) బర్త్ డే పార్టీ కోసం చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కోడి(ధనరాజ్), పండు(మనోజ్ నందం), చిట్టి(అనిల్ కళ్యాణ్), విజయ్ సాయి(సత్తి) అందరూ కలిసి వెళ్తుంటారు. వారికి అడవి మార్గంలో ఓ బాబు కనిపిస్తాడు. ఆ బాబు ఎవరు..? అతనికి సంబంధించినవారు అడవిలో ఎవరైనా వున్నారా..? అని వాళ్లు వెతకడం మొదలు పెడతారు. ఇంతలోనే అక్కడికి వసుంధర చేరుకొని.. వారికి కోటి రూపాయలు ఇచ్చి బాబుని తీసుకెళ్ళిపోతుంది. ఆమె తమకు డబ్బు ఎందుకు ఇచ్చిందోనన్న ఆలోచనలో పడిపోతారు. ఏదేమైనా తమ చేతికి డబ్బు వచ్చింది కదా అని ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా అక్కడి నుంచి బయలు దేరుతారు.
కానీ ఆ డబ్బు వచ్చిన కొద్దిసేపటికే వారి జీవితాలు మారిపోతాయి. ఫ్రెండ్స్ అందరూ విడిపోతారు.? అంతే కాకుండా చిట్టి, కోడి ఇద్దరూ అడవిలోని ఆదివాసుల చేతిలో చిక్కుకుంటారు.? వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా.. రణధీర్ మళ్ళీ కథలోకి ఎంటర్ అవుతాడు.? అక్కడి నుంచి ఈ నలుగురు ఫ్రెండ్స్ కి కలిగిన ఇబ్బందులేమిటి.? ఫైనల్ గా ఈ కిడ్నాపర్ నుంచి ఎలా తప్పించుకున్నారు.? ఆ కోటి తెచ్చిపెట్టిన సమస్యలు ఏమిటి.? చివరికి ఆ కోటి రూపాయలు ఎవరి చేతికి చిక్కింది.? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ధనరాజ్, మనోజ్ నందం, శ్రీముఖి, సింధు తులాని, రణధీర్, నాగబాబు ప్రధాన పాత్రలలో మాస్టర్ సుక్కరామ్ సమర్పణలో భీమవరం టాకీస్ బ్యానర్ పై సాయి అచ్యుత్ చిన్నారి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధనలక్ష్మీ తలుపు తడితే’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి భోలేశావలి సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని జులై 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.. కామెడీ థ్రిలర్ అనే అంశం. మొదటి 5 నిమిషాల్లోనే ఈ సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయేతారు. అలాగే మొదటి 40 నిమిషాలు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సమయంలో వచ్చే ప్రతి సీన్, ప్రతి థ్రిల్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటాయి. చివర్లో వచ్చే 20 నిమిషాలు ఆడియన్స్ ని నవ్వించడమే కాకుండా, అక్కడ వచ్చే ట్విస్ట్ లు ఆకర్షణీయంగా వుంటాయి. అన్నిటికంటే మించి ఈ సినిమా రన్ టైం కేవలం 114 నిమిషాలే కావడం సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. ధనరాజ్ ఇందులో అటు కామెడీ – ఇటు ఎమోషన్స్ ఉండే పాత్రలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఇరగదీశాడు. ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ స్పూఫ్ ఎపిసోడ్ లో ధనరాజ్ నటన అద్భుతం, డైలాగ్స్ అద్భుతం. రణధీర్ నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు. శ్రీ ముఖి ఓ లేడీ థీఫ్ గా బాగా చేసింది. మనోజ్ నందం, అనిల్ కళ్యాణ్, విజయ్ సాయిలు తమ పాత్రలకు పూర్తిన్యాయం చేశారు. చివర్లో పోలీస్ ఆఫీసర్ గా వచ్చే నాగబాబు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ బాగా నవ్వించాడు. సింధు తులాని చిన్న పాత్రలో బాగానే చేసింది. ఇక అతిధి పాత్రలో కనిపించిన తనీష్ కామెడీ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. టీవీ రిపోర్టర్ గంట పాత్రలో తాగుబోతు రమేష్ కొన్ని సీన్స్ లో బాగానే నవ్వించాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా మొదటి 40 నిమిషాలు, చివరి 20 నిమిషాలు ఎంతో ఆసక్తికరంగా సాగుతాయో.. మధ్యలో వచ్చే 50 నిమిషాలు మాత్రం ఆ రేంజ్ లో తీయలేకపోయారు. ఆ సమయం బోరింగ్ అనిపించడమేకాక.. సినిమాని సాగదీస్తున్నట్లుగా అనిపిస్తుంది. అడవి జాతి ఆది వాసుల గురించి సీరియస్ గా కాకుండా, కామెడీ ఎపిసోడ్ చూపించడం మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ ఎపిసోడ్ ని అనుకున్న రేంజ్ లో తీయలేకపోయారు. చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. డైరెక్టర్ కొత్తవాడు కావడం వలన అనుకున్న పాయింట్ ని ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు.
రణధీర్ పాత్రని మొదట్లో చాలా పవర్ఫుల్ గా చూపిస్తాడు కానీ చివరికి వచ్చే సరికి ఆ పాత్రని చాలా సిల్లీగా చేసేసాడు. ఈ సినిమాలో అనుకున్నంత కామెడీ లేకపోవడం సినిమాకి మైనస్. సినిమాలో కామెడీ కంటే థ్రిల్స్ ఎక్కువ ఉన్నాయి. సాయి అచ్యుత్ స్క్రీన్ ప్లే పరంగా, నేరేషన్ పరంగా ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది.
సాంకేతిక విభాగం విభాగం :
ఇక టెక్నికల్ విషయానికొస్తే.. ఈ సినిమాకి శివకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. బోలే శావలి అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదు. మధ్యమధ్యలో శ్లోకాలూ వున్నాయి. కానీ.. అన్ని సందర్భాలకి ఒకేరకమైన మ్యూజిక్ వినిపించడం కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. శివ వై ప్రసాద్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. మధ్యలో ఇంకాస్త కట్ చేసి ఉంటే బాగుండేది.
ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్న అచ్యుత్.. కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం వంటి మేజర్ డిపార్ట్ మెంట్లను డీల్ చేసాడు. సినిమాకి ఎంచుకున్న కథ పాతదేకానీ.. కథకి ఎంచుకున్న నేపధ్యాన్ని ఆసక్తికరంగా తీసుకున్నాడు. కథ సింపుల్ కావడంతో స్క్రీన్ ప్లే విషయంపై బాగానే కేర్ తీసుకున్నాడు. కానీ సినిమా మొత్తం టైట్ స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. మాటలు – డైలాగ్స్ జస్ట్ ఓకే, ఇంకాస్త టైం తీసుకొని ఉంటే బెటర్ డైలాగ్స్ పడేవి. దర్శకత్వం – సాయి అచ్యుత్ దర్శకుడిగా ఫస్ట్ క్లాస్ మార్క్స్ ని టచ్ చేయగలిగాడు కానీ ది బెస్ట్ అని అనిపించుకోలేకపోయాడు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ – ధనరాజ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా :
ధనలక్ష్మీ తలుపు తడితే : కామెడీ ‘పస’.. థ్రిల్ ‘బుస’!