ఆ గ్రామంలో నిరుద్యోగం లేదు. నిరక్ష్యరాస్యత లేదు. నీటి కరువు అసలే లేదు. ఒక్క పూరి గుడిసె కూడా కనిపించదు. తమిళనాడు ప్రభుత్వం గ్రామీణాభివ్రుద్ధికి సంబంధించి ఏ పథకాన్ని ప్రారంభించాలన్నా ఆ పల్లెవైపే ఆశగా చూస్తుంది. ఆ పల్లె కుత్తంబాకం.. మహాత్ముడు కలలుగన్న స్వరాజ్యాన్ని సాధించింది.
మనం గొప్పగా చెప్పుకునే మహా నగరాల్లో ఏం ఉంది. దగ్గర్లోని ఏ పల్లెటూరి చెరువులోంచో నీళ్ళు మళ్లిస్తారు. గ్రామాల నుంచే కూరగాయలూ, పాలూ వెళ్తాయి. అలాంటప్పుడు పరాన్నజీవుల్లాంటి నగరాలే ఎందుకు అభివ్రుద్ధి చెందుతున్నాయి. పల్లెలు మాత్రం అలానే ఎందుకు ఉంటున్నాయి.
పదీపన్నెండేళ్ళ దళిత బాలుడికి కలిగిన సందేహమిది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా అందుకున్నాక కూడా సమాధానం దొరకలేదు. మూడు పదుల వయసులో సంత్రుప్తికరమైన సమాధానం లభించింది. అది ఏ గూగుల్ సెర్చ్ ఇంజన్ లోనో కాదు. సర్పంచిగా ఎన్నికై, తన గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఆ యువకుడి పేరు ఇళంగో రంగస్వామి. చెన్నై నుంచి ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలోని కుత్తంబాకం అతని సొంతూరు. ఆ వూళ్లో ఎప్పుడూ ఏదో సమస్య. అక్రమ మధ్యం ఏరులైపారేది. తాగిన మత్తులో రోజూ గొడవలే. దళితులపై దాడులకైతే హద్దూ అదుపు లేదు. గ్రామ పాలనలో అంతులేని అవినీతి. ఏ సంక్షేమ కార్యక్రమమైనా జనం దాకా వచ్చేది కాదు. రోడ్ల పరిస్థితి అధ్వానం. తాగునీటికి ఎప్పుడూ కటకటే. ఉపాధి అవకాశాలు లేనేలేవు. ‘మా ఊరికే ఎందుకిన్ని సమస్యలు’ ? అనిపించేది. ఆ ప్రశ్నకు జవాబు తెలిసేలోగా కుర్రాడు పెద్దవాడైపోయాడు.
ప్రతిభావంతుడు కావడంతో ఐఐటి (మద్రాసు)లో సీటువచ్చింది. పట్టాచేతికి వచ్చేలోపే, భువనేశ్వర్ లో మంచి ఉద్యోగం దొరికింది. సెలవులకు సొంతూరికి వచ్చిన ప్రతిసారీ ఏదో అత్మనూన్యతాభావం.. తన వాళ్ళ కోసం ఏమీ చేయలేకపోతున్నానన్న బాధ. అలా అని అప్పటికప్పుడు రాజీనామా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. బరువులూ, బాధ్యతలు ఉండనే ఉన్నాయి. కనీసం సొంతూరికి దగ్గరగా వెళ్తే అయినా ఎంతోకొంత చేయగలనేమో అనుకున్నాడు. అందుకే చెన్నైలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఆర్ )లో శాస్త్రవేత్తగా చేరాడు. కోరుకున్నట్లే వూరికి దగ్గర్లో అయితే ఉన్నాడు కానీ ఆఫీసు బాధ్యతల కారణాం కూడా తీరిక దొరికేది కాదు.
కెరీర్ – గ్రామ సేవ....
ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సిన సమయం రానే వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఏటా వందలమంది, వేలమంది విద్యార్థులు ఐఐటీల నుండి బయటికి వస్తారు. నేరుగా అట్నుంచి అటే ఏ బహుళజాతి సంస్థ కొలువుకో వెళ్ళిపోతారు. లేదంటే... అమెరికా విమానం ఎక్కేస్తారు. రంగస్వామికి మాత్రమే ఇలాంటి ఆలోచన ఎందుకుకొచ్చింది. ఎందుకంటే అతను సమస్యల్లో పుట్టాడు. సమస్యల మధ్య పెరిగాడు. దళితుడిగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ప్రధాన వీధుల్లో తల ఎత్తుకొని నడవలేని దుస్థితి. తోటి పిల్లలంతా క్యారేజీలు విప్పుకొని భోంచేస్తుంటే.. చెంబునిండా మంచినీళ్ళు తాగి కడుపు తడిమి చూసుకునేంత పేదరికం. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నవారూ వైద్యం అందక ప్రాణాలు కోల్పోయినవారూ ఒకటేమిటి, కళ్ళముందే కటిక దారిద్ర్యాన్ని చూశాడు.
యువజన సైన్యం....
రాజీనామా సమర్పించగానే, రంగస్వామి దేశమంతా తిరిగాడు. బాగా అభివ్రుద్ధి చెందిన గ్రామాలన్నీ సందర్శించాడు. ఆ విజయాల వెనుకున్న కారణాల్ని విశ్లేషించుకున్నాడు. అప్పుడో స్పష్టత వచ్చింది. కుత్తంబాకం వెళ్లిపోయి, తన లాగే సొంతూరు బాగుపడాలని కోరుకునే యువకులను కూడగట్టాడు. తన కార్యక్రమాలకు వేదికగా ఒక యువజన సంఘాన్ని స్థాపించాడు. కానీ అదీ ఎంతో కాలం నిలవలేదు. ఉద్యోగమనో, ఉపాధి కోసమనో పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. రంగస్వామి దాదాపుగా ఒంటరి వాడైపోయాడు. ఒక వ్యక్తిగా చాలా పరిమితులు ఉంటాయి. ప్రజా ప్రతినిధిగా అయితే మరింత సమర్థంగా పనిచేయగలనేమో అనిపించింది. అప్పుడే పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా బరిలో దిగాడు. 60 శాతం ఓట్లతో విజయం సాధించాడు. సర్పంచిగా ప్రజా జీవితం మొదలైంది.
జనమే అండగా....
సర్పంచికి విధులెక్కువ నిధులు తక్కువ.. రంగస్వామికి ఆ విషయం అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో చాలా మందికి తెలియదు. ఏమీ చేయలేమన్న నిరాశ ఆవరించేస్తుంది. పలాయనవాదానికి అలవాటు పడతారు. ఏవో సాకులు చూపుతూ ఐదేళ్ళు నెట్టుకొస్తారు. రంగస్వామి మాత్రం నిరాశ పడలేదు. అందుబాటులో ఉన్న వనరులతో ఒక్కో పనీ చేసుకుంటూ ముందుకెళ్ళాడు.
వూళ్లో ప్రధాన సమస్యలు – తాగునీరు, పంటనీరు...
గ్రామ ప్రజలను ఒక్కటి చేసి, శ్రమదానంతో చెరువు పూడిక తీయడానికి పూనుకున్నాడు. ప్రతీ కుటుంబం ఉత్సాహంగా పాల్గొంది. ఇంట్లో ఇద్దరు పెద్దలుంటే ఒకరు బయటి పనులకెళ్తే ఇంకొకరు శ్రమదానానికి వచ్చేవారు. రంగస్వామి... కరెంటు సరఫారను లెక్కించినట్లే నీటి సరఫారును లెక్కించినట్లే, నీటి సరఫరాలనూ గణించాడు. ప్రతీ కుటుంబానికి 24 గంటలూ తాగునీరు కావాలంటే, సాగునీరు అందాలంటే ఎన్ని వనరులుండాలి? ఆ అవసరం మేరకు పూడికతీత జరిగింది. వాననీటి సంరక్షణ కార్యక్రమమూ చురుగ్గా ప్రారంభమైంది. ఒక్క నీటి చుక్క కూడా వ్రుథాగా పోవడానికి వీల్లేదు. నేరుగా చెరువులోకి పారాల్సిందే. ఎందుకూ పనికిరాకుండా పడున్న తరాలనాటి చెరువులకు మరమత్తులు చేయించారు. శ్రమదానం ఫలితంగా వాటికి జీవకళ వచ్చింది. ఆ ప్రభావంతో భూగర్భ జలమట్టం పెరిగింది. తాగునీటి సమస్య పరిష్కారమైంది. నడి వేసవిలోనూ ఈ చెరువుల్లో కనీస నీటి మట్టం పదమూడు అడుగులకు తగ్గదు. ఆ జల విజయం ప్రక్క గ్రామాలకు తాలూకాలకూ ప్రక్క జిల్లాలకు స్ఫూర్తినిచ్చింది. సర్పంచులకూ గ్రామీణాభివ్రుద్ధి అధికారులకూ పర్యాటక కేంద్రమైంది. విజయ రహస్యాలను అందరితో పంచుకోవడానికి రంగస్వామి గ్రామ అధ్యక్షుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కేంద్రం వర్షపునీటి పొదుపు, పూడికతీత తదితర అంశాలపై వందలాది మందికి పాఠాలు చెప్పింది.
ఉపాధి బాటలో....
గ్రామంలో తాగునీటి సమస్యలేదు. సాగునీటి కొరతా లేదు. ఉన్నంతలో మంచి రోడ్లున్నాయి. వీధి దీపాలున్నాయి. అయినా జనం వలస వెళ్తున్నారు. కారణం.. ఉపాది కొరత. ఇక ఊళ్లోనే ఉంటున్నవారికి సారా తయారీ తప్పించి, మరో పని తెలియదు. ఆ వూరు కాపుసారాకు పెట్టింది పేరు. గ్రామంలో మద్యం బానిసలూ ఎక్కువే. శాంతి భద్రతల విఘాతానికి ఇదో కారణం.
గ్రామానికి సంబంధించి ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా, గ్రామ సభ ద్వారా ప్రజలకు తెలియజేయడం, వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం... రంగస్వామి ముందునుంచీ పాటిస్తున్న విధానమే ఇది. పారదర్శత వల్ల ప్రజలకు ఆయనమీద నమ్మకం పెరిగింది. రైస్ మిల్లు ఆలోచన బ్యాంకులను ఆకర్షించింది. పంచాయితీ నిధులకు బ్యాంకుల ఆర్థిక సహాయం తోడైంది. ఆదర్శ గ్రామంలో కొత్త తరహా ప్రయోగం కావడంతో దీనికి ‘మినీ మోడల్ రైస్ మిల్’ గా నామకరణం చేశారు. అతర్వాత పప్పు దినుసుల మిల్లు, నూనె గింజల మిల్లు కూడా ఏర్పాటయ్యాయి. చుట్టు ప్రక్కల గ్రామాల రైతులకూ ఈ మిల్లులే ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం వీటి వల్ల సుమారు 200 కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. వీరంతా ఒకప్పుడు మద్యాన్ని నమ్ముకుని బ్రతికినవారే. దీనివల్ల గ్రామంలో సారా తయారీ తగ్గింది.
అదే ఉత్సాహంతో... మరో అడుగు ముందుకు వేశాడు. ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి ఎంతో మంది యువకులు నగరానికి వలస వెళ్తారు. రోజూ పొద్దున్నే వెళ్లి ఏ అర్థరాత్రో ఇంటికి చేరుకునేవారూ చాలా మందే ఉన్నారు. వూళ్లోనే ఏదైనా ఫ్యాక్టరీ ప్రారంభిస్తే ఆ అవసరం ఉండదుగా... పారిశ్రామిక వేత్తలను కలిసి తన ఆలోచనను వివరించాడు. నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడబోమని హామీ ఇచ్చాడు. రంగస్వామి ఐఐటీ పూర్వ విద్యార్థి కాబట్టి ఆయన సమార్థ్యం మీద ఎవరికి అనుమానం కలగలేదు. వెంటనే సరే అన్నారు. లెదర్ షూస్, హ్యాండ్ బ్యాగుల తయారీ యూనిట్, అలా వచ్చిందే. తక్కువ ఇంధనంతో పనిచేసే బర్నర్ల తయారీ విభాగాన్ని కూడా ప్రారంభించాడు. టీ, కాఫీ పొడులు, బేకరీ ఐటెమ్స్, గిన్నెలు తోమే సబ్బులు ఇలా మొత్తం 13 రకాల వస్తువులు కుత్తంబాకంలో తయారవుతున్నాయి. ఉత్పత్తిలో భారీ యంత్రాలు వినియోగించరు. చిన్నచిన్న పరికరాలతోనే పనులు జరుగుతాయి. అందులో చాలా వరకు రంగస్వామి తయారు చేసినవే. రెండేళ్ళలో గ్రామ ఆర్థిక పరిస్థితే మారిపోయింది. కుత్తంబాకం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ప్రజల ఆర్థిక పరిస్థితిలోనూ చాలా మార్పు వచ్చింది. నెలకు ఏడెమిది వేలదాకా సంపాదిస్తున్నారు. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు.
మళ్లీ గెలుపు...
అంతలోనే ఐదేళ్ళ పదవీ కాలం పూర్తయ్యింది. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ సారి పొలైన ఓట్లలో తొంభైశాతం రంగస్వామికే దక్కాయి. సంస్కరణలన్నీ సంక్షేమ కార్యక్రమాల్నీ మునుపటి ఉత్సాహంతోనే కొనసాగించారు. తమిళనాడు ప్రభుత్వానికి కూడా ఈ గ్రామం దిశా నిర్ధేశం చేసింది. కత్తంబాకంలో సీఎల్ఎఫ్ దీపాలతో విద్యుత్ పొదుపు చేస్తున్నారన్న సంగతి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్ళింది. రాష్ట్రంలోని మిగిలిన పంచాయితీల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతో మంది ప్రముఖులు కుత్తంబాకాన్ని సందర్శించారు. వారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఉన్నారు. రంగస్వామి క్రుషిని ప్రశంసిస్తూనే... సంప్రదాయేతర విద్యుత్ వినియోగం పై ద్రుష్టి సారించాలని సలహా ఇచ్చారాయన. కలాం సూచనతో రంగస్వామి ఆ దిశగా ప్రయోగాలు ప్రారంభించాడు. ప్రస్తుతం సౌరశక్తితో నడిచే సైకిల్ ని అభివ్రుద్ధి చేస్తున్నాడు. అలాగే... గ్రామంలోని అన్ని ఇళ్ళలో సౌరవిద్యుత్తునూ తప్పనిసరిగా వాడాలన్న నిబంధన పెట్టాడు.
గత ఎన్నికల్లో కుత్తంబాకం గ్రామ పంచాయితీని మహిళలకు కేటాయించారు. ఆ నిర్ణయానికి అందరికంటే ఎక్కువ సంతోషించిన వ్యక్తి రంగస్వామే. ఆయనెప్పుడూ అధికారాన్ని కోరుకోలేదు. మార్పును ఆకాంక్షించాడు. మార్పును సాధించాడు. కుత్తంబాకం ప్రజలు తమ నాయకుడు ఇచ్చిన స్ఫూర్తితో ఆ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. అవినీతి పోరాటంలో కలిసి రావాలని అన్నాహజారే స్వయంగా ఆహ్వానించినా రంగస్వామి సున్నితంగా తిరస్కరించాడు. సంపూర్ణ గ్రామ స్వరాజ్యమే తన లక్ష్యమని చెప్పాడు. అందుకు జీవితాంతం క్రుషి చేస్తానన్నాడు. ‘నా సొంతూరు మాత్రమే అభివ్రుద్ధి చెందాలని నేను కోరుకోవడం లేదు. 2016లోగా తమిళనాడులోని వేయి గ్రామాలను కుత్తంబాకంలా తీర్చిదిద్దడం.... 2021 లోగా వివిధ రాష్ట్రాల్లో మరో వేయి పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తయారుచేయడం... నా లక్ష్యం, అంకిత భావం చిత్త శుద్ధి ఉన్న సర్పంచులకు శిక్షణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటాడు రంగస్వామి.
మన సర్పంచి గారు ఏమంటారో...
పల్లెలే నా ప్రపంచం...
ఏ గ్రామమైనా కుత్తంబాకంలా అభివ్రుద్ధి చేయవచ్చు. అదేం అసాధ్యం కాదు. తొలిదశలో నేను దేశమంతా తిరిగాను. ఏ పల్లె ఎలా మార్పు చెందిందో కళ్లారా చూశాను. కొన్ని గ్రామాలు నీటి వనరుల విషయంలో విప్లవం స్రుష్టించాయి. మరికొన్ని పారిశ్రామికంగా ఎదిగాయి. ఇంకొన్ని సంప్రదాయేతర విద్యుత్తు వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆ గ్రామాల స్ఫూర్తితోనే నేనూ వివిధ కార్యక్రమాలు చేపట్టాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అరవై సంవత్సరాలు దాటింది. ఇంకా మనం గ్రాభివ్రుద్ధి గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ మందగమనానికి సిగ్గుపడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం లేదనో, రాజ్యాంగ సవరణను అమలు చేయడం లేదనో విమర్శిస్తూ కూర్చుంటే మరో 60 ఏళ్ళు గడిచినా పల్లెల పరిస్థితి మారదు. చాలా మంది సర్పంచులు దీన్నో సాకుగా చూపి, కాలం వెళ్ల దీస్తున్నారు. ఏ సర్పంచికైనా గ్రామాన్ని అభివ్రుద్ధి చేయాలన్న తపన ముఖ్యం. ఆ ఒక్కటీ లేకపోతే, కోట్ల రూపాయల నిధులిచ్చినా, అపరిమిత అధికారాలు ఇచ్చినా... కించిత్ అయినా ప్రయోజనం ఉండదు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more