2014 జూన్ 2వ తేదీన మన భారతదేశంలో ఒక కొత్త చరిత్ర సృష్టించబడింది. భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీని పూర్తి చేసుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ కూడా ఎంతో కష్టపడ్డారు. ఎన్నోసార్లు నిరాహార దీక్షలను, సమ్మెలను నిర్వహించారు. టీఆర్ఎస్ మంత్రులు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పాట్లు పడ్డారు. కొందరు యువకులు కూడా తమ ప్రాణాలను త్యాగం చేశారు. టీడీపీ పార్టీ తరఫు నుంచి కూడా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక లేఖను సమర్పించుకున్నారు. ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో అందరూ తమవంతు కృషిని అందించారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. ఆ పార్టీకి కనీస స్థానాలు కూడా దక్కకపోవడం గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా అంతరించిపోయింది. ఈ విషయాన్ని పక్కనపెడితే... తెలంగాణ రాష్ట్ర అవతరణకు ఎంతో పాట్లు పడిన టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మంత్రులు తమతమ నియోజకవర్గాల నుంచి భారీ మెజారిటీలతో గెలుపొందారు. పార్టీ అధ్యక్షుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజు అంటే 2014 జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలు, ఇతర మంత్రులు ఆయనకు శుభాభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ సందర్భంగా ఆ రాష్ట్రానికి తొలిసారిగా మంత్రుల పదవులను చేపట్టిన వారి ప్రస్థానల గురించి ఒక్కసారి చర్చించుకుందాం...
1. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) : ఈయన 1954వ సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తేదీన రాఘవరావు, వెంకటమ్మ అనే దంపతులకు మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో జన్మించారు. ఎంఏ పూర్తిచేసిన కేసీఆర్ గారు ఆనాడు తన ప్రతిభను చాటుకున్నారు. చదువు పూర్తిచేసిన తరువాత శోభగారిని వివాహమాడారు. ఈయనకు ఒక కుమారుడు తారక రామారావు, ఒక కుమార్తె కవిత వున్నారు.
మొట్టమొదటిసారిగా యువజన కాంగ్రెస్ పార్టీ ద్వారా కేసీఆర్ రాజకీయ రంగంలోకి ఆరంగేట్రం చేశారు. కొన్నాళ్ల తరువాత రాఘవాపూర్ ప్రాంతం నుంచి సింగిల్ విండో ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ తన రాజకీయ ప్రస్థానాన్ని పెంచుకుంటూ వెళ్లారు. తరువాత 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా సిద్ధపేట నుంచి పోటీ చేసి ఈయన ఓటమి చవిచూసినా... 1985వ జరిగిన ఎన్నికల్లో గెలిచి వరుసగా ఆరుసార్ల వరకు అంటే 1985 నుంచి 2004 వరకు ఆ ప్రాంత ఎమ్మెల్యేగా గెలుపొంది ఒక కొత్త రికార్డును సృష్టించారు.
ఎన్టీయార్ గారి కేబినెట్ లో కరువు మంత్రిగా, చంద్రబాబు మంత్రివర్గంలో 1996 నుంచి 1999 వరకు కేసీఆర్ గారు రవాణా శాఖమంత్రి పనిచేశారు. 1999 - 2001 వరకు శాసనసభా ఉపసభాపతిగా బాధ్యతలను కూడా నిర్వహించారు. తరువాత తెలంగాన ప్రజలకు న్యాయం చేయాలని, వారికి ఒక ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాలనే నెపంతో 2001వ సంవత్సరంలో తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. కేంద్రంలో కార్మికమంత్రిగా బాధ్యతలను కూడా స్వీకరించి, విధులను చేపట్టారు. అయితే రెండేళ్ల తరువాత కరీంనగర్ ఎంపీ పదవికి, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాన రాష్ట్ర ఏర్పాటు ఎన్నోపాట్లు పడ్డారు.
కొన్నాళ్ల తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి ముందెన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో గెలుపొంది ఒక చరిత్రను సృష్టించారు. 2008 - 09లో ఎంపీగా గెలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. సమ్మెలను నిర్వహించారు. 2009 నవంబర్ 29న సిద్ధిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు ప్రయత్నించి అరెస్ట్ అయ్యారు. దాంతో తెలంగాణలో ఉద్యమాలు తీవ్రతరం అయ్యాయి. అలా ఆ విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ జిల్లా నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. చివరకు సోమవారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
2. తన్నీరు హరీశ్ రావు : ఈయన 1972 జూన్ 3వ తేదీన కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లిలో జన్మించారు. విద్యలో డిప్లొమా, బీఏ పూర్తి చేసిన హరీశ్ గారు... తన విద్యాభ్యాసం సమయం నుంచే తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొంటూ తన ప్రతిభను చాటుకున్నారు. ఈయన భార్య శ్రీనిత, ఒక కుమారుడు అర్చిష్ మాన్, ఒక కుమార్తె వైష్ణవి వున్నారు.
హరీశ్ గారు ముందుగా రాష్ట్ర యువజన సర్వీసులు, ప్రింటింగ్ - స్టేషనరీ శాఖమంత్రిగా బాధ్యతలను స్వీకరించి, తనవంతు సహాయాన్ని అందించారు. తరువాత కొన్ని నెలలకే పదవికి రాజీనామా చేసిన ఈయన తెరాస పార్టీ తరఫు నుంచి మెదక్ జిల్లాలోని సిద్దిపేట శాసనసభా స్థానం నుంచి వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009వ సంవత్సరంలో తెరాస శాసనసభా పక్ష ఉపనేతగా కూడా పనిచేసిన ఈయన.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 93,328 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు.
3. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) : ఈయన 1976 జూలై 24వ తేదీన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్), శోభ దంపతులకు జన్మించారు. కేటీఆర్ గారు మొదట తన ప్రాథమిక విద్యను కరీంనగర్ లో పూర్తిచేశారు. తరువాత డిగ్రీ హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. అలాగే ఎమ్మెస్సీ, ఎంబీఏ పట్టాలు పొందిన ఈయన ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లి, అక్కడ ఇంట్రా కంపెనీ ఆసియా వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈయనకు భార్య శైలిమ, ఒక కుమారుడ హిమాంశు, ఒక కుమార్తె అలేఖ్య వున్నారు.
2005వ సంవత్సరంలో కేటీఆర్ గారు అమెరికాలోని ఇంట్రా కంపెనీ ఆసియా వ్యవహారాల ఉద్యోగానికి రాజీనామా చేసి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన తండ్రి బాటలోనే నడిచారు. తండ్రి స్థాపించిన తెరాస పార్టీలో చేరి, 2009లో జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ విధంగా మొదలైన ఈయన విజయ ప్రస్థానంతో 2010 ఉప ఎన్నికల్లో, 2014లో జరిగిన ఎన్నికల్లో మరోసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుపొంది, తన సత్తా చాటుకున్నారు.
4. మెహమూద్ అలీ : ఈయన 1953 మార్చి 2వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి అయిన పీర్ మహమ్మద్ వృత్తి పరంగా పాల డెయిరీని నిర్వహించుకున్నారు. బీకాం చదువు పూర్తి చేసిన మెహమూద్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. మలక్ పేట నియోజకవర్గంలో మైనారిటీలో మంచి పేరున్న ఒక ముఖ్య నాయకుడు. మెహమూద్ అలీ ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా తన పాత్రను పోషించారు. అన్ని రకాలుగా తన సేవలను అందించారు. తెరాస పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే వుంటూ, అటు పార్టీపరంగా, ఇటు వ్యక్తిగతంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పాట్లు పడ్డారు.
2001లో తెరాస వ్యవస్థాపక సభ్యుడిగా, తరువాత నగరసార్టీ ఉపాధ్యక్షుడిగా ఈయన తనవంతు సేవలను అందించారు. ఆ తరువాత తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా విధులను నిర్వహించిన ఈయన.. 2005వ సంవత్సరంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. మెహమూద్ అలీ అందించిన సేవలకుగాను 2007లో తెరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. తరువాత 2009లో తెరాస పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మైనార్టీ ప్రాతినిథ్యంతో, కేసీఆర్ తో ఈయనకున్న సాన్నిహిత్యంతో ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి పదవి వరించింది.
5. నాయిని నర్సింహారెడ్డి : 1940 మే 12వ తేదీన దేవారెడ్డి, సుభద్రమ్మ దంపతులకు నాయిని నర్సింహారెడ్డిగారు జన్మించారు. ఆనాటి కాలంలో ఈయన హెచ్.ఎమ్.సి వరకు చదువును పూర్తి చేసుకున్నారు. కొంతకాలం తరువాత భార్య అహల్యతో ఈయన వివాహం జరిగింది. ఈయనకు ఒక కుమార్తె సమత, ఒక కుమారుడు దేవేందర్ రెడ్డి వున్నారు.
నాయిని నర్సింహారెడ్డిగారు రాజకీయ రంగంలో ప్రవేశించేముందు ఎన్నోరకాల బాధ్యతలను నిర్వహించారు. హైదరబాద్ మున్సిపల్ కార్మిక సంఘం నేతగా.. ఐడీఎల్ - హెచ్ఎంటీ - వీఎస్ టీతోపాటు పలు ప్రభుత్వ - ప్రైవేటు రంగ సంస్థలకు నాయకుడిగా బాధ్యతలను స్వీకరించి, తనవంతు సేవలను అందించారు. తరువాత హింద్ మజ్దూర్ సభ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అప్పట్లో జరిగిన ముల్కీ మూవ్ మెంట్, జై తెలంగాణ ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేకత పోరాటం వంటి తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని.. పలుమార్లు జైలుకెళ్లారు. కమ్యూనిస్ట్, సోషలిస్ట, జనతా, జనతాదళ్, తెలుగుదేశం, తెరాస, తెలంగాణ ప్రజాసమితి, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ వంటి ఫ్రంట్ పార్టీల్లో వివిధ రకాల స్థాయిల్లో బాధ్యతలను చేపట్టి, తనదైన సహాయాన్ని అందించారు.
1978వ సంవత్సరంలో జనతా పార్టీలో అభ్యర్థిగా వుంటూ కాంగ్రెస్ యోధుడయిన టి.అంజయ్యను అత్యధిక మెజారిటీతో ఓడించి, ముషీరాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1985లో కూడా ఆ ప్రాంతం నుంచే రెండోసారి ఎన్నికయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ పార్టీని వీడి తెరాస అభ్యర్థిగా కొనసాగారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆ ప్రాంతం నుంచే మూడోసారి గెలుపొంది, సాంకేతిక విద్యాశాఖమంత్రిగా పదవిని పొందారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఈయన పోటీ చేయలేదు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more