రాజస్థాన్ రాష్ట్రంలో వుండే ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ‘‘మౌంట్ అబు’’ సిరోహి జిల్లాలో వుండే ఆకర్షణీయమైన పర్వతప్రాంతం. ప్రకృతి సౌందర్యం, తాజాదనంతో కూడిన వాతావరణం, పచ్చిటి కొండలు, దివ్యమైన సరస్సులు, అందంగా నిర్మించిన ఆధ్మాత్మిక దేవాలయాలు వంటి అనేక కేంద్రాలకు ప్రసిద్ధి అయిన ఈ ప్రదేశం... జైనులకు ఒక ప్రముఖ తీర్థస్థలంగా పరిగణించబడుతుంది. అంతేకాదు... అన్యమతాలవారికి సంబంధించిన ఆధ్మాత్మిక దేవాలయాలు కూడా ఇక్కడ వెలిస వున్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడానికి లక్షలాది పర్యాటకులు నిత్యం వస్తూనే వుంటారు.
1220 మీటర్ల ఎత్తులో గల ఈ పర్వత కేంద్రం... ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం మీద వుంది. ఈ పర్వతంలో వున్న పురాతన పురాతత్వ ప్రాంతాలు, వాటి అద్భుతాలు, వాటి చరిత్ర గురించి హిందూ పురాణాలలో కూడా వర్ణించబడి వున్నాయి. పర్యాటకుల కంటే ఎక్కువ భక్తులే ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. కొత్తగా పెళ్లిళ్లు జంటలు కూడా తమ హనీమూన్ క్షణాలను గడిపేందుకు ఇక్కడ విచ్చేస్తూ వుంటారు.
పురాణాల కథనాల ప్రకారం... పూర్వం సర్ప దేవత అయిన అర్బుద పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని అర్బుదారణ్య అని పిలుస్తారు. శివుని వాహనమైన ‘నంది’ని ప్రమాదం నుంచి రక్షించడానికి సర్పదేవత కిందకు వచ్చాడు. దాంతో ఆ ప్రాంతానికి అతని పేరు మీదుగా పిలుచుకోవడం జరిగింది. రానురాను కాలక్రమంలో అర్బుదారణ్య ‘అబూ పర్వతం’ లేదా ‘మౌంట్ అబూ’గా మారిపోయింది. పూర్వం ఈ ప్రాంతంలో గుర్జర్లు వుండేవారని.. వారికి ఈ పర్వతాలతో అనుబంధ సంబంధం వుండేదని ఇక్కడ లభించిన కొన్ని చారిత్రక గ్రంథాలు, శాసనాలలో నమోదు చేయబడి వుంది.
ఈ పర్వతప్రాంతంలో చూడదగిన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అవి...
1. నక్కి సరస్సు : మౌంట్ అబు ప్రాంతంలోని ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఈ నక్కి సరస్సు ఎంతో ప్రముఖమైనది. 1200 మీటర్ల ఎత్తులో వున్న ఇది.. భారతదేశంలో వుండే ఒకే ఒక్క కృత్రిమ సరస్సు. పురాణాల కథనాల ప్రకారం... రాక్షసుల బారినుంచి తమను తాము కాపాడుకోవడానికి దేవతలు తమ గోర్లతో ఈ సరస్సును తవ్వారని తెలుపబడి వుంది. ఇంకొక కథనం ప్రకారం.. దిల్వార జైన దేవాలయాల శిల్పి అయిన రసియ బాలం ఈ సరస్సును ఒకే ఒక్క రాత్రిలోనే తవ్వాడని పేర్కొనబడి వుంది. ఈ ప్రదేశంలోనే మహాత్ముని స్మారకార్థం నిర్మించిన గాంధీఘాట్ కూడా ఎంతో అందంగా పర్యాటకులను అలరిస్తూ వుంటుంది.
2. శంకరమఠం : శివభక్తులు సందర్శించుకోవడానికి ఎంతో అద్భుతమైన ప్రదేశం ఇది. ఈ మఠంలో విశేషపూర్వకంగా నిర్మించిన శివుని ఏక శిల విగ్రమం ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. దీనిని 25 సంవత్సరాల క్రితమే నిర్మించారు. స్వామి మహేశానంద్ జి గిరి నేతృత్వంలో ఈ మఠాన్ని నిర్మించడం జరిగింది.
3. దిల్వార జైన దేవాలయాలు : ఇవి 11 లేదా 13వ శతాబ్దంలో నిర్మించిన ప్రాచీన దేవాలయాలు. ఈ దేవాలయాలు తెల్లటి పాలరాయితో చెక్కబడి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ వుంటాయి. మొత్తం రాజస్థాన్ లోనే అందమైన దేవాలయాలుగా పరిగణించబడే వీటిలో... ఎంతో అద్భుతంగా ఐదు జైన దేవాలయాలు నిర్మించి వున్నాయి. విమల్ వసహి దేవాలయం, లున వసహి దేవాలయం, పీతాల్ హర్ దేవాలయం, ఖర్తర్ వసహి దేవాలయం, శ్రీ మహావీర్ స్వామి దేవాలయం అనే పిలువబడే ఈ ఐదు దేవాలయాలు రాజస్టాన్ లో వుండే ఐదు గ్రామాలపేరిట ఏర్పడ్డాయి. మౌంట్ అబూ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయాలు వుంటాయి.
4. దత్తాత్రేయ దేవాలయం : గురుదత్తాత్రేయ సిఫార్సు మేరకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దత్తాత్రేయ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఆరావళి పర్వత శ్రేణుల్లో వుండే ‘‘గురు శిఖర్’’ అనే ఎత్తైన కొండ శిఖరపై వుంది. ఈ దేవాలయానికి దగ్గరలోనే వాయువ్య దిశలో దత్తాత్రేయుని తల్లి అయిన అనసూయ దేవాలయాన్ని కూడా ఇక్కడ సందర్శించుకోవచ్చు.
5. గురు శిఖరం పీక్ : ఇది మౌంట్ అబూ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. 1722 మీటర్ల ఎత్తులో వుండే ఈ శిఖరం.. ప్రత్యేకంగా పర్యాటకుల పర్వాతారోహణ కోసం ప్రసిద్ధి చెందింది. ఇందులోనే దత్తాత్రేయుని దేవాలయం, శివాలయం, మీరా దేవాలయం, చాముండి దేవాలయం వంటి కొన్ని దేవాలయాలు ఈ శిఖరంపై వున్నాయి.
6. టోడ్ రాక్ : మౌంట్ అబూలోని ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో ఈ టోడ్ రాక్ ఎంతో అద్భుతమైంది. బోదురు కప్ప ఆకారాన్ని పోలి వుండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. నక్కి సరస్సు వద్ద వున్న ఈ పెద్దరాయి... పర్వత పట్టణం నుంచి కొండలపైకి ఎక్కే ప్రధాన రహదారిపైన వుంది. దీంతోపాటు కేమిల్ రాక్, నంది రాక్, నన్ రాక్ వంటి రాతి నిర్మాణాలు కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందినవి.
7. శ్రీ రఘునాథ్ జి దేవాలయం : మౌంట్ అబూలోని ధార్మిక ప్రదేశాలలో ఈ దేవాలయం ఎంతో ఆకర్షణీయమైనది. ఈ దేవాలయాన్ని 14వ శతాబ్దంలో హిందూ పండితుడు అయిన శ్రీరామానంద్ నిర్మించాడని ఈ ప్రాంతంలో వున్న ప్రజలు అంటారు. ఈ దేవాలయాన్ని సందర్శించుకోవడానికి ముఖ్యంగా హిందువుల్లో వైష్ణవ శాఖకు చెందినవారు చాలామంది వస్తుంటారు. ఈ దేవాలయంలో చెక్కిన శాసనాలు, గోడలపై వున్న జటిలమైన చెక్కడాలు మేవార్ సంప్రదాయాలను తెలిపే విధంగా ఎంతో అందంగా వుంటాయి.
8. ది బ్రహ్మ కుమారీస్ స్పిరిట్యువల్ యూనివర్సిటీ : మౌంట్ అబూలో వుండే ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఆధ్మాత్మిక విద్యాసంస్థల్లో ఒకటి. ఈ విశ్వవిద్యాలయం.. బ్రహ్మ కుమారీస్ వాల్డ్ స్పిరిట్యువల్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నడపబడుతుంది. 1936వ సంవత్సరంలో నిర్మించిన ఈ విద్యాలయంలో ధ్యానం, యోగ, ఆధ్మాత్మిక వంటి విద్యలను బోధిస్తారు.
9. అబూ రోడ్ : రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చే పట్టణం ఈ అబూ రోడ్. పూర్వం దీనిని ఖరాడి అనే పేరుతో పిలుచుకునేవారు. సిరోహి జిల్లాలోనే అతిపెద్ద నగరమైన ఈ అబూ రోడ్... బనస్ నది ఒడ్డున 263 మీటర్ల ఎత్తులో వుంటుంది. ఈ ప్రాంతంలో గణేష్ మందిరం, బ్రహ్మకుమారి ఆశ్రమం, చంద్రావతి ఆలయం, భద్రకాళి ఆలయం వంటి ధార్మిక ప్రదేశాలు ఆకర్షణీయమైనవి.
10. డాట్డ సీ వాల్డ్ : మౌంట్ అబూ నుంచి దిల్వార దేవాలయానికి వెళ్లే రహదారిలో ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చే ప్రాంతమే ఈ డాట్డ సీ వాల్డ్. దీనిని భారతదేశపు అతిపెద్ద ఎక్వేరియంగా భావించబడుతుంది. ఈ ప్రదేశంలో సింగపూర్, నెదర్లాండ్స్, యూఎస్ఏ, కెన్యావంటి తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రముఖ చేపలను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సీ ప్రాంగణంలో ఒక మ్యూజియం వుంది. అందులో 10,000 వరకు విభిన్న రకాలు, ఆకారాలు, పరిమాణాలలో వున్న గవ్వలు వున్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more