ఒకప్పుడు రాజకీయాల్లోకి రావటానికి నాయకత్వ లక్షణాలు, నలుగురికి మంచి చేసే గుణం, విద్య వినయం, శాంతం, క్రియాశీలత, పట్టుదల, కృషి, అవగాహన ఉండాలని అనుకునేవారు. అటువంటి వారికి ఎనలేని గౌరవం లభించేది. నాయకులు వెళ్తుంటే దారికి ఇరువైపులా నిలబడి జయజయధ్వానాలు, కేరింతలు కొడుతూ, చేతులు ఊపుతూ, కొందరు చేతులు జోడించి, అందుకోసం ఎంతో సమయం వరకూ వేచివుండి మరీ నాయకుల దర్శనం చేసుకునేవారు. అదో బంగారు స్వప్నమా అనిపిస్తుంది.
ఆ తర్వాత రాజకీయాలంటే పదవులు, హోదా గా తయారైంది. అధికారం చెలాయించవచ్చు, దర్పాన్ని చూపించవచ్చు, బంధుగణంలో అందరూ ఎంతో గౌరవాన్నిస్తారు అని అనుకునేవారు రావటం మొదలుపెట్టారు.
ఇంకా పరివర్తన చెంది, తనను తాను కాపాడుకోవటానికి ఒక మంచి మార్గంగా కనిపించసాగింది. నేర చరితలున్నవారికి డబ్బుతో తప్పించుకుందామన్నా ఒక్కోసారి బెడిసికొట్టవచ్చు, పైగా రాజకీయ నాయకులను ఆశ్రయించవలసి వస్తోంది. అందువలన తనే ఒక నాయకుడవుతేనూ అనే ఆలోచనతో కొందరు డబ్బు ఖర్చు పెట్టి, తన బలగాలను అడ్డు పెట్టుకుని రాజకీయ స్థానాలు సంపాదించే పనిలో పడ్డారు.
అవినీతి పూర్వకాలంలో లేదని కాదు కానీ చిన్న స్థాయిలో నడిచేది. ఎన్నికలు వస్తున్నాయంటే కొందరికి పండుగే అయేది. పోటీలో నిల్చున్నవారికి పార్టీ తరఫునుంచి నిధులు వచ్చేవి. అందులో ఏమీ మిగుల్చుకోకుండా అంతా ఖర్చు పెట్టినవారిని పిచ్చివాళ్ళకింద జమకట్టేవారూ ఉండేవారు.
రానురాను మీ డబ్బు మీరే ఖర్చు పెట్టుకోండి, ఆ స్తోమతుంటేనే ఎన్నికల్లో దిగండి అని పార్టీలు ఖరాఖండిగా చెప్పటం మొదలుపెట్టాయి. అంతే కాదు ఎన్నికల్లో నిలబడటానికి పార్టీ టికెట్ ఇవ్వటానికో రేటు నిర్ణయించినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. అయినా సరే తన స్థానాన్ని కాపాడుకోవటం కోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకోవటానికి డబ్బు ఖర్చు పెట్టటానికి సిద్ధమయ్యారు.
రాజ్యాంగంలోని వెసులుబాటు వలన విద్య, విషయావగాహన లేకుండానే, సేవాతత్పరత లేకపోయినా సరే డబ్బు ఖర్చు పెట్టగలిగితే నాయకత్వం చేతికి వచ్చే రోజులు వచ్చాయి. రాజుల కాలంలో యుద్ధాలు చేసి రాజ్యాధికారం సంపాదించేవారు. అది పోయి రాజకీయ ఎత్తులు పై ఎత్తులతో అధికారాన్ని చేపట్టే వ్యవస్థ వచ్చింది. ఎన్ని కేసులున్నా సరే రాజకీయ పలుకుబడితో అదంతా మరుగున పడిపోయేది.
కానీ ఉన్నట్టుండి రాజకీయ నాయకులకు చేటుకాలం వచ్చింది. ప్రజలు ఎవరిని కొడతారో తెలియదు. ఎవరిమీద అక్రమ ఆస్తుల కేసు వేస్తారో తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడితే ఆ తర్వాత ఆరోపణలే కాదు విచారణలూ ఎదుర్కోవలసి రావచ్చు. ప్రజలు మమ్మల్ని రానివ్వరు అని భయపడే నేతలున్నారు. నిలదీసి అడిగేవారు తయారయ్యారు. తాజాగా ఢిల్లీలో మంత్రి మీద చెయిచేసుకున్న ఉదంతం వెలుగు చూసింది.
పాప్యులారిటీ కోసం పోటీలు పడి దీక్షలు, పాద రథ యాత్రలతో ఆరోగ్యం పాడుచేసుకునే స్థితి వస్తోంది. రాజకీయరంగంలో అనిశ్చితి చోటుచేసుకుంది. పెట్టుబడిగా ఖర్చుపెట్టి ఎన్నికల్లో పోటీచేసి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెట్టుబడిని వడ్డీతో సహా వసూలు చేసుకుందామనుకునేవారికి సందిగ్ధావస్థ మొదలైంది. విదేశాల్లో దాచుకున్న ధనమే కాకుండా, విదేశాల్లో ఖర్చు పెట్టిన ధనం కూడా బయటపడేటట్టుగా ఉంది. పట్టుదలలకు పోయి, ఒత్తిడికి లొంగి రాజీనామాలు
చేసే పరిస్థితి కూడా రావొచ్చుననిపిస్తోంది.
ఆరోగ్యం సరిగ్గా చూసుకోలేక, డబ్బూ కూడబెట్టలేక, ఎంత కాలం పదవిలో ఉంటారో తెలియక, ఆరోపణలు ఎదుర్కుంటూ, చెంపదెబ్బలు కూడా తింటూ ఎందుకొచ్చిన రాజకీయాలు అనుకునే స్థితి వస్తోంది. మీడియా, సమాచార వ్యవస్థల వలన పారదర్శకత చోటుచేసుకుందంటే ఇంకేముంది అంతా బట్టబయలే.
కానీ ఏం భయం లేదు, పార్టీ ఉన్నదెందుకు మరి, మన తప్పులకు కొమ్ము కాస్తుంది అని అనుకుంటే పొరపాటే అవుతుంది. పురాణాల్లో ఒక కథ ఉంది. రవాణా వ్యవస్థలేమీ లేని ఆ కాలంలో అడవి దారిలోంచి ప్రయాణం చేస్తున్న ఒక గృహస్తుని బ్రహ్మరాక్షసి ఎదుటపడి, నువు ఫలానా ఫలానా పాపాలు చేసావు కాబట్టి నీ ప్రాణాలు హరిస్తానంటుంది. అయితే అవన్నీ తనకోసం చెయ్యలేదని, తన భార్యా పిల్లలకోసం చేసానని అతను చెప్పగా, అయితే వారిలో ఎవరైనా నీ పాపాలను తీసుకుంటారేమో అడిగి నీ స్థానంలో వారిని నిలబెట్టమంటుందా రాక్షసి. కానీ ఆ గృహస్తు పాపాలను తీసుకోవటానికి అతని కుటుంబ సభ్యులెవరూ ముందుకు రారు. నీ విచ్చిన సౌకర్యాలే మావి కానీ వాటికోసం నువు చేసిన పాపాలు మాత్రం నీవేనంటారు. అలాగే పార్టీ కోసం ఏం చేసినా, చివరకు తన తప్పులను పార్టీ కాస్తుందంటే నమ్మటానికి వీల్లేని రోజులొచ్చాయి.
ఇవన్నీ చూస్తుంటే, ఏమో మళ్ళీ ఆ పాత కాలం వస్తుందేమో అనిపిస్తుంది. విద్యావంతులు, సేవాతత్పరత గలవారు, పదిమందికీ మేలు చేసేవారు, ఙానులు, నాయకత్వ బాధ్యతలను చేపట్టి భారతదేశానికి మరోసారి స్వర్ణ యుగాన్ని తెచ్చినా తేవచ్చు.
ఏం, అలాంటి కలగనే హక్కు కూడా లేదా
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more