1986 డిసెంబర్ 13. జస్లోక్ హాస్పిటల్, ముంబయ్. బెడ్పై నిస్తేజంగా స్మితాపాటిల్..!అప్పటికి ఆమెకు 31 ఏళ్లు... పెళ్లై ఏడాదయింది.మగబిడ్డ పుట్టి 15 రోజులయింది.కళాత్మక, కమర్షియల్ చిత్రాలు రెంటికీ తన అందంతో, అభినయంతో ప్రాణం పోసిన స్మిత బోసిపోయిన నిర్జీవశిల్పంలా పడి ఉండటం మనసును పిండేసే దృశ్యం. ఆమె కళ్లనుంచి జాలువారిన రెండు కన్నీటి బిందువులు వెనుక ఉన్న కథ గురించి చూద్దాం.
స్మితాపాటిల్ పుట్టింది 1955, అక్టోబర్ 17న పుణెలో. అల్లారు ముద్దుగా, అల్లరి పిల్లగా పెరిగింది. తండ్రి శివాజీరావ్ పాటిల్ జాతీయోద్యమంలో జైలుకెళ్లిన గాంధేయ వాది. ఆపై మహారాష్ట్ర సర్కారులో మంత్రి. తల్లి విద్యాత్రయి సంఘసేవకురాలు. స్మితకు ఇద్దరు అక్కలు- అనిత, మాన్య. అంతా ఆమెను మురిపెంగా స్మి అని పిలిచేవారు. రేణుక స్వరూప్ హైస్కూల్లో పదోతరగతి వరకు చదివింది స్మిత. చిన్నప్పటినుంచి నాటకాలు బాగా చూసేది. చూసింది చూసినట్లుగా తిరిగి నటించేసేది. ఓసారి స్మితకు దూరదర్శన్ మరాఠీ చానెల్లో అనౌన్సర్గా అవకాశం దక్కింది. అలా- 16 ఏళ్లు నిండకుండానే బుల్లితెరపై తన నవ్వుల్ని పూయించింది. అదే సమయంలో ఫెర్గుసన్ కాలేజిలో ఇంటర్లో చేరింది. ఓ పక్క బుక్ రీడింగ్... ఇంకోపక్క న్యూస్ రీడింగ్... ఇదీ వ్యాపకం!ఎవరీ కొత్త అమ్మాయి... స్వరంలో అయస్కార తం, రూపంలో ఇంద్రజాలం... అనుకున్నారు మరాఠీలంతా! క్రమంగా స్మితాపాటిల్ మహారాష్ట్ర అంతటా ఘర్వాలీ అయిపోయింది. ఆమెకు ఎంత పేరొచ్చిందంటే దేవానంద్ అంతటి దర్శకుడు 1971లో ‘హరేరామ హరేకృష్ణ’ సినిమా తీస్తూ స్మితను వెతుక్కుంటూ వచ్చాడు- ఓ పాత్ర చేయమని! ‘రోటీ కపడా ఔర్ మకాన్’ చిత్రంలో నటింప జేసేందుకు 1974లో దర్శకుడు మనోజ్ కుమార్ ఏకంగా ఇంటికొచ్చాడు. కాని స్మిత ఈ రెంటినీ అంగీకరించలేదు.
అప్పుడే సెయింట్ జేవియర్ కాలేజీలో సైకాలజీ, ఫిలాసఫీ సబ్జెక్టులతో బిఏలో చేరింది. ఆరోజుల్లోనే తీస్రా మధ్యమ్, రాజాశివ్ ఛత్ప్రత్లాంటి షార్ట్ ఫిల్ముల్లో నటించింది. ఆమె ఫైనల్ ఇయర్లో ఉండగా ఆమె జీవితాన్ని మొత్తంగా మార్చేసే అద్భుతమైన సంఘటన జరిగింది. ఆమె శ్యాం బెనగళ్ దృష్టిలో పడింది. శ్యాం బెనగళ్... సినిమాకు ఆత్మ ఎంత అందంగా, పదునుగా ఉంటుందో పసిగట్టి చూపిన దిగ్దర్శకుడు. సికిందరాబాద్లో పుట్టి పెరిగిన అచ్చమైన తెలుగువాడు. బెనెగళ్ల శ్యాం సుందరరావు అనే అసలు పేరున్నవాడు. 1973లో ‘అంకుర్’ చిత్రంతో కళాత్మక జీవితాలకు రహదారి ఏర్పరచినవాడు. తాను తీయాలనుకుంటున్న కొత్త చిత్రాలకు సరిపడా నటికోసం ఆయన అన్వేషణ ప్రారంభించాడు. లైంగిక దోపిడీకి గురైనప్పుడు కన్నీటి సంద్రం కాగలిగిన, అంతలోనే విలాపాగ్ని కీలగా మారగలిగిన, అటు నిస్సహాయురాలైన వాస్తవ విషాద భారతీయ స్త్రీగానూ, ఇటు ఆత్మగౌరవం, ఆత్మ శక్తి కలిగిన ధీర మహిళగానూ- కెమెరా ముందు జీవించగల ... వనితకోసం శ్యాం బెనగళ్ ఎదురు చూస్తున్న కాలమది. సరిగ్గా అప్పుడు కంటపడింది స్మిత.ఆమె వర్ఛస్సు, పల్లెపట్టుల్లో కనిపించే లావణ్యం, ఆవేశ సాగరాన్ని దాచిపెట్టే పెదవులు, అగాథాల లోతుల్లో వెలుగుల జలపాతాల్లా కళ్లు... భారతీయమైన దేహసౌందర్యం గల స్మితాపాటిల్ తన పాత్రలకు ప్రాణాన్నిస్తుందని నమ్మాడు శ్యాంబెనగళ్. శ్యాం స్నేహితుడి చెల్లెలికి స్మిత అప్పటికే తెలుసు. వారితో వెళ్లి స్మితను, తల్లిదండ్రుల్ని కలిశాడు శ్యాం.
అలా 1975లో 20 ఏళ్ల స్మిత ‘చరణ్ దాస్ చోర్’లో రాజకుమారిగా నటించింది. అదే ఆమె తొలి హిందీ చిత్రం, ఆ వెంటనే ‘నిశాంత్’ తీశాడు శ్యాం. షబనా ఆజ్మీతో తొలిసారి నటించింది స్మిత. నలుగురు భూస్వాముల చేతిలో అత్యాచారానికి గురైన స్త్రీ పాత్ర స్మితది. ఇదంతా ఒక ఎత్తు. 1977 నాటి ‘భూమిక’ ఒకటీ ఒక ఎత్తు. హంసావాడ్కర్ అనే మరాఠీ నటి ఆత్మకథ ‘సాంగ్వై ఐకా’ (చెప్తాను వినండి) ఆధారంగా శ్యాం తీసిన చిత్రమిది. ఆడదాని ఒంటిసొంపుల్ని మాత్రమే చూసే పురుషుల మధ్య ‘ఆత్మగౌరవంతో బతకాలనుకునే స్త్రీ ఎలా ఉంటుందో తెలిపే దృశ్యకావ్యమిది. ఇందులో హంసా వాడ్కర్ పాత్రలో జీవించింది స్మిత. అసలు ఈ చిత్రం ప్రధానంగా స్మితాపాటిల్ చిత్రం. స్మితలోని వ్యక్తిగత స్వతంత్ర ఆలోచనా విధానాలకు ప్రతీక ఈ పాత్ర. స్మితకు జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టిన చిత్రమిది.
1970ల్లో హిందీ ప్రేక్షకులు ఫార్ములాలు, మెలోడ్రామాలు, కుప్పిగంతులున్న చిత్రాల్ని తిప్పికొట్టారు. వైవిధ్యాన్ని, సాంఘిక స్పృహను, మధ్యతరగతి సమస్యలను చిత్రీకరించడం మొదలైంది అప్పుడే! అలాంటి న్యూవేవ్ సినీ ఉద్యమానికి తన నటనతో ప్రాణం పోసింది స్మితాపాటిల్. భారతీయ ప్యారలల్ చిత్ర ప్రపంచంలో అప్పటికే బావుటా ఎగరేస్తున్న షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా, ఓం పురిలాంటి వారి పక్కన తన సింహాసనాన్ని దక్కించుకుంది స్మిత. ఎటొచ్చీ- వారందరి కన్నా చిన్న వయసులో, 22 ఏళ్లకే ఆ ఘనత సాధించడమే స్మితాపాటిల్ గొప్పతనం. ఆక్రోష్, భవ్ని భవాయ్, సత్యజిత్రే ‘సద్గతి’ .... ఇలా ఒక్కో చిత్రంతో ఆమె నగిషీలు చెక్కిన శిల్పమైంది. సానబెట్టిన వజ్రమైంది. 1980 వరకు స్మిత ఆర్ట్ చిత్రాలకు మాత్రమే పరిమితమైంది. మంచిపేరు రావడంతో, మసాలా చిత్రాల నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టడమూ మొదలైంది. మొదట వాటిని ససేమిరా అంది. కానీ ‘ఆజ్ రపట్ జాయె...’ అంటూ అమితాబ్తో వాన పాటల్లో అందాలు ఆరబోసింది; స్నానపు గది సన్నివేశాల్లోనూ కనపడింది.
సరిగ్గా అదే సమయంలో ఆమెకు వచ్చిన మరో మంచి అవకాశం- ‘అర్థ్’ సినిమా. ఇది మహేష్ భట్ సినిమా. వివాహితుణ్ని కోరుకోవడం, అతని కుటుంబం విచ్ఛిన్నం కావ డానికి తాను కారణం కావడం, ఆ దోషభావనతో రగిలి పోవడం... ఇవన్నీ మానసికంగా కుంగదీస్తుంటే ఆ బాధను భరించే పాత్రగా స్మిత ఈ చిత్రంలో కనిపిస్తుంది. విషాదమేమిటంటే - ‘అర్థ్’ సినిమాలోని పాత్రను స్మితాపాటిల్ నిజ జీవితంలో కూడా కొనసాగించడం. అవును... అప్పటికే సూపర్స్టార్గా ఉన్న రాజ్బబ్బర్ వివాహితుడని తెలిసీ వలచింది. రాజ్ బబ్బర్ తన భార్య నాదిరాను, ఇద్దరు పిల్లల్ని వదిలి స్మిత దగ్గరకు వచ్చేశాడు. 1985లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాని ఆ తర్మాత ఆమె పడిన మానసిక వేదన అంతా ఇంతా కాదు. అపరాధ భావంతో నలిగిపోయింది. ‘పురుషుణ్ని ఎంచుకునేటప్పుడు ఎందుకోగాని స్త్రీ వివేకంగా ఆలోచించలేదు’ అని మథన పడింది. అలాగని ఆమె కాపురం బాగుండలేదని కాదు. తన సంతోషం కోసం మరొకరి సంసారాన్ని కూల్చానన్న వేదన అది.
ఏడాది తిరక్కుండా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రతీక్ బబ్బర్ అని ఆ పిల్లాడికి పేరు పెట్టారు. కాని ప్రసవానంతరం మూర్చ లక్షణమున్న ఎక్లాంప్సియా, తీవ్ర రక్తస్రావం, అధిక రక్తపోటు లాంటి లక్షణాలు ఆమె దేహాన్ని కబళించాయి. అయినా రోజుల పసికందుకి మొగరపులాల అంటూ మరాఠీ జోల పాట పాడుతూ పంటి బిగువున బాధను దాచిపెట్టింది స్మిత.కాన్పు అయిన రెండు వారాలకే కన్నుమూసింది స్మిత. ఆమె ఆయుష్షు కేవలం 31 ఏళ్లే. సినీ జీవితం కేవలం 12 ఏళ్లే. హిందీ, మరాఠీ, బెంగాలీ, మలయాళం... జాతీయ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలిచి పిన్నవయసులోనే ‘పద్మశ్రీ’ పొంది... ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉందనగా.. ఇక నా పాత్ర అయ్యిందంటూ నిష్ర్కమించింది స్మిత. ముంబయ్లోని శివాజీ పార్క్ లో ఆమె దహన సంస్కారాలు జరిగాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more