జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన కార్యకలాపాలు, ప్రసంగాలను చూస్తుంటే, "ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బులెట్ దిగిందా లేదా" అన్న పోకిరి డైలాగ్ గుర్తుకొస్తుంది. మార్చి 14 న ఆవిర్భవించిన జనసేనకు కేవలం 50 రోజుల ప్రాయమే. కానీ ఆ పార్టీ ప్రభావం రాష్ట్రం మీద చాలా లోతుగా పడిందనటంలో అతిశయోక్తి లేదు.
సామాన్య పౌరుడి దృష్టిలో
కామన్ మాన్ అనబడే సామాన్య పౌరుడు ఆ సేనలో తనూ భాగమే అనుకునేట్లుగా ఉంది పవన్ కళ్యాణ్ ప్రసంగం. పార్టీ ఆవిర్భావ సభలో రాజకీయ ప్రసంగంలా లేదు. ఆత్మీయుడు ఎదురుగా కూర్చుని హృదయం విప్పి మాట్లాడుతున్నట్లుగా ఉంది. విమర్శలు జరిగాయి కానీ ఎవరినీ కించపరచి మాట్లాడలేదు. సగౌరవంగానే సంబోధించటం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇటు తెలంగాణాని అటు సీమాంధ్రను కలుపుకుపోయే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ మొదటిసారిగా హైద్రాబాద్ లో రాష్ట్ర విభజన ముందు చేసిన ప్రసంగంలో చూసాం. అప్పుడు తప్పదు అలాగే చెప్పాలి. కానీ రాష్ట్ర విభజన జరిగి పంపకాల విషయంలో రాజకీయనాయకులు రాజకీయం చేస్తున్న నేపథ్యంలో ఇరు ప్రాంత వాసులకూ ఆత్మీయుడిగా వ్యవహరించటం అనేది చాలా కష్టమైన పనే కాని, సాధ్యం కాని పని మాత్రం కాదని పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. ఒకళ్ళ మద్దతు కావాలంటే మరో ప్రాంతవాసులను విమర్శించటం అవసరమేమీ కాదని నిరూపించారు.
అధికారం కోసం ఎన్నో మాటల మూటలు, పంచరంగుల కలలను చిత్రీకరిస్తూ మాట్లాడిన నాయకులను చూసారు కానీ సామాన్య ప్రజలింత వరకు నాకేమీ వద్దంటూ, నిస్వార్థంగా లాభిసాటియైన తన వృత్తని వదిలి, నిరంతరం ప్రతిపక్షాలతోనే కాకుండా సొంత గూటిలో అసమ్మతి నాయకుల విమర్శలకు గురయ్యే రాజకీయరంగంలోకి వచ్చిన వారిని ఇంతవరకు చూడలేదు. అందునా, సినీరంగంలో ఏదో దొరికినంత వరకు చేసుకుంటూ పోతున్నాడని కాకుండా, నంబర్ వన్ స్థాయికి ఎదిగి విజయం సాధించిన తర్వాత దానికంటే రాష్ట్ర ప్రజల సౌభాగ్యమే నాకు ముఖ్యమంటూ, రాజకీయాలలో పదవుల కోసం కాకుండా, ప్రశ్నించటం కోసమే వస్తున్నానంటూ ప్రకటించటం ఇంకా ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది! అందుకే ఇతర పార్టీల సభలకు వెళ్లేవాళ్ళకంటే పవన్ కళ్యాణ్ సభకు ఎక్కువమంది హాజరవుతున్నారు. సభాప్రాంగణం సరిపోక రోడ్ల మీదకు కూడా వచ్చి నిల్చుని పవన్ కళ్యాణ్ మాటలు వింటుండటం వలన ఉభయగోదావరి జిల్లాలలో ట్రాఫిక్ కి అంతరాయం కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని అంశాలు
తెలంగాణాలో మాట్లాడినా, సీమాంధ్రలో మాట్లాడినా పవన్ చెప్పిన విషయాలలో ఒకటి ప్రశ్నించటానికే పుట్టిన పార్టీగా జనసేన అవినీతి కోరుల అంతు చూస్తానని చెప్పటం జరిగింది. రెండవది ఎవరికీ భయపడకుండా ఇంతవరకు విమర్శించటానికి భయపడుతూ వస్తున్న నాయకుల్లా కాకుండా సుస్పష్టంగా చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్తూ ప్రజలను మోసగిస్తే మీ అంతు చూస్తానని చెప్పటం. మూడవది తాను ఎవరికీ భయపడనని, బెదిరింపు కాల్స్ ని పట్టించుకోనని, అన్నిటికీ తయారయ్యే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పటం. ప్రజాధనాన్ని కొల్లగొట్టటం, కొన్ని వర్గాల ప్రజలను ప్రత్యేకంగా విమర్శించటం, అవమానించటం సహించనని చెప్పటం నాల్గవదైతే, ఐదవది నన్నేమైనా అనండి పడతాను కానీ భావి భారత భాజపా ప్రధాని నరేంద్ర మోదీని ఏమైనా అంటే సహించనని అనటం.
మనమంతా మనసులో అనుకుంటున్నదే
పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే చాలావరకు ఎవరో చెప్తున్నట్లుగా లేదని, మనం ఇంతకాలం లోపల అనుకుని పైకి మౌనంగా ఉన్న విషయాలను ఆయన బాహాటంగా, నిక్కచ్చిగా, నిర్ద్వంద్వంగా, చెప్తున్నారని చాలామంది అంటున్నారు. ఉదాహరణకు, రాజకీయాలలో అవినీతి పేరుకుపోయిందని అందరికీ తెలుసు కానీ అటువంటివి జరగకుండా అడ్డుకుంటానని, సామాజిక న్యాయం కోసం పాటుపడతానని చెప్పటం వలన. ఔను, నేను కోరుకునేది కూడా అదే అని అందరూ అంటున్నారు. ప్రజలకోసం, ప్రజలచేత ఎన్నుకోబడ్డ నాయకులు అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆ అధికారాన్ని ఇచ్చినవారినే విస్మరించి, వారినే కొల్లగొట్టి, తమ స్వార్థ ప్రయోజనాలకోసం, తమ సొంత భావి తరాల వారసులకోసం ఎనలేని, ఎంచలేనంత అస్తిని కూడగట్టుకోవటం ఎంత అనైతికమో అందరికీ తెలుసు కానీ దాన్ని సహించను అని చెప్పటానికి ఎవరికి వారే సంశయిస్తున్న సందర్భంలో ఒక నాయకుడు తనంతట తాను తన వృత్తిని పక్కకు పెట్టి లోకకళ్యాణమే లక్ష్యంగా రావటమనేది ప్రజలంతా ఆమోదిస్తున్న చర్య.
ఆర్థిక సామాజిక అసమానతలను ఎవరికి వారు సహిస్తూ వచ్చారంటే కారణం సంఘటితమవలేక. అలా సంఘటితమవాలంటే ఎవరికివారు అలా కూడలేరు. అందుకు ఒక నాయకుడు ముందుకు రావాలి జనాన్ని సంఘటిత పరచాలి. అప్పుడా సంఘటిత జనం ప్రభంజనమై, ఒక సేనగా మారి అవినీతిని అడ్డుకుంటుంది. అదే జనసేన అని పవన్ కళ్యాణ్ తన మాటల్లో తెలియజేసారు.
వోటర్ల మీద ప్రభావం
వోటర్లలో చాలామంది విద్యావంతులు కాకపోవటం, ఆర్థికంగా చితికవున్న వారవటం వలన జనాకర్షణ పథకాలకు మురిసిపోవటమే కాకుండా, ఎన్నికల ముందు ఇచ్చే వాగ్దానాలు ఏమైనా కానీ ముందుగా ఆ రోజు చేతిలో పడుతున్న డబ్బు, మద్యం, ఉపహారాలకు ముగ్ధులై వోటు వేసే తరుణంలో ఇదంతా మీ సొమ్ము, రాజకీయనాయకులకు అధికారాన్ని ఇస్తున్నవారు మీరే కాబట్టి ఎవరికి ఇవ్వాలో ఆలోచించుకోమని చెప్తూ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో ఇంతవరకు ఎవరూ చెయ్యని రీతిలో విమర్శలను గుప్పించటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వైయస్ఆర్ కాంగ్రెస్ మీద జగన్ మీద పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు వోటర్లను ఆలోచింపజేస్తున్నట్లు వారి స్పందనలో తెలుస్తోంది.
ఆ వ్యాఖ్యలు ఇవి-
జగన్ ని ముఖ్యమంత్రిని చేస్తే బాంబులు ఫాక్షన్ కల్చర్ వస్తుందని, హైద్రాబాద్ చుట్టూ భూకబ్జాలు చేసింది వైయస్ అని, రాష్ట్ర విభజన జరగటానికి కూడా అదే కారణమని, దాన్ని కప్పిపుచ్చుకుంటూ సీమాంధ్ర ప్రజల మీద కపట ప్రేమను చూపిస్తున్నారన్న పవన్ కళ్యాణ్, నిజంగా ప్రేముంటే సీమాంధ్రులను అవమానిస్తున్న కెసిఆర్ ని తిరిగి తిట్టమని చెప్పండి అన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆకాంక్షే రాష్ట్ర విభజనకు కారణమైందని దుయ్యబట్టారాయన. కెసిఆర్ ని నిలదీసే దమ్ము లేనప్పుడు జగన్ సీమాంధ్రుల సంక్షేమాన్ని ఎలా చూడగలరని, తెలంగాణాలో ఉన్న ఆంధ్రుల భద్రతకు ఎలా హామీ ఇవ్వగలరని పవన్ ప్రశ్నించారు. ప్రశాంతమైన జీవనాన్ని సాగించాలంటే, కబ్జాలు లేకుండా ఉండాలంటే, బాంబు దాడులు లేకుండా ఉండాలంటే పత్యర్థుల మీద వేటకొడవళ్ళ ప్రహారం లేకుండా ఉండాలంటే రాష్ట్రంలో చంద్రబాబుని, కేంద్రంలో మోదీని గెలిపించమని పవన్ పిలుపునిచ్చారు. భూకబ్జాలను కాపాడుకోవటం కోసమే తెరాసకు వైకాపా జై కొడుతోందని పవన్ విమర్శించారు.
అయితే, వైయస్ జగన్ ముఖ్యమంత్రైతే తనకేం నష్టం లేదని కూడా పవన్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎలాంటి నష్టం లేదని చెప్పిన పవన్, పదేపదే సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్న కెసిఆర్ ని ఉపేక్షించేది కూడా లేదని అన్నారు. జగన్ కి సొంతలాభం ఉండబట్టి ఊరుకున్నారని, ఆయనను నిలదీసే ప్రయత్నం చెయ్యలేదని, ఏ పదవినీ ఆశించకుండా కేవలం 50 రోజుల వయసుగల జనసేన పార్టీ అధ్యక్షుడు గా తాను కెసిఆర్ ని నిలదీస్తుంటే ఆ పని జగన్ ఎందుకు చెయ్యటం లేదని ప్రశ్నించారు. ఆయనలో సీమాంధ్ర పౌరుషం లేదా, తెగింపు లేదా అని అడిగారాయన.
పార్టీ గెలుపుల మీద ప్రభావం
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత లాగా ఉన్నట్టుండి ఆకాశంలోంచి ఊడిపడ్డ హీరో ఏకుమైకవుతుంటే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా చావుకే వచ్చిందనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రభావం పార్టీల మీద పడుతోందనటానికి ఉదాహరణగా, ఇంతవరకు విశాఖ స్థానాన్ని భాజపాకి ఇవ్వటం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అసంతృప్తిని వెలిబుచ్చుతూ వచ్చారు. జగన్ కి అది ప్రయోజనకారిగా మారే అవకాశం ఉందని అంటూ వచ్చారు. కానీ పార్టీలో ఆ వ్యాఖ్యలు ఆగిపోవటానికి కారణం మోదీ పవన్ ల ప్రసంగాలేనంటూ తెదేపా నాయకుడే ఒకాయన అనటం జరిగింది. గాలి దిశ మారుతోందనటానికి ఇదే ఒక నిదర్శనమంటూ ఆయన వ్యాఖ్యానించటం విశేషం.
పవన్ కళ్యాణ్ ఉద్వేగ భరిత ప్రసంగాలకు జనం నుంచి వస్తున్న స్పందన చూసిన తెదేపా భాజపా నాయకులలో నూతనోత్సాహం కనపడుతోంది.
"మీరెంత మీ పేపరెంత?" అంటూ పవన్ కళ్యాణ్ గురించి జగన్ పేపర్లు రాస్తున్న వ్యాఖ్యానాలను తిప్పికొట్టారు పవన్. అన్ని వ్యాఖ్యానాలకూ ఒకే సమాధానంగా, జనాన్ని కొల్లగొట్టి నిలబెట్టిన పేపర్లో రాసింది ఒక లెక్కా అన్నారు పవన్ కళ్యాణ్.
జగన్ అంటే నాకు శత్రుత్వం కూడా లేదన్నారు పవన్ కళ్యాణ్. నా పోరాటమంతా దోపిడీతత్వం మీదనేనని స్పష్టం చేసారాయన. జగన్ దోపిడీ చేసి జైలుకెళ్తే నేను సీమాంధ్రుల సంక్షేమంలో జైలుకి పోవటానికి సిద్ధమని అంటూ, కోనసీమ పౌరుషాన్ని చూపించమని జనాన్ని సంబోదించి అన్నప్పుడు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న కేంద్ర మంత్రులు చిరంజీవి, జైరాం రమేష్ జగన్ మీద చేస్తున్న వ్యాఖ్యలు కూడా పవన్ మాటలకు మద్దతు పలుకుతున్నాయి. శాశ్వతంగా జైల్లో ఉండాల్సివస్తుందనే జగన్ అడ్డదార్లు తొక్కుతూ అధికారాన్ని చేపడదామనుకుంటున్నారని, దానితో తప్పించుకోవచ్చని అనుకుంటున్నారని, లక్షల కోట్ల దోపిడీ చేసిన జగన్ కి వోటర్లు తగిన గుణపాఠాన్ని నేర్పాలని చిరంజీవి పిలుపునివ్వటం కూడా పవన్ కళ్యాణ్ మాటలను సమర్థించటమే కాకుండా పెద్ద పోటీగా నిలిచిన వైకాపాను బలహీన పరుస్తూ తద్వారా భాజపా తెదేపాలకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి.
దీనితో, ఇప్పటి వరకు సీమాంధ్రలో తెలుగు దేశం పార్టీకి పెద్ద పోటీగా నిలిచిందనుకున్న వైకాపా కోట గోడలకు బీటలు పడుతున్నాయి.
అయితే ఇంకా పోటీ తగ్గిందనటానికి లేదు! అందుకు కారణం- తెదేపా లోగడ పార్టీ టికెట్ ఇవ్వటంలో సామాజిక న్యాయం చెయ్యకపోవటం, అధిక శాతంలో ఉన్న సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వకపోవటం, ఒకవేళ ఇచ్చినా గెలవలేని చోట ఇవ్వటం లాంటి కొన్ని తప్పులు! అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగాల ప్రభావం వలన ఆ లోపాలు కాస్తంత పూరించుకుంటూ వున్నా, సామాజిక న్యాయమని అంటున్న పవన్ కళ్యాణ్ మాటలకు వ్యతిరేకంగా వెంకయ్య నాయుడు తన ధోరణిలో తన సామాజిక వర్గ ప్రస్తావన తీసుకుని వస్తున్నారు!
కొన్ని సందర్భాలలో మాట్లాడకుండా ఉండటం కూడా మేలు చేస్తుంది కానీ వ్యతిరేక ధోరణిలో మాట్లాడటం హాని చేస్తుంది. సీనియర్ నాయకుడిగా ఎంతో అనుభవం గడించిన వెంకయ్యనాయుడైనా సరే కొన్ని సందర్భాలలో మిన్నకుండటమే మంచిది కానీ సామాజిక వర్గం గురించి మాట్లాడకూడదు. వెంకయ్య నాయుడు కుల ప్రస్తావన మానేసి పవన్ కళ్యాణ్ కి వదిలితే అందరికీ మంచిదని తెదేపా, భాజపా నాయకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు బలం, బలహీనతలైన సామాజిక వర్గం చెయ్యలేని పని పవన్ కళ్యాణ్ మాటలు చేస్తాయని ఇప్పటికైనా గ్రహించటం తెదేపా గెలుపు దృష్ట్యా మంచిదేమో! ఎందుకంటే ఇప్పటికే చేసిన సామాజిక అన్యాయంలాంటి పనుల వలన, పవన్ కళ్యాణ్ మాటల ప్రభావం ఎంత ఉన్నా, ఇంకా వైకాపా నుంచి పోటీ మాత్రం చాలా గట్టిగానే ఉందని తెలుసుకోవటం ఆ పార్టీకి మంచి చేస్తుందనిపిస్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్ ని శ్రమను వృధా చెయ్యకుండా వెంకయ్య నాయుడు కుల ప్రస్తావన తీసుకునిరాకుండా ఉంటే మంచిదని పార్టీలో కొందరు విజ్ఞలు భావిస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more