గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారధి నరేంద్ర మోడి హైద్రాబాద్ ఎల్ బి స్టేడియంలో 'నవ భారత యువ భేరి' లో చేసిన ప్రసంగానికి పూర్ణానువాదం.
ముందుగా నరేంద్ర మోడి రాష్ట్రంలోని సీనియర్ భాజపా నాయకులను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అభివాదనలు తెలిపి, ఆతర్వాత ఈ క్రింది విధంగా తెలుగులో మాట్లాడారు.
"సోదర సోదరీమణులారా, నమస్కారము. భారతదేశ ప్రగతికి తెలుగువారి కృషి ప్రశంసనీయము. తెలుగు ప్రజలు సుఖ, సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుత కష్ట పరిస్థితుల్లో నుంటి మీరందరూ త్వరగా బయటకు రాగలుగుతారని మనసారా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధి కలిగించాలని భగవంతుడిని ప్రార్దిస్తున్నాను. తెలుగువారికి గుజరాత్ తో సంబంధాలు చాలా ప్రాచీనమైనవి. కాబట్టి గుజరాత్ రాష్ట్రంలో తెలుగు మీడియం స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇది తెలియచేస్తూ నేను చాలా సంతోషిస్తున్నాను. సెప్టెంబర్ 17, 1948లో హైద్రాబాద్ కి విముక్తి కలిగింది. ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చింది."
తర్వాత హిందీలో ప్రసంగం ఈ విధంగాసాగింది.
"మీరు హైద్రాబాద్ స్వాతంత్ర్య దినోత్సవం చేస్తే, అదృష్టవశాత్తూ నాకు కూడా ఆరోజు అభినందనలు చేరుతాయి. ఎందుకంటే సెప్టెంబర్ 17 నా జన్మదినం.
ఈ రాజకీయ సభను సమాజసేవ కోసం సదుపయోగం చేసినందుకు నేను సీనియర్ నాయకులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ సభకోసం 5 రూపాయల రిజిస్ట్రేషన్ ఇచ్చి ఉత్తరాఖండ్ బాధితుల కష్టంలో పాలుపంచుకున్నందుకు నేను ఆంధ్రప్రదేశ్ యువకులను ఎంతో అభినందిస్తున్నాను. ఇందుకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ యువకులకు నా అభినందలను తెలియజేస్తున్నాను.
(కెనడాలో ఉన్న భారతవాసి 85 సంవత్సరాల తల్లి, ఒక స్వాతంత్ర సమరయోధుడు పట్టుబట్టి నరేంద్రమోది సభకు వచ్చినందుకు వారికి సభాముఖంగా అభివాదం చేసిన నరేంద్ర మోడి ప్రసంగానికి ముందు వారికి శాలువాలు బహూకరించి వారి ఆశీస్సులను తీసుకున్నారు.)
ఢిల్లీలో జరుగుతున్న ఒక్కో ఘటనతోనూ దేశంలో సామాన్యప్రజానీకానికి రాజనీతిమీద, రాజకీయ నాయకుల మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఇక్కడ ఎంతో మంది యువతీ యువకులు వచ్చారు. కానీ నేను ఇక్కడికి వస్తుంటే, ఈ స్టేడియంలో ఉన్నవాళ్ళకి రెట్టింపు సంఖ్యలో బయట ఉండటం చూసాను. వారు లోపలికి రాలేకపోయినందుకు నేను వారి క్షమాపణ కోరుకుంటున్నాను. అయితే వాళ్ళకి నేను ఒక హామీ ఇస్తున్నాను. ఈ స్టేడియంలో లేకపోయినా నా హృదయంలో మాత్రం వాళ్ళకి కావలసినంత చోటుంది. మీరంతా నన్ను అక్కడున్న వీడియోలు టివిల ద్వారా చూడగలుగుతున్నారు. కానీ నాకా అదృష్టం లేదు. నేను మిమ్మల్ని చూడలేకపోతున్నా. నేను మాత్రం మిమ్మల్నందరినీ ఇక్కడినుంచి చూడలేకపోతున్నాను. కానీ మీకు నేను నమ్మకంగా చెప్పేదేమిటంటే, నాకు ఏమాత్రం అవకాశం చిక్కినా నేను ఆంధ్రాకు మరోసారి వస్తాను, ఈరోజు చేసుకోలేకపోయినా ఆ యువత దర్శనం అప్పడు తప్పక చేసుకుంటాను.
పోయిన వారంలో దేశ సరిహద్దులో జరిగిన కొన్నిసంఘటనలు మనందరి హృదయాలకు బాధను కలిగించాయి. మన సైనికుని తల నరికి తీసుకెళ్ళారు. అప్పడు భారత ప్రధాని, ఇటువంటి దుర్ఘటన మరోసారి జరిగితే, పాకిస్తాన్ తో ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. ఆ ప్రధానిని నేను అడిగేదేమిటంటే, ఈ వారంలో మన దేశాన్ని రక్షించే వాళ్ళు, దేశం కోసమే బ్రతుకుతూ దేశం కోసమే ప్రాణాలర్పించే మన సైనికులను పాకిస్తాన్ సైనికులు వచ్చి వాళ్ళను తుపాకులతో కాల్చివేసి వాళ్లను మృత్యులోకానికి పంపించారు. ఈ విషయంలో ఇటువంటి సంఘటనలను ఇక ఉపేక్షించము అని అన్నారు అని దేశమంతా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఒకదాని తర్వాత మరొకటిగా పాకిస్తాన్ హింసాకాండకు పూనుకోవటానికి కారణమేమిటని 125 కోట్ల భారతీయులు అడుగుతున్నారు.
కొద్దిరోజులుగా దుర్ఘటనలు జరిగాయి. ఎంత మంది మనుషులను చంపారు, ఇళ్ళను దుకాణాలను కాల్చివేసారు. కాశ్మీరు లోయలో ఒకదాని తర్వాత మరో సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. దానికి కారణం ఈ దేశంలో అశాంతిని కలిగించాలనే దుర్మార్గపు ఆలోచనతో జరగటం లేదుకదా. ఇది తెలుసుకోవటం అవసరం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేత అరుణ్ జైట్లీ బాధితులను పరామర్శించటానికి పోతుంటే, వాళ్ళకి భరోసా ఇవ్వటానికి పోతుంటే, అక్కడి ప్రభుత్వం, సత్యాలు బయటకు రాకుండా ఉండటం కోసం, జరిగిన పాపాల మీద పరదా కప్పటానికి, భద్రతా అనే వంకతో ఆయనను జమ్మూ విమానాశ్రయంలో నిర్బంధించారు.
జమ్మూ పర్వత క్షేత్రంలో ఈ ఘటనను చిన్నదిగా భావించకండి. కాశ్మీర్ లోయలో జరిగిన ఘటనతో అక్కడి నుంచి సంక్షోభాన్ని మొదలుపెట్టే పాపచింతనగా అనిపిస్తోంది. ఇది కేవలం అక్కడి ప్రజలకు చెందిన విషయం మాత్రమే కాదు. భారతదేశ వాసులందరికీ రక్షణ కావాలి, సుఖశాంతులతో జీవించే పరిస్థితులుండాలి. కానీ ఈ ప్రభుత్వం దేశవాసులకు భద్రతను కల్పించటంలో విఫలమైంది.
బంగ్లాదేశవాసులు భారత భూభాగంలో వస్తుంటే సరిహద్దుల్లో ఉన్న సేనలకు వారిని ఆపటం కోసం ఎటువంటి ఆయుధాలనూ ఉపయోగించరాదన్న ఆంక్షలు పెట్టింది. అంతేకాదు, వాళ్లు ఒకవేళ ఎక్కువ సంఖ్యలో ఉండి శక్తి వంతులైనట్లయితే వారితో యుద్ధం చెయ్యటం మానేసి వాళ్ళని లోపలికి రానివ్వాలని కూడా ఆదేశాలు జారీచేసింది.
చైనాదేశం మన దేశంలో ప్రవేశించి జెండా పాతింది. చైనా చేస్తున్న తయారీలు మన భూభాగం మీదకు కదలి వస్తున్న దృశ్యాలు, దేశ భూభాగంలోకి ప్రవేశించి తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ అందరూ చూస్తూనేవున్నారు. లోకమంతా గమనిస్తూనేవుంది. నాకేమీ అర్థమే కావటం లేదీ విషయం. చైనా వాళ్ళు వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోవాలి కదా, కానీ మన ప్రభుత్వం వాళ్ళతో ఎలాంటి రాజీలకు వచ్చిందో చూడండి. వాళ్ళయితే వెళ్ళిపోయారు కానీ మన దేశవాసులను తిరిగి రప్పించలేకపోయారు. అంతే కాదు, మన దేశ విదేశాంగ మంత్రి చైనా పోయారు. అక్కడ మనదేశానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి బదులు, మన మంత్రివర్యులు ఏమన్నారో తెలుసా. మీ నగరం ఎంత బాగుందో. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఎందులోనైనా మునిగి చావగూడదూ మన సిగ్గులేని ప్రభుత్వానికి. పుండు మీద కారం చల్లటమే ఇది. 125 కోట్ల భారతీయుల హృదయానికి తగిలిన గాయం మీద ఉప్పూ కారం చల్లినట్లే.
ఇంతేనా, మన దేశ సైనికులను వాళ్లు కాల్చి చంపుతుంటే మన విదేశాంగ మంత్రి జైపూర్ పోయి పాకిస్తాన్ అతిథులకు బిరియానీలు తినిపించారు. దానికి వంక ఏమిటో తెలుసా. ప్రోటోకాల్. ఇక్కడున్న యువతను నేను అడగదలచుకున్నదేమిటంటే, ఇది గాయాన్ని రేపటం కాదా.
ఇటలీనుంచి వచ్చి కేరళలో మన మత్స్యకారుల మీద తుపాకుల ప్రహారం చేస్తారు. వాళ్ళ తప్పేమీ లేదు పాపం. చేపల వేటకు పోయారంతే. వాటితో తమ తల్లి, కుటంబ సభ్యుల కడుపునింపాలనుకున్నారు. దానికోసం శారీరక శ్రమ చేస్తున్నారు. ఇంతలో సైనికులు వచ్చారు, నా దేశంలోని ఇద్దరు మత్స్యకారులను హతమార్చారు. వాళ్ళని జైలు పెట్టామన్నారు, వాళ్ళకి బెయిల్ దొరకదన్నారు, కానీ ఎవరి సిఫారసు పనిచేసిందో కానీ వాళ్ళిద్దరు సైనికులు ఇటలీ వెళ్ళిపోయారు, తిరిగి వచ్చే సమయం వచ్చేసరికి వాళ్ళని పంపించటం కుదరదని ఇటలీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే మన సుప్రీం కోర్టు కన్నెర్ర చేసేసరికి, వాళ్ళిద్దరినీ పంపించేంతవరకు భారతదేశంలోని ఇటలీ దౌత్యాధికారిని పంపించేది లేదని అనేసరికి, ఇటలీ ప్రభుత్వ తలవంచింది వాళ్ళని తిరిగి పంపించింది.
నేనీ సంఘటనల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఢిల్లీ గద్దెమీదున్న ప్రభుత్వం అందుకు అర్హత కోల్పోయింది. వాళ్ళకీ దేశ సమస్యలు పట్టవు. ఓ యువకులారా మీకు దేశం గురించిన ఆందోళన వేస్తుందా. మీకు ఈ దేశపరిస్థితులు బాధని కలిగిస్తున్నాయా. మీ అందరికీ ఈ దేశం పట్ల చింత ఉంటే నాకు మీ యువత పరిస్థితి చింతాక్రాంతుడిని చేస్తోంది. ఈ దేశ యువత భవితవ్యమేమిటి అన్న ప్రశ్న నాలో ఉదయిస్తుంది. కడుపు చేత పట్టుకుని వాళ్ళు ఎక్కడికి పోతారు. మా కాంగ్రెస్ మిత్రులకు ఈ మాటలు రుచించకపోవచ్చు కానీ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మహారాష్ట్రలోనూ ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వమే పాలిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే ఆత్మహత్యలు చేసుకున్న యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనే యువతకు ఎక్కువగా నిరాశలో ఆత్మహత్యకు పాల్పడవలసివస్తోంది. జీవితాన్ని వెళ్ళదీసుకోవటానికి వాళ్ళకి విదేశాలకు పోవలసివస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాల భరోసా ఇచ్చింది కదా. జరిగిందా అది. కాంగ్రెస్ పదవలోకి వచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్ చలవే. కేంద్రంలో స్థానంలో లభించిందంటే అది ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల వలన వచ్చింది. కానీ ఇక్కడి ఎంపీలకేం ప్రయోజనం కలిగింది. మీకిచ్చిన మాటను నిలబెట్టుకుందా. చిన్న రాష్ట్రాల ప్రస్తావన వాజ్పేయ్ కూడా తీసుకొచ్చారు. ఛత్తీస్ గఢ్ రాగానే ఛత్తీస్ గఢ్ లోనూ మిఠాయిలు పంచుకున్నారు, ఒరిస్సా లోనూ మిఠాయిలు పంచుకున్నారు. ఉత్తర ఖండ్ రాష్ట్రం ఏర్పడింది, ఉత్తర ఖండ్ లోనూ మిఠాయిలు పంచుకున్నారు, ఉత్తర ప్రదేశ్ లోనూ మిఠాయిలు పంచుకున్నారు. జార్ఖండ్ ఏర్పడింది, బీహార్ లోనూ మిటాయిలు పంచుకున్నారు, జార్ఖండ్ లోనూ మిఠాయిలు పంచుకున్నారు. ఈ కాంగ్రెస్ పద్ధతిదే ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో చిచ్చుపెడుతుంది. ఒక సోదరుడు మరో సోదరుడితో తలపడుతున్నాడంటే ఆ పాపాన్ని మూటగట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీయే.
భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి తెలంగాణా పక్షంలోనే ఉంది. మాకు అధికారం వస్తే 100 రోజుల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పాం. కానీ సీమాంధ్రలోనూ దేశంలోనే గౌరవం లభించేంద అభివృద్ధి కలగాలని, ఎక్కడ రాజధాని ఏర్పడ్డా అది హైద్రాబాద్ కంటే ఇంకా ఎక్కువ ప్రగతి సాధించాలని, అటువంటి ఏర్పాట్లతోనూ ముందుకెళ్లాలని చెప్పాం. కానీ ఢిల్లీ సర్కారుకి అలాంటివేమీ లేనట్టున్నాయి. ఇప్పుడే హైద్రాబాద్ ని ఉమ్మడి రాజధాని చేస్తారట, పది సంవత్సరాలకు ఆంధ్రాకు ప్రత్యేక రాజధాని ఏర్పడుతుందట. మేము ఢిల్లీ లోని కాంగ్రెస్ పెద్దలను అడిగేదేమిటంటే, ఆ పని మీరు 2004 లోనే ఎందుకు మొదలుపెట్టలేదు. ఎందుకు 2013 వరకూ తాత్సారం చేసారు. మీకు ఆంధ్రా ప్రజలకు అన్యాయం చేసే అధికారం లేదు. కానీ మా గుండెల్లో తెలంగాణాకు ఎంత ప్రాధాన్యతుందో సీమాంధ్రకు కూడా అంతే ఉంది.
నేను చాలా చిన్నవాడినే. కానీ నేను గుజరాత్ నుంచి వచ్చాను. మహాత్మాగాంధీ పుట్టిన గడ్డనుంచి వచ్చాను. నేను తెలంగాణా ఆంధ్రా సోదరులకు విజ్ఞప్తి చేసేదేమిటంటే, కాంగ్రెస్ ఎన్ని పన్నాగాలైనా పన్ననీ గాక కానీ మీ హృదయాలు కలుషితం కాకూడదు. అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు పెరగకూడదు. తెలంగాణా ఆంధ్రా ప్రజలారా గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలను చూసి మిమ్మల్ని అడుగుతున్నా. జరుగుతున్న వాటికి కలుగుతన్న వేదనతో అడుగుతున్నా. మీరు నా మాటలను తప్పు పట్టినా సరే, మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి. ఎక్కడైనా ఒకే తల్లి పాలు తాగిన వారి మధ్యలో వైషమ్యాలు వస్తాయా. అలా రావటానికి వీల్లేదు. మా గుజరాత్ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది తెలుగువాళ్ళున్నారు. ఈ హైద్రాబాద్ లో నాలుగు లక్షల మంది గుజరాతీయులన్నారు. మేమంతా కలిసి పోయి జీవిస్తాం. కలిసి శ్రమిస్తాం. అందరం మా కడుపులు నింపుకోవటానికి సమిష్టిగా పాటుపడతాం. మా గుజరాత్ ప్రాంతీయులు నాలుగు లక్షల మంది తెలుగువారితో కలిసిమెలిసి జీవించగలిగినప్పుడు తెలంగాణా వాసులు కూడా ఆంధ్రా వాసులతో కలిసి జీవించగలుగుతారు, ఆంధ్రావాసులూ తెలంగాణా వాసులతో కలిసి జీవించగలుగుతారు.
ఆంధ్రా ప్రాంతం ప్రగతి పథంలో ఎంత ప్రగతిని సాధించాలంటే, గుజరాత్ ని కూడా దాటిపోవాలని మనం ఆకాంక్షించాలి. తెలంగాణా ఎంత ప్రగతిని సాధించాలంటే, గుజరాత్ ని కూడా దాటిపోవాలి. మన స్వప్నం అలా ఉండాలి.
ప్రగతి ఒక్కటే మార్గం. అన్ని ప్రశ్నలకూ అభివృద్ధే సమాధానం. అన్ని సమస్యలకూ పరిష్కారం అభివృద్ధిలోనేవుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లోనూ అభివృద్ధి చెందే మార్గాలను అన్వేషించదు. ఎందుకంటే అందులో జవాబుదారీ ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరైనా 40 సంవత్సరాల క్రితం బజార్లో నెయ్యి అమ్మేచోట శుద్ధమైన నెయ్యి లభిస్తుంది అనే బోర్డు చూసారా. 40 సంవత్సరాల క్రితం శుద్ధమైన నెయ్యి దొరుకుతుంది అనే బోర్డు పెట్టాల్సిన అవసరం పడలేదు. నెయ్యి లభిస్తుంది అనే బోర్డు ఉంటేనే దాని అర్థం అక్కడ పరిశుద్ధమైన నెయ్యి లభిస్తుందనే. కానీ ఈ కాలంలో శుద్ధమైన నెయ్యి లభిస్తుంది అనే బోర్డు పెట్టుకునే అవసరం ఏర్పడింది. ఎందుకంటే శుద్ధంకాని నెయ్యి కూడా లభిస్తుంది.
పూర్వకాలంలో కడుపు నిండలేదనే సమస్య ఉండేది కాదు. బీదవాడికి కూడా కడుపునిండా అన్నం తినగలిగేవాడు. ఈ కాంగ్రెస్ పార్టీ బీదవాడి స్థితిని ఎంత దిగజార్చిందంటే, శుద్ధ మైన నెయ్యి అన్నట్టుగా ఆహార భద్రత గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. బీదవాడి నోటి దగ్గర అన్నాన్ని లాక్కుని పాపానికి ఒడిగట్టింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రోగంలా పట్టుకుంది.
నేను ఆంధ్రాకు వచ్చాను కాబట్టి శ్రీ ఎన్ టి రామారావ్ ని గుర్తుచేసుకోదలచుకున్నాను. ఈ దేశానికి ఎన్టీఆర్ చాలా సేవ చేసారు. ఆంధ్రుల గౌరవం కాపాడటమే కాదు, ఆంధ్రులకు గర్వ కారణమవటమే కాదు ఎన్టీఆర్ కాంగ్రెస్ విరోధులకు చేయూతనిచ్చారు. కాంగ్రెసేతర ప్రభుత్వ స్థాపనకు బలాన్ని చేకూర్చారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలకూ నేను చెప్పేదేమిటంటే, ఎన్టీఆర్ కి ఘటించగలిగే అత్యుత్తమమైన శ్రద్ధాంజలి ఏమిటి. అది కాంగ్రెస్ నుంచి విముక్తి కలిగించిన్పుడే. ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకునేవారి లక్ష్యమేమవాలంటే భారత దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తి కలిగించటం. దానికోసం ఏం చెయ్యాలో అది చెయ్యాలి.
ఆంధ్రా తెలంగాణాలో కాంగ్రెసేతర ప్రభుత్వం వస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అప్పుడే ఈ అవినీతి, తోడబుట్టినవాళ్ళ మధ్య శత్రుత్వం ఇవన్నీ నశిస్తాయి. అందువలన ఎన్టీఆర్ ఆశయాన్ని పూర్తి చెయ్యటం తెలుగుదేశం పార్టీ కర్తవ్యమవుతుంది.
అవినీతి మన దేశాన్ని సర్వనాశనం చేసింది. భూమి లోపల, భూమి మీద, నీళ్ళ మీద, గగనంలో అంతరిక్షంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళు అవినీతికి పాల్పడని ప్రదేశమనేది భూమండలంలోనే లేదు. మా సీనియర్ నాయకుడు లాల్ కిషన్ అద్వానీ గారు భారతదేశమంతా పర్యటించారు. ఎందకని, నల్లధనాన్ని దేశానికి రప్పించటానికి. విదేశ బ్యాంకల్లో నల్ల ధనం మూలుగుతుందికదా, దాన్ని దేశానికి రప్పించటంలో ఢిల్లీ ప్రభుత్వమెందుకు వెనకాడుతోంది. అద్వానీ గారు చైతన్య యాత్ర చేసింది దేశ ప్రయోజనం కోసమే. నల్లధనం తిరిగి రప్పించటం కోసమే కానీ, ఢిల్లీ సర్కారు అడ్డుకుంది. దానితో ఆ నల్లధనం ఎవరికి చెందింది అనే ప్రశ్న ఉదయిస్తుంది- విదేశీ బ్యాంకుల్లో పడివున్న ధనం ఎవరిది అని.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేదేమిటంటే, రాష్టంలో చూస్తే అభివృద్ధి లేదు. పోనీ మీకిష్టం లేకపోతే గుజరాత్ తో పోల్చి చూడకండి కానీ మీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడుని చూడండి. డా.జయలలిత ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందో చూడండి. వాళ్ళనైనా చూసి ఆంధ్రప్రదేశ్ యువతకోసం పాటుపడవచ్చు కదా. ఇప్పటికీ ఢిల్లీ సర్కార్ కి బీదవారి కడుపు ఎలా నింపాలో అర్థం కావటం లేదు. నేను ఢిల్లీ సర్కారుని, కాంగ్రెస్ నాయకులను అడిగేదేమిటంటే, దివంగత రమణ కుమార్ మార్గం చూపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీదలకు మంచి చేసే విషయంలో అవగాహనను పెంచుకోవటం కానీ నేర్చుకోవటం ఇష్టం లేదు, చెయ్యటమూ ఇష్టం లేదు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో డాలరు విలువ రూపాయల్లో ఎంతో తెలుసా. ఒక డాలరు ఒక రూపాయితో సమానం. ఇప్పుడు డాలరుకి రూపాయలు మన ఆర్ధిక మంత్రి వయసంత. ఒక డాలరు ఒక్కోసారి 64, 65 రూపాయలు. మన దేశం నుండి విదేశాలకు చదువుకోవటానికి ఎంత మంది వెళ్తున్నారో మన దేశపు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఒకప్పుడు విదేశాల నుంచి మన దేశానికి విద్యనభ్యసించటానికి వచ్చేవారు. ప్రపంచ వ్యాప్తంగా యువత భారతదేశం వచ్చి విద్యాభిక్షను పొందేవారు. మన దేశం నుంచి ఎందరో యువతీ యువకుల విదేశాలకు వెళ్ళిపోయారు. దానితో మన మేధస్సు, మన ధనం కూడా విదేశాలకు వెళ్ళిపోయింది. వాళ్ళ చదువులకోసం వెచ్చించిన ఫీజులతో మన భారత దేశపు ఖజానాలోంచి లక్షల కోట్ల రూపాయలు ఖాళీ అయిపోయాయి. అయినా మన ప్రభుత్వం మన యువతకు ఇక్కడే విద్య లభించాలని, ఎక్కడికీ పోవలసిన అవసరం లేదని ఆలోచించటేలేదు. గ్రామాల్లో వైద్యులుండరు. బీదవాళ్ళకు మందులు లేవు. ఇన్ని సంవత్సరాల అనుభవంగల ప్రభుత్వం మన దేశ అవసరాలకనుగుణంగా వైద్యులను తయారు చేసే పని చేపట్టగూడదా. దానికవసరమైనన్ని మెడికల్ కాలేజీలను స్థాపించగూడదా. ఆంధ్రా గుజరాత్ లలో ఔషధాల ఉత్పత్తి రంగంలో బాగా పనిచేస్తున్నాయి. మందులైతే తయారవుతున్నాయి కానీ ఆ మందులను ఉపయోగించే డాక్టర్లు లేరు. ఇక బీదల వ్యాధుల నిర్మూలన ఎలా జరుగుతుంది.
ఎలాంటి సమస్యలున్నాయో చూడండి. తినటానికి సరిపడా తిండిలేదు, కట్టుకోవటానికి కావలసినంత బట్ట లేదు, ఉండటానికో నీడ లేదు, వ్యాధి గ్రస్తులకు అవసరమైన వైద్యం లేదు, చదువుకోవటానికి సరిపడా పాఠశాలలు లేవు. ఇదంతా కాంగ్రెస్ మూలకంగానే.
దేశం భవిష్యత్తు ఎలా ఉంటుందనే దాని మీద మీకు చింత ఉంటే దేశ భవిష్యత్తుని చక్కదిద్దాలని మీకుంటే, దానికి మార్గం వెతుక్కోవలసిన అవసరమెంతైనా ఉంది. అభివృద్ధి మార్గం తప్ప సామాన్య మానవులు, ఆదివాసులు, దళితులు, మత్స్యకారులు వీళ్ళందరి సంక్షేమాన్ని ఎవరు చూస్తారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది. ఏమీ లేదు. ఎన్నికలొచ్చాయంటే డబ్బు ఖర్చు పెట్టటం, వోట్లు పొందటానికి మార్గాలు వెత్తుక్కోవటం, ఇవే తప్ప మరో మార్గమేమీ తోచదు.
అందువలన మీ అందరికీ నేను చెప్పదలచుకున్నదేమిటంటే, ఈ హైద్రాబాద్ గడ్డ మీది నుంచి సంపూర్ణ భారతదేశాన్ని అర్థించేదేమిటంటే, ఈ దేశ వాసులందరికీ దేశం గురించి చింత వుంది. యువతంతా బాధపడుతోంది. వాళ్ళకి మనం భరోసా ఇవ్వకపోతే, వాళ్ళ నమ్మకాన్ని చూరగొనకపోతే, శక్తి ఉండీ సామర్థ్యం ఉండీ చేతిలో పనిలేని వాళ్ళున్నారు. మన యువతకు ఉపాధి కలిగించకపోతే ఈ దేశ పరిస్థితి ఏమవుతుందన్నది మీరు ఊహించుకోవచ్చు.
నేను ఈ రోజు హైద్రాబాద్ గడ్డ మీద అడుగుపెట్టాను. ఈ రోజు ప్రభుత్వం ఏమని అనుకుంటుందో నేను మీకు చెప్తాను. నిజానికి ప్రభుత్వానిది ఒకటే మతం. అదేమిటంటే ఇండియా ఫస్ట్. ఇండియా ఫస్ట్ అన్నదే ప్రభుత్వం అనుసరించే మతం. ప్రభుత్వానికి ఉండేదే ఒకే మత గ్రంథం. అది రాజ్యాంగం. ప్రభుత్వానికి ఉండవలసిన భక్తి ఒక్కటే. అది భారత దేశభక్తి. ప్రభుత్వానికి ఉండేది ఒకటే శక్తి . అది కోటి కోటి జన శక్తి. సర్కర్ కి ఉన్న శక్తి జనశక్తి. ప్రభుత్వం పూజించవలసింది 125 కోట్ల జనతా సంక్షేమం. అందరికోసం అనేదే పఠించాల్సిన మంత్రం. అదే మన దేశ భవిష్యత్తుని మార్చివేస్తుంది. అందుకోసం దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తిని కలిగించాలి."
చివర్లో మోడి అందరితో ఇలా పలికించారు. శక్తినంతా ఉపయోగించి గట్టిగా చెప్పమన్నారు. రెండు చేతులనూ పైకెత్తి చెప్పమన్నారు. నేను అనేది మీరూ అనాలి అని అన్నారు.
"యస్ వియ్ కెన్. (అందరూ అన్నారు) మళ్ళీ చెప్పండి. యస్ వియ్ కెన్. (అందరూ అన్నారు) యస్ వియ్ కెన్. (అందరూ అన్నారు) యస్ వియ్ డు. (అందరూ అన్నారు) యస్ వియ్ డు. (అందరూ అన్నారు)
"నాతో పాటు అనండి, జై తెలంగాణా. (జై తెలంగాణా) నాతో పాటు అనండి, జై సీమాంధ్రా. (జై సీమాంధ్ర) జై తెలంగాణా. (జై తెలంగాణా) జై సీమాంధ్రా. (జై సీమాంధ్రా) భారత్ మాతా కీ (జై), భారత్ మాతా కీ (జై) వందే (మాతరం), పూర్తి శక్తినంతా ఉపయోగించి అనండి నా మిత్రులారా,
వందే (మాతరం), వందే (మాతరం), వందే (మాతరం).................." అలుపులేకుండా మళ్లీ మళ్ళీ అంటూ అనిపిస్తూ ముగించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more