ముంబైలోని ఓ ప్రముఖ గేమింగ్ కంపెనీలో ఆదిత్య (దుల్కర్ సల్మాన్) ఉద్యోగం సంపాదించుకుంటాడు. కంపెనీలో జాయిన్ అయ్యేందుకు ఆదిత్య ముంబై స్టేషన్లో దిగగానే.. అక్కడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న తార(నిత్యామీనన్)ను చూస్తాడు. అప్పుడు అతను ఆమెను ఒప్పించి ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించేలా చేస్తాడు.
తర్వాత కొంత కాలానికి వీరిద్దరూ ఓ ఫంక్షన్లో కలుసుకోవడం, ఇద్దరూ అతి కొద్ది కాలంలోనే దగ్గరైపోవడం జరిగిపోతుంది. తారకు తాను పెరిగి వచ్చిన పరిస్థితుల వల్ల ఆమెకు పెళ్ళి అనే కాన్సెప్టే నచ్చదు. ఇక నిత్యం అమ్మాయిలను మార్చుతూ వుండే ఆదిత్యకు కూడా పెళ్ళి అనేది నచ్చదు. యూఎస్ వెళ్ళిపోయి ఏదైనా పెద్ద కంపెనీ పెట్టాలన్నది ఆదిత్య ఆశయం, పారిస్ వెళ్ళి ఆర్కిటెక్చర్ చదువుకోవాలన్నది తార కల. వీరిద్దరూ తమ తమ కలలను నెరవేర్చుకోవడానికి మధ్యగల ఆరు నెలల సమయంలో సహజీవనం చేయాలనుకుంటారు.
అప్పుడు ఆదిత్య తాను నివాసం వుండే ఇంటి ఓనర్ గణపతి (ప్రకాష్ రాజ్), అతని భార్య భవాని (లీలా శామ్సన్)లను ఒప్పించి వారిద్దరు సహజీవనం చేస్తుంటారు. ఇక ఆరు నెలల సమయం ముగిసిన అనంతరం వారిద్దరూ ఒకరినొకరు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళలో ఎలాంటి మార్పు వచ్చింది? గణపతి-భవానిల జంట నుంచి వారిద్దరూ ఏం నేర్చుకున్నారన్నది తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే!
దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న మణిరత్నంకు గత కొంతకాలంగా ఒక్క విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తన పాత ఇమేజ్ ని తిరిగి పొందేందుకు తన బంగారంతో కలిసి ప్రయత్నం చేశారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా ‘ఓకే బంగారం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు మణిరత్నం. మరి ఈ సినిమా ద్వారా ఆయన మళ్ళీ తన మార్క్ చూపెట్టారా? లేదా అన్నది తెలుసుకుందాం..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో బలమైన కథ లేదు కానీ.. మణిరత్నం స్క్రీన్ప్లే మాత్రం ఈ మూవీకి ప్రధానం బలంగా చెప్పుకోవచ్చు. సాధారణ కథలో కొన్ని బలమైన అంశాలను ఒడిసిపట్టి.. స్క్రీన్ప్లేలో ఆ అంశాలను ఒక్కొక్కటిగా తెరకెక్కించిన విధానం అందరినీ అబ్బురపరుస్తుంది. మొదటి పది నిమిషాలకే కథలోకి తీసుకెళ్లన మణి.. దాంతోనే ఇంటర్వెల్ వరకూ ప్రేక్షకులను కదలనీయకుండా కథ చెప్పడం సినిమాకు ప్లస్ పాయింట్. ఇక సెకండాఫ్లో వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం అద్భుతమనే చెప్పాలి.
ఇక దుల్కర్, నిత్యామీనన్ల కెమిస్ట్రీ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. వీరిద్దరు క్లైమాక్స్ లో మరింత అద్భుతంగా నటించారు. ఇక ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్లు తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. ముఖ్యంగా వీరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు అందరినీ కట్టిపడేస్తాయి. పాటలన్నీ సందర్భానుసారంగా వస్తూ సినిమాకు మరింత అందాన్ని చేకూర్చాయి. సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.
ఆదిత్యగా నటించిన దుల్కర్ సల్మాన్ చాలా బాగా నటించాడు. నాని అందించిన డబ్బింగ్ దుల్కర్ పాత్రను మరింత ఎత్తులో నిలబెట్టింది. తారగా నటించిన నిత్యామీనన్.. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయే.. అందులో మరొకరిని ఊహించే అవకాశం కల్పించలేదు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథాంశం కొత్తదైనా కథ మాత్రం చాలా పాతదే! అయితే.. మణిరత్నం లాంటి జీనియస్ దర్శకుడు ఇలాంటి ఈ కథను ఫార్ములా సన్నివేశాల ద్వారానే మొదలుపెట్టడం, అలాగే ముగించడం కొంత నిరుత్సాహపరుస్తుంది. ఫస్టాఫ్ను, సెకండాఫ్లోని మొదటి ఇరవై నిమిషాలను చాలా తెలివిగా చెప్పి, ఆ తర్వాత ప్రీక్లైమాక్స్ వరకూ గల విలువైన భావోద్వేగాన్ని క్యాప్చర్ చేయగల సన్నివేశాలను అంతగా పట్టించుకున్నట్టు కనిపించదు. ఇక ఇలాంటి అందమైన ప్రేమకథల్లో కామెడీ సన్నివేశాలని జొప్పించలేరు కాబట్టి.. అలాంటి సీన్లను కోరుకునే వారికి ఇది కొంత నిరుత్సాహ పరిచే అంశం.
సాంకేతిక విభాగం :
మణిరత్నం గురించి చెప్పుకుంటే.. తనకు మాత్రమే సాధ్యమయ్యే కొన్ని భావోద్వేగాలను తెరకెక్కించే టెక్నిక్ను ఈ సినిమాలో ప్రతీ సీన్లో చూడొచ్చు. ఎప్పుడెప్పుడు మణిరత్నం తన స్థాయి సినిమా తీస్తాడా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ‘ఇదీ మణిరత్నం సినిమా’ అనే విషయాన్ని మరోసారి తీసి చూపించారు. తెలిసిన కథనే తెలియని కోణంలో తెరకెక్కించడం మణిరత్నం ఫిల్మ్మేకింగ్ టెక్నిక్ ఏ స్థాయిదో చెప్పే చిన్న ఉదాహరణ ఈ సినిమా.
పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది. ఏ.ఆర్.రెహమాన్ పాటలు ఎంత బాగున్నాయో, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రీ రికార్డింగ్ అంతకుమించి బాగున్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పర్ఫెక్ట్గా ఉంది. చాలా సన్నివేశాల్లో ప్రేక్షకుడి మూడ్ని క్యాప్చర్ చేయడంలో ఎడిటింగ్ పనితనం ఆకట్టుకుంటుంది.
చివరగా :
ఓకే బంగారం.. ఈ బంగారం విలువ మార్కెట్లో అంతంత మాత్రమే!