ఈ మూవీ కథ ఓ వేశ్యాగృహంలో మొదలవుతుంది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న దుర్గ (అంజలి పాటిల్) అక్కడినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి దొరికిపోతుంది. ఆ బాధలో గతం గుర్తు చేసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో... తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం లో దుర్గ పదవ తరగతి చదువుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివినా.. రాష్ర్టంలో 8వ ర్యాంక్ సాధిస్తుంది. పై చదువులు చదివేందుకు హైదరాబాద్ వెళ్ళాలని భావిస్తుంది. అయితే నాన్న శ్రీనివాస్(సిద్ధిక్)కు దుర్గ అంటే చాలా ఇష్టం.., ఆమెలేకుండా ఉండలేనని నగరానికి పంపేందుకు ఒప్పుకోడు. అయితే తండ్రికి తెలియకుండా దుర్గ హైదరాబాద్ లోని కాలేజీలో సీటుకు దరఖాస్తు చేసుకోగా, సీటు వస్తుంది. కాలేజీలో చేరేందుకు తండ్రికి తెలియకుండా హైదరాబాద్ వచ్చి బ్రోతల్ హౌజ్ గ్యాంగ్ కు దొరుకుతుంది. ఆ తర్వాత పది రోజుల పాటు నిత్యం చిత్రవధ అనుభవిస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు కొన్ని కఠోర నిజాలు తెలుస్తాయి. ఇంతకీ ఏమిటా నిజాలు... బ్రోతల్ హౌజ్ నుంచి బయట పడుతుందా లేదా అనేది థియేటర్ కు వెళ్ళి చూడండి.
విడుదలకు ముందే 3 నేషనల్ అవార్డులు గెలుచుకుని మంచి సినిమా అనే పేరుతో ‘నా బంగారు తల్లి ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశీస్సలు అందించారు. తండ్రి, కూతురు మద్య అన్యోన్యత, సమాజంలో ఉండే ఇబ్బందులు నేపథ్యంగా తెరకెక్కింది. ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు చిరంజీవి, సమంత సహా అనేక మంది తారలు సహకారం అందించి ప్రచారం కల్పించారు. నేషనల్ అవార్డులు, ఇండోనేషియన్, ట్రినిటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఎలా ఉందో.., ఇప్పుడు చూద్దాం.
ప్లస్ పాయింట్లు :
ఈ సినిమాకు మూడు నేషనల్ అవార్డులు రావటమే అతిపెద్ద ప్లస్ పాయింట్. వాస్తవ ఘటన కావటం మరొక ప్లస్ పాయింట్. ఇక నటి అంజలి నటన చాలా బాగుంది. తండ్రిగా క్యారక్టర్ లో సిద్ధిక్ కూడా పాత్రకు న్యాయం చేశాడు. ఫస్ట్ ఆఫ్ అంతా ఊరి వాతావరణం మంచి కథ,కధనంతో సాగిపోయే స్టోరీ.. సెకండ్ ఆఫ్ లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వల్ ట్విస్ట్ కూడా చాలాబాగా చూపించారు.
మైనస్ పాయింట్లు :
మంచి సినిమా, మంచి ప్రయత్నానికి వంకలు పెట్టకూడదు. ఇక్కడ యధార్ధ ఘటనను వదిలేసి మిగతా మైనస్ ల గురించి ప్రస్తావించుకుందాం. సినిమా అంతా ఒక యధార్ధ ఘటనను మాత్రమే చూపించారు. స్పష్టమైన జస్టిఫికేషన్ అంటే.., అలాంటి ఘటనల వల్ల కలిగే ఇతర ఇబ్బందులు వంటి కొత్త కోణాలను చూపించలేదు. వాస్తవ కధ అని చెప్పినా ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ చేయటంలో డైరెక్టర్ విఫలం అయ్యాడు. ఓహో ఇలా జరిగిందా అని తెలుసుకోవటం తప్ప.. స్వయంగా తమకు జరుగుతున్నట్లు ఫీల్ అవ్వరు. జనరల్ ఆడియన్స్ కోరుకునే కామెడి, గ్లామర్ పాటలు లేవు.
డైరెక్టర్ కథ ఎంపిక బాగున్నా.., దాన్నే పట్టుకుని వేలాడాడు. రియల్ స్టోరీ కావటంతో రియాలిటి లుక్ కోసం లైట్లు వాడకుండా సినిమాటోగ్రాఫర్ కెమెరా ఉపయోగించాడు. లైట్లు లేని లోపం స్పష్టంగా కన్పిస్తుంది. సంగీతంకు ఇద్దరు ఉన్నా ఫలితం లేదు. నిర్మాణ విలువలు నామమాత్రం. అంటే న్యాచురాలిటీ కోరుకున్నారు కాబట్టి ఎక్కువగా హంగులు చూపించలేదు ఇది వారి తప్పు కాదనుకొండి. ఈ సినిమాలో కథ కాకుండా బాగున్నవి అంటే డైలాగ్స్ మాత్రమే, ఇందుకు సురేష్ ను మెచ్చుకోవాలి.
చివరగా : ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ మూవీ రియాలిటీ, న్యాచురాలిటీ కోరుకునేవారికి నచ్చుతుంది.