కోర్టు కేసులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న (రెహమాన్), అతని అక్క సానియా (అంజలి) బతుకుదెరువు కోసం తన మామయ్య ఎమ్మెస్ నారాయణ పనిచేస్తున్న భీమరాజుపాలెంలోని ఓ ఆసామి అయిన బలరామ్ (వెంకటేష్) దగ్గరకి పనికోసం వస్తారు. తన కులం ముస్లీం అయిన రామ్ ఆ ఊర్లో మూసి ఉన్న కోవెల తలుపులను తెరవాల్సివస్తుంది. ఓ ముస్లిం కోవెల తలుపులు తీశాడని తెలిస్తే ఆ ఊర్లో మత ఘర్షణలు జరుగుతాయనే భయంతో రెహమాన్ ని అతని స్నేహితుడు అయిన (ఆలీ) ద్వరా బలరాం కి రామ్గా పరిచయం చేస్తాడు. అయితే ఓ సందర్భంలో రామ్ మజిద్ లో నమాజ్ చేసుకోవడం చూస్తాడు బలరామ్. తాను చెప్పిన అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక అబద్దాలు ఆడాల్సి వస్తుంది. అబద్దాలు ఆడే వాళ్ళంటే నచ్చని బలరాం కి దొరకకుండా ఎన్నాళ్ళు ఉంటారు ? బలరామ్ కి నిజాలు తెలిసిన తరువాత ఏం జరింగింది అనేది తెలుసుకోవాలంటే ‘మసాలా ’ చూడాల్సిందే.
సినిమా దర్శకులకు కొత్త కథ దొరకడం లేదో, లేక రాయాలనే ఆలోచన తట్టడం లేదో గానీ ఇటీవలి కాలంలో పరభాష చిత్రాల్ని రీమేక్ చేయడం బాగా అలవాటు అయ్యింది. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అక్కడ హిట్ అయిన సినిమాల్ని ఇక్కడి స్టార్స్ తో రీమేక్ చేస్తున్నారు. అదే కోవలోకి వస్తుంది ఈ ‘మసాలా ’ సినిమా. బాలీవుడ్లో వచ్చిన ‘బోల్బచ్చన్’ సినిమాఅక్కడ మంచి విజయాన్ని సాధించింది.
అభిషేక్బచ్చన్కి తొలిసారి వంద కోట్ల క్లబ్లో చోటు సంపాదించిపెట్టిన ఆ చిత్రాన్ని తెలుగులో ‘మసాలా’ పేరుతో రీమేక్ చేశారు. ‘మసాలా’ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిన దర్శకుడు రోహిత్ శెట్టి ఈ సినిమాను అక్కడ సూపర్ చేశాడు. తెలుగులో విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఉత్సాహం నింపిందో ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.
కామెడీనే ప్రధానంగా తీసుకొని ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఓ రేమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారంటే వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు కథలో మార్పులు చేయాలి. కానీ అవేమి చేయకుండా బాలీవుడ్ దర్శకుడు ఓ పాత చింతకాయ పచ్చడి లాంటి కథను తీసుకొని తనకు అనుగుణంగా మలుచుకొని హిట్టుకొడితే దాన్నే మళ్ళీ తెలుగు జనాలకు చూపించి బకరాలను చేశారు. గతంలో ఇలాంటి పాత్రలు కలిగిన సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ ఇలా ఇద్దరు స్టార్ హీరోలు తెలుగులో నటించిన చిత్రం ఇదే అవుతుంది.
బాలీవుడ్ లోనే బోలెడన్నీ బొక్కలు(లొసుగులు) ఉన్న ఈ చిత్రాన్ని సేమ్ టు సేమ్ దింపడం పెద్ద డ్రా బ్యాక్. ఎలాగు హిట్టు సినిమానే కదా అని ఇంకాస్త బెటర్గా ఏమి చేయవచ్చుననేదిఅస్సలు ఆలోచించలేదు. సీన్స్లో వెంకటేష్ పర్ఫార్మెన్స్, జయప్రకాష్రెడ్డి రియాక్షన్స్ నవ్విస్తాయి. బోల్బచ్చన్లో అజయ్దేవ్గణ్ అసిన్ ట్రాక్ని అండర్ డెవలప్డ్గా వదిలేశారు. ఇక్కడ వెంకటేష్-అంజలి ట్రాక్ని కూడా అలాగే అర్థం లేకుండా నడిపించారు. విజయభాస్కర్ తెలుగు ప్రేక్షకుల హాస్యాభిరుచికి తగ్గ క్వాలిటీ కామెడీని రూపొందించడంలో ఫెయిలయ్యాడు. తెరపై కనిపించిన ప్రతీ పాత్ర కామెడీగానే ఉంటుంది. ఇంట్రవెల్ వరకూ కథ అంగుళం కూడా ముందుకు కదలదు. సెకండాఫ్ అంతా చిందర వందరగా ఉంటుంది.
కాస్త కామెడీ ఉంటే కాలక్షేపం అయిపోతుందనుకునే వారు ‘మసాలా ’తో సంతృప్తి పొందవచ్చు. కానీ వెంకటేష్, రామ్ సినిమా కదా అని భారీ ఆశలు పెట్టుకొని థియేటర్ కి వెళ్లిన వారికి ‘మసాలా ’ కాదు కదా దాని వాసన కూడా రాదు.
ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ నటన గురించి చెప్పేదేముంది. గత కొంత కాలంగా కామెడీ పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పాత్రల్లో రాణించడం అతనికి అలవాటే. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తరువాత అలాంటి పాత్ర పోషించిందంటే ఈ సినిమాలనే అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో యాక్షన్ ఓవరాక్షన్ అయినా, తన నటనతో ఆకట్టుకున్నాడు. వయస్సు మీద పడ్డ వెంకీకి ఇలాంటి పాత్రలే సూటవుతాయన్నట్లుగా నటించాడు. రామ్ ఎనర్జీ ఈ సినిమాకి ప్రాణం పోసింది. గే క్యారెక్టర్లో రామ్ బాడీ లాంగ్వేజ్, అతని నటన బాగానే ఉంది. ఇలాంటి పాత్రలు పోషించడానికి హీరోలు కాస్త జంకుతారు కానీ రామ్ ఎలాంటి బెరుకు లేకుండా ఫోషించి తన వరకు న్యాయం చేశాడు.
అంజలి ముఖం మునపుటిలా అనిపించలేదు. అదీ గాక పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. ఎమోషనల్ సీన్స్ని యావరేజ్గా చేసింది. షాజాన్ పదాంసీ ‘ఆరెంజ్’లో బాగుంది కానీ ఇప్పుడు మరీ పీలగా అయిపోయి ఆకట్టుకోలేకపోయింది. నటనలో తేలిపోయింది. కోవై సరళ రామ్ కి తల్లి పాత్రలో కాసేపు అలరించింది. జయప్రకాష్ రెడ్డి మాస్ పాత్ర పోషించాడు. అలీ, ఎమ్మెస్ నారాయణ కూడా సిట్యువేషనల్ కామెడీ పండిరచడానికి అప్పుడప్పుడూ ఉపయోగపడ్డారు. మిగతా వారు తమ పరిధిమేరకు నటించారు.
సాంకేతిక విభాగం
ఓ హింధీ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు ఇక్కడి వారి నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు చేసి చేస్తారు. కానీ హిందీలో రోహిత్ శెట్టి చిత్రం కాబట్టి అక్కడ సూపర్ హిట్ అయింది. అదే ఫార్ములాను దర్శకుడు విజయ్ భాస్కర్ మక్కీకి మక్కి దించాడు. డైలాగులు, ఫైట్స్ ఇలా ఒక్కటేమిటీ అన్నీ అచ్చుగుద్దాడు. హిందీ డైలాగుల్నే తెలుగులోకి తర్జుమా చేసి వెంకీ చేత పలికించారు. తమన్ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సెంటిమెంట్ సన్నివేశాలలో రచించిన సంభాషణలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది.
ఎడిటర్ కి పెద్దగా పనిలేకుండా పోయింది. ఎందుకుంటే ఆ సీన్స్ నే ఇక్కడ సేమ్ టు సేమ్ చేశారు కాబట్టి. దర్శకుడు రోహిత్ శెట్టి మనుషుల్ని, సుమోల్ని, ఇతర వాహనాల్ని ఎగరేయడం సరదా.. అక్కడ ఆయన సదరా తీరనట్లు ఇక్కడ విజయ్ భాస్కర్ మరోసారి బౌన్సర్లలా వాటిని ఎగిరించి ఆయన సరదా తీర్చాడు. 35 కోట్ల సినిమాలా లేదు పాతిక రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్టు అనిపించదు. నిర్మాతలు ఖర్చయితే పెట్టారు కాని కరెక్ట్ గా పెట్టలేదు. రీమేక్ సినిమాలు ఇలా అద్దుగుద్దినట్లు తీయడానికి దర్శకుడు అవసరం లేదు. అన్నీ తెలిసిన కెమెరామెన్ కూడా చేయగలడు.