ఇరాక్ లోని రాజకీయ సంక్షోభానికి ప్రముఖంగా ముస్లింలలో ఒక వర్గమైన సున్నీలు తమ సంస్కృతిని విస్తరింపజేయటానికి మరో వర్గమైన షియాల మీద కత్తికట్టటం, ఆ పోరాటంలో సున్నీలైన ఐఎస్ఐఎస్ మిలిటెంట్లకు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుంచి కూడా పూర్తి మద్దతు లభించటమే కారణం. ఇరాక్ లో ఉన్న సున్నీ సైనికులు ఐఎస్ఐఎస్ తో పోరాడటానికి ఇష్టపడక పారిపోగా, మిగిలిన షియాలు తమ సంస్కృతిని కాపాడుకునే దిశగా తమ రాజ్యాన్ని రక్షించుకుంటున్నారు.
క్రమక్రమంగా ఇరాక్, సిరియా దేశాల మీద ఆధిపత్యాన్ని సంపాదించుకుంటూ ఐఎస్ఐఎస్ పైకి ఎదుగుతుంటే మరో పక్క దాని ప్రభావం భారత దేశం మీద కూడా పడుతోంది. ఐఎస్ఐఎస్ కమాండర్ గా ప్రకటించుకున్న అబు బక్ర్ అల్ బాగ్ధాది ఎన్నో దేశాల మీద శత్రుత్వం ఉన్నట్లుగా ప్రకటించటం జరిగింది. అందులో భారతదేశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ల చర్యలను నిరసిస్తూ, భారత దేశంలో ముస్లిం ల మీద వహాబీ సంస్కృతిని అద్దటానికి కొన్ని ముస్లిం సంస్థలు ప్రయత్నిస్తున్నాయని కొందరు వాపోతున్నారు.
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థ ఇస్లాం లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే సంస్థ. వాళ్ళు అనుసరించేది వహాబిజమ్. దాన్ని భారత దేశంలో హనాఫీ సంస్కతిలో జీవించే ముస్లింలను వహాబిజమ్ లోకి దించటానికి చేసే ప్రయత్నం 2010 నుంచి జరుగుతోందని భారత నిఘా సంస్థ తెలియజేస్తోంది. ముంబైలోని పఠాన్ వాడీ ప్రాంతంలోని వహాబీలు సమీపంలోని సున్నీ మస్జీద్ ని ఆక్రమించుకుని నియంత్రించటమే ఇందుకు తార్కాణమని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక తెలియజేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాంటి చర్యలే కనిపించాయి.
సౌదీ అరేబియాకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ కేవలం వహీబీ సంస్కితిని ప్రపంచంలో విస్తరింపజేయటానికే నడుంకట్టి ఖండాతరాలలోకి వెళ్తోందని కూడా నిఘా సంస్థ చెప్తోంది. ఉదాహరణకు నాగ్ పూర్ లోని ఒక మస్జీద్ పరిస్థితి అంత బాగోలేదు. కానీ దాన్ని పునరుద్ధరించటానికి కావలసిన నిధులు కూడా ఆ మస్జీద్ నిర్వాహకుల దగ్గర లేవు. అటువంటి అవకాశాన్ని చూసిని వహాబీ ప్రచార సంస్థ ఆ మస్జీద్ ని పునర్నిర్మించటానికి అవసరమైన నిధులను చేతికి ఎముక లేకుండా సరఫరా చేసి ఆ మస్జీద్ నియంత్రణను తన చేతిలోకి తీసుకుందామని అనుకుంటోంది.
వహాబీలు అలా మస్జీద్ ల మీద నియంత్రణను స్థాపించాలనుకుంటూనే ఆ సౌదీ మస్లిం మత గురువులు మదారసాల నియంత్రణ కోసం కూడా కృషిచేస్తున్నారు.
నిఘాసంస్థ నివేదిక ప్రకారం భారత్ లో మొత్తం 50000 మదారసాలున్నాయి. అందులో చాలావరకు వహాబీల నియంత్రణలోకి పోయాయి. భారత్ లోని ముస్లిం వర్గాలు దీన్ని గమనించి మదారసాల నియంత్రణను తిరిగి తమ చేతుల్లోకి తీసుకుంటాయని ఆశిస్తున్నామంటూ నిఘా సంస్థ అధికారి అన్నారు.
ఇది ఇలా ఉండగా, వహాబీ సంస్కృతిని అనుసరించే ఒక కేరళ వాసి తన పేరును గుప్తంగా ఉంచమని కోరుతూ, ఈ సంఘటనల్లో వహాబీలు కాని వారే ఎక్కువగా లాభాన్ని పొందుతున్నారని అన్నారు. అంతేకాదు, అసలు ఇస్లాంని ప్రభోదించేది మేమే అని, సూఫీ ఆలయాలలో పూజలు అనుమతించరానిదని, నిజమైన ఇస్లాం మార్గాన్ని ఎందుకు ప్రతిఘటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
మరోపక్క భారతదేశంలో పెరిగిపోతున్న వహాబీ సంస్కృతిని కనిపెట్టి దానికి ప్రతిగా చాలా మస్జీద్ లలో ప్రార్థనా సమయంలో వహాబీ సంస్కతి పట్ల నిరసనను తెలియజేస్తూ ఆ సంస్కృతి విషప్రభావం గురించి చెప్పటం మొదలుబెట్టారు. రంజాన్ నెలలోనే రక్తాన్ని చిందించటం, ముస్లింలను సంప్రదించకుండా వాళ్ళే ఇస్లామ్ కి వారసులమని చెప్పుకోవటం సరికాదంటూ శుక్రవారం ప్రార్థనల్లో చెప్పటం ప్రారంభించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యుడు ఎస్ క్యు ఆర్ ఇలియాస్ భారత్ లో వహాబీ ప్రభావం గురించి స్పందిస్తూ, భారత్ లోని ముస్లిం సోదరులు వహాబీ సంస్కృతిని సమ్మతించరని, కానీ దురదృష్టవశాత్తూ వహాబీయిజాన్ని ప్రచారం చెయ్యటంలో విదేశీ ధన ప్రవాహం పెద్ద పాత్రను పోషిస్తోందని అన్నారు.
ఏమిటీ వహాబీయిజమ్?
ముస్లింలలో ఉగ్రవాద శాఖ వ్యవహార శైలే వహాబీయిజం. వీళ్ళు ముస్లింలలో సనాతన ధర్మాన్ని పాటిస్తూ, అందులో నిష్ణాతులై తమకు తాము పవిత్రమైన ఇస్లామ్ ను అనుసరించేవారుగా చెప్పుకుంటారు. తిరిగి ఖురాన్ హడిత్ లో సూచించిన ముస్లిం సంస్కృతిని పునరుద్ధరించే కార్యక్రమాన్ని తలపెట్టిన వారే ఈ వహీబీలు.
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం చెలరేగటానికి మూలమే వహాబియిజమ్ అని జూలై 2013 లో గుర్తించిన యూరోపియన్ పార్లమెంట్, ఇది ఇతర ముస్లిం వర్గాలకు చేటు కలిగిస్తుందని, ముస్లిం మతానికే ప్రమాదకరంగా తయారవుతుందని కూడా పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వహాబీయిజమ్ ఉన్న దేశాలు కతార్, యుఏఇ, సౌదీ అరేబియా. సౌదీలో 23 శాతమైతే, కతార్ లో 47 శాతం, ఎమిరేట్స్ లో 45 శాతం వహాబీయిజాన్ని అనుసరించేవారున్నారు. అల్ ఖైదా, తాలిబాన్లు, ఐఎస్ఐఎస్ లు వహాబీయులే.
వహాబీయిజమ్ ప్రకారం ఇస్లాంకి వ్యతిరేకుల మీద కఠిన మైన శిక్షలు అమలు పరచవలసిందే. అది తల తెగనరకటమే కావొచ్చు, చచ్చిపోయేంతవరకు రాళ్ళతో కొట్టటమే కావొచ్చు.
దక్షిణాసియాలో వహాబీయిజాన్ని ప్రచారం చేసేవారు సూఫీయిజం, అందులోని సంగీతాన్ని వ్యతిరేకిస్తారు. కేవలం వాహాబీయిజమ్ సూత్రాలను పాటించి ఆ ప్రార్థనలే చెయ్యాలని చెప్తున్నారు.
సౌదీ అరేబియావాసులు తమ దగ్గరున్న పెట్రో డాలర్లను కుమ్మరించి వహాబీయిజాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంపొందించుదామని ప్రయత్నిస్తున్నారని అందుకోసమే మస్జీదులు, మదారసాల నియంత్రణను చేతిలోకి తీసుకోవాలని చూడటం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో నిజమైన ఇస్లాం లోకి రమ్మంటూ ప్రభోధించటం జరుగుతోంది. సహనాన్ని చూపించకపోవటం, హింసలకు పాల్పడటమే ఆచారంగా మతానికి చెందిన సంస్థలలోని విద్యార్థులకు బోధిస్తూ వహాబీలు కానివారిని పాపాత్ములుగా పరిగణించి నరకంలో మంటల్లో వేయటం జరుగుతుందని చెప్తారు.
ఇరాక్ లో షియాల దేవాలయాలను ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ధ్వంసం చేసిన ఫొటోలను చూడవచ్చు.
{besps}Wahabis{/besps}
ఇరాక్ లో మాసుల్ లో ఒక మస్జీద్ లో మాట్లాడుతున్న అబు బక్ర్ అల్ బాగ్ధాదీని కూడా ఫోటోలో చూడవచ్చు.
భారతదేశంలో బాగా వ్యాపిస్తున్న ఈ వహాబీయిజమ్ లో మదారసాలలో యువతను ఆకర్షిస్తూ వహీబీయిజాన్ని బోధిస్తున్నారు. ఒక శుక్రవారం మత ప్రసంగంలో ఒక ఇమామ్ ఇలా చెప్పినట్లుగా సమాచారం- “ఏమిటి ముసల్మాన్ ల లక్ష్యం? అడుక్కునేవారిలాగా పాటలు పాడి డ్యాన్స్ లు చెయ్యటమా? కాదు. మనలను పుట్టించింది అందుకు కాదు. అందరినీ అసలైన, సరైన మార్గంలో (సిరాతమ్ ముస్తకీమ్) నడిపించటమే మన బాధ్యత. మనం దయ్యాల బాటలో పోతున్నాం. హిందువులే అలా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ లు చేసుకుంటూ ఊరేగింపుగా పోతారు. మనం కూడా వాళ్ల బాటలో పోతూ ముహర్రం అప్పుడు, మహమ్మద్ ప్రవక్త జన్మదినాన అలాగే చేస్తున్నాం. అది తప్పు.” ఇది వహాబీ సందేశమన్నదానిలో అనుమానం లేదు. వీళ్ళు దీపం వెలిగించి వేడుకను ప్రారంభించే దక్షిణ భారత సాంప్రదాయాన్ని తప్పుపట్టారు.
కాశ్మీర్ లో దర్గాలు, సూఫీ ఆలయాల మీద దాడులు చేసింది వహాబీయులే. ఇస్లాం వారసత్వాన్ని నెలకొల్పటానికి ముస్లిం యువత జీహాద్ కి సిద్ధపడే అవసరం, సమయం వచ్చిందని 2001 లో స్టూడెంట్ ఇస్లాం మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది.
వహాబీ ఆధారిత సంస్థలు ఈ క్రిందివాటిని ప్రోత్సహిస్తారు-
బాల్య వివాహాలు, బాలికలకు విద్యాబోధనను నిలిపివేయటం, ముస్లిం కుటుంబాలు షారియా సూత్రాలను పాటిస్తూ, ఖుదా అనేదానికి బదులుగా అల్లాహ్ అనటం లాంటి మార్పులను తేవటం లాంటివి. అల్లాహ్ అనేది అరబిక్ పదం, ఖుదా అనేది పర్సియన్ పదం.
తౌహిద్- అంటే అల్లా ఒక్కడే అనేదాన్ని నమ్ముతారు. షాపీ, హనాఫీ, మాలికి, హన్ బలి శాఖలకు వ్యతిరేకులు. పూర్తిగా వెనక్కి వెళ్ళి ఖురాన్, షారియా అనబడే ఇస్లామిక్ న్యాయసూత్రాలను పాటించమని చెప్తారు. వీళ్ళు ఇస్లామ్ అనేది ఒక మతం కాదని, సంపూర్ణమైన జీవన శైలిగా అభివర్ణిస్తారు. ఇస్లాం లోని సలాఫ్ అంటే స్వర్ణసమయం తిరిగి రావాలని కోరుతారు. దీనికి సౌదీ అరేబియాలో అనుసరించటం ప్రభుత్వపరంగా సమర్ధన లభించింది. కేవలం ఇస్లాం న్యాయం మాత్రమే సమాజాన్ని తీర్చిదిద్దుతుందని వీరి గట్టి నమ్మకం. అందువలన, ప్రపంచంలోని ఇతర జహీలియా (మూడులైన మతస్తులు) తో పోరాటం చెయ్యటంతోనే అది అల్లా మార్గంలోకి అందరినీ తీసుకునివస్తుందని వీళ్ళు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నవారు.
లష్కరే తాయిబా, జమ్మాతుద్ దావాలాంటి ఉగ్రవాద సంస్థలకు ఈ వహాబీయిజమే మార్గదర్శనం చేయించింది.
భారతదేశంలో ప్రస్తుతమున్న తబ్లీగీ జామాత్, అహ్లే హాదిత్, ది గుజరాత్ ముస్లిం రివెంజ్ ఫోర్స్, ది ముస్లిం డిఫెంస్ ఫోర్స్, ఇస్లామిక్ డిఫెంస్ ఫోర్స్ లాంటి సంస్థలు చిన్న పరిమాణంలోనే ఉన్నా అవి ఎప్పుడు పెరిగి పెద్దవుతాయో చెప్పలేమంటున్నారు పరిశీలకులు. తమిళనాడు ముస్లిం మున్నేత్ర కజగమ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లాంటి సంస్థలు మొదట్లో లేకపోయినా క్రమక్రమంగా ఉగ్రవాదంలోకి దిగుతున్నాయని కూడా పరిశీలనలో తేలింది. కమల హాసన్ తీసిన విశ్వరూపం సినిమా ప్రదర్శనను అడ్డుకోవటానికి ఒత్తిడి తెచ్చింది కూడా తమిళనాడు ముస్లిం మున్రేత్ర కజగమ్ సంస్థే.
ఈ మధ్యనే ముస్లిం మతస్తుల మీద పెరిగిపోతున్న వహాబీ ప్రభావాన్ని గురించి ఆదుర్దా వెలిబుచ్చిన భారతీయ నిఘా సంస్థ ఇండియన్ ఇంటెలిజన్స్ బ్యూరో, ఇది దేశంలో ప్రమాదకరమైన పరిణామంగా సంభివించే అవకాశం ఎక్కువగా ఉందని నివేదికనిచ్చింది. భారతదేశంలోనే పుట్టిన ముస్లిం వర్గాలలో కూడా కొందరు ఈ ఉగ్రవాదంవైపుకి తిరుగుతున్న యువతను చూసి అంతే ఆవేదన చెందుతున్నారు. 1992 లో జరిగిన బాబ్రీ మస్జీద్ కూల్చివేత ఎంతోకాలం ముస్లిం, హిందువుల మధ్యనున్న సఖ్యతను కూలదీయటానికి దోహదం చేసింది. ఇది ముస్లింలలో ఉగ్రవాదాన్ని పెంచటానికి బాగా ఉపయోగపడింది. అటువంటి అవకాశం కోసమే చూస్తున్న వహాబీ ప్రచారకులకు ఇది మంచి అదనుగా తోచింది. ముస్లింలలో ఉన్న అభద్రతా భావాన్ని ఊతంగా చేసుకుని తమ పని చేసుకోవాలనుకున్నారు.
భారతీయ ముస్లింలలో ఒక వర్గం వారు దేశ రాజ్యాంగంలోని విధానాలతో దేశంలో మతవివాదాలు అంతరించేట్టుగా చూస్తారని నమ్మితే, మరో వర్గం వారు భారత ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందన్న దానిలో నమ్మకం పోగొట్టుకున్నారు. అయితే వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే రాజకీయంగా పైకి వచ్చి సమస్యను పరిష్కరిద్దామనుకున్నారు. కానీ మూడో వర్గం వారు ఎక్కువగా విదేశాలలో చదువుకున్నవారు మత గురువులు, భారత దేశంలో అటువంటిదేమీ జరగదని, కేవలం ఇస్లామ్ ని పునరుద్ధరించి పాటిస్తేనే సమస్య అంతమవుతుందని నమ్మటం మొదలుపెట్టారు. ఆ వర్గం మీద వహాబీయిజం బాగా ప్రభావం చూపించింది.
అందువలన, భారత దేశంలో వ్యాపిస్తున్న వహాబీయిజాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు రాజకీయంగా అడుగులు వెయ్యటం తప్పనిసరిని, లేకపోతే దేశంలో అల్లకల్లోలం జరుగుతుందని నిఘావర్గాలు గట్టిగా సూచిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంటే ఒకే వర్గమనే నమ్మకముంది. అందులో ఇన్ని జాతులున్నాయని, పరస్పర విరుద్ధంగా ప్రచారమే కాదు పోరాటాలు కూడా జరుగుతాయని బయటపడటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇంకా వెనక్కి పోయి అసలు ముస్లింలు ఎలా వచ్చారు, అందులో షియాలు, సున్నీలు అనే ఉప వర్గాలు ఎలా పుట్టాయని పరిశీలించదలచుకుంటే-
ప్రపంచంలో ముస్లింలలో 87-89 శాతం సున్నీలు, 11-12 శాతం షియాలున్నారు. క్రీ.శ.632 లో మహమ్మద్ ప్రవక్త చనిపోయిన సమయంలో ఆయనకు వారసుడిగా అప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించివున్న ఇస్లామిక్ మతస్తులకు ఖలీఫ్ గా ఎవరు ఉంటారన్న విషయంలో వివాదం చెలరేగింది. అది సిప్ఫిన్ యుద్ధానికి దారితీసింది. ఆ తర్వాత అది కర్బలా యుద్ధంతో బాగా ముదరటానికి కారణం అందులో అప్పుడు అధికారంలో ఉన్న ఉమయ్యద్ కాలిఫ్ యాజిద్ 1, హుస్సేన్ ఇబ్న్ అలి, అతని కుటుంబాన్ని సంహరించటం జరిగింది. ఆ సంఘట ప్రతీకారవాంఛలతో ఇస్లామిక్ మతస్తులలో చీలిక ఏర్పడింది. సున్నీ, షియాలకు పవిత్రమైన మత గ్రంధం ఖురానే అయినా వాళ్ళు హాడిత్ భాష్యాన్ని వేరు వేరుగా నమ్ముతూ వస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలలో సంక్షోభానికి ఈ రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయమే కారణం.
అయితే నిజానికి ఈ రెండు ఉప వర్గాల మధ్య పోరాటం ఆధ్యాత్మిక సూత్రాల అవగాహన వలన మొదలైంది కాదు. కేవలం రాజకీయమైనదే. కానీ అది బాగా ముదిరి మత విశ్వాసాల రంగు పులుముకుంది.
సున్ని అంటే అర్థం మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడిచేవాడని. ప్రవక్త అనుచరుల ఉద్దేశ్యాన్ని అంగీకరిస్తూ సున్నీలు ముస్లిం వర్గానికి నాయకత్వం వహించటానికి అర్హుడిని ఎన్నుకోవటానికి సిద్ధమయ్యారు. అలాగే ఎన్నిక జరిగింది. మహమ్మద్ ప్రవక్తకి అత్యంత సన్నిహితుడు, సలహాదారుడైన అబు బక్ర్ మొదటి ఖలీఫ్ గా ఎంపికయ్యాడు.
కానీ మరికొంతమంది మాత్రం మహమ్మద్ ప్రవక్త రక్త సంబంధీకుడే నాయకత్వం వహించాలని కోరుకున్నారు- అందులోనూ ఆయన స్వయంగా నియమించిన ఇమామ్ లలో. షియా అంటే అనుసరించే బృందం అని అర్థం. పూర్తిగా చెప్తే షియాత్ అలి (అంటే అలి బృందం). వారినే అహి అల్ బయత్- అంటే, (మహ్మద్ ప్రవక్త) కుటుంబీకులకు చెందినవారు అని కూడా అంటారు. ఆ విధంగా షియాలు నాయకత్వం మహమ్మద్ ప్రవక్త కజిన్, అల్లుడు అయిన అలి బిన్ అబు తాలిబ్ కి అప్పగించాలని కోరుకున్నారు. అక్కడి నుంచి ముస్లిం నాయకుల ఆధిపత్యాన్ని షియాలు అంగీకరించకుండా మహమ్మద్ ప్రవక్త (అంటే స్వయంగా అల్లా) నియమించిన ఇమామ్ లను అనుసరించటం మొదలుబెట్టారు.
ముస్లిం అనే పదానికి అరబిక్ లో "దేవుడికి శరణాగతైనవాడు" అని అర్థం. చాలా మంది అనుకునేది ఇస్లాం మక్కా మదీనా నుంచి మొదలైందని. కానీ మొదట్లో క్రిస్టియానిటీకి చెందిన ఆడమ్, నోవా, అబ్రహమ్, మోజెస్, జీసస్ లాంటి వాళ్ళని కూడా ఆ మతంలో ప్రవక్తలుగానే విశ్వసించేవారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more