రాష్ట్రాలన్నీ తమ పనులు తాము చేసుకుంటూ పోతే నిజానికి కేంద్రానికి పెద్దగా పనుండదు. కానీ రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర విభేదాలను పరిష్కరించటం, విదేశ వ్యవహారాలు, దేశ సురక్ష ఇవన్నీ చెయ్యటానికి రాష్ట్రాల మీద ఆధిపత్యం తో పాటు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి కనుక కేంద్ర ప్రభుత్వం, చట్టాలను తీసుకునిరావటానికి పార్లమెంటు, అందులో వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యులు ఉండే ఏర్పాటు జరిగింది మన రాజ్యాంగంలో.
ప్రభుత్వం నడపటానికి అధికారాలతో పాటు ఖజనా కూడా ఉండాలి కాబట్టి రైల్వే, టెలిఫోన్, భూగర్భ వనరులు, రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి వాటి మీద ఆధిపత్యం ఇవ్వటం జరిగింది. దేశమంతటికీ సమన్యాయం చెయ్యటం కోసం సుప్రీం కోర్టు, ప్రజాప్రతినిదులను సకాలంలో సక్రమంగా ఎన్నుకోవటానికి ఎన్నికల కమిషన్ ఏర్పడింది. దేశ భద్రత అనేది దేశం మొత్తానికి సంబంధించింది కనుక వాటి అధికారాలు రాష్ట్రపతికి ఇవ్వటం జరిగింది.
అయితే కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ మనుగడ కోసం రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో జోక్యం చేసుకోవటమనేది ఆనవాయితీగా వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాలలో కూడా తమ పార్టీకే ఆధిపత్యం ఉండాలనుకోవటం నిజానికి సరైన ఆలోచనా విధానం కాదు. కేంద్రం తన పరిధిలో ఉన్న విభాగాలను నిర్వహించుకుంటూ సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే రాష్ట్ర వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలి కానీ అందరికీ పెద్దన్నయ్యలా వ్యవహరించటానికి చూడటం, కేంద్రంతో పాటు రాష్ట్రాలలో కూడా తమ పార్టీకే పగ్గాలు చేజిక్కాలని ప్రయత్నించటం సరికాదు. కానీ అలాగే జరుగుతోంది. అక్కడే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్యలన్నిటికీ మూలం. ఈ అధికారాలను పెంచుకునే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో తగు సవరణలను చేసుకునే వెసులుబాటుంది.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కేంద్రంతో సమస్య అలాగే వచ్చి చివరకు 49 రోజుల్లోనే రాజీనామా చెయ్యవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తన సొంత పార్టీ అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా బాట పట్టవలసివస్తోంది. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టిన తీరును విమర్శిస్తూ ప్రతిపక్షాలు నిరసనలు చూపించాయంటే కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను ఏ విధంగా వాడుకోవాలని చూస్తోందన్నది అర్థమౌతోంది. నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన స్పీకర్ ల విషయంలోనే కాకుండా రాష్ట్రపతికి పంపిన బిల్లును ఏ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టాలో ముందుగానే నిర్ణయించిన వైఖరి లోతుగా ఆలోచించేవారికి అచ్చెరువు కలిగిస్తుంది.
కేంద్రంలో రాను రాను పెరుగుతున్న అధికార దాహం న్యాయస్థానాల మీద కూడా ఆధిపత్యం వహించాలన్నంత వరకు వెళ్తోంది. తరచుగా అందుకే సుప్రీం కోర్టుకి ప్రభుత్వానికి మధ్య వ్యాఖ్యలు చోటుచేసుకుంటుంటాయి. సుప్రీం కోర్టు జడ్జ్ లకు జవాబుదారీతనాన్ని అంటగట్టాలని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించింది. నేర చరిత కలవాళ్లు ప్రజాప్రతినిధులుగా ఉండతగరని ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పుకి ప్రతిగా ఆర్డినెన్స్ జారీ చేసి భంగపడింది. దాన్నుంచి తేరుకోవటానికి ప్రధాన మంత్రినే తప్పు పట్టారు రాహుల్ గాంధీ.
పార్లమెంటులోనే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ ఆర్టికిల్ 377 ని సవరించే పని కోర్టు పరిధిలో లేదని చేసిన సుప్రీం కోర్టు కావాలంటే దాన్ని పార్లమెంటులోనే సవరణలతో సరిచేసుకోవచ్చని సూచించినా కేంద్ర ప్రభుత్వం స్వలింగుల వ్యవహారంలో సుప్రీం కోర్టుని తప్పుపట్టింది.
పార్లమెంటులోనే అవమానం జరిగింది, బాధితులను సస్పెన్షన్ తో శిక్షించటమేమిటని అడిగిన తెదేపా ఎంపీ మాకు ప్రత్యేక పార్లమెంటు ప్రతపత్తి కావాలని అన్నారంటే వాళ్ళ హృదయం ఎంత ఘోషించిందో అర్థమౌతోంది.
రాష్ట్రాలలో తమ పార్టీకే ఆధిపత్యం ఉండాలని కేంద్రం కోరుకునేది ఆ రాష్ట్ర ప్రజలకు ఏదో చేసేద్దామని కాదు వాళ్ళు తమని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఉంటారని. అందుకే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళమీద వేటు, అనుకూలంగా పనిచేసేవారిని గద్దెక్కించటం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందువలనే ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలు, లేక మిత్రపక్షాలు పాలించే రాష్ట్రాలలోని ప్రజలను మంచి చేసుకునే ప్రయత్నంలో వరాలు కురిపిద్దామని చూస్తారు. కానీ సొంత పార్టీ నుంచి ఎన్నికై రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి, ఎంపీల విషయంలో చులకన భావాన్ని చూపిస్తుంది, వాళ్లని ఒత్తిళ్ళకు గురిచేస్తుంది
తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు చేసిన ఆందోళనలో వాళ్ళంతా బలయ్యారు, ఆ తర్వాత రాష్ట్ర విభజనకు కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్ర నాయకులు బలయ్యారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పని చేస్తూ రాష్ట్రాలకు సమన్వకర్తగా వ్యవహరిస్తే ఈ సంక్షోభమంతా పోతుంది. అప్పటి వరకూ ఇది తప్పదు. దీన్ని చూసి సహించలేకనే దివంగత నాయకుడు ఎన్టీ రామారావు తెలుగువాడి ఆత్మగౌరవం, కేంద్రానికి తొత్తులం కాము అనే విషయాలను పైకెత్తుకుని ప్రాంతీయ పార్టీ తెదేపాను స్థాపించారు.
మిగతా పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు మాట్లాడినంత గట్టిగా నిర్మొహమాటంగా సొంత పార్టీ ముఖ్యమంత్రులు మాట్లాడలేరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకు రాష్ట్రాలలో ఆధిపత్యానికే చూస్తోంది. అంతేకానీ పార్టీ మనదే కదా రాష్ట్రానికి ఎక్కువ సేవ చేసుకోవచ్చు అని అనుకున్నముఖ్యమంత్రులది అడియాసే అవుతుంది.
ప్రధాన మంత్రి నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రానని నిర్మొహమాటంగా చెప్పేసారు. మీరు ముందు అనుకున్నవి మాకు చెప్తారు కానీ మాకు చర్చలో మా అభిప్రాయాలను తెలిపే అవకాశమివ్వరు. పైగా మీకు కేంద్ర ప్రభుత్వంలో ఎంత బాద్యతుందో మాకూ రాష్ట్ర పరిధిలో అన్నే బాధ్యతలున్నాయి. వాటిని మేము నిర్వర్తించవలసివుంటుంది అంటూ జయలలిత ప్రధానమంత్రికి లేఖ రాసారు.
ఏ రాష్ట్రంలో పనులు ఆ రాష్ట్రం చూసుకుంటుంది కాబట్టి దేశమంతటినీ చూసుకోవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కానీ రాజ్యాంగం ఇచ్చిన అధికారాలతో రాష్ట్రాలను నియంత్రించాలనుకోవటం మాత్రం అధికార వ్యామోహమే అవుతుంది. తన రాష్ట్రంలో శాసనసభలో జన్ లోక్ పాల్ బిల్లుని ప్రవేశపెట్టలేక పోవటం, పోలీసులు సహకరించకపోవటం ఒక ముఖ్యమంత్రి కి ఎంతటి బాధాకరమైన విషయమో అరవింద్ కేజ్రీవాల్ ని చూస్తే అర్థమౌతుంది. తన రాష్ట్ర ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అధిక సంఖ్యాకుల బాణిని వినిపించి, విభజన బిల్లుని శాసన సభలో తిరస్కరించిన తర్వాత కూడా చీమకుట్టినంతైనా లేకుండా తాపీగా కేంద్రం ఆ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తీరుని తప్పు పట్టకుండా ఉండటం కోసం నేరమంతా సభను అడ్డుకున్న సభ్యులమీదకు తోసేసింది కేంద్ర ప్రభుత్వం. అందులోనూ కొందరు సభ్యల పట్ల నిరసనను తెలియజేసింది. బిల్లుకి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని పార్లమెంటుకి రాకుండా బహిష్కరించటంలో కృతకృత్యులైన కేంద్ర నాయకులు బిల్లుకి అడ్డు లేకుండా చూసామని అనుకున్నారే కానీ అడ్డు చెప్పే హక్కు వాళ్ళకుందన్న విషయాన్ని పట్టించుకోవటం లేదు.
అందువలన, ఇప్పటికైనా కేంద్రం వైఖరి మార్చుకుంటేనే రాష్ట్రాల విషయంలో సరైన విధానంలో సమన్వయం జరుగుతుంది. లేదంటే రాజకీయ పార్టీలు కేంద్రానికి, రాష్ట్రానికి వేరువేరుగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం లో పనిచేసే రాజకీయ పార్టీల మీద కేంద్రం ఆధిపత్యం ఉండగూడదు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more