హిందూమతంలోని విశేషాల్లో కొన్ని-
ప్రపంచంలోని మతాలన్నిటిలోనూ హిందూ మతం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుని కొన్ని విషయాల్లో భిన్నంగా ఉంది. అందులో ముఖ్యమైనది అద్వైతం.
ద్వైతం అంటే రెండు. నేను (ఆత్మ), పరమాత్మ రెండూ వేరు వేరు అనే భావన. మతాలన్నిటిలోనూ ఉన్నది ద్వైతమే. ఆత్మ వేరు పరమాత్మ వేరు అనే చెప్తాయి. లేకపోతే భక్తి కలగటం కష్టం కనుక అలాగే చెప్పవలసి వస్తుంది. కానీ ఆ మతాలన్నీ అంతటితో ఆగిపోయాయి. కానీ హిందూ మతంలో మాత్రం అద్వైతం, అంటే రెండు కావు అని చెప్పబడింది. రెండు కావు అంటే ఇంకా ఎక్కువని కాదు, ఒకటే అని. జీవాత్మ, పరమాత్మ వేరు కాదు అన్నది అద్వైత సిద్ధాంతంలోని ప్రధానాంశం.
విచిత్రంగా అనిపిస్తుంది కదూ. ప్రపంచంలో ఏ మతంలోనూ లేనన్ని దేవుళ్ళున్న హిందూ మతం ఆ దేవుడు నేను వేరు కాదు అని చెప్తోంది. కానీ శైశవ దశలో భక్తులను ద్వైతంలోనే ఉండమని చెప్తుంది. భక్తి కలగటం చాలా కష్టం కాబట్టి ద్వైతభావనతో భక్తి శ్రద్ధలు ఏర్పపచుకుని, నిష్టతో పూజ, ధ్యానాది కర్మలను నిర్వర్తించిన తర్వాత పరిపక్వత వచ్చినపుడు అద్వైత భావన ఏర్పరచుకోమంటుంది. అసలు అన్ని కోట్ల దేవీ దేవతలు ఉద్భవించిందే అద్వైతం వలన అంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది.
హిందూ మతంలోని మిగతా తేడాలలో చాలా వరకూ ఈ అద్వైతం వలన వచ్చినవే. ఉదాహరణకు, అన్ని శాస్త్రాలూ మనిషి అనుభవాల గురించి మాట్లాడుతూ, వారి అధ్యయనంలో కేవలం జాగృదావస్తనే పరిగణనలోకి తీసుకున్నాయి. దాని వలన మనిషి జీవితంలో దాదాపూ సగ భాగం పోయినట్టే. మనిషి జీవితంలో జాగృదావస్తకెంత ప్రాముఖ్యతుందో స్వప్న, సుషుప్తీలకు కూడా సమానమైన ప్రాముఖ్యతనిచ్చేది ఒక్క అద్వైతమే. స్వప్తావస్తే మనిషిని తన జాగృదావస్త కూడా అంతే కదా అన్న భావనను కలుగజేయటానికి పనికివస్తుంది. కల చూస్తున్నంత సేపూ అది కల అని కాని, వాస్తవం దానికంటే భిన్నంగా ఉందని కాని ఆ మనిషికి తెలియదు. కల ఆగిపోయిన తర్వాతనే ఆ విషయం అవగాహనలోకి వస్తుంది. కళ్ళు మూసుకుంటే ప్రపంచమే మరుగునపడిపోయిందే మరి ఆ కలలో చూసే ప్రపంచాన్ని ఎవరు రచించారు. అందులో కదలాడే పాత్రలను ఎవరు సృష్టించారు. వాటిని చూడటానికి వెలుగులను ఎవరు ప్రసరింపజేసారు. అదంతా మనలో ఉన్న చైతన్యం కలిగించిన సృష్టే. ఆ చైతన్యమే మన లోపలా బయటా కూడా ఉంది. నిజం చెప్పాలంటే మనమున్నదే ఆ చైతన్యంలో. నేను అనే చైతన్యం (ఇంటెలిజెన్స్) ఆ దివ్యచైతన్యం (సూపర్ ఇంటెలిజెన్స్) లో భాగమన్నమాట.
బయట కనిపించే సృష్టికి మనలోపలే ప్రతిసృష్టి జరిగింది. అక్కడ కనిపించే వ్యక్తులతో సంబంధం ఇక్కడ వాస్తవంలో ఉన్న సంబంధమే అయినా అక్కడివారితో జరిపిన ఇష్టాగోష్టులు, వ్యవహారాలు, యాత్రలు, ఒప్పందాలు, వ్యతిరేకతలు, బయటి ప్రపంచంలో వర్తించవు. వారికి తెలియవు కూడా. బయట ఉన్న అప్పులను కలలో తీరిస్తే తీరినట్టు కావు కదా. అలాగే ఎక్కడో ఉన్న మనిషి, ఒక్కోసారి చనిపోయిన మనుషులతో కూడా మనం వ్యవహరిస్తుంటాం.
అదేవిధంగా వాస్తవం అని మనమనుకుంటున్న ఈ ప్రపంచమంతా కూడా మిథ్య. ఇదంతా కూడా స్వప్నమే. ఇదీ అంతరించిపోయేదే అని చెప్తే నమ్మబుద్ధి కాదు. అందుకే అద్వైతం అంత త్వరగా పట్టుబడదు. మన కంటికి కనిపిస్తుంటే వాస్తవం కాదంటారేం అని అంటే, కలలో కూడా కంటికేగా కనిపించింది. అక్కడ కూడా దృష్టి, స్పర్శ, వాసనలు, శబ్దగ్రహణం, రుచులు కూడా తెలుస్తాయి. మరో వాదన ఏమిటంటే, కలంటే ఎప్పటికప్పుడు అయిపోతుంది కదా, మరి లేచి చూసేటప్పటికి నిద్రపోకముందు ఉన్న వ్యవహారాలే కొనసాగుతుంటాయి కదా అని అంటారు. అందుకే ఇదంతా మిథ్య అని నమ్మటం కష్టమౌతుంది. అందుకే, ఇదంతా ఒక పెద్ద కల అని, ఈ కలలో మన స్వప్నావస్త ఒక చిరు కల అని చెప్తారు. అది అంతమైనట్టే ఈ జాగృదావస్త కూడా అంతమవుతుందని అంటే, అది ఎలా జరుగుతుంది, మనం చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఇలాగే నడుస్తుంది కదా అని ప్రశ్నిస్తారు. మీకు ఎలా తెలుసది. ఇలాగే జరుగుతుందని మీరు ఎలా చెప్పగలరు.
గాఢ సుషుప్తిలో ఉన్నపుడు కూడా ప్రపంచం యథావిధిగా నడుస్తూనే ఉంది కదా అని అంటారు. అది మీకు ఎలా తెలుసు. ఎప్పుడు తెలుస్తుందా విషయం. నిద్రలోంచి లేచిన తర్వాత. నిద్రలో ఉన్నాను అన్న విషయం కూడా మీకు తెలియదప్పుడు. గాఢ సుషుప్తిలో నేను అనేదే ఉండదు. అప్పుడే ఆ ప్రశాంతత లభిస్తుంది. స్వప్నావస్తలో నేను అనేది ఉండబట్టే వివిధ భావ పరంపరలు ముసురుకుని భావో్ద్వేగాలను కలిగిస్తాయి. కానీ గాఢ సుషుప్తిలో ఏమీ ఉండదు. ప్రశాంతతత అనేది కూడా అర్థం చేసుకోవటానికి వాడిన పదమే కానీ అదీ ఉండదు. ఈ మూడు స్తితులూ కలిసే మనిషి జీవితం కాబట్టి, అద్వైతం జాగృదావస్తకి ఇచ్చిన ప్రాధాన్యతను స్వప్న, గాఢ సుషుప్తీలకు కూడా ఇస్తుంది.
విశ్వంలోని చరాచర సృష్టి అంతా పరమాత్మ చైతన్యమే. ఉన్నదంతా ఒక్కటే, ఆ చైతన్యమే అంటుంది అద్వైతం. వేరే ఏమీ లేదంటుంది. మనకు కనిపించే ప్రపంచమంతా అందులోంచి పుట్టింది అని చెప్తుంది. బయట కనిపించే ప్రతి దాన్ని మనం మన లోపల సృష్టించుకుంటున్నాం. అలా సృష్టించుకున్నదాన్నే మనం చూస్తుంటాం (గ్రహిస్తాం). సృష్టించుకోలేనిది మనకు కనపడదు.
కంప్యూటర్ లో హార్డ్ వేర్ ఆదేశాలున్నట్టుగా మనం కూడా పుట్టి బుద్దెరిగిన దగ్గర్నుంచీ ఎన్నో ఆదేశాలను తయారు చేసుకుని మన మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకుంటాం. ఒక మనిషిని చూస్తే ఒకరికి కలిగే అనుభూతి మరొకరికి కలగక పోవచ్చు. తల్లిదండ్రులను చూసినప్పుడు కలిగే ప్రేమ, సురక్షితా భావం ఆ పిల్లలకు మరొకరిని చూసినప్పుడు కలగకపోవచ్చు. అలాగే తన పిల్లలను చూసినప్పుడు కలిగే వాత్సల్యం మరెవరినైనా చూసినపుడు కలగదు. దానికి కారణం ఆ భావన మనలోపల ఉన్నది. బయట ఆ మనుషుల్లో లేదు. అంటే, ఆ మనుషులను, వస్తువులను మనం లోపల సృష్టించుకోవటమే కాకుండా వాటికి కొన్ని లక్షణాలను కూడా మనమే ఆపాదించి వాటిని కూడా రాసి పెట్టుకుంటాం. మంచివాడు, చెడ్డవాడు. పనికివచ్చే వస్తువు, పనికిరానిది ఇలాంటివన్నీ ఎవరికి వారు తయారు చేసుకునేవే. జాగృదావస్థలో ఉన్నప్పుడు తయారు చేసుకుని పెట్టుకున్న ఈ ఆదేశాలు (ప్రోగ్రాంలు) గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు నిద్రాణమైన స్థితిలో ఉంటాయి. అందుకే లేవగానే బయట ప్రపంచంలోకి రావటానికి కొద్దిగా సమయం పడుతుంది. కంప్యూటర్ లో దాన్నే బూటింగ్ సమయం అంటారు. బూట్ అయినప్పుడు కంప్యూటర్ తనలో నిక్షిప్తమై ఉన్న ఆదేశాలను చదువుకుని, మనం పనిచెయ్యటానికి అవసరమైన తయారీలతో సిద్దమవుతుంది. అప్పుడే దాన్ని వాడగలుగుతాం.
నువ్వూ, నేనూ, ఈ చరాచర సృష్టిలోని ప్రతి ఒక్కటీ, ఆ పరమాత్మ స్వరూపమే అని నమ్మటం వలనే, ప్రతిదానికీ ఒక దేవీ దేవతా నామాన్ని ఆపాదించారు. తల్లిదండ్రులు, గురువులు, అతిథులతో సహా అందరూ దైవ స్వరూపాలే. చెట్టూ చేమలూ, పుట్టలూ గట్లూ, గాలి, నీరు, నిప్పు, నింగి, భూమి, అన్ని జీవరాశులు, సూర్యుడు చంద్రుడు అన్నిటిలోనూ దైవాన్ని చూడగలగటం సామాన్యమైన విషయం కాదు. అది అంత త్వరగా అబ్బేది కాదు కాబట్టే, అన్నిటికన్నా ముందు ఈ ఙానాన్ని కలిగించే దేవతను సరస్వతి అని అన్నారు. పుస్తకం కిందపడకుండా చూసుకోవటం, కాలికి తగిలితే కళ్ళకద్దుకోవటం దగ్గర్నుంచి గురువులను పూజించటం వరకూ అన్నీఙాన ప్రాప్తికోసం, ఙానమార్గంలో నడవటానికి సంసిద్ధతే. ఈ ఙానం ఒకేసారి రాదు కాబట్టి ప్రతి ఒక్కదానికీ ఒక దేవీదేవతల నామాలను పెట్టి పిలిచారు.
కేవలం భక్తి కోసమే కాకుండా ఏదైనా విషయపరిఙానాన్ని అందించటానికి కూడా ఈ పేర్లు పనికి వచ్చాయి. జ్యోతిష్యంలో అందరికీ తెలిసిందే, గ్రహాలకు పేర్లు పెట్టి, ఆ పేర్లను బట్టి వాటి గుణగణాలను బోధించటం ద్వారా దాన్ని వంటబట్టించుకోవటమే కాకుండా మర్చిపోకుండా ఉంటారు. అలాగే ఆయుర్వేదంలో కూడా ప్రతి చెట్టుని విష్ణు రూపమనో, శివతత్త్వమనో చెప్తూ వాటి లక్షణాలను మర్చిపోలేని విధంగా కథల రూపంలో చెప్పేవారు. అదేవిధంగా లోహాలు, రసాయనాలు, ఒకటేమిటి అన్నిటికీ పేర్లు పెట్టి, వాటికి సంబందించిన శాస్త్రాధ్యయనాన్ని సులభతరం చేసారు. ఇది అర్థం కాని పాశ్చాత్యులు, పాశ్చాత్య పోకడలు పొయ్యేవారు కూడా వీటిని అవహేళన చేసారు. ఒక రోడ్డుకి ఒక పార్క్ కి, ఒక గ్రామానికీ దేశనాయకుల పేరు పెట్టవచ్చు కానీ దేవతల పేర్లు పెట్టగూడదా.
ఏ పేర్లను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ధనసంపదలకు పెట్టిన లక్ష్మి, కష్ట నష్టాలకు పెట్టిన శని అనే పేర్లను మాత్రం బాగా పట్టించుకుంటారు. భూమికి దగ్గరగా ఉన్న ఉపగ్రహం చంద్రుడు. నక్షత్రాల్లో అతి దగ్గరగా ఉన్నది సూర్యుడు. అలాంటప్పుడు చంద్రుడికి ఎన్నో రెట్లు ఎక్కవు పరిమాణంలో ఉన్న తారలు ఆ చంద్రుడికి భార్యలవటమేమిటి, వారికి సంతానం కూడా కలగటమేమిటని నవ్వులాటగా తీసుకునే వారే ఎక్కువమంది ఉంటారు కానీ, సమాచార వ్యవస్థ లేని సమయంలో, కాగితం, ముద్రణా వ్యవస్థలు లేని కాలంలో విషయావగాహన కోసం కథలు కథలుగా చెప్పినవి ఆ కాలంలో ఎంతో ఉపయోగపడబట్టే, అవన్నీ అర్థం లేనివి అనే తార్కిక స్థితికి మానవుడు ఎదగగలిగాడు.
ద్వైతం, అద్వైతం తర్వాత వచ్చింది విశిష్టాద్వైతం. ద్వైతాన్ని మధ్వాచార్యులు తీసుకొస్తే, అద్వైతాన్ని ప్రతిపాదించిన శంకరాచార్యులవారు దేశమంతా పర్యటించి మూఢనమ్మకాలను పోగొడుతూ, అందరూ పాటిస్తున్న వేదాలనే ప్రమాణంగా తీసుకుని తర్కంతో అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసారు. అయితే అద్వైతం అర్థం కావటానికి మనిషిలో ఎంతో పరిణితి కలగాలి కాబట్టి, రామానుజాచార్యులవారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ దానికి విశిష్టాద్వైతమని పేరు పెట్టారు. అందులో స్వామి సేవలు, అర్చనలు, ఉత్సవాలు అన్నీ శైశవ దశలోని భక్తులకోసం పెట్టినవే కానీ అసలు సిద్ధాంతం కూడా పరిణితి కలిగిన తర్వాత అర్థమయ్యేదే. కానీ అద్వైతంతో పోలిస్తే అర్థం చేసుకోవటం సులభమే.
ఒక వ్యాపార సంస్థ ఉందంటే అందులో ఎంతో మంది ఉద్యోగులుంటారు. ఎవరి పని వారు చేస్తుంటారు. వాటి కోసం ఎవరికిచ్చే సదుపాయ సౌకర్యాలు వారికుంటాయి. ఆ పనులు వారివా అంటే వారివే. ఆ సౌకర్యాలు వారికోసమేనా అంటే కూడా అవుననే అనాలి. కానీ నిజానికి ఆ పనులన్నీ ఆ సంస్థకి చెందినవి, అందులోని వస్తువులకు సంస్థే యజమాని. అందరూ కలిస్తేనే సంస్థ. ఏ శాఖ లేకపోయినా సంస్థ సంపూర్ణం కాదు. కానీ ఏ శాఖా విడిగా సంస్థ కాదు. దీన్నే ఒక వృక్షంతో పోల్చారు రామానుజాచార్యులు. చెట్టుకి వేళ్ళుంటాయి, కాండముంటుంది, ఆకులుంటాయి, పువ్వులుంటాయి, కాయలుంటాయి, పండ్లు పండుతాయి. వృక్షంలో ప్రతి భాగానికీ ఒక పేరుంది. అస్తిత్వముంది. అవి చెయ్యాల్సిన పనులనున్నాయి. కానీ ఆ పనులన్నీ వృక్ష ప్రణాళికలో భాగాలే. ఏ భాగం లేకపోయినా చెట్టు లేదు. కానీ ఏ భాగమూ చెట్టు కాదు. అదేవిధంగా ఆత్మలు, పరమాత్మ వేరు వేరు కావు. ప్రతి జీవాత్మ ప్రణాళికా, పరమాత్మ ఉన్నతమైన ప్రణాళికలో భాగమే అంటారు విశిష్టాద్వైతులు.
హిందూ మతం మిగిలిన మతాలకంటే మరో ముఖ్య విషయంలో అన్నిటికన్నా భిన్నంగా ఉంది. అదేమిటంటే తర్కానికీ అభివృద్ధికీ అవకాశమివ్వటం. పూర్వకాలంలో వేదాంత చర్చల ద్వారా విషయావగాహన చేసుకునేవారు. టీకా తాత్పర్యాలు వ్యాఖ్యానాల్లో మార్పులు చేసుకునేవారు. అది కుదరకపోవటం వలనే ఇతర మత గ్రంధాలకు కేవలం పవిత్రత మాత్రమే ఆపాదించి, వాటిని పఠించటానికి, వల్లె వేయటానికి, పూజకు మాత్రమే ఉపయోగిస్తారు కానీ వాటిని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలేమీ చెయ్యటానికి ఎవరికీ అధికారం లేదు. కానీ హిందూ ధర్మ శాస్త్రాలను పండితులు, ఆచార్యులు దివ్య ఙానమే కాకుండా, లోకఙానాన్ని పెంచుకోవటానికి కూడా ఉపయోగించారు. .కానీ తెలిసీ తెలియని ఙానంలో వాటిని అఙానంగానూ, మూఢ నమ్మకాలగానూ ముద్రవేసారు కానీ అవగాహన పెంచుకోవటం కోసం ఉపయోగించుకుందామనుకోకపోవటం దురదృష్టం!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more