భూమి (రీతూ వర్మ) ఓ స్టార్టప్ కంపెనీ నడుపుతూంటుంది. చాలా స్ట్రిక్ట్. ఎవరినీ ఎంటర్టైన్ చేయదు. నవ్వదు. నవ్వుతూ మాట్లాడినా ఒప్పుకునే రకం కాదు. మన్మధుడులో నాగ్ పాత్రను గుర్తు చేస్తూంటుంది. మరో ప్రక్క ఆకాష్ (నాగ శౌర్య) దుబాయిలో ఆర్కిటెక్ట్. ఓ ప్రాజెక్ట్ కోసం ఇండియాకి వచ్చాడు. ఆ క్రమంలో భూమిని కలిసాడు. ఆమె కంపెనీకు కావాల్సిన డిజైన్ గీసిచ్చాడు. ఆకాష్ ఆమెని తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తాడు. ప్రేమను ఎక్సప్రెస్ చేద్దామనుకుంటాడు. కానీ ఆమె ఆ అవకాసం ఇవ్వదు. ఈలోగా ఆకాష్ కు ఒకావిడ (నదియా) పరిచయం అవుతుంది. ఆమె తన కుమార్తెకు సంభంధాలు చూస్తూంటుంది. నదియా కూతురే భూమి. నదియాకు ఆకాష్ కు మధ్య స్నేహం ఏర్పడుతుంది.
తను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నా ఆమె పడటం లేదని చెప్పి వాపోతే..తన కూతురు ఏ సంభందం కూడా ఓకే చేయటం లేదని ఆమె బాధపడుతుంది. ఇలా ఒకరికొకరు ఓదార్పు యాత్ర చేసుకుంటారే కానీ ఆ ఇద్దరి కథల్లో సెంట్రల్ క్యారక్టర్ భూమి అని తెలుసుకోరు. ఇక భూమి అలా స్ట్రిక్ట్ గా ఉండటానికి ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో విఫలమైన లవ్ స్టోరీ ఉంటుంది. ఇంతకీ భూమి గతంలో ఎవరితో ప్రేమలో పడింది..ఆకాష్ తన ప్రేమను ఆమెతో వ్యక్తపరిచాడా, చివరకు వాళ్లిద్దరూ ఒకటయ్యారా, నదియా కూతురు తన ప్రేమించే భూమి అని ఆకాష్ ఎలా తెలుసుకున్నాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
స్టోరీ ఎంత సింపుల్ గా ఉంటే సినిమా అంత అందంగా వస్తుందనటంలో సందేహం లేదు. అయితే సింపుల్ అన్నారు కదా మరీ సాంపిల్ లాగా ఉంటే దాన్ని సాగతీయటానికి అదే విస్తరించటానికి సినిమా భాషలో ట్రీట్మెంట్ చేయటానికి చాలా కష్టపడాలి. డైలాగులుతో పేజీలు పేజీలు నింపుకెళ్ళాలి. అదే ఈ సినిమా కు జరిగింది. ఓ ఐదు నిముషాలు హీరో,హీరోయిన్ కూర్చుని మాట్లాడుకుంటే కట్ అయ్యే కాంప్లిక్ట్ ని, ఆ అవకాసం ఇవ్వకుండా డైరక్టర్,ఆమెలోని రైటర్ కలిసి సినిమా చివరి దాకా విడతీసే ఉంచారు. ఒకరు మనస్సు విప్పుదామంటే మరొకరు అడ్డుపడతారు...లేదా ఎవరో ఒకరు అడ్డం పడతారు.
అయితే లైటర్ వీన్ ఫన్ తో ,త్రివిక్రమ్ పూనినట్లుగా రాసిన డైలాగులుతో సినిమాని లాగేసారు.ఫస్టాఫ్ కార్పోరేట్ సెటప్ లో వెన్నెల కిషోర్, సెకండాఫ్ లో సప్తగిరితో లాగ్ కామెడీ అంటూ ఫన్ చేసి ఒడ్డున పడే ప్రయత్నం చేసారు. గ్యాప్ లని టిక్ టాక్ కామెడీతో నింపేసారు. ఏదైతేనేం ఫ్యామిలీలకు ఊ కొట్టేలా ప్యాకేజీ చేసారు. తెరని కలర్ ఫుల్ విజువల్స్ తో నింపేసి, కాన్వర్షేషన్ తో కాలక్షేపం చేసారు. ఫస్టాఫ్ లో పెద్దగా ట్విస్ట్ లు ,టర్న్ లు లేకపోయినా నడిచిపోయింది.
సెకండాఫ్ లో అసలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎందుకు పెట్టారో అర్దం కాదు. నిజానికి రెండు ముక్కుల్లో చెప్పాల్సింది ఇరవై నిముషాలు పెట్టారు. ఆ సీన్స్ మాత్రం హారిబుల్ ..ఎందుకంటే ఆ సీన్స్ వల్ల కథలో కొత్త మలుపులేమీ రావు. ప్రేక్షకుడుకి ఆ సీన్స్ అంత డిటేల్ గా తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. ప్లాష్ బ్యాక్ అయ్యాక కథలో కూడా ఏమీ జరగలేదు. ఉన్నంతలో ఫ్లాష్ బ్యాక్ తర్వాత వచ్చే సప్తగిరి లాగ్ కామెడీ సినిమాని ఒడ్డున పడేసింది. క్లైమాక్స్ మళ్లీ రొటీన్ గా ముగించారు. అంతకు మించి చేయటానికి కూడా ఏమీ లేదు.
నటీనటుల విషాయానికి వస్తే..
నాగశౌర్య, రీతూ వర్మ అందంగా కనిపించారు. వాళ్లు ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, పలికించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఆయా పాత్రలకి సరైన ఎంపిక అనిపిస్తారు నాయకానాయికలు. విరామానికి ముందు, క్లైమాక్స్కి ముందు సన్నివేశాల్లో ఆ ఇద్దరి నటన హత్తుకుంటుంది. పాటల్లోనూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అలరించింది. సప్తగిరి, వెన్నెల కిషోర్, హిమజ, ప్రవీణ్ తదితరులు నవ్వించే బాధ్యతని తీసుకున్నారు. మురళీశర్మ, నదియా కథానాయిక తల్లిదండ్రులుగా చక్కటి పాత్రల్లో మెప్పించారు.