విధి వక్రించింది.. మృత్యువు ఘోషించింది.. పొట్టకూటి కోసం వెళ్లిన పసికందుల్ని కూడా వదలకుండా పొట్టనబెట్టుకుంది.. ఆ అభాగ్యుల పాలిట టపాసుల పేలుళ్లు మరణ మృదంగమైతే... రసాయనాల వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉసురు తీసేశాయ.. దీపావళి పండుగ సీజన్ సందర్భంగా పది రూకలు సంపాదించుకుందామని వెళ్లినవారంతా పండుటాకుల్లా రాలిపోయారు.. భోజనానికి వెళ్దామని సిద్ధమవుతున్న వారల్లా యమలోకానికి పయనమయ్యారు.. ఇదీ విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని ముదలిపట్టిలో వున్న ఓంశక్తి ఫైర్వర్క్స్ కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం నెలకొన్న దుస్థితి... ఈ సంఘటనతో యావద్దేశం దిగ్భ్రాంతికి గురైంది...ఓంశక్తి ఫైర్ వర్క్స్ సంస్థకు ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. బాణసంచా తయారు చేసే పెద్ద సంస్థల్లో ఒకటిగా వున్న ఈ కర్మాగారంలో 360 మంది పని చేస్తున్నట్టు సమాచారం. ఈ కర్మాగారం యజమాని మురుగేశన్ అనుమతి లేని విషయాన్ని దాచిపెట్టి పాల్పాండి అనే వ్యక్తికి లీజుకిచ్చాడు. దీపావళి పండుగ సమీపిస్తుండడంతో ఈ కర్మాగారాన్ని లీజుకు తీసుకున్న ప్రతినిధి చిన్నారుల్ని కూడా రప్పించారు. ఓంశక్తి ఫైర్వర్క్స్కి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని బాణసంచా యజమానుల సంఘం ప్రతినిధి తమిళసెల్వన్ పేర్కొన్నారు. లంచాలు మరిగిన అధికారులు ఆ సంస్థ వ్యవహారాన్ని చూసీచూడనట్టు వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని ఆయన ఆరోపించారు. అనుమతుల్లేని ఈ సంస్థ ఇతర కర్మాగారాల కన్నా అధికంగా డబ్బు చెల్లించి కూలీల్ని రప్పించుకుంది. దీంతో చిన్నారులు సైతం ఆశపడి ఈ పనులకు వచ్చారు. అయితే గదుల్లో పరిమితికి మించి కూలీలు వుండడం, శిక్షణ పొందిన నిపుణులకు బదులు చిన్నారులే మందుగుండు దట్టించేందుకు ప్రయత్నించడంతో భారీ పేలుడు సంభవించింది.
9 ఎకరాల్లో నిర్మితమైన 48 గదుల్లోని ఓ గది నుంచి 12.30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఆ వెంటనే ఒకదాని వెంట మరొక గదిలో భారీ పేలుళ్లతో ఉవ్వెత్తున మంటలు వ్యాపించాయి. పేలుళ్ల కారణంగా 28 గదులు నేలమట్టమయ్యాయి. పేలుళ్లు, మంటలకు తోడు భవనాలు కుప్పకూలడంతో సుమారు 200 మంది శిథిలాల క్రింద చిక్కుకుపోయారు. అయితే ఒకటిన్నర గంట తరువాతే ఈ విషయం బయటికి తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే శివకాశి, సాత్తూరు, విరుదునగర్ నుంచి అగ్నిమాపక శకటాలు, అంబులెన్సులు హూటాహూటిన ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. మొత్తం 10 అగ్నిమాపక శకటాలతో 120 మంది సిబ్బంది తరలివచ్చారు. ఈలోపే సహాయక చర్యలు చేపట్టేందుకు సంఘటనాస్థలికి చుట్టుపక్కల వారు వెళ్లడంతో రసాయనాల ప్రభావం కారణంగా వారంతా స్పృహ కోల్పోయారు. ఘటనాస్థలిలో 31 మృతదేహాలు లభ్యం కాగా, ఆసుపత్రులకు తరలిస్తుండగా కొంతమంది, చికిత్స ఇంకొంతమంది మొత్తం 56 మంది మరణించారు. మొత్తం క్షతగాత్రుల్లో 100 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 40 మంది పరిస్థితి విషమంగా వుందని వైద్యవర్గాలు తెలిపాయి.కార్మికులకన్నా బయటివారే మృతుల్లో అధికంగా వున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం గురించి గుర్తించిన చుట్టుపక్కల వారు బాధితులకు సాయం చేసేందుకు పరుగులు తీశారు. అయితే వారంతా రసాయనాల వాసనలు పీల్చి అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. వీరే అధికభాగం మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విరుదునగర్ జిల్లా రెవెన్యూ అధికారి రాజా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కర్మాగారంలోపల కన్నా, బయటే శవాలు అధికంగా వున్నట్టు వివరించారు.
కర్మాగారంలో, ప్రాంగణంలో ఎటు చూసినా శవాల గుట్టలే కనిపించాయి. కర్మాగారంలో ఛిద్రమైన శరీరాలుండగా, ప్రాంగణంలో రంగుమారిన శరీరాలు కనిపించాయి. క్షతగాత్రుల్లో చేతులు, కాళ్లు, కళ్లు, చెవులు, ముక్కు.. ఇలా ఏదో ఒక అవయవం కోల్పోయిన వారే కనిపించారు.మదురైలో 50, విరుదునగర్లో 38, శివకాశిలో 32, సాత్తూరులో 10, అరుప్పుకోటలో ఐదుగురు క్షతగాత్రులున్నట్టు వైద్యవర్గాలు ప్రకటించాయి. అయితే స్వల్పంగా గాయపడిన వారిలో కొంతమంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయినట్లు ఆ వర్గాలు వివరించాయి. బాధితులు, వారిని పరామర్శించేందుకు వారి రోదనలతో ఆసుపత్రులు శోకసంద్రంలా మారాయి.శివకాశి సమీపంలోని ముదలిపట్టి పొగబారింది. ప్రమాదస్థలి నుంచి కనీసం 2 కి.మీ వరకు పొగ కమ్మేసింది. ఈ కారణంగా అగ్నిమాపక శకటాలు, అంబులెన్సులు కూడా ప్రమాదస్థలికి వెళ్లడం కష్టంగా మారింది. దీనికి తోడు విపరీతమైన సెగ కూడా సహాయక చర్యలకు ఆటంకం కలిగించింది. బాధితులకు సహాయం చేసేందుకు వెళ్లిన వారు స్పృహ తప్పిపోవడంతో, బాణసంచాలో రసాయనాలు కలసి వుండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ప్రమాదస్థలి నుంచి 3 కి.మీ వరకు ప్రజలంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజలు మూటాముల్లే సర్దుకుని, ప్రాణాలు అరచేతబట్టుకున్న ప్రజలు హూటాహూటిన ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.
ప్రమాదం గురించి తెలియగానే సంఘటనాస్థలికి వెళ్లాలని మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశారు. దీంతో సీనియర్ మంత్రులైన ఒ.పన్నీర్సెల్వం, నత్తం విశ్వనాధన్, కేపీమునస్వామి, వైద్యలింగం, రాజేంద్రబాలాజీ, పలువురు ఎమ్మెల్యేలు సంఘటనాస్థలికి తరలివెళ్లారు. అక్కడ పరిస్థితిని సమీక్షించిన అనంతరం శివకాశిలోని ప్రభుత్వాస్పత్రి, సాత్తూరు ప్రభుత్వాస్పత్రి, మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రి, తిరునల్వేలి ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. కాగా ముఖ్యమంత్రి జయలలిత గురువారం నేరుగా శివకాశి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. బాణసంచా దుర్ఘటనపట్ల ప్రధాని మన్మోహన్సింగ్, తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక కేంద్రం కూడా మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
సుదీర్ఘకాలం నుంచి బాణసంచా తయారు చేస్తున్న శివకాశి చరిత్రలో ఇంత భారీస్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం. ఒకరకంగా బాణసంచా ప్రమాదాల కారణంగా ఇంతస్థాయిలో ప్రాణనష్టం జరగడం రాష్ట్ర చరిత్రలో కూడా ఇదే ప్రథమం. 2009 అక్టోబరు మాసంలో తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు వద్ద ఓ బాణసంచా విక్రయ దుకాణంలో ప్రమాం సంభవించి 32 మంది చనిపోయారు. అదే ఇప్పటి వరకూ రాష్ట్ర చరిత్రలో అదే పెద్ద బాణసంచా ప్రమాదం. ప్రమాదానికి కారణమైన ఓంశక్తి ఫైర్వర్క్స్ యజమానుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే వారు పరారయ్యారా, లేక దుర్ఘటనలో మృతి చెందారా అన్నదానిపైనా పోలీసులు పరిశోధిస్తున్నారు. కాగా సంస్థ ప్రతినిధిగా భావిస్తున్న ఉదయకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు.
8 వేల బాణసంచా తయారీ సంస్థలున్న శివకాశిలో ప్రతి ఏటా ప్రమాదాలు సంభవిస్తూనే వున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి, ఆ తరువాత పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యాన్ని ఈ ప్రమాదం అడుగడుగునా ఎత్తిచూపింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ప్రథమ చికిత్సకు తప్ప, మరే చికిత్సకూ తగిన సదుపాయాలుగానీ, మందులుగానీ లేకపోవడంతో క్షతగాత్రులను వెంటనే విరుదునగర్, మదురై తదితర ప్రభుత్వాసుపత్రులకు తరలించాల్సి వచ్చింది. అన్ని బాణసంచా సంస్థలు నడుస్తున్న ప్రాంతంలో ఆమాత్రం ముందు జాగ్రత్త ఎందుకు లేకపోయిందన్న ప్రశ్నకు వైద్యశాఖాధికారుల నుంచి సమాధానమే కరువైంది. ఇక అగ్నిమాపక శాఖ వ్యవహారం కూడా ఇందుకు భిన్నంగా లేకుండాపోయింది. బాణసంచా కర్మాగారాల్లో ప్రమాదాలు జరుగుతాయని, అది కూడా దీపావళి సీజన్లో వీటి సంఖ్య అధికమవుతుందని తెలిసినా శివకాశి అగ్నిమాపకకేంద్రంలో వున్నది కేవలం మూడు వాహనాలే. ఈ విషయాన్ని అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారి షణ్ముగమే అంగీకరించారు. ఈ వాహనాల సంఖ్య మరింత వున్నా, ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలున్నా కనీసం పదిమందైనా బ్రతికి వుండేవారని ఓ అధికారి వాపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more