ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసినట్టు అత్యంత సహజంగా నటించి న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని.. గత కొంత కాలంగా ఓటీటీ స్టార్ గా మారారు. గ్యాంగ్ లీడర్ చిత్రం తరువాత ఆయన చిత్రం నేరుగా సినిమా ధియేటర్లలో విడుదల అవుడం ఇదే. ఆయన చిత్రం వి ఆ తరువాత ఇటీవలే విడుదలైన టక్ జగదీష్ చిత్రాలు ఓటీటీలో మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఆయన తన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ తో మరో మారు వెండితెర ముందుకోచ్చారు. టాక్సీవాలా చిత్రంతో డెరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దీనిని తెరకెక్కించారు.
సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం పునర్జన్మల కథాశంతో రూపొందించబడింది. ఇక ఈ చిత్రంలో నాని కూడా డబుల్ యాక్షన్ చేయడం.. ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో.. ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో సంఘసంస్కర్తగా ఓ మంచి గెటప్ లోనూ నాని అలరించడంతో.. చిత్రంపై అంచాలను పెంచేసింది. ఇన్ని అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? సినీప్రియులకు ఎలాంటి అనుభూతిని అందించింది? పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ప్రేక్షకులను ఎంతమేరకు అలరించాడు. రెండేళ్ల విరామ తర్వాత థియేటర్లోకి వచ్చిన నానికి విజయం దక్కిందా?
వాసుదేవ్ (నాని) ఒక వర్ధమాన సినీ దర్శకుడు. సినిమాల మీద ఇష్టంతో ఉద్యోగం కూడా వదులుకున్న అతను ఒక షార్ట్ ఫిలిం ద్వారా నిర్మాతను మెప్పించి సినిమా తీసే అవకాశం అందుకుంటాడు. ఆ సినిమా కూడా పెద్ద విజయం సాధించి వాసుకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. అతడి తొలి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడంతో పాటు ఇంకో రెండు సినిమాలు తీయడానికి ఓ బాలీవుడ్ నిర్మాత ముందుకొస్తాడు. దీనికి సంబంధించి ప్రకటన చేస్తున్న సమయంలోనే వాసును పోలీసులు అరెస్టు చేస్తారు. అతను దివంగత బెంగాల్ రచయిత శ్యామ్ సింగ రాయ్ కథల్ని కాపీ కొట్టినట్లు ఆరోపణలు రావడమే అందుక్కారణం. మరి నాలుగు దశాబ్దాల కిందటే చనిపోయిన శ్యామ్ తో వాసుకేంటి సంబంధం.. నిజంగానే అతను ఆ రచనల్ని కాపీ కొట్టాడా.. ఇంతకీ ఎవరీ శ్యామ్ సింగ రాయ్.. చివరికీ కేసు ఏమైంది అన్నది మిగతా కథ.
విశ్లేషణ
పునర్జన్మల కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అలనాటి ‘జానకి రాముడు’ నుంచి ఇటీవల కాలంలో వచ్చిన ‘మగధీర’ వరకు ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. వాటిలో చాలా వరకు విజయవంతమయ్యాయి. ఈ ‘శ్యామ్ సింగరాయ్’ కూడా ఆ తరహా కథతో రూపొందినదే. దీంట్లో నాని వాసుగా.. శ్యామ్గా రెండు భిన్నమైన పాత్రల్లో నటించారు. వాసు పాత్ర కథ వర్తమానంలో సాగుతుంటే.. శ్యామ్ సింగరాయ్ పాత్ర కథ 1970ల కాలంనాటి బెంగాల్ నేపథ్యంలో సాగుతుంటుంది. ఇదే చిత్రానికి కాస్త కొత్తదనం అందించింది. అలాగే శ్యామ్-మైత్రిల ప్రేమకథను రాహుల్ రాసుకున్న విధానం.. నాని, సాయిపల్లవిల పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. అయితే వాసు, శ్యామ్ల కథల్ని సమర్థంగా ముడివేయడంలో దర్శకుడు కాస్త తడబాటుకు గురయ్యాడని చెప్పకతప్పదు
ఆరంభంలో వాసు, కీర్తి పాత్రల్ని పరిచయం చేసిన తీరు.. వాళ్లిద్దరి ప్రేమకథను చూపించిన విధానం బాగుంది. దర్శకుడు కావడం కోసం వాసు పడే కష్టాలు.. అక్కడ్కక్కడా నవ్వులు పంచుతాయి. మధ్యలో వాసు, కీర్తిల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కుర్రకారును ఆకట్టుకుంటాయి. అయితే వాసు దర్శకుడిగా ఎదిగిన తీరు మరీ సినిమాటిక్గా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అంత భావోద్వేగభరితంగా అనిపించవు. ప్రథమార్ధం మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. అక్కడి నుంచే కథ మరో మలుపు తీసుకుంటుంది.
కాపీ రైట్ కేసులో వాసు అరెస్ట్ అయ్యాక.. కథలో వేగం పెరుగుతుంది. అయితే ఆ తర్వాత వచ్చే కోర్ట్ డ్రామా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. విరామానికి ముందు కేసు విచారణ క్రమంలో వాసును క్లినికల్ హిప్నాసిస్ చేయగా.. అతనే గత జన్మలో శ్యామ్ అని చెప్పడంతో ద్వితీయార్ధంపై అంచనాలు పెరుగుతాయి. ఇక అక్కడి నుంచి కథ మొత్తం శ్యామ్ సింగరాయ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. పరిచయ సన్నివేశంలో అంటరానితనంపై శ్యామ్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటాయి. దేవదాసి మైత్రిగా సాయిపల్లవి పాత్రని పరిచయం చేసిన తీరు మెప్పిస్తుంది.
ఈ ఇద్దరి ప్రేమకథ ఎమోషనల్గా సాగినా.. అక్కడక్కడా మరీ సినిమాటిక్గా అనిపిస్తుంది. కాళీ ఆలయంలో నాని చేసే యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా అనిపిస్తాయి. సినిమాలో శ్యామ్ పాత్రను సమాజంలోని అసమానతలు.. అన్యాయాలపై పోరాడే వ్యక్తిగా చూపించినా ఆయన పోరాటాన్ని ఎక్కడా ఆసక్తికరంగా చూపించలేదు. దేవదాసీ వ్యవస్థపై శ్యామ్ పలికిన సంభాషణలు కదిలించేలా ఉంటాయి. భావోద్వేగభరితమైన క్లైమాక్స్ అందరినీ మెప్పిస్తుంది.
నటీనటుల విషాయానికి వస్తే..
నాని ఇటు వాసుగా, అటు శ్యామ్ సింగరాయ్ గా రెండు పాత్రలతోనూ సహజంగా సెట్ అయ్యాడు. పెర్ఫామెన్స్ పరంగా సవాలు విసిరే ఏ కొత్త పాత్ర ఇచ్చినా.. అందులో సులువుగా ఒదిగిపోయి.. ఆశ్చర్యపరుస్తాడు. శ్యామ్ సింగ రాయ్ గా నాని ఆహార్యం మొదలుకుని.. నటన వరకు అన్నీ ఆకట్టుకుంటాయి. నాని కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఆద్యంతం అతను ఆకట్టుకున్నాడు. వాసు పాత్ర సాధారణంగా అనిపించడంతో నటన పరంగా నాని కొత్తగా చేయడానికేమీ లేకపోయింది. నాని తర్వాత ఆటోమేటిగ్గా ఎక్కువ స్కోర్ చేసేది సాయిపల్లవినే. మైత్రి పాత్రకు అమె తనదైన అభినయంతో వన్నెతెచ్చింది.
ఆమె తెరపై కనిపించిన తొలి మూమెంట్ నుంచి ప్రేక్షకులను కట్టిపడేసేలా వుంది. చిన్న చిన్న హావభావాల విషయంలోనూ సాయిపల్లవి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే ఇండస్ట్రీ మెచ్చిన నృత్యకారిణిగా పేరుతెచ్చుకున్న ఆమె.. ఈ చిత్రంలోనూ కొత్త మూవ్ మెంట్స్ వేసి.. తనకు తానే సాటి అని చాటుకుంది. దేవదాసి పాత్రలోని సంఘర్షణను ఆమె సరిగ్గా చూపగలిగింది. తన నాట్యంతోనూ సాయిపల్లవి మెప్పించింది. కృతి శెట్టి జస్ట్ ఓకే అనిపిస్తుంది. తొలి సినిమాలో మాదిరి ఇందులో పెద్దగా ఆకర్షించలేకపోయింది. మడోన్నా సెబాస్టియన్ బాగానే చేసింది కానీ.. ఆమె మరీ జీవం కోల్పోయినట్లు కనిపించింది. రాహుల్ రవీంద్రన్ తన పాత్రకు న్యాయం చేశాడు. జిష్ణు సేన్ గుప్తా ఓకే. అభినవ్ గోమఠం బాగా చేశాడు.