హిందూమత సంస్కృతి, సంప్రదాయాలప్రకారం మనకున్న మాసాలలో ఎంతో పుణ్యమైనది కార్తీకమాసం. ఈ కార్తీకమాసంలో క్షీరాబ్ది ద్వాదశి ఎంతో విశిష్టమైనది కూడా. కార్తీకమాసంలో వచ్చే శుద్ధపక్ష ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు.
ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు పవళించిన శ్రీమహావిష్ణువు.. కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర మేల్కొంటాడు. ఆ మరుసటిరోజే అయిన క్షీరాబ్ది ద్వాదశినాడు విష్ణువు లక్ష్మీ సమేతుడై, బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనానికి చేరుకుంటాడు. అలా చేరుకోవడంతో ఆ రోజుని బృందావని ద్వాదశిగా పిలుచుకుంటారు.
దాని తర్వాత వచ్చేరోజు క్షీరాబ్ది ద్వాదశిని ఎంతో పుణ్యంగా భావించి, పూజాకార్యక్రమాలు నిర్వహించుకుంటారు. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లతో కూడా పేర్కొంటారు.
క్షీరాబ్ది ద్వాదశిరోజు పుణ్యనదిలో స్నానం చేసుకుంటే.. సమస్త పాపాలు తొలగిపోయి అనంతపుణ్యం లభిస్తుందని ప్రతిఒక్కరు ప్రగాఢంగా నమ్ముతారు. అలాగే సూర్యగ్రహణ సమయంలో అన్నదానం చేయడంవల్ల.. కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాల కథనాలలో చెప్పబడింది.
క్షీరాబ్ది ద్వాదశిరోజు శ్రీ మహావిష్ణువు సకలసిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన రోజుకాబట్టి.. ఆరోజు సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి... విష్ణువుకు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారంగానే నిర్వహించుకుంటారు.
అదెలా అంటే.. తులసీదేవిని లక్ష్మీదేవిగానూ, ఉసిరిచెట్టును శ్రీమహావిష్ణువును తలచుకోవడం వల్ల ఆ రెండింటిని కలిపి.. లక్ష్మీదేవి, విష్ణువులను పూజించి, వివాహం చేస్తారు. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశిని ఒక పండుగ శుభదినంగా ప్రతిఒక్కరు జరుపుకుంటారు.
క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. అవి..
అంబరీషుని విష్ణుభక్తి :
సకలసంపదలు అన్ని ఉన్నప్పటికీ.. చక్రవర్తి అంబరీషుడు ఏమాత్రం పొంగిపోకుండా కేవలం విష్ణు పాదాచర్చనమే శాశ్వతమని భావించేవాడు. ద్వాదశీవ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించి.. వ్రతం తరువాత కాళిందీ నదీజలంలో పుణ్యస్నానం చేసి.. మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని మహిమాన్వితంగా నిర్వహించాడు.
తరువాత సాలవర్ష ప్రవాహాలను కురిపించే ఆరువేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. అనేక బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి, తాను కూడా భోజనానికి సిద్ధపడుతుండగా... చతుర్వేదాలను విశ్లేషించిన ధీశాలి, అమిత తపస్సంపన్నుడయిన దుర్వాస మహాముని ఆ ప్రాంతానికి వచ్చాడు.
ఎంతో దివ్యమైన సమయంలో దుర్వాసుని రాకను పవిత్రంగా భావించి.. అంబరీషుడు ఆ మహామునిని భోజనం చేయమని కోరుకున్నాడు. అప్పుడు మహర్షి కాళిందిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళతాడు. అయితే అతను నదిలో స్నానం చేస్తూ.. పరవశంతో పరధ్యానంలో మునిగిపోతాడు.
ద్వాదశ క్షణాల్లో భుజిస్తేగాని వ్రతఫలం దక్కదు కాబట్టి బ్రాహ్మణులు, పండితులతో అంబరీషుడు మంచిచెడులను సమాలోచించాడు. ‘‘విబుధులారా! దుర్వాసుడు నా అతిథి. అతనికి మర్యాదలు చేయడం నా ధర్మం. మహర్షి భుజించకుండా నేనే భుజిస్తే.. అతని ఆగ్రహానికి, శాపానికి గురవుతాను. అయితే ద్వాదశ ఘడియలలో నేను పారణం చేయకపోతే.. వ్రతఫలం దక్కక, విష్ణుదేవుని కృపావృష్టి నాపై వర్షించదు. అయితే బ్రాహ్మణ శాపంకంటే.. విష్ణుదేవుని కృప ముఖ్యం కాబట్టి నేను శుద్ధజలాన్ని సేవిస్తే దీక్ష ముగించినట్లవుతుంది. భోజనం చేయకుండా వేచివుంటాను కాబట్టి.. అతిథిని గౌరవించినట్లవుతుంది. అప్పటికీ ఆయన శపిస్తే.. అది పూర్వజన్మల ఫలంగా భావిస్తాను’’ అని వారితో అంటాడు.
అలాగే తన మనస్సులో శ్రీహరిని ధ్యానించి, కేవలం జలాన్ని సేవించి.. మహాముని రాకకోసం ఎదురుచూస్తాడు.
ఇదిలావుండగా.. దుర్వాసన మహాముని నదీస్నానం ముగించుకుని అక్కడికి చేరుకుంటాడు. తన దివ్యదృష్టితో అక్కడ జరిగిందిందంతా గ్రహించి రాజు చేసిన కార్యం మహాపరాధంగా భావిస్తాడు. తనకు అవమానం జరిగిందని భావించి కోపంతో తన జటాజూటం నుంచి ఒక దుష్టశక్తిని సృష్టించి అంబరీషుడి మీద ప్రయోగిస్తాడు.
దాంతో భయపడిపోయిన అంబరీషుడు, విష్ణువును ప్రార్థించగా... అప్పుడు విష్ణువు ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగిస్తాడు. అది అగ్నిహోత్రంలా ఆవిర్భవించి.. క్షణాలలో దుర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి.. దుర్వాసునిని వెంబడిస్తుంది.
అలా మూల్లోకాలలోనూ దుర్వాసునిని వెంబడించిన ఆ సుదర్శన చక్రాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. అప్పుడు మహర్షి తనను రక్షించమని బ్రహ్మను ప్రార్థించగా.. అతనితో బ్రహ్మ ‘‘ఓ మునివ్వరా! నువ్వు సుదర్శన చక్రం నుంచి రక్షించుకోవాలంటే అది కేవలం విష్ణుమూర్తికే సాధ్యం. అతనిని శరణు వేడుకోవడం శ్రేయస్కరం’’ అని చెబుతాడు.
అప్పుడు దుర్వాసుడు విష్ణువు దగ్గరకు చేరుకుని... ‘‘ఓ భక్తవరదా! నీ చక్రాగ్ని జ్వాలలనుంచి నన్ను రక్షించు’’ అని వేడుకుంటాడు. అతనితో కేశవుడు ‘‘ఓ మునిసత్తమా! నేను భక్తులకు సదా దాసుడిని. వారు తమ భక్తిపాశాలతో నన్ను హృదయాలలో బంధించి వుంచుతారు. వారిని చెరపడం వల్లే ఆ చక్రం నిన్ను వెంటాడింది. ఆ సమయంలో నిన్ను రక్షించేది అంబరీషుడు మాత్రమే’’ అని అంటాడు.
దుర్వాసుడు అంబరీషుడు దగ్గరకు చేరుకుని... ‘‘ఓ రాజా! క్షీరాబ్ది దీక్షలో వున్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను మన్నించు’’ అని వినయంగా కోరుకుంటాడు.
సంపన్నుడైన అంబరీషుడు ‘‘మునివ్వరా! ఈరోజు జరిగివన్నీ భగవత్సంకల్పయుతాలు.. ఆ జగన్నాటక సూత్రధారిని కల్పితాలు’’ అని చక్రాన్ని స్తుతించగా.. ఆ చక్రం తిరిగి విష్ణువు దగ్గరకు చేరుకుంటుంది.
అనంతరం అంబరీషుడు పెట్టిన భోజనాన్ని దుర్వాసునుడు సేవించి.. సంతోషంతో ‘‘ఈరోజు లోకాలన్నింటికి నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి పుణ్య తిధి నాడు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు'' అని అనుగ్రహించినట్లు మహాభాగవతంలో చెప్పబడింది.
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more