కథ ప్యారీస్లో స్టార్ట్ అవుతుంది. రిషి కుమార్ (మహేష్ బాబు) ఆరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. తన స్నేహితులు అందరూ సర్ప్రైజ్ ఇవ్వడానికి మహేష్ ని కలవడంతో అక్కడి నుండి ప్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఓ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చి, అంచెలంచెలుగా ఎదుగుతాడు. అయితే తన జీవితం, తన విజయాలు తనొక్కడి కష్టానికి వచ్చిన ప్రతిఫలాలు కాదని, వాటి వెనుక తన స్నేహితుడు రవి (అల్లరి నరేష్) కష్టం, త్యాగం కూడా ఉన్నాయని గ్రహిస్తాడు. మరి ఆ స్నేహితుల కోసం రిషి ఏం చేశాడు? విజయం అంటే డబ్బు సాధించడమే, స్థాయిని పెంచుకోవడమే అనుకునే రిషి అసలుసిసలైన విజయాన్ని ఎలా గుర్తించాడు? మహర్షిగా ఎలా మారాడు? అనేదే కథ.
విశ్లేషణ
మహేష్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే 25వ సినిమాలో కథతో పాటు అందులోని అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా వుంది. మరోలా చెప్పాలంటే.. కమర్షియల్ చిత్రంలో మంచి పాయింట్స్ చెప్పే ప్రయత్నం చాలా బాగుందని, ఇకపై ఇలాంటి సినిమాలే రావాలని ప్రేక్షకులు కోరుకునేలా వుంది. అటు విద్యారంగం, ఇటు కర్షకుల సమస్యలను మధ్య ఓ సగటు మధ్యతరగతి వ్యక్తి ఎలా ప్రపంచాన్ని ఏలాడు.. అందుకు అతనికి ఊతమిచ్చిన అంశాలు ఏమిటన్నది చూపడంలో దర్శకుడు వంశీ నూటికి నూరు మార్కులు కొట్టేశాడు.
సీఈఓగా రిషిని పరిచయం చేసే సన్నివేశాలు చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ మొదలు నుంచే సినిమా కథలోకి వెళ్తుంది. సీఈఓగా, విద్యార్థిగా అప్పటికప్పుడు తన పాత్రలోనే రెండు వేరియేషన్స్ చూపించాడు మహేష్. స్నేహం, ప్రేమలాంటి ఎమోషన్స్ పండిస్తూనే విద్యా వ్యవస్థ తీరు తెన్నులను ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. కాలేజీ నేపథ్యం, ముగ్గురు వ్యక్తుల మధ్య స్నేహం, విద్యావ్యవస్థపై వ్యంగ్య బాణాలు సంధించడం ప్రేక్షకులను కూడా అలోచనలో పడేసింది. విశ్రాంతికి ముందు సన్నివేశాలు మెలోడ్రామా ప్రధానంగా సాగాయి. ఎమోషన్స్ ని పండించాయి.
తొలి సగంలో విద్యావ్యవస్థని ప్రశ్నించిన రిషి - ద్వితీయార్ధంలో రైతు సమస్యలపై పోరాటం చేస్తాడు. దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతుల దీనస్థితిని కళ్లకు కట్టారు. రిషి లక్ష్యం, ఆశయ సాధనకు ఎంచుకున్న మార్గం... ఆలోచనలో పడేస్తాయి. అయితే నిడివి అధికంగా వుండటంతో కొంత నెమ్మదిగా.. సాగదీతగా కనిపించక తప్పదు. ఈ కథకు కీలకం అనుకున్న మహేష్ - నరేష్ ఎపిసోడ్ లో ఎమోషన్స్ ఇంకాస్త బాగా పండాల్సింది. సినిమా క్లైమాక్స్ కూడా రొటీన్ గా వున్నట్లు అనపిస్తుంది.
నటీనటుల విషాయానికి వస్తే..
ప్రిన్స్ మహేష్ బాబు తన కెరీర్ లో ఓ మైలురాయిలా నిలిచే తన 25 చిత్రాన్ని ఎంచుకోవడంలోనే మంచి మార్కుటు కోట్టేశాడు. వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ లు రచించిన కథకు నటుడిగా మహేష్ ప్రాణం పోశాడు. తనలోని నటనావైవిధ్యాన్ని చూపించేందకు అవకాశం దక్కింది. తన పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయి. ఒక్కో షేడ్లో ఒక్కోలా కనిపిస్తాడు. సీఈఓగా స్టైలిష్గా కనిపించిన మహేష్ - విద్యార్థిగా మాస్ని అలరిస్తాడు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నప్పుడు తనలోని సిన్సియారిటీ కనిపిస్తుంది.
మహేష్ తెరపై మరింత అందంగా కనిపించాడు. తన వరకూ అభిమానుల్ని అలరించే ప్రయత్నం చేశాడు. కథానాయకుడిగా సరైన విజయం అందుకుని చాలా కాలమైన అల్లరి నరేష్కి ఇందులో వైవిధ్యభరితమైన పాత్ర దక్కింది. కథకి మూలస్తంభంగా నిలిచాడు. ‘గమ్యం’లో గాలిశీను పాత్రలా ఇది ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఇలాంటి పాత్రలకు ఇకపై నరేష్ పేరుని పరిశీలించడం ఖాయం. ఇక కథానాయికగా వరుస సినిమాలను చేస్తున్న పూజాహెగ్డేకు ఇందులో మంచి పాత్ర దక్కింది.
హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ల కోసమనే కాకుండా వంశీపైడిపల్లి పూజాహెగ్డేకు కథలో కూడా ప్రాముఖ్యతను కల్పించారు. కథానుసారం ఆ పాత్రకూ ప్రాధాన్యం ఇచ్చారు. కాలేజ్ సన్నివేశాల్లో చిలిపితనంతో ఆకట్టుకున్న పూజా పాటల్లో మరింత గ్లామర్గా కనిపించింది. జగపతిబాబు మరోసారి స్టైలిష్ విలన్గా ఆకట్టుకున్నారు. ఇక తనికేళ్ల భరని, సాయికుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ సహా సీనియర్ నటీనటులందరూ తమ పాత్రలకు అనుగూణంగా నటించి మార్కులు సాధించారు. కమల్ కామరాజు పాత్ర కూడా బావుంది. చాన్నాళ్ల తర్వాత ముఖేష్ రుషి తెలుగు తెరపై కనిపించారు. కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు ఒక్క సీన్లోనే కనిపించినా ఫ్రేమ్ ఆహ్లాదకరంగా అనిపించింది.
టెక్నికల్ అంశాలకు వస్తే..
సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో వున్నాయి. కె.యు. మోహనన్ ఛాయాగ్రహణం సినిమాకు అదనపు బలంగా నిలించింది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంచుకున్న కథ బలమైనదే. తాను అనుకున్న విధంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందుకు మహేష్ లాంటి అగ్రకథానాయకుడి ఎంచుకోవడం వల్లే ఈ కథకు మరింత బలం చేకూరింది. సినిమాని స్టైలిష్గా, రిచ్గా తీర్చిదిద్దారు దర్శక నిర్మాతలు.. ప్రతి ఫ్రేమ్లోనూ ప్రేక్షకుడికి రిచ్నెస్ కనిపిస్తుంది.
సంగీత దర్శకుడు దేవిశ్రీ పాటలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కసారి వినగానే ఎక్కేయవు. కానీ, నెమ్మదిగా వినగా వినగా నచ్చుతాయి. ‘మహర్షి’ విషయంలోనూ అదే జరిగింది. సినిమాలో ఆ పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా శ్రీమణి సాహిత్యం పాటలకు అదనపు బలాన్ని ఇచ్చింది. ఇక నేపథ్య సంగీతంలోనూ దేవి తన మార్క్ను చూపించారు. ఇక చిత్రానికి బావోద్వేగాలను జతపర్చింది ముఖ్యంగా మాటలు, డైలాగులు. రైతులపై సింపతీతో కాదు రెస్పెక్ట్ తో మాట్లాడుతున్నాను.. ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను అన్న డైలాగులు ప్రేక్షకులను అట్రాక్ట్ చేశాయి.
తీర్పు..
మహేష్ బాబు కెరీర్ లోనే నిజమైన మైలురాయిగా నిలుస్తుందీ చిత్రం. మూడు విభిన్న పాత్రలలో ఆయన చేసిన నటన అధ్భుతం. ఆయన అభిమానులకు అందించిన ఓ చక్కని ట్రీట్ మహర్షి
చివరగా... అన్నివర్గాల ప్రేక్షకులను అకర్షించే యజ్ఞమే ‘మహర్షి’..!