సూర్య ఒక సైనిక అధికారి. యువరక్తం నిండిన అధికారి కాబట్టి.. కోపం కూడా ఎక్కువే. చిన్న తప్పు జరిగినా ఓర్చుకోని మనస్తత్వం వున్నవాడు. హెడ్ క్వార్టర్స్ నుంచి సరిహద్దుకు వెళ్లాలన్నదే అతడి లక్ష్యం. ఇంతలో పై అధికారులకు తెలియకుండా ఒక ఉగ్రవాదిని కాల్చి చంపేస్తాడు. దీంతో సైనిక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సూర్యను ఆర్మీ నుంచి బయటకు పంపించాలని కల్నల్ నిర్ణయిస్తాడు.
అయితే సూర్య గాడ్ ఫాదర్ విన్నపంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఇక సరిహద్దులోకి వెళ్లాలన్న సూర్య కొరిక నెరవేరాలంటే.. వైజాగ్లో ఉన్న సైకియాట్రిస్ట్ రఘురామ కృష్ణంరాజు నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాలని కల్నల్ సూచిస్తాడు. రామకృష్ణంరాజు 21రోజుల సమయం ఇచ్చి, కోపం తగ్గించుకుని రమ్మని సూర్యకు చెబుతాడు. మరి ఆ ఛాలెంజ్ లో సూర్య నెగ్గాడా? అతను బోర్డర్ కి వెళ్లాడా? రఘురామ కృష్ణంరాజుకు సూర్యకు ఉన్న బంధం ఏంటి? అనేదే సూక్షంగా ‘నా పేరు సూర్య’ కథ.
దేశం మనకేం చేసిందని కాదు.. దేశానికి మనమేం చేశామన్నది కూడా ఆలోచించండీ అన్న వ్యాఖ్యల నేపథ్యంలో మనం ఇండియాలో వుండటం కాదు.. మనలో ఇండియా వుందా.? అసలు మనలో ఇండియాపై వున్న భక్తిభావం ఎంత అంటూ కొలమానం పెడితే.. సైనికుడు తప్ప మరెవ్వరూ అగ్రబాగన వుండరు. అలాంటి ఓ యువ సైనికాధికారిలో వున్న దేశభక్తిని విభిన్నంగా తెరకెక్కించిన చిత్రం నా పేరు సూర్య.
బొబ్బులిపులి చిత్రం ద్వారా విశ్వవిఖ్యాతన నటుడు ఎన్టీఆర్ చేత దర్శకరత్న దాసరి నారాయణ రావు చిత్రాన్ని కొత్త కథ కథనంతో తలపించేలా వుంది. సరిహద్దులో పోరుగుదేశాల శత్రువులు వుంటారన్ని తెలుసు కానీ, మనలోనూ మనకు శత్రువులు వుంటారని..దీంతో సరిహద్దులో చేయాల్సిన యుద్ధం ఇక్కడే చేస్తున్నాడంటూ పాత్రను మలిచిన విధానం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. ఆర్మీ క్యాంపు నేపథ్యంలో మొదలయ్యే కథ.. అక్కడ అల్లు అర్జున్ తీరును ఎలివేట్ చేసిన విధానం ఆసక్తికరంగా చిత్రీకరించారు దర్శకులు.
కథ వైజాగ్ కు మారిన తరువాత రోటిన్ చిత్రంలా అనిపించినా.. అనూ ఇమ్మాన్యుయేల్ తో ప్రేమాయణం, కుటుంబ నేపథ్యం, చల్లా గ్యాంగ్ అరాచకాలు, కాసింత కొత్త కథనంలో వచ్చిన బొబ్బులి పులి చిత్రంలా అనిపిస్తుంది. పగటు అభిమాని కోరుకునే పాయింట్ మాత్రం దర్శకుడు మిస్ అయ్యాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అల్లు అర్జున్ సరిహద్దులో యుద్దం చేసివుంటూ చిత్రం మరింతగా అభిమానుల ఆధరణను పొందేదన్న టాక్ మాత్రం వినిపిస్తుంది. అయితే దేశ భక్తి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, డైలాగులు, హీరో క్యారెక్టర్ మాత్రం చిత్రాని అయువుపట్టని చెప్పాలి.
నటీనటుల విషయానికోస్తే..
అల్లు అర్జున్ వన్ మెన్ షో. ఆయన పాత్ర కోసం తనని తాను తీర్చిదిద్దుకున్న విధానం ఆ పాత్ర కోసం పడిన కష్టం తెరపై అడుగడుగునా కనిపిస్తాయి. కోపం ఉన్న సైనికుడిగా ఆయన హావభావాలు చాలా బాగుంటాయి. ఈ సినిమాలోని ఆయన నటన కెరీర్ లోనే హైలైట్ గా నిలుస్తుంది. ఫైట్స్, డ్యాన్సుల్లోనూ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. వర్షగా అను ఇమ్మాన్యుయేల్ అందంగా కనిపించారు. అదే సమయంలో పరిధి మేరకు భావోద్వేగాలు కూడా పండించారు.
రామకృష్ణంరాజు పాత్రలో నటించిన సీనియర్ నటుడు అర్జున్ సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. స్టైలిష్ గా కనిపించిన అర్జున్ తన పాత్రలో ఒదిగిపోయారు. చల్లాగా శరత్ కుమార్ ఆకట్టుకుంటారు. కార్గిల్ పోరాటంలో కాలు కోల్పోయిన సైనికుడు ముస్తఫా సాయికుమార్ పాత్ర కూడా బాగుంది. అర్జున్ నటన సినిమాకు ప్రధాన బలం. సూర్య గాడ్ ఫాదర్ గా రావు రమేష్ చిన్న పాత్రలో మెరిపిస్తారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ అంశాలకు వస్తే..
తొలిసారి దర్శకత్వం వహించినా.. వక్కంతం వంశీలో పరిణతి తెరపై ప్రతీ సన్నివేశంలోనూ కనిపిస్తుంది. కథకుడిగా, దర్శకుడిగా ఆయనకు మంచి మార్కులు పడతాయి. వంశీ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. కెమెరామెన్ రాజీవ్ రవి ఆర్మీ నేపథ్యాన్ని చూపించిన విధానం కొత్తగా ఉంది. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ లు బన్నీ ఎనర్జీకి తగ్గ ట్యూన్స్ తో అలరించారు. మాస్ ఐటమ్ నంబర్, రొమాంటిక్ మెలోడి, ఫ్యామిలీ సాంగ్ ఇలా అన్ని వేరియేషన్స్ లోనూ ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని మరింత పెంచారు.
రాజీవ్ రవి సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. ఆర్మీ సీన్స్ తో పాటు ఇతర సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు రాజీవ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. సరిహద్దులో వున్న శత్రువుల కంటే.. దేశం లోపల ఉన్న దుష్టశక్తులపైనే ముందుగా యుద్దం చేయాలని భావించే ఆవేశపరుడైన సైనికుడి కథే ఇది. దర్శకుడు వక్కంతం వంశీ.. ఆసక్తికరంగా చిత్రీకరించాడు
తీర్పు:
ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని కలిగించేలా చిత్రంలోని కథనం సాగింది. దేశంలో అంతర్గతంగా వున్న దుష్టశక్తులు కూడా.. సరిహద్దులోని శత్రువులే నన్న కాన్సెప్ట్ తో చిత్రీకరించిన సినిమా ఇది. కాకపోతే అర్మీ నేపథ్యంలో అధిక సన్నివేశాలు లేకపోవడం, ఎమేషనల్ పన్నివేశాలకు తోడు స్టైలిష్ స్టార్ కాస్తా యాంగ్రీ అర్మీ మన్ గా మారడం.. సూపర్బ్. అయితే సెకండాఫ్ లో చిత్రంలో డైలాగులు అధికంగా వుండి సాగదీసినట్లుగా అనిపించింది.
చివరగా.. భావోద్వేగాలతో కదిలించే ‘సూర్య’..