వరుస ఫ్లాపులతో సతమతమయిన రామ్ కు ‘నేను శైలజ’తో మంచి హిట్ అందించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఆ తర్వాత హైపర్ అంటూ మళ్లీ పాత ఛాయలతో మన ముందుకు వచ్చి బోల్తా పడ్డాడు. దీంతో మరోసారి ఆ హిట్ కాంబో మరోసారి జోడి కట్టింది. అదే ‘ఉన్నది ఒకటే జిందగీ’. మరి ఈ కాంబో మరోసారి హిట్ కొట్టారా? చిత్రం ఎలా ఉంది... రివ్యూలోకి వెళ్లి చూద్దాం.
విశ్లేషణ :
ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే అమ్మాయిని ప్రేమించటం.. చివరకు ఒకరి త్యాగం తెలిసిన కథే అయినా చిత్రంలో ఫ్రాంక్ నెస్ పాలు చాలా ఎక్కువగా ఉంది. ఏ సినిమాలో అయినా ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు విషయం చెప్పకుండా వాళ్లలో వాళ్లే కుమిలిపోవటం లాంటి ఎమోషనల్స్ ఉంటాయి. కానీ, ‘ఉన్నది ఒకటే జిందగీ’లో మాత్రం నాటకీయతకు అవకాశం లేకుండా చూసుకున్నాడు దర్శకుడు కిషోర్. అయితే వేగంగా జరిగే పరిణామాలకు స్లో నారేషన్ అడ్డంకిగా మారింది.
సహజంగా చాలా నిజాయితీగా సాగిపోయే కథకు.. ఎక్కువ స్వేచ్ఛ తీసుకోకుండా నీట్ గా తెరకెక్కించాడు. దీంతో ఆడియన్స్ తమను తాము తెరపై చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎటోచ్చి కమర్షియల్ హంగులు లేకపోవటం సినిమాకు మైనస్ గా మారింది. దీనికి తోడు స్లోగా సాగిపోవటం కూడా మరో మైనస్ అయ్యింది. అవసరమైన సన్నివేశాల్ని కూడా నెమ్మదిగానే నడిపించాడు.
తెలిసిన విషయాల్నే.. మన చుట్టూ జరిగే సంగతుల్నే.. తెరమీద అందంగా.. ఆహ్లాదంగా.. ఎమోషనల్ గా చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఉన్నది ఒకటే జిందగీలో పాత్రల చిత్రీకరణ బాగా ఆకట్టుకుంటుంది. కథనాలు అసహజంగా అనిపించినప్పటికీ.. అవి దారితీసే పరిస్థితులు మాత్రం నిజజీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. రెండో సగం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినప్పటికీ.. చివర్లో నాటకీయతకు చెక్ పెడుతూ మంచి ముగింపు ఉంటుంది. కానీ, అక్కడ పాత చిత్ర పంథానే దర్శకుడు అనుసరించాడు.
నటీనటుల విషయానికొస్తే... హైపర్ రోల్స్ లో ఎంతో అతి చేసే రామ్, ఇలాంటి సిన్సియర్ రోల్స్ లో ఎంత ఒద్దికగా నటిస్తాడో మరోసారి నిరూపించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటనే హైలెట్. హీరోతో సమానమైన పాత్రలో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. హీరోయిన్లలో అనుపమ మెయిన్ లీడ్ లో ఆకట్టుకుంది. మహా పాత్రే మెయిన్ అస్సెట్. లావణ్య జస్ట్ గ్లామర్ రోల్ కి తప్ప పెద్ద ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించింది. అభి-మహా మధ్య పరిచయం ఆహ్లాదంగా ఉంది. మిగతా పాత్రలు బాగా కనెక్ట్ అవుతాయి.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే... దేవిశ్రీ ప్రసాద్ పాటలు.. నేపథ్య సంగీతం రెండూ సినిమాకు ఆకర్షణగా మారాయి. కానీ, సెకండాఫ్ లో జోష్ లేని పాటలు మిస్సయిన ఫీలింగ్ కనిపిస్తుంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ‘స్రవంతి మూవీస్’ స్థాయికి తగ్గట్లే బాగున్నాయి.
తీర్పు :
దర్శకుడిగా కంటే కిషోర్ తిరుమల రచయితగా ఎక్కువ మెప్పించాడు. కానీ, కొన్ని చోట్ల సినిమా మరీ నెమ్మదిగా సాగిపోవటం నిరాశపరిచే అంశం. అది కాస్త వేగంగా సాగి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదేమో. కానీ, సహజంగా సాగిపోయే కథనాలు ప్రేక్షకుల మనసుకు తాకుతుంది.
చివరగా... ఉన్నది ఒకటే జిందగీ.... ఫ్రెండ్స్ కు ప్రేమతో...