
ప్రభుత్వ రంగ సంస్థలయిన ఒఎన్జిసి, ఆయిల్ ఇండియా, గెయిల్లకు ఈ పనిని అప్పగించాలని అరవింద్ కేజ్రీ వాల్ డిమాండ్ చేసారు.ప్రభుత్వాన్ని బ్లాక్మెయిలింగ్ చేస్తూ తమ ఆదేశాలను ఖాతరు చేయని మంత్రులు, అధికారులను పదవి నుంచి తప్పించగలుగుతున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ప్రధాని మన్మోహన్ సింగ్ వంత పాడుతున్నారని ఆయన విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుదిరిన ఒప్పందాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ఇప్పటివరకూ లక్ష కోట్ల రూపాయల లాభాన్ని రిలయన్స్ సంపాదించుకుందని ఆయన చెప్పారు. రిలయన్స్ చేసిన డిమాండ్లకు తలవంచనందుకే జైపాల్రెడ్డి పెట్రోలియం శాఖ పదవిని కోల్పోయారని ఆయన చెప్పారు. జైపాల్రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు నలభైఐదు వేల కోట్లరూపాయలు ఆదా అయిందని ఆయన తెలియజేశారు. అవినీతిని పెంచి పోషించటంలోను, ప్రకృతి వనరులను బడాకార్పోరేట్ సంస్ధలకు అప్పనంగా అప్పగించి దేశాన్ని దోచుకుతినటంలో బిజెపి, కాంగ్రెస్ మధ్య తేడా లేదని చెప్పటానికి రిలయన్స్తో వాజపేయి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని గుడ్డిగా కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి సజీవ సాక్ష్యమని ఆయన తెలియచేశారు. ఒప్పందంలోని ప్రతి ఒక్క అంశం రిలయన్స్కు విపరీతమైన లాభం కలిగించే తీరులో రూపొందించారని ఆయన చెప్పారు. ఒక యూనిట్ కరెంటు ఉత్పత్తికి అవసరపడే గ్యాస్ను మూడు డాలర్లకు అందచేస్తామని కుదర్చుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కి పద్నాలుగు డాలర్లకు విక్రయించే విధంగా అంగీకారాన్ని సవరించవలసిందిగా రిలయన్స్ సంస్థ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. 2000లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని 2014వరకూ సవరించటానికి వీలులేదు.

తనకు లభించిన 31 బ్లాకులలో ఇంతవరకూ 13బ్లాకులలో మాత్రమే రిలయన్స్ తవ్వకాలు మొదలు పెట్టి మిగిలిన బ్లాకులను సబ్ కాంట్రాక్టులకు ఇచ్చి వేలాదికోట్ల రూపాయలను జేబులో వేసుకుందని ఆయన చెప్పారు. ఉత్పత్తివ్యయం పెరిగిందన్న మిషతో రేటు పెంచవలసిందిగా ప్రభుత్వంపై ఓత్తిడి తీసుకురాగా ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పడిన మంత్రుల సాధికార కమిటీ ఈ రేటును 2.34 డాలర్ల నుంచి 4.32 డాలర్లకు పెంచింది. 2000 సంవత్సరంలో ఎన్టిపిసితోకుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2017 వరకూ రిలయన్స్ 2.34 డాలర్లకే గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఇవ్వవలసి ఉంది. అయితే రేటు 4.32 డాలర్లకు పెరిగితే వినియోగదారులు ఒక్క యూనిట్కు ఏడు రూపాయలవరకూ చెల్లించవలసి ఉంటుందని ఇంధన శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ డిమాండ్కు అంగీకరించిందని ఆయన చెప్పారు. మధ్యలోనే కిరికిరి పెట్టి రిలయన్స్ తన డిమాండ్ సాధించుకుని ఎనిమిది వందల కోట్ల రూపాయల లాభం ఆర్జించిందని కేజ్రివాల్ చెప్పారు. రిలయన్స్ పాల్పడుతున్న అవకతవకలను గ్రహించిన అప్పటి మంత్రి మణిశంకర్ అయ్యర్ దాని జోరుకు బ్రేకు వేయాలని ప్రయత్నించి పదవిని పోగొట్టుకున్నారని ఆయన చెప్పారు . ఆయన స్థానంలో నియమితులైన మురళీ దేవర రిలయన్స్ చేసిన అన్ని ప్రతిపాదనలకు సంతకం చేసి రూపాయికి రెండు రూపాయల లాభం వచ్చేట్లు, లాభంలో 20శాతం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరే విధంగా సరికొత్త ఒప్పందం ఖరారు చేశారని ఆయన చెప్పారు.

ఈ ఒప్పందం ఫలితంగా రిలయన్స్ లాభాలు గణనీయంగా పెరిగాయి. రేటు పెంచటానికి జైపాల్ అంగీకరించక పోవటంతో రిలయన్స్ ఉత్పత్తి తగ్గించింది. రేటు పెంచటానికి వీలుందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించవలసిందిగా అటార్నీ జనరల్ను ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారే తప్పించి కుదుర్చుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రిలయన్స్పై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించవలసిందిగా మాత్రం సూచించలేదని ఆయన చెప్పారు. ఉత్పత్తితగ్గించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినందుకు జైపాల్ రిలయన్స్పై ఏడు వేల కోట్ల రూపాయల జరిమానా విధించటంతో రిలయన్స్ అధినేత ప్రధానిపై ఒత్తిడి తెచ్చి జైపాల్ పదవికే ఎసరు పెట్టారని కేజ్రివాల్ ఆరోపించారు. ప్రధాని నేరుగా అవినీతికి పాల్పడక పోయినా ఎదుటి వాడు లాభపడే విధంగా నిర్ణయం తీసుకోవటం కూడా అవినీతి కిందకే వస్తుందని చట్టం చెబుతోందని ఆయన గుర్తుచేశారు. రిలయన్స్ పాల్పడుతున్న అక్రమాలపై తమ సంస్ధ పోరాటం చేస్తుందని ఆయన ప్రకటించారు.
