
దేశంలో పాలపొడి నిల్వలు భారీగా పేరుకు పోయాయి.ప్రస్తుత అంచనాల ప్రకారం 1.20 లక్షల టన్నుల వరకూ పాలపొడి గోడౌన్లలో మూలుగు తోంది. దీనిని ఏం చేయాలన్నది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్కు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. చివరకు మద్యాహ్న భోజన పథకం వంటి సంక్షేమ పథకాలకు ఈ మిగిలిపోయిన పాల పొడిని వినియోగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అలాగే అభివృధ్ధి చెందుతున్న దేశాలకు మన దేశం అందిస్తున్న ఆహార ధాన్యాలతో పాటుగా పాలపొడిని కూడా ఆ దేశాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పవార్ తెలిపారు. ఇందుకు సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖలతో చర్చించామని ఆయన తెలిపారు. పాల సహకార కేంద్రాలు సేకరించిన పాలను సక్రమంగా మార్కెటింగ్ చేసుకోవడం వలన సమస్య తలెత్తుతోం దిని ఆయన చెప్పారు. దేశంలో ఓ వంక పాల కొరత ఉంటే మరో వంక పాలపొడి నిల్వలు పేరుకుపోతున్నాయని ఇదొక పరిస్థితిగా మారిందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాల ఉత్పత్తుల రంగంలో పేరొందిన అమూల్ సంస్థను కోరామని అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో పాలపొడి ఎగుమతికి అంతగా అవకాశాలు లేవని సంస్థ తెలిపిందని అన్నారు. ప్రపంచంలో పాల ఉత్పత్తుల్లో ప్రధమ స్థానంలో ఉన్నా ఎగుమతుల్లో మాత్రం మన దేశం ఇంకా వెనుకబడే ఉందని మొత్తంగా చూస్తే 122 మిలియన్ టన్నుల కంటే ఎగుమతులు ఉండటం లేదని అమూల్ ఎండీ వివరించారు. దేశీయ మార్కెట్లో పాల ధరను నిలకడగా ఉంచేందుకు ఎగుమతులపై నిషేదం విధించడం కూడా సమస్యకు ఒక కారణంగా పేర్కొంటున్నారు.