
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కి, డిప్యూటీ సీఎం రాజనరసింహ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ చిలికి చిలికి గాలివాన లాగా తయారయ్యింది. ఇన్ని రోజులు లోలోపట ఉన్న వీరి విభేదాలు బజారుకెక్కాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయికి చేరుకున్నాయి. వీరి మధ్య విభేధాలు ఈ స్థాయికి చేరడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ వారు. ప్రతి జిల్లాలో ఇందిరమ్మబాట షెడ్యూల్ ఖరారు చేయ డానికి ఆ జిల్లా మంత్రులతో, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో సిఎం స్వయానా సమావేశం నిర్వహించి ఖరారు చేస్తారు. కానీ మెదక్ జిల్లాలో ఇన్చార్జీ మంత్రి డి.కె. ఆరుణకు ముఖ్యమంత్రి ఆ బాధ్యత ను అప్పజెప్పారు. ఇది డిప్యూటీ సిఎంకు ఆగ్రహం తెచ్చింది. ఆయన ఆ సమావేశానికి వెళ్లనేలేదు. డిప్యూటీ సీఎం అయి ఉండటమే కాకుండా, తమ ప్రభుత్వంలో తన మాట చెల్లకపోవడం పట్ల డిప్యూటీ సిఎం ఆందోళన గా ఉన్నారు. ఇదే వీరిద్దరి మధ్య విభేదానికి కారణమయ్యిందని అంటున్నారు. ఇక వీరు అమీ తుమీ తేల్చుకునేందుకు త్వరలో మెదక్ జిల్లాలో జరిగబోయే ఇందిరమ్మ బాట వేదిక కానుంది. సిఎం కిరణ్ ఇందిరమ్మబాట ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 8 జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. మెదక్లో ఇందిరమ్మబాట కార్యక్రమంలో చేపడుతున్నారు. రెండు నెలలుగా మెదక్ జిల్లా ఇందిరమ్మబాట వాయిదా పడుస్తూ వసుతంది. సింగూరు జలాల విషయంలో సిఎం స్పందించకపోవడంతో ఇందిరమ్మబాట ను డిప్యూటీ సిఎం వాయిదా వేయిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు వాయిదా పడేలా లేదు. ఆయన పాల్గొన క పోయినా సిఎం ఇందిరమ్మబాట చేపట్టేందుకే సిద్దమయ్యారు. ఇప్పుడు డిప్యూటీ సిఎం ఏక్ నిరంజన్ అయ్యారు. మరి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఎంత దూరం వెళుతుందోనని కాంగ్రెస్ వారు ఆందోళన చెందుతున్నారు.
