
అధిష్టానం కొత్త ఆలోచనలో పడిందా? రాహుల్ గాంధీని కేంద్రంలో చేర్చుకోవటం పై ఢిల్లీ నాయకుల్లో చర్చ జరుగుతుంది. సోనియా గాంధీ కూడా దీనిపైన బడా నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీకి కొత్తగా అనుభవంగా ఉందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఇంతకీ యువరాజు మనసులో ఏముంది ?కాంగ్రెస్లో గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులంటే హీరోలే. వాళ్ళకు ఉన్న ఇమేజీ ఇంతా అంతా కాదు. అందులోనూ కాంగ్రెస్ యువరాజు రాహుల్ అంటే అందరికీ క్రేజీనే. ఓవైపు ఎంపీగా మరోవైపు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా నేతల్లో ప్రిన్స్ను మంత్రిగా చూడాలన్న కోరిక బాగా పెరిగిపోతోంది. దీంతో త్వరలో జరగబోయే పునర్వ్యవస్థీకరణలో ఏదోఒక పదవి చేపట్టాలని తెగ ఒత్తిడి చేసేస్తున్నారు. యూపీఏ వన్ క్యాబినెట్లోనే చేరాలని ప్రతిపాదనలు వచ్చినా రాహుల్ సున్నితంగా తిరస్కరించారు. అయితే రెండోదఫా ఎంపీగా ఎన్నికైనా యూపీఏ 2 మంత్రివర్గానికి దూరంగానే ఉన్నారు.

పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్న భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ను ప్రపోజ్ చేస్తున్న నేపథ్యంలో ముందుగానే క్యాబినెట్లో చేరితే మరింత అనుభవం వస్తుందని పార్టీ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయ్.అయితే ఈ విషయంలో రాహుల్ ఆచితూచి స్పందిస్తున్నారు. తల్లి సోనియా, అంతా తనయుడి ఇష్టమే అని చెప్పడంతో ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తున్నారు. ప్రధాని మన్మోహన్సింగ్తో భేటీ అయ్యి విస్తరణపై చర్చించారు. ఇన్నాళ్ళు తనకు పెద్దదిక్కుగా సలహాలిచ్చి, ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ మెట్లెక్కిన ప్రణబ్ను కలిసి మనసులోమాట చెప్పారు. దాదా సలహా తీసుకొని వచ్చారు.మన్మోహన్, ప్రణబ్లను రాహుల్ కవలడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఇద్దరూ క్యాబినెట్లో చేరితేనే మంచిదనే సలహాఇచ్చినట్లు హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. దీంతో రాహుల్బాబు క్యాబినెట్లో చేరడం ఖాయమని మెజార్టీ నేతలు భావిస్తున్నారు. సమయం దగ్గరపడుతున్నా రాహుల్ నుంచి సమాధానం రాకపోవడం ఉత్కంఠను రేపుతోంది.
