
రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్ర సీజన్ ప్రారంభమైంది. రెపటి నుండి మహిళ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసిన వారికి చివరి లక్ష్యం ఒక్కటే అధికారం కోసమే అధినేతలు పాదయాత్రలు చేస్తున్నావిషయం ప్రజలు తెలుసుకోవాలి? ప్రజలను బాగా ఆకట్టుకునేందుకు వందలాది కిలోమీటర్లు పరుగులు పెడుతున్నారు. యాత్రలతో తమ ఓటుబ్యాంకును పదిలం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు రాజకీయనాయులు. రాష్ట్రంలో పోటాపోటీగా యాత్రలు సా..గుతూనే వున్నాయి. బోసిపోయిన ఊర్లలో బడానేతలు బహిరంగ సభలు పెడుతున్నారు. సాధ్యాఅసాధ్యాలను పక్కన పెట్టి నోటికి హద్దు అదుపు లేకుండా హామీల గుప్పిస్తూనే ఉన్నారు. ప్రజల మనస్సుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్. వైఎస్ఆర్ లను బరిలోకి లాగుతున్నారు నేటి రాజకీయ నాయకులు. మొన్నటి వరకు రాజన్న రాజ్యం పేరు విన్నం, కానీ ఆ రాజ్యం వచ్చినట్లు మనకు ఎక్కడ కనిపించలేదు.

ఇప్పుడు కొత్త తెరపైకి రామరాజ్యం వచ్చింది. రామ రాజ్యం లో ప్రజలు హాయిగా ఉంటారని హామీలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇదీ తెలుగు దేశం పార్టీ ధివంగత అధినేత మాజీ ముఖ్యమంత్రి తారక రామరావు గారు పేరును ఇప్పుడు రామ రాజ్యంగా ప్రజలకు పరిచయం చేస్తున్నాడు పాదయాత్రలో. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ఆయన రాజన్న రాజ్యం పేరును ప్రజలకు పరిచయం చేయటం జరిగింది. వైఎస్ జగన్ కూడా రాజన్న రాజ్యం అంటూ ఓదార్పు యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ఆర్ కూతురు షర్మిల .. రాజన్న రాజ్యం కోసం పాదయాత్ర చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ రెండు పార్టీ నాయకులు రామరాజ్యం కావాల లేక రాజన్న రాజ్యం కావాల అంటూ ప్రజలకు పరీక్ష పెడుతున్నారు నేటి పాదయాత్ర నాయకులు. రామరాజ్యం తిరిగి తెద్దాం. ప్రజలకు సుభీక్షమైన పాలన రామరాజ్యంలోనే సాధ్యం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడదామంటూ తెలుగుతమ్ముళ్ళు తెగ తిరిగేస్తున్నారు. పాదయాత్ర పేరిట తెలుగుదేశం అధినేత 16 రోజులుగా ఓటు వేట సాగిస్తూనే ఉన్నారు. అలాగే తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల సైతం పాదయాత్రకు సిద్దమైంది. రాజన్న రాజ్యం కోసం అంటూ ప్రజల్లోకి వెళ్లనుంది. నిరుపేదల గుండెల్లో గూడుకట్టుకున్న రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే వైకాపాను ఆదరించాలని ఆమె పిలుపునిస్తోంది.

సందట్లో సడేమియా లాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొత్త రాజ్యం పేరు ప్రకటించినట్లు తెలుస్తోంది. అదే ఇందిరమ్మ రాజ్యం .ఈక్రమంలో అనతికాలంలో జరిగే స్థానిక ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ పడుతూనే వున్నాయి. తమదైన శైలిలో పాదయాత్రలు చేపడుతూనే వున్నాయి. అయితే తర్వలో ప్రజలు ఇందిరమ్మ రాజ్యం..రామన్న రాజ్యం..రాజన్న రాజ్యం ఏదీ కావాలో నిర్ణయించేది బ్యాలెట్ బాక్సుల్లో తేలుతుందని ప్రజలు అంటున్నారు. అయితే చనిపోయిన నాయకుల పేరులతో శవ రాజకీయలు చెయటం నేటి నాయకులకు ఫ్యాషన్ గా మారిపోయింది. అసలు ముందు నేటి నాయకులు ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి? నారా వారి రాజ్యమా? వైఎస్ రాజ్యమా? సోనియామ్మ రాజ్యమా? ముందు ఏ రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉంటారో రాజకీయ నాయకలు తెలుసుకోవాలని రాష్ట్రా ప్రజలు కోరుకుంటున్నారు.
