
మన ముఖ్యమంత్రి గారు అమ్మ దగ్గర మార్కులు కొట్టేశారు. తెలంగాణ వాదులు తలపెట్టిన తెలంగాణ మార్చ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఎం కిరణ్ తీసుకున్న జాగ్రత్తలపై కేంద్రం చాలా ఆనందంగా ఉందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. గతంలో కంటే ఈసారి చాలా బెటర్ అని కేంద్రంలోని నాయకులు అంటున్నారు. తీవ్ర ఉత్కంఠ రేపిన తెలంగాణ మార్చ్ ప్రశాంతంగా ముగియడంపై కాంగ్రెస్ అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్కు కేంద్రం బాసటగా నిలిచింది. కోరిన వెంటనే బలగాలను పంపింది. రైల్వేశాఖ కూడా పూర్తిగా సహకరించేలా ఆదేశాలిచ్చింది. సీఎం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా నిరోధించగలగడం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు సంతృప్తి వ్యక్తంచేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీఎంను అధిష్ఠానం పెద్దలు ఫోన్లో ప్రశంసించారు.

గతంలో మిలీనియం మార్చ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో కొంత కాలం దాని ప్రభావం పాలనపై పడింది. కానీ, తెలంగాణ మార్చ్ అపశృతులు లేకుండా ముగియడంతో పలువురు ఢిల్లీ పెద్దలు సీఎంకి ఫోన్చేసి సమర్థంగా వ్యవహరించారంటూ ప్రశంసించా రు. కాగా, తెలంగాణ అంశంపై ఇంకా నాన్చకుండా త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా కిరణ్ ఢిల్లీ పెద్దల ముందు వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్రంలో ప్రశాంతత నెలకొని ఇరుప్రాంతాల్లోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగవంతంగా చేపట్టేందుకు వీలుంటుందని ఢిల్లీ పెద్దలతో ముఖ్యమంత్రి చెప్పారు.
