కామన్వెల్త్ గేమ్స్ లో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాజీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీకి ఒలింపిక్స్ నిమిత్తం లండన్ వెళ్లేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహక కమిటీ చైర్మన్గా వ్యవహరించిన కల్మాడీ ఈ నెల 26 నుంచి ఆగస్టు 13 వరకు లండన్లో పర్యటించవచ్చని సీబీఐ స్పెషల్ జడ్జి తల్వంత్ సింగ్ ఆదేశాలు జారీచేశారు. లండన్ వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ కల్మాడీ చేసుకున్న విజ్ఞప్తిని తొలుత సీబీఐ వ్యతిరేకించింది. అవినీతి కేసులో ముద్దాయిగా ఉన్న కల్మాడీకి లండన్ వెళ్లేందుకు అనుమతిస్తే రోజువారీ విచారణకు ఆటంకం కలుగుతుందని వాదించింది.
అయితే ఇవన్నీ పరిగణించని జడ్జి కల్మాడీకి అనుమతిస్తున్నట్టు తెలిపారు. కల్మాడీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్) కౌన్సిల్లో సభ్యుడు, ఆసియా అథ్లెటిక్ అసోసియేషన్ (ఏఏఏ) అధ్యక్షుడు కాబట్టి అందుకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, అందువల్లే అతనికి అనుమతిచ్చినట్టు జడ్జి పేర్కొన్నారు.