
రైతులు మంచి పంటలు పండించడం కూడా పాపమేనా..? విధానపరిషత్లో అటవీశాఖ మంత్రి సి.పి.యోగీశ్వర్ సమాధానం విని ఉపసభాపతి స్థానంలో ఉన్న విమలాగౌడకు కూడా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మంత్రిగారూ.. ఏమిటీ వరుస.. సభ్యుల ప్రశ్నలకు అధికారులు ఇచ్చిన సమాధానాలు ఒక్కసారి చదవకుండానే సంతకం పెట్టేస్తున్నారా..? ఇదేం బాగోలే దు.. అంటూ ఆమె మండిపడ్డారు. అసలు విషయంలోకి వెడితే.. ఏనుగులు అరణ్యం నుంచి జనారణ్యంలోకి వచ్చి పడుతున్నాయని రైతుల పంట పొలాలను సర్వనాశనం చేస్తున్నాయని వీటి బారినుంచి రైతాంగాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలంటూ జేడీఎస్ సభ్యుడు నాణయ్య ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అధికారులు సదరు మంత్రిగారికి సమకూర్చిన సమాధానం దిమ్మతిరిగేలా ఉంది. అడవిలో ఆహారానికి తీవ్ర కొరత వచ్చి పడిందట. పైగా దున్నలు, ఏనుగులకు మధ్య ఆహారం విషయంలో తీవ్ర పోటీ ఏర్పడిందట. దీంతో ఏనుగులు పచ్చటి పొలాలవైపు కన్నేశాయట. పైగా రైతులు అరటి, చెరకు తదితర నోరూరించే పంటలు పండిస్తుండడంతో వీటికి రుచి మరిగి పదే పదే జనారణ్యంలోకి వస్తున్నాయట. ఈ సమాధానం విన్నాక సీనియర్ సభ్యుడు నాణయ్యకు చిర్రెత్తుకొచ్చింది. మంత్రి ఇలా బాధ్యతారహితంగా అజ్ఞానంతో సమాధానం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. చివరికి మంత్రి క్షమాపణ కోరడంతో వివాదం ముగిసింది. రామదాస్పై బీజేపీ ఎమ్మెల్యే ధ్వజం శాసనసభ సాక్షిగా వైద్యవిద్యాశాఖ మంత్రి రామదాస్పై బీజేపీ ఎమ్మెల్యే సార్వభౌమభగిళి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డఘటన సోమవారం చోటుచేసుకుంది. కరువుపై చర్చ సమయంలో జోక్యం చేసుకున్న భగిలి మాట్లాడుతూ జెనరిక్ ఔషధాల పేరిట ప్రజలకు కుచ్చుటోపీ వేస్తున్నారని మార్కెట్ ధరతో పోలిస్తే ఈ మందుల ధరలు పది రెట్లు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. మంత్రి రామదాస్, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఈ మొత్తం వ్యవహారంలో కుమ్మక్కయ్యారన్నారు. నైతికత ఉంటే తక్షణం రాజీనామా చేయాలని మంత్రిని డిమాండ్ చేశారు.
