
నాలుగు పదుల వయసు దాటిన ముదురు బ్రహ్మచారి.. సొట్టబుగ్గల చిన్నోడు.. రాహుల్గాంధీకి బంపర్ ఆఫర్! రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓం శాంతి శర్మ అనే మహిళ.. కాంగ్రెస్ యువరాజు గనక తన కుమార్తెను పెళ్లి చేసుకుంటే రూ.15 కోట్ల కట్నం ఇస్తానని ఆఫర్ చేస్తోంది. మాటవరసకు కాదు.. రాహుల్ని తన అల్లుడిగా చేసుకునే లక్ష్యంతో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఐదురోజులుగా జూలై 9 నుంచి మౌనదీక్షకు కూడా దిగిందామె. సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీకి పెళ్లి చేయాలని ఇంట్లో చూస్తున్నారో లేదో తెలీదు గానీ.. రాహుల్ గాంధీకి శాంతి శర్మ తన ఇంటికి అమ్యూల్ బేబీగా వస్తే.. కట్నంగా 15 కోట్లు ఇస్తానంటూ బంఫర్ ఆపర్ ఇచ్చేసింది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన కూతురిని పెళ్లాడాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తోంది. మౌనవ్రతం కూడా పాటిస్తోంది. ‘నాకో కూతురు ఉంది. ఆమెను పెళ్లాడాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నా. ఆయన పెళ్లికి ఒప్పుకుంటే రూ.15 కోట్ల కట్నం కూడా ఇస్తా’ అని రాసి ఉన్న ప్లకార్డుతో ఓం శాంతి శర్మ అనే మహిళ దీక్ష సాగిస్తోంది. తన స్వస్థలం రాజస్థాన్ రాజధాని జైపూర్ అని... తన అత్తమామలు, తల్లిదండ్రులు ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేస్తోంది. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ఆ మహిళ ఈ నెల 9 నుంచి దీక్ష కొనసాగిస్తోంది. కాగా, ఆమెకు మతిస్థిమితం లేనట్టుందని, దీక్షకు అనుమతి కూడా తీసుకోలేదని పోలీసులు చెప్పారు.
