
దేశంలో ఆర్థిక వ్యవహారాలు మందగించా యనడానికి ఉదాహరణ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వారు కరవయ్యారు. జులై 27తో ముగిసిన పక్షం రోజుల కాలానికి రూ.21,000 కోట్లు తగ్గుముఖం పట్టింది. తాజాగా రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం షెడ్యూలు బ్యాంకులు జులై 13వ తేదీన రూ.48,72,341 కోట్లు రుణాలు మంజూరు చేయగా.. అదే జులై 27 నాటికి రూ.48,51,386 కోట్లక తగ్గాయి. తాజా గణాంకాలను బట్టి చూస్తే వాణిజ్య లేదా వ్యవసాయరంగానికి చెందిన వారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి పెద్ద ఉత్సాహం చూపడం లేదని తెలుస్తోంది. జులై 27 నాటికి వ్యవసాయం రంగానికి చెందిన రుణాలు రూ.97,787 కోట్లు కాగా అంతకు ముందు పక్షం రోజుల ముందు రూ.1,02,759 కోట్లు.
ఇదిలా ఉండగా షెడ్యూలు బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. జులై 27 నాటికి రూ.78,649 కోట్లు డిపాజిట్లు కాగా జులై 13 నాడు రూ.80,567 కోట్టు డిపాజిట్లు జరిగాయి. అయితే ఆర్బీఐ మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం డిపాజిట్లు 16 శాతం రుణాల డిమాండ్ 17 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. బ్యాంకు డిపాజిట్లు, రుణాలు తగ్గడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థ మందగించడంతో పాటు 2011-12లో జీడీపీ వృద్ధిరేటు 9 సంవత్సరాల కనిష్ఠానికి 6.5 శాతానికి పడిపోవడమేనని తెలిపింది. తాజాగా రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కూడా ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 5.5 శాతంగా నమోదు చేయవచ్చునని అంచనా వేసింది. ఆర్బీఐ కూడా జీడీపీ వృద్ధిరేటు ముందుగా 7.3 శాతం అంచనా వేసి తిరిగి దాన్ని 6.5 శాతానికి సవరించింది.