
గత ఆరుమాసాలుగా మద్యం వ్యాపారులకు ఎంఆర్పి రగడ, ఎసిబి సోదాలు, ఆపైన ఉపఎన్నికల కారణంగా ఎన్నికల కమిషన్ ఆంక్షలు కంటిమీద కునుకులేకుండా చేసాయి. ఎన్నికల సంఘం నిబంధనలు మద్యం వ్యాపారులను, మందుబాబులను ఇరకాటంలో నెట్టేసాయి. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయపక్షాలు డబ్బు, మద్యాన్ని వెదజల్లకుండా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో విజయనగరంలో ఉన్న వివిధ మద్యం దుకాణాల నుంచి కావాల్సిన సరుకును రైళ్లలో పలాస వరకు గుట్టుచప్పుడు కాకుండా తరలించి యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలిసింది. అటు ఎన్నికల పరిశీలకులు ఇటు పోలీసు తనిఖీలకు దొరకకుండా వివిధ బ్రాండ్లను అట్టపెట్టెలలో భద్రపరిచి వేర్వేరు రైళ్లలో జిల్లాకు తరలించి వాహనాల్లో తరలిస్తున్నట్టు సమాచారం. ఉపఎన్నికల సందర్భంగా జిల్లాలో మద్యం అమ్మకాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఇక్కడి ఐఎంఎల్ డిపో అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ గత ఏడాది ఈ నెలలో ఎంత మొత్తంలో సరుకు కొనుగోలు చేశారో షాపుల వారీగా అంతే సరుకును సరఫరా చేయాలని హుకుం జారీచేయడంతో మద్యం వ్యాపారులు ఇరకాటంలో పడ్డారు.