శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఒకేసారి 30 మంది కింది స్థాయి ఉద్యోగులను బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు పూర్తిగా జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైమ్స్కేల్ ఉద్యోగులు, ఎన్.ఎం.ఆర్లకు పరిమితం చేశారు. వీసీగా మూడు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన డబ్ల్యూ.రాజేంద్ర రెండు నెలల్లో పరీక్షల విభాగంతో సహా పారిపాలనా, ఆర్థిక విభాగాల్లో దీర్ఘకాలంగా తిష్టవేసినవారిని బదిలీ చేస్తామని ప్రకటించారు. రెండు నెలల క్రితం సర్టిఫికెట్ సకాలంలో ఇవ్వకపోవటంతో ఒక విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవటంతో పరీక్షల విభాగంలో నిర్లక్ష్యపు పని తీరు వెలుగుచూసింది. అప్పుడు విద్యార్థులు పరిపాలనాభవనానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. స్నాతకోత్సవం అయిన వెంటనే ఆగస్టు 28వ తేదీన పరీక్షల విభాగం ప్రక్షాళన చేస్తామని, దీర్ఘకాలంగా ఉన్నవారిని బదిలీలు చేస్తామని మరోసారి ప్రకటించారు. ఇప్పటికీ ఈ దిశగా చర్యలు లేవు. తాజాగా బుధవారం ఒకేసారి 30 మంది ఉద్యోగులను బదిలీ చేసినా అందులో ఒక్కరు కూడా పరీక్షల విభాగంలో కీలక స్థానాల్లో పని చేస్తున్నవారు లేకపోవడం గమనార్హం. పరీక్షల విభాగానికి కొత్తగా ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లను వేసి, ఒకరిని అక్కడే సర్దుబాటు చేశారు.